చారిత్రక పురి.. అభివృద్ధే గురి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగి కొండపల్లి ప్రస్తుతం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. 1956 నుంచి 2020 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కొండపల్లిని.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2021 జనవరిలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి జంట గ్రామాలను కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. చరిత్రకు ఆనవాళ్లుగా కొండపల్లి ఖిల్లా, బొమ్మల పరిశ్రమ, విద్యుత్ వెలుగులు విరజిమ్మే నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, కొండపల్లి ఇండస్ట్రీయల్ డెవలప్ ఏరియా(ఐడీఏ) ఆప్మెల్ సంస్థ, దూరదర్శన్ కేంద్రం, రైల్వే స్లీపర్ల తయారీ సంస్థ, పట్టణ ఒడ్డున కృష్ణమ్మ పరవళ్లు ఈ ప్రాంతానికి తలమానికంగా నిలిచాయి. గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని కొండపల్లి.. ఈ ఐదేళ్లలో ప్రగతి పథాన పయనిస్తోంది.
విద్య, వైద్యం అద్భుతః..
ఐదేళ్ల కాలంలో విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇప్పటికే రెండు పీహెచ్సీలు ఉన్న కొండపల్లిలో ప్రతి 30 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం చొప్పున ఒక్కొక్కటి రూ.96.50 లక్షల చొప్పున రూ.1.93కోట్లతో రెండు అర్బన్ యూపీహెచ్సీలు నిర్మించింది. రూ.2 కోట్లతో బొమ్మల పరిశ్రమ అభివృద్ధి, ఎన్టీటీపీఎస్, ఐడీఏలో పనిచేసే అసంఘటిత కార్మికుల ఆరోగ్య ప్రయోజనాల కోసం రూ.54 లక్షలతో ఈఎస్ఐ వైద్యశాల నిర్మించింది. నాడు – నేడు పథకంలో రూ.6 కోట్లతో 14 పాఠశాలలు, ఏపీ గిరిజన గురుకుల బాలికల సంక్షేమ హాస్టల్, బీసీ గురుకుల సంక్షేమ బాలుర హాస్టల్ అభివృద్ధి చేశారు. జెడ్పీ బాలికల పాఠశాలలో జూనియర్ కళాశాల మంజూరు చేసి అదనపు గదులు నిర్మించింది. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియాన్ని చేరువ చేసింది.
చేరువైన పాలన..
73,580 మంది జనాభా కలిగిన కొండపల్లిలో పరిపాలనా సౌలభ్యం కోసం 10 వార్డు సచివాలయాలు నిర్మించారు. 340 మంది వలంటీర్లు, 90 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయి. ఐదేళ్లలో ప్రజల నుంచి 31,357 అర్జీలు స్వీకరించి 28,186 అర్జీలు పరిష్కరించారు. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, లానేస్తం, తదితర పథకాలు 73,580 మంది జనాభాలో 67,515 మందికి రూ.207.35 కోట్లు నగదు డీబీటీ ద్వారా అందాయి.
రూ.80.16 కోట్లతో అభివృద్ధి పనులు..
● గత ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా విడుదలైన రూ.80.16 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు.
● ఎస్సీ సబ్ప్లాన్ రూ.75 లక్షలతో ఆర్సీఎం కాలనీలో ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేశారు.
● ప్రభుత్వ నిధులు రూ.4 కోట్లతో 10 నూతన సచివాలయాలు నిర్మించారు. 14, 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ రూ.10.70 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు జరిగాయి.
● ప్రభుత్వ నిధులు రూ.1.50 కోట్లతో పైప్లైన్ ఆధునికీకరణ పనులు జరిగాయి.
● అమృత్ 0.2 నిధులు రూ.1.45కోట్లతో గజరాజు చెరువు, రూ.1.93 కోట్లతో రెండు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రూ.కోటితో 4 కమ్యూనిటీ భవనాలు నిర్మించారు.
● నాడు – నేడు పథకం నుంచి రూ.6 కోట్లతో 14 పాఠశాలలు, బాలికలు, బాలుర హాస్టల్స్ అభివృద్ధి చేశారు.
● రూ.54 లక్షలతో ఈఎస్ఐ వైద్యశాల నూతన భవన నిర్మాణం చేశారు.
● జగనన్న కాలనీల్లో రూ.1.50 కోట్లతో విద్యుత్ సదుపాయం కల్పించారు. 3,120 మందికి స్థలాలు కేటాయించగా, ఇళ్లు పూర్తి చేసిన 2,709 మందికి రూ.48.79 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
● ఇవికాక మరో రూ.63 కోట్లతో ఇంటింటికీ తాగునీటి పథకం పనులు టెండర్ దశలో ఉన్నాయి. ఐదేళ్లలో మారిన కొండపల్లి రూపురేఖలు
2021లో పంచాయతీ నుంచి
మునిసిపాలిటీగా రూపాంతరం
దాదాపు రూ.80.16 కోట్లతో
అభివృద్ధి పనులు
మరో రూ. 207.35 కోట్లతో
67,515 మందికి సంక్షేమం
విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట ఐదేళ్లల్లో రెట్టింపు అభివృద్ధి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కొండపల్లి రూపురేఖలు మారాయి. సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు ఉచితంగా పొందగలుగుతున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సదుపాయం మెరుగైంది. మరో ఐదేళ్లు సీఎంగా జగన్మోహన్రెడ్డి ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నా.
– డి.మల్లికార్జునరావు, స్థానికుడు, ఇబ్రహీంపట్నం విద్య, వైద్య రంగాల్లో మార్పులు..
కొండపల్లి మునిసిపాలిటీ అయ్యాక విద్య వైద్య రంగాలు మెరుగుపడ్డాయి. రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక ఈఎస్ఐ వైద్యశాల నిర్మించారు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా యూపీహెచ్సీల్లో వైద్య సేవలు, మెడికల్ టెస్ట్లు పక్కాగా నిర్వహిస్తున్నారు. నాడు – నేడులో భాగంగా చేసిన పాఠశాలల అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుంది.
– పచ్చిగోళ్ల పండు, స్థానికుడు, కొండపల్లి