
నాణ్యమైన సన్న బియ్యమివ్వాలి
సింగూరు కాల్వలకు సింగారం
సంగారెడ్డి జోన్: నాణ్యతతో కూడిన సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని మూడవ వార్డులో కిట్టు, స్వప్నల ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలసి కలెక్టర్ భోజనం చేశారు. సన్న బియ్యం పంపిణీతో తమ కుటుంబం సంతోషంగా ఉందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేషన్ షాపును పరిశీలించి, సన్న బియ్యం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 846 రేషన్ షాపులకు గాను 3లక్షల,78 వేల728 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,999 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం నాణ్యత లేక పోవటంతో రీసైక్లింగ్ చేయడం, ఇతరులకు అమ్మడం జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు తగిన వసతులు కల్పించాలి
వయో వృద్ధులకు తగిన వసతులు సమకూర్చాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వృద్ధాశ్రమం, బాల రక్షాబంధన్ను ఆమె సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేయనున్న జనరిక్ మెడికల్ షాపు స్థలాన్ని, ఐకేపీ మహిళల పెట్రోల్ బంక్ను కూడా పరిశిలించారు. వృద్ధాశ్రమంలో అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించి అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి వనజా రెడ్డి, డీఈ దీపక్, డీసీపీఓ రత్నం, ఎఫ్ఆర్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న దివ్యాంగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో దివ్యాంగుల ప్రజావాణి నిర్వహించారు. ఈ మేరకు 23 వరకు అర్జీలు వచ్చాయి. సదరం సర్టిఫికెట్, రెన్యూవల్ కోసం సంబంధిత దివ్యాంగులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సదరం క్యాంపులో స్లాట్ బుకింగ్ కోసం మొబైల్ యాప్లో సిటిజన్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. నెలలో రెండుసార్లు సదరం స్లాట్ బుకింగ్, నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధూరి, వైద్యారోగ్య శాఖ, డీఆర్డీఏ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పుల్కల్(ఆందోల్): సింగూరు కాల్వలకు సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. పనులు దక్కి ంచుకున్న కాంట్రాక్టర్ మొదట కాల్వల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి కొలతల ప్రకా రం మట్టిని తీసేశారు. కాల్వలకు కాంక్రీట్ పోయడానికి వీలుగా మార్కింగ్ చేస్తున్నారు. దశాబ్దం క్రితం నుంచి సాగునీరు అందిస్తున్న కాల్వలకు నీటి పారుదలశాఖ అధికారులు ఇప్పటివరకు మరమ్మతు లు చేయలేదు. దీంతో కాల్వల్లో మట్టి పేరుకుపోయి ముళ్లకంప మొలిచింది. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకొని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేయడానికి నిధులు మంజూరు చేశారు.
రూ.169.30 కోట్లతో మరమ్మతులు
సింగూరు డ్యామ్కు కుడి, ఎడమన 60 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ, 160 కిలోమీటర్ల మేర డైవర్షన్ కెనాల్లు ఉన్నాయి. దశాబ్దం నుంచి మరమ్మతులు చేయకపోవడంతో కాల్వల్లో పిచ్చి మొక్కలు మొలిచి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక చౌటకూర్, అందోల్ మండలాల్లోని పిల్ల కాల్వలకు నీరందడం లేదని రైతులు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు ఉండటంతో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షించి సిమెంట్ లైనింగ్ మరమ్మతులకు రూ.169.30 కోట్లు మంజూరు చేశారు. అధికారులు రూ.133.51 కోట్లకు టెండర్ ప్రక్రియ ప్రారంభించగా.. హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ 4.95 ఎక్సెస్తో పనులు దక్కించుకున్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్ 18 నెలలకు అగ్రిమెంట్ చేసుకున్నారు.
పంటలకు క్రాఫ్ హాలిడే..
కాగా, కాల్వల్లో నీటి ప్రవాహం ఉంటే పనులకు ఆటంకం కలుగుతుందని ఆయకట్టు కింద రెండు పంటలకు సాగునీరు వదలడం లేదు. దీంతో బోరు బావులతోనే సాగు చేసుకున్నారు. సిమెంట్ లైనింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నారు.
కలెక్టర్ క్రాంతి ఆదేశం
లబ్ధిదారులతో కలసి భోజనం
పేదలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య
రూ.169.30 కోట్లతో సిమెంట్ లైనింగ్
పనులు ప్రారంభించిన గుత్తేదారు
కాంక్రీట్ వేయడానికి మార్కింగ్
ఏడాదిన్నరలో పనులు పూర్తికి ఒప్పందం

నాణ్యమైన సన్న బియ్యమివ్వాలి