వైభవ్ క్రేజ్‌.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొద‌లు! | Commentators Discussion-Vaibhav Sooryavanshi Selection-ENG Vs NZ 1st Test | Sakshi
Sakshi News home page

వైభవ్ క్రేజ్‌.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొద‌లు!

Jun 5 2026 7:50 PM | Updated on Jun 5 2026 8:02 PM

Commentators Discussion-Vaibhav Sooryavanshi Selection-ENG Vs NZ 1st Test

ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ గురించే చ‌ర్చ న‌డిచింది. ఈ సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవ‌డంతో పాటు మోస్ట్ వాల్యుబ‌ల్ ప్లేయ‌ర్‌, ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. అత‌డి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గ‌జాలు స‌హా మాజీ క్రికెట‌ర్లు అభినందించారు.  

వైభ‌వ్‌ను జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాల‌కు కూడా పాకింది. విదేశాల‌కు చెందిన మాజీ క్రికెట‌ర్లు కూడా వైభ‌వ్‌ను టీమిండియాకు ఎంపిక చేయాల‌ని త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులోనూ వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.  

మ్యాచ్ తొలిరోజు మ‌ధ్య‌లో వర్షం ప‌డ‌డంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి స‌హ‌చ‌ర కామెంటేట‌ర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్‌, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభ‌వ్‌ను జాతీయ జ‌ట్టులోకి తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్లుంది'అంటూ పేర్కొన‌డం ఆస‌క్తి క‌లిగించింది. 

అయితే టీమిండియాలోకి వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపికపై ఇంకా స‌మ‌యం ఉంద‌ని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావ‌డంతో అత‌డికి క్రికెట‌ర్‌గా చాలా భ‌విష్య‌త్తు ఉంద‌ని, ఈలోగా ఇండియా-ఏ త‌ర‌ఫున త‌న ఆట‌ను చూపించే అవ‌కాశ‌మిస్తున్న‌ట్లు తెలిపింది. లంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఇండియా-ఏ జ‌ట్టులో వైభ‌వ్ చోటు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇండియా-ఏ జ‌ట్టు శ్రీలంక‌-ఏ, అఫ్గానిస్తాన్‌-ఏ జ‌ట్ల‌తో ట్రై సిరీస్ ఆడ‌నుంది. 

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఇంగ్లండ్‌కు 27 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగుల‌తో ఆడుతుంది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 151 ప‌రుగుల లీడ్‌లో ఉంది.

చదవండి: గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement