
వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్లో కొందరు క్లిక్ అయితే.. మరికొందరు విఫలమయ్యారు. ఈ మధ్యనే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా పక్కకు తప్పుకున్న కోహ్లి విండీస్తో రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. తొలి వన్డేలో 8 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డేలో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా రెండో వన్డేలో విండీస్ తరపున రీఎంట్రీ ఇచ్చిన ఓడియన్ స్మిత్ బౌలింగ్లోనే కోహ్లి వెనుదిరిగాడు. కోహ్లి వికెట్తో పాటు కీలకమైన పంత్ వికెట్ను కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఓవరాల్గా మ్యాచ్లో ఏడు ఓవర్లు వేసిన ఓడియన్ స్మిత్ 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో స్మిత్ కోహ్లి వికెట్ తీయడంపై ట్విటర్ ద్వారా స్పందించాడు. ' వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్ అయిన కోహ్లి వికెట్ తీయడం నాకు కలగా ఉండేది. నిన్నటి మ్యాచ్తో అది నెరవేరింది.' అని చెప్పుకొచ్చాడు. ఇక శుక్రవారం జరగనున్న మూడో వన్డేకు టీమిండియా జట్టులో పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్తో పాటు రవి బిష్ణోయికి జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విండీస్ మాత్రం కనీసం మూడో వన్డే గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment