
మహిళ వెంటపడి తరిమిన శునకాలు
మణికొండ చిత్రపురి కాలనీలో ఘటన
మణికొండ: వాకింగ్ కోసం ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ మహిళను వీధి కుక్కలు వెంటపడి తరిమాయి. ఏకంగా పదికి పైగా కుక్కల గుంపు ఆమెను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకుంటూ ఆ మహిళ వంద అడుగుల దూరం వరకు వెళ్లింది. అయినా అవి వెంటపడి మరీ తరమడంతో మహిళ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో అవి ఒక్కసారిగా ఆమెపై పడ్డాయి.
అదే సమయంలో అటువైపుగా స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్దకు సదరు మహిళ పారిపోయి కుక్కల బారి నుంచి తప్పించుకున్న ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. చిత్రపురి కాలనీకి చెందిన రాజేశ్వరి రోజు మాదిరిగానే శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్ నిమిత్తం ఇంట్లోంచి బయటకు వచి్చంది. అదే సమయంలో పదుల సంఖ్యలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఆమె వెంట పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేసింది. వాటి కాటుకు బలి కాకుండా తప్పించుకోగలిగింది.
తిండి కోసం ఎదురు చూస్తుండగా..
కాలనీ వాసులు ముందు రోజు మిగిలిపోయిన ఆహారాన్ని కుక్కల కోసం వీధుల్లో పెడుతున్నారు. దీంతో ప్రతిరోజూ ఉదయం కుక్కలు ఆకలితో అక్కడికి చేరుకుంటున్నాయి. శనివారం కుక్కల బారిన పడిన మహిళ సైతం తమకు ఆహారం పెట్టేందుకే వచ్చి ఉంటుందని కొద్ది సేపు వెంటపడినట్టు సీసీ టీవీలలో రికార్డు అయ్యింది. ఎంతకూ అన్నం పెట్టకపోయేసరికి మహిళ వెంట పడ్డాయని కాలనీ వాసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment