ఉగాదికి సన్న బియ్యం | - | Sakshi
Sakshi News home page

ఉగాదికి సన్న బియ్యం

Published Mon, Mar 24 2025 6:24 AM | Last Updated on Mon, Mar 24 2025 6:23 AM

ఉగాదికి సన్న బియ్యం

ఉగాదికి సన్న బియ్యం

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా

ప్రారంభం కానున్న పథకం

రేషన్‌కార్డుదారులందరికీ

పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు

ఇప్పటికే మూడు నెలలకు

సరిపడా సీఎంఆర్‌ సేకరణ

సందిగ్ధంలో కొత్త రేషన్‌కార్డుదారులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇందిస్తాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే మిల్లర్ల నుంచి 14వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌గా తీసుకున్నాం. మండల స్థాయి స్టాక్‌ పాయింట్లకు అక్కడి నుంచి రేషన్‌దుకాణాలకు సరఫరా చేసి ఏప్రిల్‌ నుంచి అందిస్తాం.

– ప్రసాద్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం, సూర్యాపేట

భానుపురి (సూర్యాపేట): రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటలో మాట్లాడుతూ వచ్చేనెల నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పడంతో పేదల్లో ఆనందం నెలకొంది. సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది పర్వదినాన హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పారరంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు.

దొడ్డు బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు..

జిల్లాలో 3,24,158 రేషన్‌కార్డులు ఉండగా 610 రేషన్‌ షాపుల ద్వారా ప్రభుత్వం నెలనెలా రేషన్‌ అందిస్తోంది. ఇప్పటి వరకు నెలకు సుమారుగా 5వేల మెట్రిక్‌ టన్నుల దొడ్డుబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తుండగా.. ఈ బియ్యం తినలేక చాలామంది కిలో రూ.10 చొప్పున ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. అవే బియ్యం తిరిగి దళారుల ద్వారా మిల్లర్లు తమ కోటా సీఎంఆర్‌కు ఇస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అందించే దొడ్డురకం బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కే చేరుతుండడంతో లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండా పోతోంది.

ఇచ్చిన హామీ మేరకు..

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ వానాకాలంలో సన్నరకం వడ్ల సాగును పెంచేందుకు బోనస్‌ చెల్లించింది. ఈ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నరకం వడ్లను రెండుమాసాలుగా మర ఆడించి మిల్లర్ల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 14వేల మెట్రిక్‌ టన్నుల సన్నరకం బియ్యం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న రేషన్‌దారులకు నెలకు 5వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉండగా.. ప్రస్తుత నిల్వలు 3నెలలకు సరిపడా ఉన్నాయి. అయితే జిల్లాలో నూతన రేషన్‌ కార్డులకు మాత్రం ఈ సన్నబియ్యం అందుతాయా లేదా అన్నది సందిగ్ధత నెలకొంది. అలాగే ఇప్పటికే రేషన్‌కార్డులు ఉండి పిల్లల పేర్లను చేర్పించిన దాదాపు 52వేల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పిల్లల పేర్ల కోసం వచ్చిన దరఖాస్తులకై నా ఈ నెల చివరి నాటికి మోక్షం కల్పించి సన్నబియ్యం అందిస్తారా.. లేదా అనేది వేచిచూడాల్సిందే.

రేషన్‌ దుకాణాలు 610

రేషన్‌కార్డులు 3,24,158

ప్రతినెలా ఇచ్చే బియ్యం 5 వేలమెట్రిక్‌ టన్నులు

ప్రస్తుతం బియ్యం నిల్వలు 14వేల మెట్రిక్‌ టన్నులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement