
సాక్షి, బెంగళూరు: గెలుపు సంబరాల్లో ఘోరం చోటుచేసుకుంది.. అభిమానుల కేరింతలు, కోలాహలంతో సందడిగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మార్మోగింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాలకు అసంఖ్యాకంగా అభిమానులు తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద పరిస్థితి అదుపుతప్పి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందగా 47 మంది గాయపడ్డారు.
ఈ విషాదంపట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ కలిసి రూ. 5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించాయి.
మరోవైపు ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పర రాజకీయ విమర్శలకు దిగాయి. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపిస్తోంది.
ఇంకోవైపు.. జేడీఎస్ కీలక నేత, కేంద్ర మంత్రి కుమారస్వామి డిప్యూటీ సీఎం శివకుమార్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘క్రికెటర్లను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు ఎవరు వెళ్లారు?. ఈవెంట్కు డిప్యూటీ సీఎం మద్దతుదారులు ఎందుకు వచ్చారు?. అమాయకమైన అభిమానుల మృతికి బాధ్యత ఎవరు వహిస్తారు?’’ అని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్మీట్లో సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నోట కుంభమేళా తొక్కిసలాట ప్రస్తావన రావడం గమనార్హం.
‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపించింది. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఖౌy్చ∙ఇజ్చి ్ఛnజ్ఛటటఆ్ఛnజ్చ uటu) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు.
ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరిగేవే. ఇంతకంటే దారుణమైనవి కూడా జరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో.. మహా కుంభమేళాలోనూ ఇది జరిగింది. ఆ ఘటనలో 50 నుంచి 60 మంది చనిపోయారు కదా. అలాగని ఇప్పుడు జరిగిన ఘటన నుంచి తప్పించుకోవాలని మేం అనుకోం. ఇది ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్ కాదు. క్రికెట్ అసోషియేషన్ నిర్వహించింది. ఈవెంట్కు ప్రభుత్వం కేవలం అనుమతి మాత్రమే ఇచ్చింది. పూర్తి బందోబస్తును అందించింది. అయినప్పటికీ..

స్టేడియం కెపాసిటీ 35 వేలు అయితే.. మూడు లక్షల మంది వచ్చారు. ఘటనలో 11 మంది మరణించగా.. గాయపడిన వాళ్లంతా త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అదృష్టవశాత్తూ.. విధాన సౌధ వద్ద జనం గుమిగూడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు అని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని, 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఏం జరిగిందంటే?
ఆర్సీబీ అభిమానులు మంగళవారం రాత్రి నుంచే బెంగళూరులో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు తమ హోం గ్రౌండ్లో అభిమానుల సమక్షంలో ఆనందం పంచుకోవాలని భావించింది. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి జట్టు సభ్యులు వచ్చారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లి వారికి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా విధాన సౌధ వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కార్యక్రమం సజావుగానే సాగింది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ బస్సులో ‘విక్టరీ పరేడ్’తో చిన్నస్వామి స్టేడియానికి ఆటగాళ్లు చేరుకోవాల్సి ఉంది. అయితే..
అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి పోటెత్తడంతో మైదానం పూర్తిగా నిండిపోయింది. అయినప్పటికీ బయట కూడా భారీగా ఫ్యాన్స్ నిరీక్షిస్తూ ఉండిపోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. భారీ సంఖ్యలో జనం గుమిగూడడంతో అక్కడ ఉన్న డ్రెయిన్ కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన వాళ్లంతా చెల్లాచెదురుకాగా.. చివరకు ఇదే తొక్కిసలాటకు దారితీసింది.
వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ తోపులాటలో శ్వాస అందక కొందరు సొమ్మసిల్లారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా వీల్లేని స్థితిలో అభిమానులు పోటెత్తారు. చివరకు క్షతగాత్రులను బౌరింగ్ ఆస్పత్రికి, వైదేహీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రణాళికా లోపమే కారణం?
దాదాపు ఏడాది క్రితం భారత టి20 జట్టు వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర జరిగింది. అయితే అంతటి మహానగరంలో కూడా ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా అధికారులు, పోలీసులు చక్కటి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిజానికి టీమ్ మేనేజ్మెంట్ చాలా హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఫైనల్ జరిగిన 24 గంటల్లోపే బెంగళూరు వచ్చేసి ఇలాంటి ఈవెంట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సన్నాహాలకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రోగ్రామ్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీమ్ ఫ్యాన్స్కు పిలుపు ఇచ్చేసింది.
మంగళవారం రాత్రి నుంచి ఇంకా గెలుపు ఆనందంలోనే ఉన్న అభిమానులకు ఈ కార్యక్రమం దానికి కొనసాగింపులా కనిపించి అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు చివరకు పరిస్థితిని వివరించి ఓపెన్ టాప్ బస్సు ర్యాలీ జరగకుండా నిలువరించినా... అప్పటికే పెద్ద నష్టం జరిగిపోయింది. ఒకవైపు తొక్కిసలాటతో మైదానం బయట పరిస్థితి విషాదం నెలకొన్నప్పటికీ మరోవైపు స్టేడియంలో వేడుకలు కొనసాగాయి. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆర్సీబీ అధికారులకు ఫోన్ చేసి వెంటనే కార్యక్రమం ఆగిపోయేలా చేశారు. జనాన్ని అదుపు చేయడం చాలా కష్టంగా మారిందని, పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.