
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
భోజనంలో నాణ్యతలోపిస్తే జైలుకే
సంగారెడ్డి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దామోదర హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వారిని ఆదుకునే పథకాలను తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్రంలో కులగణన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకతీతంగా గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాయితీ రుణాలను ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వ్లెడించారు. త్వరలో మరో 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్ ,టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
● మంత్రి దామోదర హెచ్చరిక
● అందోలులో కేజీబీవీ,
నర్సింగ్ కళాశాలల సందర్శన
జోగిపేట(అందోల్): విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే అందుకు బాధ్యులైన వారినందరినీ జైలుకే పంపిస్తామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. అందోలులోని ప్రభుత్వ నర్సింగ్, మహిళా పాలిటెక్నిక్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో మంత్రి విద్యార్థినిలతో మాట్లాడారు. పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రిన్సిపాల్, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ల్యాబ్లలో కొత్త కంప్యూటర్లు, డైనింగ్ హాల్లో కొత్త టేబుళ్లు, ఇతర సామగ్రి సమకూర్చినందుకు మంత్రికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. ల్యాబ్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కళాశాల పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కళాశాల నుంచి హాస్పిటల్కు, హాస్పిటల్ నుంచి కాలేజీకి వెళ్లడానికి కొత్త బస్సు ఏర్పాటు చేయిస్తానని విద్యార్థులకు మంత్రి హమీ ఇచ్చారు. అందోలులోని 1141 సర్వే నంబరులోని స్థలంలో నిర్మాణంలో ఉన్న 50 బెడ్ల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, వంద బెడ్ల ఏరియా హాస్పిటల్, నూతన నర్సింగ్ కళాశాల భవనాలతోపాటు కళాశాల ముందు నిర్మిస్తున్న బస్టాండ్లు, ఫోర్లైన్ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆర్డీఓ పాండు, ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు, స్థానికులు మంత్రి వెంట ఉన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డిలో కల్యాణలక్ష్మి,
షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

అర్హులందరికీ పథకాలు అందిస్తాం