నేడు తెలంగాణకు అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణకు అమిత్‌ షా

Published Sun, May 5 2024 3:06 AM

Amit Shah for the state today

కాగజ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ప్రచారం

మూడుచోట్ల బహిరంగ సభల్లో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి

ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

అమిత్‌ షా షెడ్యూల్‌ ఇలా.. 
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీలోని శ్రీసత్యసాయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేటకు అమిత్‌ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ వెళ్లనున్నారు. అక్కడి ఎస్‌పీఎం క్రికెట్‌ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

సాయంత్రం 4:15 గంటలకు కాగజ్‌నగర్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 5 గంటలకు నిజామాబాద్‌ చేరుకోనున్నారు. సాయంత్రం 5:10 గంటల నుంచి 5:50 గంటల వరకు అక్కడి గిరిరాజ్‌ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్‌ నుంచి బయలుదేరి 6:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 

సాయంత్రం 6:45 గంటలనుంచి రాత్రి 7:30 గంటల దాకా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7:55 నిమిషాలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు బయలుదేరనున్నారు.

నేడు తెలంగాణకు రాహుల్‌.. రెండు సభలకు హాజరు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. నాందేడ్‌ నుంచి నేరుగా నిర్మల్‌కు రానున్న రాహుల్‌.. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా అలంపూర్‌ వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అలంపూర్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకొని పార్టీ నేతలతో కాసేపు భేటీ కానున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్తారని గాంధీ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement