ఫైనల్లో సాకేత్‌–రామ్‌ జోడీ | Saketh Myneni in to final of Chennai Open ATP Challenger 100 tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాకేత్‌–రామ్‌ జోడీ

Published Sat, Feb 8 2025 3:34 AM | Last Updated on Sat, Feb 8 2025 3:34 AM

Saketh Myneni in to final of Chennai Open ATP Challenger 100 tournament

చెన్నై: కొత్త ఏడాదిలో ఆడుతున్న మూడో టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు సాకేత్‌ మైనేని(Saket Myneni) టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌తో జత కట్టిన సాకేత్‌ చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి సెమీఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ సాకేత్‌–రామ్‌కుమార్‌ (భారత్‌) ద్వయం 7–6 (7/5), 7–6 (10/8)తో టాప్‌ సీడ్‌ రే హో (చైనీస్‌ తైపీ)–మాథ్యూ క్రిస్టోఫర్‌ రోమియోస్‌ (ఆ్రస్టేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 

98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–రామ్‌ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను రెండేసి సార్లు  కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో మాత్రం సాకేత్‌–రామ్‌ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. 

నేడు జరిగే ఫైనల్లో షింటారో మొచిజుకి–కైటో యుసుగి (జపాన్‌) జోడీతో సాకేత్‌–రామ్‌ ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మొచిజుకి–యుసుగి జంట 4–6, 6–4, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రెండో సీడ్‌ జీవన్‌ నెడుంజెళియన్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జోడీపై గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement