నేపాల్‌తో చారిత్రక క్రికెట్‌ సిరీస్‌.. వైభవ్‌కు ప్రమోషన్‌! | Vaibhav-Sooryavanshi-Go-To-Nepal-Bcci-Announces-Historic-Move | Sakshi
Sakshi News home page

నేపాల్‌తో చారిత్రక క్రికెట్‌ సిరీస్‌.. వైభవ్‌కు ప్రమోషన్‌!

Jul 10 2026 3:17 PM | Updated on Jul 10 2026 3:36 PM

Vaibhav-Sooryavanshi-Go-To-Nepal-Bcci-Announces-Historic-Move

నేపాల్‌తో క్రికెట్ బంధాన్ని పెంచుకునే క్రమంలో బీసీసీఐ మరో కీలక అడుగు వేయనుంది. సమీప భవిష్యత్తులో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడేందుకు నేపాల్‌కు పంపించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళిక రాజకీ యాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బంధం చారిత్రక క్రికెట్‌ సిరీస్‌ నిర్వహణతో మరింత బలపడనుంది. అయితే నేపాల్‌ పర్యటనకు సీనియర్‌ జట్టును కాకుండా ఇండియా-ఏ జట్టును పంపించనున్నట్లు దేవజిత్ స్పష్టం చేశారు.

అయితే నేపాల్‌తో ఆడబోయే సిరీస్ ఏ ఫార్మాట్‌లో నిర్వహించాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇండియా-ఏ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైభవ్‌కు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికైతే తిలక్ వర్మ ఇండియా-ఏ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్‌ను కెప్టెన్ హోదాలో నేపాల్‌కు పంపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికైన వైభవ్‌ ఆటలో ఇంకా ఎంతో  మెరుగుపడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.

ఇటీవల సంవత్సరాల్లో ఆసియా దేశాల నుంచి క్రికెట్‌లో అడుగుపెట్టిన దేశాల్లో నేపాల్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆటలో పురోగతి సాధించడం ద్వారా నేపాల్ జట్టు వరుసగా 2024తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాప్రికాకు ఓడించినంత పని చేసిన నేపాల్‌.. 2026 టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఓడించినంత పని చేసింది. 

చివరకు ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇక ఇదే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై విజయంతో నేపాల్‌ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ టూర్‌కు ఎంపికైనప్పటికీ వైభవ్ సూర్యవంశీకి ఆ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లండ్ టూర్‌లో మాత్రం తొలి టీ20 మినహా మిగతా అన్న్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వైభవ్ రాణించడంలో విఫలమయ్యాడు. 

మూడు మ్యాచ్‌లు కలిపి వైభవ్ 42 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు లంకలో జరిగిన ట్రై సిరీస్‌లో పరుగుల పండుగ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.

 

చదవండి: ‘శ్రేయస్‌ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement