
సాక్షి, తూర్పుగోదావరి: దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ నేతలను ఎలా అణగదొక్కాలని ఆలోచిస్తున్నారని అంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా సీఐ ప్రవర్తించిన తీరు దారుణం. ఖాకీ చొక్కా వేసుకోగానే రాష్ట్రానికి సుప్రీం అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదు. దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే వైఎస్సార్సీపీ వారిని ఎలా అణగదొక్కలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు ఏ పోలీసు అధికారి ఏ రకంగా ప్రవర్తించారన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. అధికార పార్టీకి కొమ్ము కాసిన ప్రతీ పోలీస్ అధికారి రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లెక్కలు అప్పజెప్పాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తు పెట్టుకుని పోలీసులు వ్యవహరిస్తే మంచిది’ అంటూ హెచ్చరించారు.