ఒక్కసారి కళ్లు తెరవమ్మా..  | Child Deceased By Fell Into Water Sump In Medak | Sakshi
Sakshi News home page

ఒక్కసారి కళ్లు తెరవమ్మా.. 

Feb 2 2021 10:09 AM | Updated on Feb 2 2021 10:09 AM

Child Deceased By Fell Into Water Sump In Medak - Sakshi

చిన్నారి మృతదేహంపై పడి రోదిస్తున్న తల్లి  

శివ్వంపేట(నర్సాపూర్‌): ఒక్కసారి లే తల్లీ.. కళ్లు తెరువమ్మా.. అల్లారుముద్దుగా పెంచుకుంటిని కదే.. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ.. తమ్ముడు పిలుస్తున్నడు చూడమ్మా.. డాడి పిలుస్తున్నడు ఒక్కసారి ఊ అనవే.. అంటూ పాప మృతదేహం వద్ద ఆ తల్లి రోదించిన తీరు అందరి కంటా కన్నీళ్లు పెట్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు తూప్రాన్‌ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మాధవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప జాహ్నవి (6), నాలుగేళ్లు కుమారుడు ఉన్నారు. కూలి పనులు చేస్తే కాని కుటుంబం గడవని పరిస్థితి వారిది. రోజులాగే సోమవారం పిల్లలిద్దరినీ ఇంటివద్దే నాయనమ్మ దగ్గర ఉంచి దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లారు.

నాయనమ్మ ఇంట్లో ఉండగా జాహ్నవి ఓ బొమ్మతో ఆరుబయట ఆడుకుంటుండగా బొమ్మ ఇంటి ఎదుట ఉన్న డ్రమ్ములో పడిపోయింది. దీంతో కుర్చీ తీసుకొచ్చి బొమ్మను తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జారి డ్రమ్ములో పడిపోయింది. మనుమరాలు కనిపించకపోయేసరికి నాయనమ్మ ఇంట్లో వెతకగా డ్రమ్ములో పడిన విషయం గుర్తించి చుట్టు పక్కల వారిని పిలిచింది. వారు డ్రమ్ములో నుంచి పాపను బయటకు తీయగా విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement