వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీలో ఆడతారా లేదా అన్న దానిపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ చర్చకు వస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.
2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నామని, ఈ ప్రయాణంలో కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు.
సైకియా మాటలను బట్టి చూస్తే జట్టులో సీనియర్లుగా చెలామణి అవుతున్న రోహిత్, కోహ్లీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అన్నదానిపై సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కోహ్లి, రోహిత్లు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ సైకియా వ్యాఖ్యలు సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గంభీర్, అగార్కర్ల మాదిరిగానే, రోహిత్, కోహ్లీల 2027 ప్రపంచ కప్ అవకాశాలపై సైకియా కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. ఈ విషయంపై బీసీసీఐ ఏమైనా అంతర్గత చర్చలు జరిపిందా అని అడగ్గా, ఇది ప్రాథమికంగా కొనసాగుతున్న ప్రక్రియ అని, ఇందులో భాగస్వాములందరూ తమ అభిప్రాయాలలో ఏకీభవిస్తున్నారని సైకియా అన్నారు.
'మాది చాలా సమన్వయంతో కూడిన బృందం, ఇందులో చాలా మంది నిపుణులు ఉన్నారు. సంబంధిత వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్తాము. ఏ నిర్ణయాలలోనైనా క్రికెట్ కమిటీ, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్, సంబంధిత ఆటగాళ్లతో సహా ఇతర భాగస్వాములందరూ పాలుపంచుకుంటారు.క్రమం తప్పకుండా సంభాషణలు జరుగుతున్నాయి.
అందువల్ల, మనకు ప్రత్యేక సంప్రదింపుల సమావేశం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ' అని సైకియా పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో ఆడుతుండగా, కోహ్లీ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు.


