పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సజావుగా నిర్వహించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థుల కోసం జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పరీక్ష సమయాల్లో విద్యార్థులకోసం ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఆదేశించారు. ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన, అధికారులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు ఇంటర్ విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరీక్ష సమయానికి ఒకగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సజావుగా సాగేందుకు వైద్య, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు.
జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు
ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25 మంది పర్యవేక్షకులు, 25 మంది అదనపు పర్యవేక్షకులు, ఒక ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్తోపాటు 400 మంది ఇన్విజిలేటర్లను నియమించా రు. జిల్లావ్యాప్తంగా మొత్తం 10,985 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రశ్నాపత్రాలను తెరిచే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగిస్తున్నామని పేర్కొన్నారు.
సెంటర్ లొకేటర్ యాప్..
గతంలో పరీక్ష కేంద్రాల చిరునామా తెలుసుకోవ డం విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సారి వాటిగుర్తింపు కోసం లొకేటర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు ఇక సులువుగా పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. హాల్టికెట్ల జారీలో ప్రై వేట్ కళాశాలలు పెట్టే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇంటర్ విద్యార్థులు 10,985 మంది..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మొత్తం 10,985 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరంలో 5,844 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,141 మంది ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు 400 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తికావడంతో ఇక వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఆర్టీసీ బస్సు సౌకర్యం..
గురుకుల, మోడల్ స్కూల్, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలకు పరీక్ష కేంద్రాలు దూరం ఉంటే సంబంధితవిద్యార్థులు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రానికి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా అప్ అండ్ డౌన్ చేరవేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
144 సెక్షన్ అమలు..
జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు చేరగా.. వాటిని సమీప పోలీస్స్టేషన్లలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో బుక్స్టాల్స్, జిరాక్స్ సెంటర్లను మూసివేస్తామని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
అందుబాటులో వైద్య సిబ్బంది..
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. ఇందుకోసం ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, సూపర్వైజర్లకు విధులు కేటాయించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుతారు. అవసరమైన మందులు కూడా నిల్వచేస్తారు.
5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
మొత్తం విద్యార్థులు 10,985 మంది
కేటాయించిన పరీక్ష కేంద్రాలు 23
290 మంది ఇన్విజిలేటర్ల నియామకం
ఫిర్యాదు చేస్తే చర్యలు
జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలకు అనుమతించరు. హాల్టికెట్ల జారీ విషయంలో ఇబ్బందులకు గురిచేసే కళాశాలపై ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– కల్పన, జిల్లా ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment