
తెలంగాణ భవన్,సాక్షి: హెచ్సీయూ భూముల కోసం న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు’అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీపై జగదీష్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల జరిపిన లాఠీఛార్జ్ను బీఆర్ఎస్ ఖండిస్తోంది. 1969లో విద్యార్థుల పోరాట ఫలితం వల్లనే HCUను సాధించుకున్నాం. ఉద్యమ ఫలితంగా సాధించిన HCUను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.
న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో పెయిడ్ బ్యాచ్ ముఖ్యమంత్రి,మంత్రులు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారు. సమాజ శ్రేయసు కొరకు విద్యార్థులు పాటుపడుతారు. విద్యార్థులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం, నటుడు ప్రకాష్ రాజ్ పేమెంట్ బ్యాచ్ నా. కేసీఆర్ హరితహారం చేస్తే , కాంగ్రెస్ హరితసంహారం చేస్తుంది.
కేసీఆర్ వనసంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి హరిత భక్షణ చేస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హెచ్సీయూలో జరుగుతున్న పనులు ఆపొచ్చు. పోలీసులను బయటకు పంపొచ్చు. కాంగ్రెస్, బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా లోపటికి వెళ్తారు. డ్రోన్ కెమెరా ఎగరేస్తే 500 రూపాయలతో ఫైన్ వేయొచ్చు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇవ్వాళ హెచ్సీయూ విద్యార్థులు డ్రోన్ ఎగరేశారని వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.
హెచ్సీయూ భూముల అమ్మక వ్యవహారం చీకటి దందాలో భాగమే.హెచ్సీయూ భూములను గురువు కోసం (చంద్రబాబు నాయుడు) అప్పనంగా రేవంత్ రెడ్డి చీకటి దందాకు తెరలేపారు. సేవ్ హెచ్సీయూ అని యూనివర్సిటీ విద్యార్థులకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 5 లక్షల మంది మద్దతు పలికారు. వారందరూ పెయిడ్ బ్యాచ్చేనా. హెచ్సీయూ భూములను అమ్మిన మూటల కోసమే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు.
యూనివర్సిటీనీ గౌరవించే మా హయంలో రోడ్లు వెయ్యలేదు. కమిషన్ల కొరకు కక్కుర్తి పడి రైతుల జీవితాలతో , విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపణలు గుప్పించారు.