
సాక్షి, హైదరాబాద్: సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతానని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో షర్మిల పేర్కొన్నారు.
డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్డు మీదకొచ్చే తమ్ముళ్లు, చెల్లెమ్మల కోసం ఉద్యోగ బాటలు వేస్తానని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు. మెరుగైన వైద్యం కోసం పడిగాపులు కాసే పరిస్థితిని సమూలంగా మార్చేస్తానని చెప్పారు.