
ధాన్యం దళారుల పాలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తోటపల్లి గ్రామానికి చెందిన రాంగోపాల్రావు. వారం రోజుల కిందట వరి కోసి నాలుగు ట్రాక్టర్లలో 50 క్వింటాళ్ల ధాన్యం మిల్లుకు తీసుకుపోయిండు. వ్యాపారులు తాలు సాకు చూపి క్వింటాల్కు 5 కిలోల ధాన్యం కోత పెట్టారు. 50 క్వింటాళ్లకు 2.5 క్వింటాల్లు కోత పెట్టడంతో రూ.4,500 నష్టం జరిగింది. అలాగే ప్రభుత్వ మద్దతు క్వింటాల్కు రూ.2,320 ఉంటే వ్యాపారులు మాత్రం రూ.1,800కి కొన్నారు. ఇందులోనూ రూ.500 వ్యత్యాసంతో 50 క్వింటాళ్లకు రూ.25,000 నష్టం పోయాడు. అనంతరం హమాలీ ఖర్చుల కింద క్వింటాల్కు రూ.40 చొప్పున 50 క్వింటాళ్లకు రూ.2,000 తీసుకున్నారు. మొత్తంగా 50 క్వింటాళ్ల ధాన్యం అమ్మితే రూ.31,500 నష్టపోయాడు. డబ్బులకు 12 రోజులు వాయిదా పెట్టారు. ఇది ఒక రాంగోపాల్రావు కష్టమే కాదు మిల్లుకు ధాన్యం తీసుకొచ్చే ప్రతీ రైతులందరిది ఇదే పరిస్థితి.
చర్యలు తీసుకోవాలి
రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు. మిల్లులను తనిఖీ చేసి రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం పరిశీలించాల్సి బాధ్యత లేదా.? అధికారులు వ్యాపారులు ఇచ్చే ముడుపులకు ఆశపడితే రైతులు దోపిడీ గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అక్కడే రైతులు ధాన్యం అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలి. దోపిడీ చేసే వ్యాపారులపై చర్యలు తీసుకోకపోతే మిల్లుల ముందు రైతులతో ఆందోళనకు దిగుతాం.
– మల్లికార్జున్రెడ్డి, రైతు సంఘం నాయకుడు
అధికారులతో తనిఖీలు చేయిస్తాం
రైతులు పచ్చివడ్లు అమ్ముకోవద్దు. గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ము కోవాలని చెబుతున్నాం. కొందరు రైతులు ఆరబెట్టడం ఏంటని చేనులోనే వరి కోసిన వెంటనే మిల్లుకు తీసుకుపోతున్నారు. వ్యాపారులకు ఇది వరకే చెప్పాం. రైతుల ధాన్యం కొనుగోలు చేయొద్దని ఒక వేళ చేస్తే మద్దతు ధర చెల్లించాలని చెప్పినాం. తూకములో మోసం గురించి అధికారులతో తనిఖీ చేయించి చర్యలు తీసుకుంటాం.
– టీ.తిరుపతిరెడ్డి, మార్కెట్ చైర్మన్,హుస్నాబాద్
హుస్నాబాద్రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. రైతులకు ధర తక్కువగా చెల్లించి నిలువునా దోచుకుంటున్నారు. వరి కోసం మిల్లులకు ధాన్యం తెచ్చిన తర్వాత ధాన్యం పచ్చిగా ఉందని, తాలు సాకు చూపించి క్వింటాల్ రూ.100 కోత పెడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320లు ఉంటే వ్యాపారులు రూ.1760కే కొనుగోలు చేసి క్వింటాల్కు రూ.560 లాభం పొందుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొస్తే మిల్లులోని వే బ్రిడ్జి పై ధాన్యం తూకం వేస్తారు. బయటి వే బ్రిడ్జిలకు మిల్లుల వే బ్రిడ్జిలకు 10 నుంచి 20 కిలోల వ్యత్యాసం చూపిస్తుందని రైతులు వాపోతున్నారు. మార్కెటింగ్ అధికారులు ఎప్పుడు మిల్లుల వే బ్రిడ్జిలను తనిఖీ చేయరు. రైతుల ఫిర్యాదు మేరకు మిల్లులకు వచ్చిన అధికారులు ముడుపుల ఆశ చూపించి పంపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 29 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 19 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు లేని రైతులు దళారులను ఆశ్రయించడంతో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. శనివారం రోజు గోమాత కాటన్ మిల్లులో ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకు ధర చెల్లింపులో కోతలు పెట్టడంతో ఆగ్రహించి ఆందోళనకు దిగారు. రైతులను శాంతింప చేసిన వ్యాపారులు క్వింటాల్కు రూ.1800లు చెల్లించడంతో రైతులు అందోళన విరమించారు. పత్తి మిల్లులో ధాన్యం కొనుగోలు చేయరాదు. పార బాయిలర్ మిల్లులోనే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం బోగస్ రైతుల పేరున ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి లాభాలను పొందుతున్నారు.
తూకంలో మోసం,
ధరలో వ్యత్యాసం
క్వింటాల్కు రూ.500ల తేడా
తాలు సాకుతో క్వింటాల్కు
5 కిలోలు కోత విధిస్తున్న వైనం
రైతులను నిలువునా
ముంచుతున్న వ్యాపారులు
క్షేత్రస్థాయిలో గమనించని అధికారులు
పత్తి అమ్మిన రైతుల పేరునే ధాన్యం అమ్మకాలు

ధాన్యం దళారుల పాలు

ధాన్యం దళారుల పాలు

ధాన్యం దళారుల పాలు