
హైదరాబాద్, సాక్షి: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల గురువారం మధ్యాహ్నాం నుంచి వర్షాలు మొదలయ్యాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలు ఊరట పొందుతున్నారు.

హైదరాబాద్ నగరంలో.. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. సాయంత్రంకల్లా మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడే అవకాశం ఉంది. ఇక.. నారాయణఖేడ్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వానలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికల్లా.. సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు జారీ చేసింది.

ఆరెంజ్ అలర్ట్
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయి. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఎల్లో అలర్ట్
సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.