
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్లగొండ: ఉపరితల ద్రోణి కారణంగా నేడు(బుధవారం) తెలంగాణలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
అయితే, ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 644 అడుగులకు చేరుకుంది. దీంతో, మూసీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తివేసే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు.. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.
ఇది కూడా చదవండి: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. భారీ క్యూలు! కారణం ఏంటంటే..