మిడ్మానేరులో కేజ్కల్చర్
● ట్రయల్రన్కు ఫిష్ఇన్ కంపెనీ సన్నాహాలు ● తొలిదశలో 10 కేజెస్ ● విజయవంతమైతే పూర్తిస్థాయి యూనిట్లు ● మూడు కంపెనీలకు 367 ఎకరాలు
బోయినపల్లి(చొప్పదండి): మత్స్యసంపద అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో మిడ్మానేరులో ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. మిడ్మానేరు బ్యాక్వాటర్లో అధునాతన టెక్నాలజీతో అమెరికా ఫిష్ఇన్ కంపెనీ కేజెస్తో(పంజరం వలల ద్వారా) ఫిష్ కల్చర్ అభివృద్ధికి బాటలు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మిడ్మానేరు బ్యాక్వాటర్ ఎడ్జ్లో కేజ్కల్చర్ విధానంలో చేపల పెంపకం చేపట్టేందుకు ట్రయల్రన్ పనులు చేపడుతున్నారు. ఇది సక్సెస్ అయితే పూర్తిస్థాయిలో ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
367 ఎకరాలలో..
రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ బ్యాక్వాటర్లో కేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిడ్మానేరు బ్యాక్వాటర్లో ఫిష్ఇన్ కంపెనీకి కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకానికి అనుమతులు ఇచ్చారు. మూడు కంపెనీలకు దాదాపు 367 ఎకరాలు భూమిని సేకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 33 ఏళ్లపాటు కేజ్కల్చర్ విధానానికి అనుమతులు ఇచ్చింది. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లకు కుదించిననట్లు సమాచారం.
పది పంజరం వలలతో ట్రయల్ రన్
అమెరికా ఫిష్ఇన్ కంపెనీ 600 కేజెస్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. మొదటిషిఫ్టులో 300 కేజేస్ ఏర్పాటు చేసి చేపలు పెంచనున్నారు. ఇందులో భాగంగా 10 కేజేస్తో ట్రయల్రన్ చేయాలని ఫిష్ఇన్ కంపెనీ భావిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఏడాది పాటు 10 పంజరం వలలతో చేపలు పెంపకం చేపట్టి అందులో సక్సెస్ అయితే తదుపరి పూర్తి స్థాయిలో కేజ్ కల్చర్ విధానం అమలు చేయాలని ఆయా కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం.
తిలాపియా చేపల పెంపకం
కేజ్కల్చర్ విధానంలో తిలాపియా చేపల పెంపకం చేపట్టాలని అనుమతులు పొందిన ఫిష్ఇన్ కంపెనీ భావిస్తోంది. ఈరకం చేపలు ఆరు నెలల్లో బ్రీడింగ్ ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఈ రకం చేపను ఎంచుకున్నట్లు సమాచారం. తిలాపియా చేపల పెంపకం కోసం మిడ్మానేరు బ్యాక్వాటర్ చివరిలో చీర్లవంచ పరిసరాల్లో కేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. ఫీడ్ కన్వర్షన్ రేషియో(ఎఫ్సీఆర్) ద్వారా చేపల పెంకంతో తమకు ఎంత లాభం వస్తుందోననే విషయం ట్రయల్రన్ పెంపకం ద్వారా తెలియనుంది. చేపలు ఒకటి, రెండు కిలోలు తీసుకుని ఒక కిలో బరువు ఎదిగితే అప్పుడు కంపెనీకి తగిన లాభం దక్కుతుంది. ఈ రకంగా ఫీడ్ తీసుకుని చేప బరువు పెరిగితే మరిన్ని రకాల యూనిట్లు పెట్టడానికి కంపెనీకి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
ట్రయల్రన్ పనులు జరుగుతున్నాయి
మిడ్మానేరు బ్యాక్వాటర్ చివరిలో చీర్లవంచ పరిసరాల్లో అమెరికా ఫిష్ఇన్ కంపెనీ కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకం చేపట్టే పనులకు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు పొందింది. ఇందులో భాగంగా కేజ్కల్చర్ ఏర్పాటుకు ట్రయల్రన్ పనులు చేసుకుంటున్నారు. మొదట ఏడాది కాలంలో 10 కేజెస్ ఏర్పాటుతో తిలాపియా చేపలు పెంచనున్నారు. అందుకు సంబంధించిన పనులు చేస్తున్నారు.
– సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, సిరిసిల్ల
మిడ్మానేరులో కేజ్కల్చర్
మిడ్మానేరులో కేజ్కల్చర్
Comments
Please login to add a commentAdd a comment