
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
► ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా 2020–21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అనంతరం ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదవ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లిష్ మీడియంలో రాసేలా తీర్చిదిద్దాలని భావించింది.
► ఇదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. ఈ మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ఓ తెలుగు మీడియం పాఠశాల కొనసాగించాలని నిర్ణయించింది.
► కాగా ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో కేసు వేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment