నాన్న చూపునకూ నోచుకోకుండానే..! | two sisters Ends Life in car accident at nirmal | Sakshi
Sakshi News home page

నాన్న చూపునకూ నోచుకోకుండానే..!

May 3 2025 11:29 AM | Updated on May 3 2025 11:29 AM

two sisters Ends Life in car accident at nirmal

అక్కాచెల్లెళ్లను బలిగొన్న రోడ్డు ప్రమాదం

దుబాయిలో ఉపాధిలేక తండ్రి అవస్థలు..

స్వదేశానికి వచ్చేందుకూ డబ్బులు లేని దుస్థితి

 భర్త కోసం కూలీ డబ్బులు పంపిస్తున్న భార్య

నిర్మల్‌/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్‌ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్‌..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ సమీపంలో ఎన్‌హెచ్‌ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్‌ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. 

మారుమూల తండా నుంచి..
గ్రామస్తులు, జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్‌ రహమాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్‌ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్‌ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్‌ రెడ్డి దుబాయి వెళ్లాడు.

ఎలాగైనా చదవాలని..
తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్‌ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్‌ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్‌ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు.  సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.

చివరిచూపునకూ నోచుకోలేక..
మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్‌ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement