లోక్‌సభ పోలింగ్‌ 66.3 శాతం | Polling Percentage Final Figures Of Telangana In Lok Sabha Elections 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

2024 Polling Percentage In Telangana: లోక్‌సభ పోలింగ్‌ 66.3 శాతం

Published Wed, May 15 2024 5:51 AM

polling percentage final figures

3.32 కోట్ల మంది 17 స్థానాల్లో మొత్తం ఓటర్లు

2.20 కోట్లుఓటేసిన వారి సంఖ్య

తుది పోలింగ్‌ శాతం గణాంకాలు వెల్లడించిన సీఈవో వికాస్‌రాజ్‌ 

2019 లోక్‌సభ ఎన్నికలతో పోలి్చతే 3.6 శాతం పెరిగిన పోలింగ్‌ 

అత్యధికం: భువనగిరి 76.78%, అత్యల్పం: హైదరాబాద్‌ 48.48%

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం జరిగిన సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతంపై స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించి తుది గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ మంగళవారం రాత్రి విడుదల చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 66.3 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,24,806 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇందులో 2,18,14,035 మంది పోలింగ్‌ కేంద్రాల్లో ఓటేయగా.. 2,10,771 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. ఇందులో 1,89,091 మంది ఎన్నికల సిబ్బంది, 21,680 మంది వయోవృద్ధులు/వికలాంగ/ అత్యవసర సేవల ఓటర్లు ఉన్నారు. వీరిలో వయోవృద్ధులు, వికలాంగులు తమ ఇళ్ల వద్దే ఓటేశారు. 

భువనగిరిలో అత్యధికం 
2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్‌ నమోదవగా.. ఈసారి 3.6శాతం అదనంగా పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానంలో 76.78 శాతం పోలింగ్, అత్యల్పంగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో 48.48శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు: సీఈఓ వికాస్‌రాజ్‌ 
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని.. అవాంఛనీయ ఘటనలు జరగలేదని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. పోలింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల యంత్రాంగం చేసిన కృషి ఫలించిందన్నారు. ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఓటర్లు, ఎన్నికల యంత్రాంగం, సిబ్బంది, పోలీసు బలగాలు, ఎన్‌ సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలి పారు.

 రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం రాలేదని చెప్పారు. ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామాగ్రిని పరిశీలకులు/అభ్యర్థులు/ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తనిఖీ చేసి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. వచ్చే నెల 4వ తేదీన 34 కౌంటింగ్‌ సెంటర్లలో పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్‌ చేస్తామని చెప్పారు. కౌంటింగ్‌ తర్వాత ఈవీఎంలను కొంతకాలం తిరిగి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరుస్తామని వెల్లడించారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement