T20 World Cup 2024: హరికేన్‌ ప్రభావం.. ఇంకా బార్బడోస్‌లోనే టీమిండియా | Indian Team Departure From Barbados Has Been Delayed Yet Again, Expected To Reach Delhi Tomorrow | Sakshi
Sakshi News home page

Barbados Hurricane: హరికేన్‌ ప్రభావం.. ఇంకా బార్బడోస్‌లోనే టీమిండియా

Published Wed, Jul 3 2024 7:44 AM | Last Updated on Wed, Jul 3 2024 10:48 AM

Indian Team Departure From Barbados Has Been Delayed Yet Again. They Are Likely Going To Arrive Early Morning On Thursday

టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం మరుసటి రోజే (జూన్‌ 30) భారత్‌కు తిరిగి రావాల్సిన టీమిండియా.. హరికేన్‌ (గాలివాన) ప్రభావం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. 

హరికేన్‌ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీంతో భారత క్రికెటర్లు గత రెండు రోజులుగా హోటల్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు.  

ప్రకృతి శాంతిస్తే టీమిండియా గురువారం ఉదయానికంతా భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. భారత బృందం రిటర్న్‌ జర్నీ ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది.  గాలివాన మధ్యమధ్యలో కాస్త ఎడతెరిపినిస్తూ మళ్లీ తీవ్రరూపం దాలుస్తుంది.

బార్బడోస్‌లో భారత బృందం బస​ చేస్తున్న హోటల్‌లో నీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం. బార్బడోస్‌ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మకు హరికేన్‌ తీవ్రతను ఫోన్లో చూపించాడు. మూడు రోజులైనా హరికేన్‌ తీవ్రత తగ్గకపోవడంతో భారత్‌లో ఉన్న క్రికెటర్ల ఆప్తులు ఆందోళన చెందుతున్నారు.  

టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్‌ భారత దేశం ఎదురుచూస్తుంది. 

కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement