ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్లో భద్రతా కారణాల రీత్యా తమ ఆటగాళ్లను పంపలేమంటూ సాకులు చెప్పి వరల్డ్కప్కు దూరంగా ఉండిపోయింది. వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఐసీసీ ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు ముప్పు లేదని, తాము భరోసా కల్పిస్తామని పేర్కొంది.
అయినా కూడా బంగ్లాదేశ్ జట్టు మాట వినకుండా టోర్నీ నుంచి వైదొలిగింది అయితే బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ జట్టు అప్పట్లో కొత్త డ్రామాకు తెరతీసింది. అయితే ఐసీసీ హెచ్చరికలు, మాజీ ఆటగాళ్ల విమర్శలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
తాజాగా టీ20 ప్రపంచకప్ ముంగిట పాకిస్థాన్, బంగ్లాదేశ్లు ఆడిన డ్రామాల గురించి ఐసీసీ చైర్మన్ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వరల్డ్కప్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసీసీ ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగాటోర్నీని నిర్వహించాం. పాక్, బంగ్లాదేశ్ నాటకాలు ఫలించలేదు.
ఐసీసీ చైర్మన్గా నేను ఒకటే మాట చెప్పదలచుకున్నా.. ఐసీసీ కంటే కూడా ఏ జట్టూ గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. ఇక ఈసారి ప్రపంచకప్ వ్యూయర్షిప్ పరంగానూ కొత్త రికార్డులకు నాంది పలికింది. ఓవరాల్ వీక్షణలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.
భారత్కు అమెరికా, పాకిస్థాన్కు నెదర్లాండ్స్ గట్టిపోటీనిస్తే, పటిష్ఠమైన ఆస్ట్రేలియాను జింబాబ్వే మట్టికరిపించింది. మరోవైపు ఇంగ్లండ్కు నేపాల్ ఓటమి భయం చూపించింది. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రత్యేక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఉన్నతస్థాయి నుంచి అథమ స్థాయికి పడిపోవడానికి నెలల సమయం చాలు. కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మాత్రం సంవత్సరాలు పడతాయి. శ్రమిస్తూనే ఉండాలి. విజయాలు సాధిస్తూనే ఉండాలి.’ అని చెప్పుకొచ్చాడు.


