‘ఎవరూ లేరని బాధపడొద్దు. జరిగిన దానిని పీడ కలలా మర్చిపో. నీకు నేనున్నాను. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నా ఇంటికి రా. నీకు మంచి హాస్టల్లో వసతి కల్పించి చదువు చెప్పిస్తా. సెలవుల్లో వచ్చి మా ఇంట్లోనే ఉండు. నీకు నా కూతురు (నిజామాబాద్ ఎంపీ కవిత) తోడుగా ఉంటుంది. సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా’ అంటూ ప్రత్యూషకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. ఆస్తి కోసం కన్నతండ్రి రమేశ్, సవతి తల్లి చాముండేశ్వరి పెట్టిన చిత్రహింసల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ సరూర్నగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు. భార్య శోభారాణి, కూతురు కవితతో కలసి ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్...ప్రత్యూషతో మాట్లాడారు. ‘జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడాలి. జీవితం ఇంకా చాలా వుంది. కొత్త జీవితం ప్రారంభించి నిలదొక్కుకోవాలి. బాగా చదివి పైకిరావాలి. రేపు నీలాగా ఇంకా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే పరిస్థితిలో నువ్వుండాలి. నీకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నాడనే ధైర్యంతో ఉండు. నీకు పోలీసు కాపలా పెట్టిస్తా. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా నిన్ను చూసుకుంటడు’ అంటూ ప్రత్యూషకు కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యూషకు పండ్ల బుట్టతోపాటు చేతి ఖర్చుల కోసం కొంత నగదు కూడా అందించారు. వాళ్లను బయటకు రానీయొద్దు: ప్రత్యూష ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నావా అని సీఎం అడగ్గా భావోద్వేగానికి గురైన ప్రత్యూష...తనను ఈ స్థితికి తెచ్చిన సవతి తల్లి, తండ్రిని జైల్లోంచి బయటకు రానీయొద్దని కేసీఆర్ను వేడుకుంది. ‘వాళ్లిద్దరూ కొడుతున్నట్లు ఇంకా కలలు వస్తూనే ఉన్నాయి. వారంటేనే భయమేస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి కేసీఆర్ స్పందిస్తూ ‘ఇకపై నీకేమీ కాదు. అన్నింటికీ నేనున్నా’ అని భరోసా ఇచ్చారు. ప్రత్యూషను చిత్ర హింసలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డిశ్చార్జి అయ్యాక ఇంటికి తీసుకెళ్తా...
Published Sun, Jul 19 2015 9:04 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement