
బెంగళూరు: కాంగ్రెస్ నాయకుల సమష్టి కృషి వల్లే కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారీ మెజార్టీ అందించిన కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠపైనా మీడియా ఆయన్ని ఆరా తీసింది. ఎవరిని ఎంపిక చేస్తారని ప్రశ్నించింది. అతిముఖ్యమైన ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను అధిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. ‘‘కర్ణాటక ఎన్నికల్లో ప్రజాస్వామ్యానిదే విజయం. అధికారం డబ్బు, ప్రభావం పని చేయలేదు. బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టింద’’ని అన్నారాయన.
అలాగే.. కర్ణాటకలో ప్రచారం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగాలేకపోయినా పార్టీ కోసం వచ్చి ప్రచారం చేశారని గుర్తు చేశారు. మేం గెలిచాం. ఇప్పుడు చేయాల్సిన పనులపై దృష్టి పెడతాం. ఎవర్నీ కించపరచాలని అనుకోవడం లేదు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాం. అన్ని హామీలు నెరవేర్చుతాం. అని ఖర్గే అన్నారు.
ఇదిలా ఉంటే రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే సీఎం ఎంపికపై ఓ స్పష్టత రావొచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment