
Ravindra Jadeja- KL Rahul- బీసీసీఐ కొత్తగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్లో ‘ఏ’ ప్లస్ గ్రేడ్లో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కకపోవడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. రూ. 7 కోట్ల వార్షిక జీతానికి అతడు అర్హుడని, అయినా ఇంకా గ్రేడ్ ‘ఏ’లోనే కొనసాగించడం ఏమిటని ప్రశ్నించాడు. కాగా టీమిండియా కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ‘ఏ’ ప్లస్ గ్రేడ్లో కొనసాగనున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న జడేజాను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ సైతం ఏ ప్లస్ గ్రేడ్లో ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు 7 కోట్లు చెల్లిస్తున్నారు. ఆ కేటగిరీలో ఎలాంటి మార్పు లేదు. నా అభిప్రాయం ప్రకారం సర్ జడేజా పేరు కూడా ఈ జాబితాలో ఉండాలి. తను నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి తదుపరి కాంట్రాక్ట్లో అయినా అతడిని ఏ ప్లస్ గ్రేడ్లో చేర్చాలి. జడేజాతో పాటు కేఎల్ రాహుల్ను ఈ కేటగిరీకి ప్రమోట్ చేయాలి’’ అని పేర్కొన్నాడు.
కాగా ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్లో ఉన్న టెస్టు స్పెషలిస్ట్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మలను బీసీసీఐ ‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు)లోకి మార్చిన విషయం తెలిసిందే. అంతేగాక.. గాయాలతో వరుసగా మ్యాచ్లకు దూరమవుతున్న హార్దిక్ పాండ్యా, వన్డేలకే పరిమితమైన శిఖర్ ధావన్లను కూడా ‘ఎ’ నుంచి తప్పించి ‘సి’లో (రూ. 1 కోటి) వేసింది. ఇక ఏ ప్లస్ కేటరిగీలోని ఆటగాళ్లకు ఏడాదికి 7 కోట్లు, ఏ కేటగిరీలోని ప్లేయర్లకు 5 కోట్లు చెల్లిస్తారు.
చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment