
టీమిండియా- పాకిస్తాన్ జట్లు(PC: BCCI/PCB)
Asia Cup 2022- India Vs Pakistan: ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీల ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను చూసి భవిష్యత్ ప్రణాళికలు రచించడం నేర్చుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సూచించాడు. కేవలం వర్తమానం గురించి ఆలోచిస్తే సరిపోదని.. బెంచ్ బలాన్ని పెంచుకుంటేనే మనుగడ ఉంటుందని పేర్కొన్నాడు.
కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారిగా ఆగష్టు 28న ఆసియా కప్ ఈవెంట్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలో దాయాది చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రయోగాలు చేస్తున్న భారత్.. యువ ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తూ బెంచ్ను చెక్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే వాళ్లు రాణిస్తుండటం సానుకూల అంశంగా మారింది. ఓవైపు అనువజ్ఞులైన సీనియర్లు.. మరోవైపు ప్రతిభ నిరూపించుకుంటున్న యంగ్స్టర్స్తో జట్టు నిండిపోయింది. దీంతో ఎవరిని సెలక్ట్ చేయాలి? ఎవరిని పక్కనపెట్టాలి? అన్న విషయంలో సెలక్టర్లకు తల నొప్పులు తప్పడం లేదంటే అతిశయోక్తి కాదు.
దానిష్ కనేరియా
భారత్ను చూసి నేర్చుకోండి!
ఈ నేపథ్యంలో పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘గతేడాది ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్ చాలా తక్కువ టీ20 మ్యాచ్లు ఆడింది. ఏడింట ఆరు గెలిచింది. ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో ఆడిన గేమ్లో ఓడిపోయింది. ఇక టీమిండియా విషయానికొస్తే.. వాళ్లు 24 మ్యాచ్లు ఆడారు. దాదాపుగా 20 మ్యాచ్లు గెలిచారు.
చాలా వరకు బీ,సీ టీమ్లతో ఆడి కూడా ఇలాంటి అద్భుత విజయాలు అందుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే తమ బెంచ్ స్ట్రెంత్ను మరింత బలోపేతం చేసుకునే పనిలో ఉన్నామని చెప్పాడు. భారత్.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. దురదృష్టవశాత్తూ.. పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.
బెంచ్ స్ట్రెంత్ గురించి అసలు ఆలోచించడం లేదు. ఇప్పటికైనా మెంటాలిటీ మార్చుకోవాలి. కాస్త ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రయోగాలు చేయాలి. నెదర్లాండ్స్ పర్యటనలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి’’ అని చెప్పుకొచ్చాడు. కాగా నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆగష్టు 16 నుంచి ఆగష్టు 21 వరకు మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 27 నుంచి ఆసియా కప్, అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్కప్-2022 ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
చదవండి: Virender Sehwag: ‘ప్రతీకారం’ అంటూ పాక్ కామెంటేటర్ పైత్యం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్! నెహ్రా ఇప్పుడు..
Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment