బెంగళూరు ఘటన: అల్లు అర్జున్‌ ప్రస్తావన! విమర్శలపై కాంగ్రెస్‌ సర్కార్‌ ఏమందంటే.. | Bengaluru Incident Turns Political War | Sakshi
Sakshi News home page

బెంగళూరు ఘటన: అల్లు అర్జున్‌ ప్రస్తావన! బీజేపీ విమర్శలపై కాంగ్రెస్‌ సర్కార్‌ ఏమందంటే..

Jun 5 2025 2:05 PM | Updated on Jun 5 2025 3:34 PM

Bengaluru Incident Turns Political War

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ తొక్కిసలాట ఘటన.. రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని, డీకే శివకుమార్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రతిగా కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇస్తోంది.

బెంగళూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజా ఘటనలో ఎవరిని అరెస్ట్‌ చేస్తారంటూ సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి శోభా కరెంద్లాజె(Shobha Karandlaje) కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పుష్ఫ చిత్రం సమయంలో థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోతే.. సినీ నటుడు అల్లు అర్జున్‌ను ఇంటికెళ్లి మరీ అరెస్ట్‌ చేశారు. పొరుగున్న ఉన్న రాష్ట్రం(తెలంగాణ)లో ఉన్నది మీ ప్రభుత్వమే కదా!. అలాంటిది ఇక్కడ 11 ప్రాణాలు పోయినా పట్టించుకోరా?. ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు సీఎం సిద్ధరామయ్యా?, డిప్యూటీ సీఎం శివకుమారా?.. ఎవరిని అరెస్ట్‌ చేస్తారు?. ఇద్దరూ తక్షణమే రాజీనామా చేయాలి. ఘటనలో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం ఉంది. ఎంక్వైరీ కోసం మెజిస్ట్రేట్‌ ఎంక్వైరీకి ఆదేశించారట. జిల్లా స్థాయి అధికారిని నియమించడం ఏంటి?. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని డిమాండ్‌ చేశారామె.

VIDEO Credits: NEWS18 Kannada

మరోవైపు ఈ అంశంపై కర్ణాటక బీజేపీ నేతలు గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. విధాన సౌధలోనే ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానం చేయాల్సిన అవసరం ఏంటి?. అనుమతి లేదని చెప్పి అక్కడే ఎందుకు నిర్వహించారు. ఆర్సీబీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అత్యాశా ఫలితమే ఈ తొక్కిసలాట. ఘటనకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య రాజీనామా చేయాలి. డీకే శివకుమార్‌ను అరెస్ట్‌ చేయాలి అని బీజేపీ నేతలు డిమాండ్‌  చేశారు. ప్రతీ విషయంలో కేంద్రాన్నిప్రశ్నించే రాహుల్‌  గాంధీ..ఈ అంశంపై ఎందుకు మాట్లాడరు అని ఎంపీ సంబీత్‌ పాత్రా ప్రశ్నించారు. అయితే..

 

బీజేపీ విమర్శలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆ పార్టీవి డర్టీ పాలిటిక్స్‌ అని డీకే శివకుమార్‌ అన్నారు. తల్లిదండ్రులకు శోకం మిగిలిందంటూ కంటతడి పెట్టారు. మరోవైపు సిద్ధరామయ్య సైతం బీజేపీపై మండిపడ్డారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోతే బీజేపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 50 నుంచి60 మంది చనిపోయారు. అప్పుడు మేం ఏమైనా అన్నామా? సిద్ధరామయ్య అన్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆర్సీబీ ప్రాంచైజీనే హడావిడిగా సంబురాలు ఏర్పాటు చేసుకుందని ప్రకటించారు హోంమంత్రి పరమేశ్వర ప్రకటించడం గమనార్హం. ఇక.. ఈ ఘటనపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది.

తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాధ్యులు ఎవరనేది మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించలేదు. ఘటనపై దర్యాప్తు జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement