గొట్లూరులో మరోసారి ఉద్రిక్తత
సాక్షి టాస్క్పోర్స్: ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ నడిబొడ్డున అంగన్వాడీ భవనాన్ని కూల్చివేసి అక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామంలోని కొందరు కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రికి రాత్రే పిల్లరు వేశారు.
కోర్టు స్టేను పట్టించుకోకుండా...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామ నడిబొడ్డున ఉన్న శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని కూల్చివేశారు. అప్పట్లో ఈ చర్యను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ హేమంత్కుమార్, ఆర్డీఓ మహేష్ గ్రామంలో పర్యటించి విగ్రహ ఏర్పాట్లను నిలిపివేశారు. దీంతో సమస్య అప్పట్లో సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అంగన్వాడీ భవనం స్థానంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని అధికారులకు వినతులు ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయకుండా గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం గ్రామస్తులకు అనుకూలంగా స్టే ఇచ్చింది. అయితే గ్రామంలోని కూటమి నాయకుల ప్రోద్బలంతో కొందరు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు కోసం రాత్రికి రాత్రే పిల్లరు వేశారు. కోర్టు స్టేను పట్టించుకోకుండా దౌర్జన్యంగా పిల్లరు వేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోర్టు స్టేను గౌరవించి అధికారులు విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలని కోరుతున్నారు. విలువైన ప్రభుత్వ స్థలంలో కాకుండా గ్రామంలో మరోచోట విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని చెబుతున్నారు. మంత్రి సత్యకుమార్యాదవ్ చొరవ తీసుకొని విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోని కొందరి ప్రయోజనాలను కాకుండా అందరి ప్రయోజనాలకు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో కక్షలకు ఆజ్యం పోస్తున్న
కూటమి నాయకులు
కోర్టు స్టే ఉన్నా .. విగ్రహ ఏర్పాటుకు
పిల్లరు ఏర్పాటు
గొట్లూరులో మరోసారి ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment