చదివింపులు రూ.13,564 కోట్లు | Telangana Budget 2021 Allocation For Education Sector | Sakshi
Sakshi News home page

చదివింపులు రూ.13,564 కోట్లు

Mar 19 2021 8:41 AM | Updated on Mar 19 2021 8:58 AM

Telangana Budget 2021 Allocation For Education Sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌లో ఈసారి విద్యా రంగానికి కేటాయింపులు పెరిగాయి. గతేడాది పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖలకు మొత్తంగా రూ.12,138 కోట్లు కేటాయించగా ఈసారి ఆయా శాఖలకు రూ. 13,564.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే రూ. 1,426.65 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. అందులో పాఠశాల విద్యలోనే 90 శాతం కేటాయింపులను పెంచింది. గతేడాది పాఠశాల విద్యాశాఖకు రూ. 10,405.31 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 11,693.08 కోట్లు కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 1,287.77 కోట్లు అదనంగా కేటాయించింది. ఇందులో సగానికిపైగా బడ్జెట్‌ను నిర్వహణ పద్దు కింద అదనంగా కేటాయించగా అవి వేతనాలు, నిర్వహణ వ్యయం కిందే ఖర్చు కానున్నాయి.

ఇక ప్రగతి పద్దు కింద కేటాయించిన మిగతా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిం చనుంది. గతేడాది ఉన్నత విద్యకు 1,462.02 కోట్లు, సాంకేతిక విద్యకు 270.23 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి ఉన్నత విద్యకు రూ. 1,592.77 కోట్లు, సాంకేతిక విద్యకు 278.81 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఈసారి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దును రెట్టింపు చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు నిధులను ఎక్కువ మొత్తంలో కేటాయించింది. ‘రూసా’అమలు కోసం గతేడాది రూ. 14.73 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 75.71 కోట్లను కేటాయించింది. అలాగే సంస్కృత అకాడమీ కోసం రూ.15 లక్షలు కేటాయించింది. ఇటు యూనివర్సిటీల్లో మహిళల టాయిలెట్ల నిర్మాణానికి ఈసారి రూ. 10 కోట్లు కేటాయించింది. పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలు కలిగిన తెలుగు యూనివర్సిటీకి మాత్రమే రూ. 3 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఇతర యూనివర్సిటీలకు కేటాయింపులేవీ చేయలేదు. 

పెంపుదల ఇలా.. 
పాఠశాల విద్యలో గతేడాది కంటే ఇప్పుడు రూ. 1,277.77 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద రూ.731.35 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.556.42 కోట్లు అదనంగా కేటాయించింది. ఉన్నత విద్యలో గతేడాది కంటే ఈ సారి రూ. 130.75 కోట్లు అదనంగా ఇచ్చింది. అం దులో నిర్వహణ పద్దు కింద రూ. 39.94 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 89.81 కోట్లు అదనంగా కేటాయించింది. సాంకేతిక విద్యలో గతేడాది కంటే ఇప్పుడు రూ. 8.58 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద రూ. 55 లక్షలు, ప్రగతి పద్దు కింద రూ. 8.02 కోట్లు అ దనంగా కేటాయించింది. కాగా, విద్యాశాఖకు ఈసారి బ డ్జెట్‌ కేటాయింపులు పెరిగినా రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో చూస్తే విద్యారంగం వాటా తగ్గింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్ర బడ్జెట్‌ క్రమంగా పెరుగుతున్నా విద్యా రంగానికి కేటాయింపుల శాతం ఆ మేరకు పెరగట్లేదు..

వర్సిటీలకు రూ. 627 కోట్లు.. 
విద్యాశాఖకు గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి మాత్రం కేటాయింపులు లేకుండాపోయాయి. యూనివర్సిటీల నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి ప్రభుత్వం నిధులను పెంచినా అవి వర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. యూనివర్సిటీలకు గతేడాది రూ. 606.73 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 627.31 కేటాయించింది. మరోవైపు కరీంనగర్‌ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీకి గతేడాది రూ.5.59 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 5.76 కోట్లు కేటాయించింది. అలాగే సుల్తాన్‌పూర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి గతేడాది రూ. 5.1 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 5.25 కోట్లు కేటాయించింది. మంథని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీకి గతేడాది రూ. 84.71 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 87.25 కోట్లను కేటాయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement