
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నిరుద్యోగ డిక్లరేషన్ పేరిట మరో భారీ బహిరంగసభకు సన్నాహాలు చేస్తోంది. ఈ సభతో నిరుద్యోగులకు స్నేహ‘హస్తం’అందించాలని ప్రయత్ని స్తోంది. ఈ సభకు అగ్రనేత రాహుల్గాంధీని ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 17న రాహుల్గాంధీ సభ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి తాజాగా ఢిల్లీలో ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది.
మూడు నెలల క్రితం వరంగల్లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభ కాంగ్రెస్కు మంచి ఊపు తెచ్చిందని నేతలు భావిస్తున్నారు. తాజాగా నిరుద్యోగ డిక్లరేషన్ సభ ఉంటుందన్న ప్రకటన రావడంతో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వరుస సభలతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
సెప్టెంబర్ 17న నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో ఈ సభ ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల భవిష్యత్కు భరోసా ఇచ్చేలా, ఉద్యోగ ప్రకటనలు, ఇతరత్రా అంశాలతో రైతు డిక్లరేషన్లాగా కార్యాచరణ ప్రకటిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో యువతను పార్టీ వైపు ఆకర్షించవచ్చని నేతలు అంచనా వేస్తున్నా రు. ఆ రోజు సభ కోసం పార్టీలోని సీనియర్లతోపాటు జిల్లాల్లోని పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పొలిటికల్ కన్సల్టెంట్గా ఉన్న సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలపై డిక్లరేషన్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment