
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ ఛత్తీస్ఘడ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనము కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో)తో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ.. ఒక్కసారిగా మేఘావృతమైన వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
కాగా, గత 24 గంటల్లో వనపర్తి జిల్లా ఆత్మకూర్లో అత్యధికంగా 8 సెంటీమీటర్లు, పెబ్బేరులో 7 సెంటీమీటర్లు, వీపనగండ్లలో 6 సెంటీమీటర్లు, కామారెడ్డి, నవీపేట్, గాంధారి, బోధన్లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ఇదీ చదవండి: ట్రోలింగ్.. సామాజిక జబ్బు!
Comments
Please login to add a commentAdd a comment