
సాక్షి, హైదరాబాద్: ‘లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను (జమిలి) నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని పార్టీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు.
గ్రేటర్ ఓటమిపై నిరాశ వద్దు..
‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే నిరాశలో ఉండొద్దు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గ్రేటర్ ఎన్నికలను మనం అనుభవంలా మాత్రమే చూడాలి. ఓటమి పాలైన వారి పట్ల చులకన భావంతో ఉండకండి. ఆయా డివిజన్లలో ఓటమి పాలైన అభ్యర్థులే మన పార్టీకి అత్యంత ముఖ్యమనే విషయాన్ని గుర్తించండి. సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు ఇచ్చే విషయంలో మనం కొంత ఆలోచించి ఉండాల్సింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశించారు.
ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా బంద్...
రైతులకు సంఘీభావంగా ఈ నెల 8న జరిగే భారత్ బంద్కు మద్దతుగా హైదరాబాద్లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ భేటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కేటీఆర్తో కార్పొరేటర్ల భేటీ
గ్రేటర్లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆదివా రం తెలంగాణ భవన్లో కేటీఆర్తో భేటీ అయ్యారు. నగర పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన కార్పొరేటర్లతోపాటు, ఓడిన అభ్యర్థులను కూడా వెంటబెట్టుకుని వచ్చా రు. గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన కేటీఆర్... ఓటమిపాలైన వారు నిరాశ చెందవద్దని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment