డయల్‌ 112  | Dial 112: Home Ministry launches Micro Mission Under National Emergency Response System | Sakshi
Sakshi News home page

డయల్‌ 112 

Apr 25 2022 4:22 AM | Updated on Apr 25 2022 7:58 AM

Dial 112: Home Ministry launches Micro Mission Under National Emergency Response System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రాబోతున్నాయి. ఇందుకోసం నేషనల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టం (ఎన్‌ఈఆర్‌ఎస్‌) పేరుతో మైక్రో మిషన్‌ను కేంద్ర హోం శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ‘112’నంబర్‌ను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రాల్లో అమలు లో ఉన్న 100, 101, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకొస్తోంది. వీలైనంత త్వరగా ‘112’ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగం కూడా కొత్త నంబర్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించింది. డయల్‌ 100కు కాల్‌ చేసిన వారికి వచ్చే సందేశంలో 100కు బదులుగా డయల్‌ 112 అంటూ పొందుపరిచింది. 

దేశంలో 36 చోట్ల 24 గంటల కాల్‌ సెంటర్లు 
‘112’వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలు నిర్విరామంగా పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ తరహా కాల్‌ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. పోలీసు, మెడికల్, ఫైర్, విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు సహా ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు మొత్తం 9 రకాల అత్యవసర సేవలకు ఈ కాల్‌ సెంటర్‌ను ఆశ్రయించేలా ఏర్పాటు చేస్తోంది. ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్‌ ద్వారా కాల్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, చాట్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌లో ఏర్పాటు చేసే ప్యానిక్‌ బటన్, వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్, మొబైల్‌ యాప్స్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ).. ఇలా అన్ని మాధ్యమాల ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టింది.  

ఫోన్‌ చేస్తే ఎక్కడున్నారో కనిపెట్టేలా.. 
అత్యవసర సాయం కోసం బాధితులు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసేటప్పుడు.. అన్ని సందర్భాల్లో పూర్తి వివరాలు అందించే పరిస్థితిలో ఉండరు. సమాచారం అందగానే ఎంత తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తే బాధితులకు అంత ఊరట ఉంటుంది. కాబట్టి కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన కాల్, మెసేజ్, మెయిల్‌ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

దీన్ని గుర్తించేందుకు రాష్ట్ర పోలీసుల దగ్గర ఇప్పటికే కొంత పరిజ్ఞానం ఉంది. తాజాగా ఎన్‌ఈఆర్‌ఎస్‌ అమలుతో మరింత అత్యాధునిక పరిజ్ఞానం చేకూరనుంది. ఇది పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తే జీఐఎస్‌ పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్‌ కంట్రోల్‌ రూమ్స్‌లో ఉంటా యి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యా దు చేస్తున్నారో తక్షణం గుర్తించవచ్చు. పో లీసుల రెస్పాన్స్‌ టైమ్‌ మరింత తగ్గనుంది. 

కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా.. 
ఎన్‌ఈఆర్‌ఎస్‌ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేస్తోంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అంది స్తుండగా.. సిబ్బంది, బాధితులను ఆదుకునేందుకు ఆయా ప్రాంతాలకు చేరుకోవడానికి వాహనాలు, తదితరాలను రా ష్ట్రం చూసుకుంటోంది. సిబ్బందిని రిక్రూట్‌మెంట్, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద, రాష్ట్ర నిధులతో సమీకరించుకుంటున్నారు.

ఇక వైపరీత్యాలు సంభ వించినప్పుడు సత్వర స్పందన కోసం పోలీసు విభా గంతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, మున్సి పల్‌ కార్పొరేషన్లకు ఒకేసారి సమాచారం అందేలా ఇంటిగ్రేటెడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్‌ నేరాల్లో బాధితులుగా మారిన వారికి సహాయం చేయడానికి కేంద్రం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని కూ డా 112లో కలిపేయాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement