రాష్ట్రంలో పగ, దగా పథకాలే..
● కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ● గ్రూప్–2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారు ● ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం ● జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే వారు కోట్లాది మంది ఉన్నారు ● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా కన్నబాబు బాధ్యతల స్వీకరణ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో చంద్రన్న పగ.. చంద్రన్న దగా సంక్షేమ పథకాలే అమలవుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలుచేసిన పాపానపోలేదని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేదని పేర్కొన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకు పురిటి గడ్డలాంటిదని, ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తే.. సాధించేవరకూ పట్టువదలరని కొనియాడారు. అలాంటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసేందుకు అన్నివిధాలా తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి కృషిచేశారన్నారు. ప్రజలకు ఏమైతే మాట ఇస్తారో.. అది చేయడం వైఎస్ జగన్ నైజమన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వారిచ్చిన ప్రతి హామీని అమలుచేసేలా వైఎస్సార్ సీపీ ప్రజల తరఫున పోరాడుతుందని పేర్కొన్నారు. కూటమి 8 నెలల పాలనలో రూ.లక్షా 20 వేల కోట్లు అప్పుచేసిన సీఎం చంద్రబాబు.. ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సేనల కన్నా వైఎస్ జగన్ సేన స్ట్రాంగ్గా ఉందని, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కోట్లాది మంది కార్యకర్తలు, ప్రజలు, అభిమానులున్నారన్నారు. వైఎస్ జగన్ అంటే ఒక శక్తి.. ఆయన చాలా స్ట్రాంగ్ అని స్పష్టం చేశారు. ప్రజలే తమ బలమన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఒకరిద్దరు వెళ్లినంత మాత్రానా ఎటువంటి నష్టం లేదన్నారు.
కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, అరకు ఎంపీ తనూజ రాణి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్కుమార్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్రాజ్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, సమన్వయకర్తలు కేకే రాజు, తిప్పల దేవన్రెడ్డి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, పీవీ సురేష్, సాడి పద్మారెడ్డి, ఇమ్రాన్, ముఖ్యనేతలు కోలా గురువులు, రొంగలి జగన్నాథం, చొక్కాకుల వెంకట్రావ్, మొల్లి అప్పారావు, రవిరెడ్డి, పేర్ల విజయచందర్, కాయల వెంకటరెడ్డి, పేడాడ రమణికుమారి, మారుతీప్రసాద్, బోని శివరామకృష్ణ, శ్రీదేవి వర్మ, మాధవివర్మ, పీలా వెంకటలక్ష్మి, కాళిదాస్రెడ్డి, సనపల రవీంద్ర భరత్, అల్లంపల్లి రాజుబాబు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
గ్రూప్–2 అభ్యర్థుల యువగర్జన చూశాం
ఎన్నికలకు ముందు లోకేష్ యువగళమంటూ తిరిగాడు.. అసలుసిసలైన యువగర్జన విశాఖ కేంద్రంగా గ్రూప్–2 అభ్యర్థులు చేశారని కన్నబాబు అన్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేస్తామంటూ నమ్మించి అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారన్నారు. నిరుద్యోగులనే కాదు.. మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో పగ, దగా పథకాలే..
Comments
Please login to add a commentAdd a comment