
సాక్షి,సిరిసిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించి, కార్యకర్త వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ను అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలు యత్నించారు. డిగ్రీ కళాశాల కావాలని మంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు బిజెపి కార్యకర్తలను అడ్డుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బిజేపి నేతల తీరుపై నిరసన వ్యక్తం చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు.. నలుగురు బీజేపీ కార్యకర్తలపై దాడిచేసి, ఓ బైకును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సాయికుమార్ అనే బీజేపీ కార్యకర్త గాయపడగా, ఇరువర్గాల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బిజేపి కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడ్డ టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని మైనార్టీ యువకుడిపై మంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారని, దాడికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆందోళనను విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment