English medium
-
విద్యార్థుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై కక్షగట్టిన కూటమి సర్కారుకు విద్యార్థులు షాకిచ్చారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగులోనూ రాసేందుకు అవకాశం కల్పించినా విద్యార్థులు ససేమిరా అన్నారు. కొన్నిచోట్ల సర్కారు ఒత్తిడితో కేవలం 7 శాతం మంది మాత్రమే తెలుగులో పరీక్షలు రాసేందుకు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను తెలుగు మీడియంలోకి మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పదో తరగతి విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పినట్టయింది.సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మీడియానికే జై కొట్టారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 93 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలోనే రాస్తామని తేల్చి చెప్పారు. 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతిలో మొత్తం 6,64,527 మంది విద్యార్థులు ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 3,77,054 మంది చదువుతున్నారు. వీరంతా మార్చి 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ నామినల్ రోల్స్ పంపాల్సిందిగా పాఠశాలలను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొదలైన అనంతరం తెలుగులోనూ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుంచి కేవలం 51,037 మంది మాత్రమే తెలుగు మీడియంకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య 25 వేలకు మించి ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలతో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్ మీడియం లేకున్నా సరే 4 లక్షల మంది విద్యార్థుల్లో 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. చట్టప్రకారం ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోకి మారింది. అయినప్పటికీ కూటమి సర్కారు ఇంగ్లిష్ మీడియం రద్దుకు కంకణం కట్టుకుని పదో తరగతి విద్యార్థులను తెలుగు మీడియం వైపు తిప్పేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇంగ్లిష్ మీడియం విద్యకే ఓటు రాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉండేది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకోవడం, అది ప్రభుత్వ బడుల్లో లేకపోవడంతో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడం.. ప్రైవేటు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగడం పరిపాటిగా మారింది. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలను గత టీడీపీ ప్రభుత్వం మూసేసింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అధ్యయనం చేసి తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంది. తద్వారా రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటున్నామని 95 శాతం మంది తెలిపారు. ఇంగ్లిష్ కోసమే ఫీజులు భారమైనా తమ బిడ్డలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నట్టు వివరించారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. ఆ సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టగా, 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ఇదే క్రమంలో 2024–25 విద్యా సంత్సరంలో పదో తరగతి కూడా ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వచ్చింది. కుట్రను తిప్పికొట్టి మరీ..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదవలేకపోతున్నారని, మాతృభాషలో బోధన అందిస్తామని ప్రకటించింది. కానీ.. విద్యార్థులు అందుకు అంగీకరించలేదు. 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువుతున్న పదో తరగతి విద్యార్థుల్లో 2.20 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వారిలో 1.94 లక్షల మంది ఉత్తర్ణీత సాధించడం ద్వారా పిల్లలు ఇంగ్లిష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో రుజువు చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో 25 వేల మందే తెలుగు మీడియం పరీక్షలకు అంగీకరించి.. తెలుగు మీడియం సంఖ్యను మరింత తగ్గించారు. గత ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో ప్రజల్లో సర్కారు బడులపై నమ్మకం పెరిగింది. దాంతో 2023–24 విద్యా సంవత్సరంలో అంతకు ముందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరికలు నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ప్రభుత్వం బైలింగ్యువల్ పుస్తకాలను అందించడంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే భయం పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకే ఇష్టపడుతున్నారు. గతేడాది ముగిసిన పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 3 నుంచి 5 తరగతుల్లో 86 శాతం, 6 నుంచి 9వ తరగతి వరకు 94 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయగా, మొత్తం అన్ని తరగతుల్లోను పరీక్షలు 93 శాతం ఇంగ్లిష్ మీడియంలోనే పూర్తి చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. అదీ ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎందుకని ఆక్షేపించిన వారికి గట్టి జవాబు ఇచ్చారు. -
ఇంగ్లిష్ మీడియంపై అక్కసు ఎందుకు?
ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరం. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగు వర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. కానీ దళిత బహుజనులు ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేయడం న్యాయం కాదు. తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తీర్మానం సామాజిక న్యాయానికి విరుద్ధమైనది, నిజాయితీ లోపించినది.తెలుగు నేలలో ఈ నాలుగు దశాబ్దాల్లో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యా, భాషా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు హరిత విప్లవం తరువాత సంపన్న వర్గాలుగా మారాయి. ఒకనాడు జమీందారీ విధానం మీద పోరాడిన ఈ వర్గాలు ఆ తరువాత అవకాశ వాదంగా బ్రాహ్మణవాద కులాధిపత్యాన్ని స్వీకరించాయి. భూమి పంపకాన్ని నిరాకరిస్తూ భూస్వామ్య గుత్తాధిపత్యంతో రాజ్యాధి కారాన్ని చేపట్టాయి. అంతకుముందు వీళ్లు తెలుగు భాషకు పట్టం గట్టారు. కానీ తెలుగు విద్య వల్ల తమ పిల్లలకు ఉద్యోగ వసతి రాదనీ, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపా దించాలంటే ఇంగ్లిష్ విద్య అవసరమనీ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ విద్యను దెబ్బతీశారు. ఎవరైతే తమ పిల్లలకు, మనవళ్ళకు బుద్ధిపూర్వకంగా తెలుగు రాకుండా చేసి వారి దేశీయత మీద గొడ్డలివేటు వేశారో, వారే మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కానీ దీన్ని తెలుగు మీద ప్రేమ అనలేము. ‘భూస్వామ్య ఆధిపత్యానికి కూలీలు ఎవరు దొరుకుతా’రనే భావనతోనే బడుగులకు తెలివిగా ఆంగ్ల మాధ్యమ నిరాకరణ జరుగుతోంది.నిజానికి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ లాంటివాళ్లు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక వహించడానికి వారి ఇంగ్లిష్ విద్యే కారణం. అంబేడ్కర్. భారత రాజ్యాంగంతో పాటు, వేలాది పేజీలు వివిధ అంశాలపై రాయడం ఆయన ఆంగ్ల భాషా అధ్యయనం వల్లే జరిగింది. ఆంగ్ల భాషాధ్యయనం వల్లే రాజా రామ్మోహన్ రాయ్ సతీసహగమన దురాచారానికి ఎదురు తిరగగలిగారు. రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతనం స్థాపించి, నోబెల్ బహుమతి గ్రహీత కాగలిగారు. దీని వెనుక ఇంగ్లిష్ పునరుజ్జీవన ఉద్యమ అధ్యయనం ఉంది. ఇంగ్లిష్ విద్య ఇప్పటి కచ్చిత అవసరమనే విషయం అందరూ తెలుసుకోవాలి. దాన్ని అందిపుచ్చుకుంటూ దళిత బహుజనులు కూడా ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. నిజానికి పోయిన ఐదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలోని స్కూళ్ళల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగువర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే, చదువుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. ఒక సబ్జెక్టుగా తెలుగు అన్ని పాఠశాలల్లో ఉంది. తెలుగును ఆ సబ్జెక్టు నుండి అభివృద్ధి చేయవచ్చును. ప్రతి విద్యార్థికి నూరు పద్యాలు కంఠతా వస్తేనే ఆ విద్యార్థికి పదో తరగతి సర్టిఫికెట్ ఇవ్వండి అని ‘దళిత మహాసభ’ సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భాషోద్ధరణకు సభలు పెట్టినవాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళను, కార్పొరేట్ స్కూళ్ళను నెలకొల్పారు. అందులో రెండవ భాషగా సంస్కృతాన్ని పెట్టి అసలు పిల్లలకు తెలుగే రాకుండా చేశారు. తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసిన ఈ పాలకులే తెలుగు భాషోద్ధరణకు పూనుకుంటున్నామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దళిత బహుజన వర్గాలు ఆంగ్ల విద్య నేర్చుకుని వారు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే అర్హతను సంపా దిస్తారేమో అనే భయం వీరిని వెంటాడుతున్నట్టుంది.ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వంలోనే 56 సంస్కృత కళాశాల లను రద్దుచేసి ఆ కళాశాలల్లోని తెలుగు పండితుల పొట్ట కొట్టారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలను నిర్వీర్యం చేసి తెలుగు భాషా సాహితీ కవితా పరిశోధనల వెన్ను విరిచారు. ఆధిపత్య కులాలు ఏ సబ్జెక్టును చదవడం లేదో గుర్తించి వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఒక్క తెలుగునే కాకుండా వృక్షశాస్త్రాన్ని, జంతుశాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాలను దెబ్బ తీసి ఐటీ సెక్టారుకు ఉపయోగపడే బీటెక్, ఎంటెక్లకే ప్రాధాన్యం ఇచ్చారు. మానవ వ్యక్తిత్వంలోని జీవశక్తిని దెబ్బతీశారు. కుటుంబ సంబంధాలన్నీ నాశనం అయినాయి. తమ సామాజిక వ్యవస్థలను గుర్తించ కుండా దేశం అంతా నాశనం అయిపోయిందని గగ్గోలు పెడు తున్నారు. నిజానికి ఇది స్వీయ వ్యక్తిత్వ దహనం నుండి వస్తున్న ఆక్రోశం. దళిత బహుజనుల వికాసంపైన ద్వేషానలం. ఈ హిపో క్రసీని అర్థం చేసుకోలేనంత అవిద్యలో దళిత బహుజనులు లేరు. ఏ పోరాటానికైనా నిజాయితీ ఉండాలి. అన్ని వర్గాల అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని కాంక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండాలి. తమ కులాలే పైకి రావాలి అనేవారు సామాజిక సంస్కర్తలు కాలేరు. ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా ఆలో చనల్లో విస్తృతి, సామాజిక విప్లవ భావన లేకపోతే వేదికలు మాత్రమే పెద్దవిగా ఉంటాయి; ఆలోచనలు సంకు చితంగానే కనబడతాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి అందరూ సంతాపం తెలపడమే కాక ఆయన తీసుకొచ్చిన ‘సరళీకరణ’ దేశాభివృద్ధిని పొగిడారు. ఈ సరళీ కరణలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలంటే ‘ఇంగ్లిష్ విద్య అందరికీ రావాలి’ అనే భావన అందులో దాగివున్న విషయం మరచిపోయారా? కొన్ని సామాజిక వర్గాల్లో సంస్కర్తలు, సామాజిక విప్లవకారులు తగ్గుతున్నారు. కారణం అట్టడుగు వర్గాల జీవన వ్యవస్థల అభివృద్ధే దేశాభి వృద్ధి అని తెలుసుకోలేక పోతున్నారు. మానవ పరిణామశాస్త్రం అన్ని జీవుల్లో మానవజాతే గొప్పదని నిగ్గుతేల్చింది. మౌఖిక జీవన వ్యవస్థలన్నీ లిఖిత జీవన వ్యవస్థలుగా పరిణామం చెందుతున్న దశ ఇది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోతోంది. విద్య అనేది జ్ఞానం, సంస్కృతి, నాగరికత, చరిత్ర, ఉత్పత్తి, ఉత్పిత్తి పరికరాలను సృష్టించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు విస్తరించి ఉన్నారు. ఆయా వృత్తుల్లో ఆ యా జీవన వ్యవస్థల్లో, ఆ యా దేశ పాలనల్లో వీరు భాగస్వాములౌతున్నారు. దానికి ఆంగ్ల విద్య ఎంతో తోడ్పడిందనేది చారిత్రక సత్యం. అందుకే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, బడుగు వర్గాలకు ఆంగ్ల విద్యను నేర్పడం అవసరం. దీనివల్ల వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంతిమంగా దేశానికే మేలు కలుగుతుంది. జీడీపీ పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశీయ ఎగు మతులు పెరుగుతాయి. ఏ ప్రభుత్వానికైనా పోయిన ప్రభుత్వాల విధానాలనన్నింటినీ రద్దు చేయాలనే భావన మంచిది కాదు. పాలకులు మారుతూఉంటారు. కానీ మంచి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రజల్లో ఎంతో చైతన్యం ఉన్న కాలం ఇది. ఇంగ్లిష్ మీడియంపై ప్రభుత్వం చర్య తీసుకొనే పక్షంలో, అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళను ఒకే విధానంలోకి తేగలరా? ఒకసారి సామాజిక న్యాయ కోణంలో, దళిత, బహుజనుల మేలును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇంగ్లిష్ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. తెలుగు భాషాభివృద్ధి ఒక జీవన సంస్కృతి. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళడమే దళిత బహుజన సామాజిక తాత్విక ఆలోచన క్రమం. ఇది ఫూలే, అంబేడ్కర్ బాట. ఆ బాటలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంగ్లిష్పై ‘తీర్పు’ వివక్షాపూరితం!
విజయవాడలో జరిగిన మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడమే కాక, తత్సంబంధ జీవో నం.85ను రద్దు చేయాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరడం ఏ కోణం నుండి చూసినా సమంజసనీయమైనది కాదు. గౌరవ నీయ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తిగా ఆయనకిది ఏమాత్రం తగినట్లుగా లేదు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాలలోనే విద్య నేర్పాలని సూచించారు. అయితే నేటి పోటీ ప్రపంచంలో దీని అమలు అసాధ్యమని తెలిసినప్పటికీ, జస్టిస్ రమణ దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎక్కడా కోరలేదు. కానీ స్వరాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగు మాధ్యమానికి మాత్రమే, అందునా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు మాధ్యమానికి తావివ్వాలని మాట్లాడుతున్నారు!ప్రైవేట్ స్కూళ్లలో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని నామమాత్రంగానైనా ఆయన ఎందుకు అడగటం లేదు? అంటే సంపన్నుల పిల్లలకు ఒక న్యాయం, పేద దళిత గ్రామీణ పిల్లలకు మరొక న్యాయం! ఇదేనా ఎవరైనా ఇవ్వవలసిన ‘తీర్పు’? ఇంగ్లిష్ మీడియంతో ప్రైవేట్ విద్యారంగం కళకళలాడాలనీ, కేవలం తెలుగు మీడియంతో నడిచే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోవాలనీ; ‘ప్రభుత్వం వేస్ట్.. ప్రైవేట్ రంగం బెస్ట్’ అనీ... ఆయన, ఆయన వెనుక ఉన్న రాజకీయ నేతల ఉద్దేశంలా కనిపిస్తోంది.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ తెలుగు భాషపై ప్రేమ వెలిబుచ్చుతూ ఉంటారు. వీరి పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి! విదేశాలకు వెళ్లి వచ్చి, గొప్పగా సంపాదించుకోవాలి. కానీ పేదవాళ్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్లు రాష్ట్రం దాటి వెళ్లకూడదు.జగన్ సంస్కరణలు చరిత్రాత్మకం గత ఐదేళ్లలో జగన్ దేశంలోకెల్లా అత్యధికంగా పాలనలో, పలు రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చి చరిత్రకెక్కారు. రాజకీయంగా జగన్ మోహన్రెడ్డితో విభేదిస్తే, రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఆయన మీది ద్వేషంతో ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలను రద్దు చేస్తూ పోవడం ఏమాత్రం సమంజసం కాకపోగా విపరిణామాలకు దారి తీస్తుంది.ద్విభాషా పాఠ్యపుస్తకాలను, ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులను ఇచ్చినప్పటికీ, ఏ మీడియంలోనైనా చదువుకునే, పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంనే కోరుకున్నప్పటికీ, లక్షలాదిగా ఉన్న వారి అభీష్టానికి, హక్కుకు వ్యతిరేకంగా ఈ న్యాయమూర్తి ఇలా మాట్లాడటం సరైనది కాదు. ఆయన మాట విని, ఆంగ్ల మాధ్యమంలో 9వ తరగతి వరకు వచ్చిన విద్యార్థులను నట్టేట ముంచి, తిరోగమన దిశలోకి మరల్చడం చంద్రబాబు చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుంది.దీనికి బదులు, తెలుగు భాషపై తెలుగు మాధ్యమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఆంగ్ల మాధ్యమాన్ని కొనసా గిస్తూనే, కేజీ టు పీజీ తెలుగు మాధ్యమ బోధనా విద్యాసంస్థలను సమాంతరంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రత్యే కంగా ఏర్పాటు చేసి, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధులలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం సముచితంగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రజల భాష లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, న్యాయస్థానాలు ప్రజల భాషలోనే తీర్పులు ఇవ్వాలని ఆదేశిస్తే, నిర్దేశిత రాజ్యాంగ ఆశయాలు కూడా తద్వారా నెరవేరుతాయి.ఇలాంటి విశాల దృక్పథంతో ఆంగ్ల లేక తెలుగు మాధ్యమ అంశాలను పరిశీలించినప్పుడే ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. అలా కాని పక్షంలో ఎన్నో వేల ఏళ్లుగా వివక్షకు గురైన అట్టడుగు పేద బడుగు వర్గాల నుండి ప్రతిఘటనను, ఇంగ్లిష్ మీడియం పరి రక్షణ ఉద్యమాలను కూటమి పాలకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈదర గోపీచంద్ వ్యాసకర్త సామాజిక ఉద్యమ కార్యకర్తమొబైల్: 94403 45494 -
‘ఇంగ్లీష్ మీడియం.. మీ పిల్లలకేనా?..మా పిల్లలకొద్దా?’
విశాఖపట్నం, సాక్షి: తెలుగు వికాసం ముసుగులో బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని, అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా? అని విదసం ఐక్య వేదిక ప్రశ్నిస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలంటూ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు మహా సభలు తీర్మానాలను వ్యతిరేకిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం రద్దును మేము ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. వేదిక మీద మాట్లాడిన వారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు?. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా?.. మా పిల్లల మాత్రం మీ దొడ్లుల్లో పశువులు కాయలా.. అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా?.. .. తెలుగు మహా సభల వేదిక మీద ఉన్నవారు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా మాట్లాడారు. వేదికపై ఒకరు కూడా బడుగు బలహీను వర్గాలకు చెందిన వారు లేరు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలే!. అందుకే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి. ప్రపంచీకరణలో ఉద్యోగాల రావాలంటే ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ కి వచ్చిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇంగ్లీషు రాక ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక నష్టపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని విదసం ఐక్య వేదిక పేర్కొంది. -
ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే'
సాక్షి, అమరావతి: కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి! పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. పేదింటి తల్లిదండ్రుల ఆరాటం, పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యా రంగాన్ని సమున్నతంగా మార్చాలని తపన పడ్డారు. మునుపెన్నడూ చూడని విద్యా సంస్కరణలు తెచ్చారు. విద్యా బోధనలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకోకుండా మూస విధానాలతో వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు అంతులేని నష్టం జరుగుతుందని గుర్తించారు. పేద కుటుంబాల్లో మరో తరం అణగారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ఓ మేనమామలా అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు. ఐరాస వేదికపై మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా రూ.72,919 కోట్లు వెచ్చించారు. కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు? ఏ ఒక్కరైనా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా? పిల్లల్లో బలమైన ఆసక్తి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరీక్షలు సైతం ఆంగ్లంలోనే రాస్తూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆరాట పడుతున్నారు. గతేడాది 9వ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో 91.33 శాతం మంది పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు 2.20 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయడం.. 1.94 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. తద్వారా పిల్లలు ఇంగ్లీష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ.. ‘దేశంలో పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యం. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువొక్కటే. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత. పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే అది ఇంగ్లీష్ చదువులతోనే సాధ్యమవుతుంది..’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివీ! అందుకు అనుగుణంగానే ఆయన 2020–21లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్ను అందుబాటులోకి తెచ్చారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024–25 నాటికి టెన్త్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు (మిర్రర్ ఇమేజ్), ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమలు టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనేవైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో 2023 – 24లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల చేరికలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1,50,005 అధికంగా నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2023–24 పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి టాప్ 28 మంది విద్యార్థుల్లో 26 మంది ప్రభుత్వ స్కూళ్లలో చదివి బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాల సహాయంతో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590 నుంచి 594 వరకు మార్కులు సాధించడం గమనార్హం. జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులను గత ప్రభుత్వం సత్కరించి ప్రోత్సహించింది. ఇంగ్లీష్ మీడియంలో కేరళను దాటిన ఏపీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) 2023లో ఇంగ్లీష్ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్లో నిలిచింది. ఈమేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు. సర్వేలో జాతీయ సగటు 37.03 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో 84.11 శాతంగా నమోదు కావడం గమనార్హం. కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది. ప్రైవేట్ స్కూళ్లకు 2 లక్షల మంది విద్యార్థులు వైఎస్ జగన్పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్ను రద్దు చేశారు. అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ 1,000 సీబీఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్లను తొలగించారు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులను నీరుగార్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోవడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా నీరుగారుతోందో చెప్పేందుకు నిదర్శనం. 95% తల్లిదండ్రుల కోరిక ఇంగ్లీష్ మీడియంరాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను బలంగా కోరుకున్నారు. అది ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్ బాట పట్టారు. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలు వివిధ దశల్లో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలోప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై అధ్యయనం నిర్వహించిన జగన్ ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం సేకరించింది. రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఫీజులు ఆర్ధికంగా భారమైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నట్లు చెప్పారు. సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో మరో దారి కానరాక ప్రైవేట్లో చేర్చినట్లు వాపోయారు. ఈ క్రమంలో పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రేపటి పౌరుల ఉజ్వల భవిష్యత్తు దిశగా జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. తొలుత ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగా 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్లపై పెరిగిన నమ్మకం మనబడి నాడు–నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2019–20లో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో కార్పొరేట్కు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. డ్రాపౌట్స్ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా అందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2020 జనవరి 1న జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో రుచికరమైన మెనూతో 16 రకాల పదార్థాలు, ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో ఆహారాన్ని అందచేశారు. గోరుముద్దపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్లు వెచ్చించింది.మేధావుల్లారా ఆలోచించండి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని తెలుగు రచయితల మహాసభల్లో వక్తలు, మేధావులు డిమాండ్ చేశారు. కానీ రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వానికి తెలుగు భాషపై నిజంగా ప్రేమ ఉంటే ప్రతి గ్రామం, పట్టణంలో ఒకేచోట తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మీడియం కావాలంటే అందులో చేరుతారు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు అన్యాయం తలపెట్టవద్దు. – ఎస్.రామకృష్ణ, పురపాలక టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుమీ పిల్లలు ఎక్కడ చదివారు?.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, రచయితలు మూకుమ్మడిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే జీవో 85ను రద్దు చేయాలని కోరడం అత్యంత దుర్మార్గం. వారిలో ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంగ్లీష్తోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని పాలకులపై ఒత్తిడి తేవాలి. మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదుల పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు, తెలుగు భాషా రచయితల పిల్లలు ఏ మాధ్యమంలో చదివారో.. ప్రస్తుతం ఏ దేశాల్లో ఉంటున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. – బి.మనోజ్కుమార్, రమేష్, బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుఏపీలో విద్యా విప్లవాన్ని మళ్లీ వెనక్కి తీప్పాలనే..⇒ తెలుగు మీడియంలో చదివి కష్టపడి న్యాయవాద డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లీష్లో సమర్థంగా వాదించే నైపుణ్యం లేక ఎంత డిప్రెషన్కు గురవుతున్నారో నేను చూశా. ⇒ ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అంటున్న తెలుగు భాషకు సివిల్ సర్వీస్లో ప్రశ్నాపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ⇒ కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లను కన్నడలో బోధించాలని జీవో ఇచ్చినప్పుడు తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్టే చెప్పింది కదా! ⇒ చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది. ఆయన మనవడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కాబోతున్నాడు? ⇒ మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువదించి నోబెల్ ప్రైజ్ పొందే పుస్తకాలు రాయాలిగానీ దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా! ⇒ ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో లేదా రచించాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! ⇒ ఆంధ్రప్రదేశ్లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. ⇒ ఇంగ్లీష్ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే గానీ అది బతకదు. పోరాటం చేస్తేగానీ ఈ తిరోగమన రథ చక్రం ఆగదు. – ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక విశ్లేషకుడు, ప్రముఖ రచయిత -
నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!
కొందరు మోసపూరిత ధోరణి అనవచ్చు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మాత్రం ఇది నేర్పరితనమే. చేసిన వాగ్ధానాలతో నిమిత్తం లేకుండా ఆయన ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లి విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు సుద్దులు చెప్పి తిరిగి వచ్చారు. మెగా పేరెంట్స్, టీచర్స్ కమిటీల సమావేశాలతో రికార్డు సృష్టించామని ప్రకటించుకున్నారు కూడా. సహజంగానే ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఈ గొప్పలకు గొంతు కలిపారు. తామేం చేయబోతున్నామో చెప్పి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తే బాగుంటుంది కానీ.. ప్రచారం కోసం ఉత్తుత్తి మీటింగ్లు పెడితే ఏం లాభం? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే కొన్ని రోజుల క్రితం ఒక్కరోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు గొప్పలు చెప్పుకున్నారు. బహుశా వీటికి పోటీగానే లోకేష్ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినట్లుంది. ఒకరికొకరు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారన్నమాట!! పవన్ ,లోకేష్కు మధ్య సాగుతున్న ఈ అంతర్గత పోరు రాజకీయంలో చంద్రబాబు కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉద్ధరణకు సంకల్పం చెప్పుకున్నారు. కానీ ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఊరకే సమావేశాలు పెట్టామని చెబితే వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా ఇవే సమావేశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని తప్పుడు ఆరోపణలు సైతం గుప్పించారు. బాపట్లలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్, పేరెంట్స్తో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్లకు అక్కడి పరిస్థితులను చూసిన వెంటనే జగన్ ప్రభుత్వం చేసిన మంచి కనిపించి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్బోర్డులు, మంచి బల్లలు, ఫ్యాన్లు, మంచినీటి వసతి, శుభ్రమైన మరుగుదొడ్లను చూసే ఉంటారు. స్కూల్ భవనాలు బాగుపడ్డ సంగతీ అర్థమై ఉంటుంది. అప్పటికే పవన్కళ్యాణ్ కూడా కొన్ని స్కూళ్లలో వచ్చిన మార్పులను ప్రత్యక్షంగా గమనించి ఆశ్చర్యపోయిన విషయం సోషల్మీడియాలోనూ విస్తృతంగా వ్యాప్తి చెందింది. అధికారం చేపట్టిన తరువాత ఈ ఆరునెలల్లో స్కూళ్లను ఉద్ధరించేందుకు చేసిందేమీ లేకపోయినా తామూ ఏదో చేస్తున్నామని అనిపించుకునేందుకు మాత్రమే ఈ సమావేశాలను నిర్హించినట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఎదుట ఒక విద్యార్ధి తల్లి స్కూళ్లలో సమస్యలను వివరించిన ఉదంతమే అందుకు ఉదాహరణ అని చెప్పాలి. పారిశుద్ద్యం ఎలా కొరవడిందో, పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆమె చెబుతుంటే మంత్రి ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తమ ప్రచారం కోసం స్కూళ్లకు వెళ్లినా, వారు ఏమి తప్పు చేస్తున్నది వారికి తెలియకుండా ఉంటుందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడునేడు పేరుతో అనేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. స్కూళ్ల రూపురేఖలను మార్చేశారు. ఇలా విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్లో జగన్ వేసిన ముద్రను చెరిపేసేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. జగన్ కంటే ఎక్కువ మంచి చేస్తే బాగుండేది కానీ.. ఒకపక్క ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడుతూ, ఇంకోపక్క ప్రైవేటు స్కూళ్లకు ఉపయోగపడేలా వ్యవహరించడంతోనే వస్తుంది సమస్య. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో స్కూల్ తెరిచే జూన్ నెలలోనే తల్లుల ఖాతాలో రూ.15 వేల చొప్పున వేసేది. పిల్లలు స్కూళ్లు మానివేయకుండా ఉండడానికి చేసిన ఈ ప్రయత్నం జగన్కు పేరు తేవడంతో చంద్రబాబు అండ్ కో తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని, ప్రతి విద్యార్దికి రూ.15 వేల చొప్పున వేస్తామని నమ్మబలికారు. ‘‘ఓపిక ఉంటే ఎంతమంది పిల్లలనైనా కనండి’’ అని వారి బాధ్యత తనదని బొంకిన నేత ఇప్పుడు అసలు తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. అమ్మ ఒడి వల్ల జగన్ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించి ఉంటే, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు తల్లికి వందనం పేరుతో పిల్లలందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎందుకు చెప్పారో వివరించాలి కదా? రానున్న రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు తెస్తామని చంద్రబాబు అన్నారు. అవేమిటో చెప్పాలి కదా? జగన్ ప్రభుత్వం పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే వరకు వెళ్లారు. విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమంటే ఇదే అని చంద్రబాబు చెబుతున్నారా? జగన్ టైమ్ లో పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకుంటూ చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేలా ఎదిగారు. అందువల్ల విద్యా వ్యవస్థ భ్రస్టు పట్టిందని చంద్రబాబు అంటారా? అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా కూటమి నేతలంతా ప్రచారం చేశారు. వారి ప్రభుత్వం రాగానే ఆంగ్ల మీడియం ను నిరుత్సాహపరచే చర్యలు చేపట్టారు. తద్వారా ప్రైవేటు స్కూళ్లకు మేలు చేయడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నించారని అంటారు. ఇది కదా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడం అంటే! అలాగే సీబీఎస్ఈ, ఐబి కోర్స్, టోఫెల్ వంటి విన్నూత్నమైన, ఖరీదైన కోర్సులను పేదలకు ఉచితంగా అందేలా జగన్ చేశారు. చంద్రబాబు భావనలో ఇది విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమేమో చెప్పాలి. ప్రతి ఏటా పిల్లలకు టాబ్ లు అందచేయడం తప్పని అనుకుంటున్నారా? ఈనాడు మీడియా అప్పట్లో నీచంగా పిల్లల ట్యాబ్ లపై ప్రచారం చేసి తన ఫ్యూడల్ ధోరణిని బయటపెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతోందేమో తెలియదు. స్కూళ్లలో పారిశుద్ద్యం, పిల్లకు భోజనం వంటి వాటిపై జగన్ ప్రభుత్వం అత్యంత శ్రద్ద వహించిందన్నది వాస్తవం.ఫైవ్ స్టార్ హెటల్ స్థాయిలో టాయిలెట్లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ఇప్పుడు అవేమి అయిపోయాయో తెలియదు కాని, కర్నూలులో ఒక విద్యార్ధి తల్లి టాయిలెట్ల అధ్వాన్న పరిస్థితిపై వివరించడం వింటే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది. జగన్ ఎన్ని సంస్కరణలు తీసుకు వచ్చినా వ్యతిరేకిస్తూ వికృతమైన కధనాలు రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు విద్యా శాఖ నాలుగైదు రకాల బడులను ఏర్పాటు చేయబోతోందని చెబుతోంది. అంటే గత ప్రభుత్వ వ్యవస్థను దెబ్బ తీయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ తీరుతో రెండు లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని కొన్ని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని జగన్ ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆయనకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు.పైగా బుకాయిస్తున్నారు. ఈ జనవరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వచ్చే జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారని చెబుతున్నారు. మంత్రి లోకేష్ ఒక మాట అన్నారు. పిల్లలంతా తన కుమారుడు దేవాన్ష్ లానే అనిపిస్తారని చెప్పారు. మంచి మాటే. కానీ దేవాన్ష్కు వస్తున్న చదువు స్టాండర్ట్ తను మంత్రిగా బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు తీసుకు రావడం లేదు. జగన్ పై ఉన్న ద్వేషంతో ఉన్న కోర్సులను ఎందుకు తీసివేశారు.? ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నాం అని చెబుతున్న లోకేష్ ఎన్నికలకు ముందు టీచర్లను ఎలా రెచ్చగొట్టింది తెలియదా? ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో పిల్లలకు నైతిక విలువల గురించి బోధిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.మంచిదే! కానీ ముందుగా ప్రభుత్వానికి నైతిక విలువలు ఉండేలా ఏమి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నైతిక విలువలు నేర్పడం వరకు బాగానే ఉంటుంది. అదే సమయంలో మూఢ విశ్వాసాలు పెరిగేలా ఉపన్యాసాలు చెప్పకుండా ఉండడం కూడా అవసరమే. చాగంటి నియామకాన్ని జనవిజ్ఞాన వేదికకు చెందిన పలువురు మేధావులు తప్పు పట్టారు. ఏది ఏమైనా జగన్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పులను ఒక వైపు ధ్వంసం చేస్తూ, మరో వైపు మెగా సమావేశాలు అంటూ కోటి ఇరవై లక్షల మందితో జరిగాయని చెబితే పిల్లలకు వచ్చే లాభం ఏమిటి? మీటింగ్ లతో తల్లికి వందనం చేసినట్లు అయిపోతుందా? అదేదో సామెత ఉంది. ఉత్తుత్తిగానే అన్నం పెట్టాం, కూర వేశాం.. మజ్జిగ వేశాం.. అంటూ పిల్లల ఆట మాదిరిగా విద్యావ్యవస్థను మేడిపండు చందంగా మార్చకుండా ఉంటే అదే పదివేలు!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చదువుల విప్లవానికి తూట్లు.. సర్కారు ప్రచార పాట్లు
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చదువుల వెలుగులతో ప్రకాశించిన సర్కారీ బడులకు ఇప్పుడు చంద్ర గ్రహణం పట్టింది. నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందించాలనే ఉన్నత ఆశయంతో వైఎస్ జగన్ తెచ్చిన సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్(ఐబీ), పిల్లలకు ఏటా ట్యాబ్స్, డిజిటల్ తరగతులు, సబ్జెక్టు టీచర్లు వంటి వాటికి చంద్రబాబు సర్కారు మంగళం పాడుతోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి.. ప్రవేట్కు ధారాదత్తం చేయడం ద్వారా తన వాళ్లకు మేలు చేసేందుకు కుట్ర పన్నింది. పేద విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించాలన్న గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ అద్భుత పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లల బంగారు భవిత కోసం వైఎస్ జగన్ గొప్ప సంస్కరణలతో బాటలు వేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వాటికి గండి కొడుతోంది. నాణ్యమైన చదువుల విప్లవానికి తూట్లు పొడుస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం బాగు పరిస్తే.. ఇప్పుడు తామొచ్చాకే వాటిని ఉద్దరిస్తున్నట్లు కూటమి సర్కారు కలరింగ్ ఇస్తోంది. ఇందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పేరిట ఆర్బాటాలకు తెరలేపింది. మరోవైపు గత ప్రభుత్వంలో అమలైన ఒక్కో కార్యక్రమాన్ని తెరమరుగు చేస్తోంది. బడిఈడు ఉన్న ప్రతి ఒక్కరినీ బడికి పంపేలా ప్రోత్సహిస్తూ వైఎస్ జగన్ తీసుకొచ్చిన అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేక పోయింది. ‘జగన్ రూ.15 వేలు ఇస్తున్నారు.. మేమొస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం’అని నమ్మించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ హామీని అమలు చేయకుండా మోసం చేసింది.సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్,ఐబీ శిక్షణకు మంగళం పాడింది. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ పైకి మాత్రం ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం పాటు పడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించక పోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఓ వైపు ఇక్కట్లు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆరు నెలలుగా విద్యా రంగం అభివృద్ధికి చేసిందేమీలేక పోగా.. గత ప్రభుత్వం తెచ్చిన చదువుల విప్లవాన్ని తన ఖాతాలో జమ చేసుకునేందుకు మాత్రం పావులు కదిపింది. సీబీఎస్ఈకి మంగళం » గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది.. తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు వెయ్యి ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన చంద్రబాబు అన్నంత పని చేశారు. » 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్, పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.‘టోఫెల్’ రద్దు » పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరంలో జగన్ ప్రభుత్వం టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. » నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్)లు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,285 మందికిగాను 4,17,879 మంది (82 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా పోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఐబీ శిక్షణకూ అదే గతి » ‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’ అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే కూటమి ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది.» అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్ని తొలగించడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. కిట్లు పంపిణీలోను కూటమి కునికిపాట్లు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కూళ్లు తెరిచిన రోజునే పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు సక్రమంగా అందలేదు. స్టూడెంట్ కిట్లను అరకొరగా కూటమి నేతలతో పంపిణీ చేయించారు. గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు » ప్రభుత్వ తీరు కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్కు వెళ్లిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దు చేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు.» మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ’రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.స్పష్టతలేని తల్లికి వందనం» పేద పిల్లల చదువులను ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అద్భుతంగా అందించింది. పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో 2019 జూన్లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టడం ద్వారా డ్రాప్ అవుట్స్ను తగ్గించింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్లోనే రూ.15 వేలు చొప్పున అందించింది.» 2022–23కు సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం ద్వారా ఏకంగా రూ.26,067.28 కోట్ల సాయం చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా, కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. »ఇప్పటి వరకు తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించక పోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చిన మేరకు ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.బాబు పాలనలోఅట్టడుగున జీఈఆర్చంద్రబాబు గత పాలనలో 2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది.భోజన ఏజెన్సీల మార్పురాష్ట్రంలో దాదాపు 80 వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో ఏకంగా 46 వేల మందికిపైగా మార్చేసిన కూటమి ప్రభుత్వం.. అతి సామాన్యుల పొట్ట కొట్టింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను ఇష్టానుసారం మార్చడంతో గందరగోళం ఏర్పడి, విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. భోజనానికి అందించే బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది. -
తీరిగ్గా ‘మీడియం’ మార్పు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కారు ఒక్కొక్కటీ రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్ను, ఇంగ్లిష్ ప్రావీణ్య శిక్షణ టోఫెల్ను రద్దు చేసిన ప్రభుత్వం... తాజాగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విధానంలో మార్పులు చేసింది.2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలో కూడా రాయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత తీరిగ్గా ఇప్పుడు మీడియం మార్పు చేయడం వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే దాదాపు 4.20లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.మీడియం ఎంచుకుని.. నామినల్ రోల్స్ పంపిన తర్వాత ఇలా...ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన దాదాపు 4 లక్షల మంది వరకు ఫీజు చెల్లించారు. నామినల్ రోల్స్ పంపించినప్పుడు ఎంచుకున్న మీడియంలోనే పరీక్షలు రాయాలి. ఫీజు చెల్లించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంనే ఎంచుకున్నారు. అయితే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో ‘మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్’లో ‘తెలుగు’ మార్చుకునేందుకు ఎడిట్ అవకాశం కల్పించాలని అన్ని పాఠశాలల హెచ్ఎంలను బుధవారం విద్యాశాఖ ఆదేశించింది.గత ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దాదాపు 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తున్నారు. మిగిలిన వారు ఈ విద్యా సంవత్సరం (2024–25) ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. దేశంలో సగటున 37.03 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 2.23 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు తెలుగు మీడియం పరీక్ష విధానం తెరపైకి తేవడంపై తల్లిండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులు కోరుకున్న ఇంగ్లిష్ మీడియం విద్యను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా దిగజార్చుతూ నిర్వీర్యం చేసే దిశగా ఈ సర్కారు చర్యలు ఉన్నాయని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
ఇదొక నిశ్శబ్ద విధ్వంసం!
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా ఏ భాషలో మాట్లాడుకుంటారు... తెలుగులోనా, ఇంగ్లీషులోనా?’ అని అడి గారు. అక్కడున్న విద్యార్థినులు తడుముకోకుండా ‘ఇంగ్లీషు లోనే’ అని సమాధానమిచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉన్నదని కూడా వారు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాల పిల్లల గుండెల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు ఈ ఘటన అద్దం పట్టింది.అంతకు ముందు రోజు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభ విజయవాడలో జరిగింది. ఆ సభలో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి తెలుగు భాషతోనే జీవితమని మరోసారి చెప్పు కొచ్చారు. జీతం కోసం ఇంగ్లీషు కూడా నేర్పిస్తామని తన ఉభయ భాషాభిమానాన్ని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఒకటున్నది. జీతం కోసం నేర్చుకునే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్లకు, ‘జీవితం’ కోసం నేర్చుకునే తెలుగు ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేకం.తొంభై శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడి యమే ఉంటుందన్న సంగతి జగమెరిగిన సత్యమే! కనుక తెలుగు భాషను రక్షించి పోషించవలసిన బాధ్యత ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలది, కష్టజీవులైన వారి తల్లిదండ్రులది. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ఈ బాధ్యతను వారు తమ భుజాల మీద మోస్తూనే వస్తున్నారు. మన తెలుగు జాతి లోని సంపన్న శ్రేణివారు, ఉన్నతోద్యోగులు, క్రీమీ లేయర్లోని ఓ పదిమంది కూడిన ప్రతిచోట ఏ భాషలో మాట్లాడుకుంటారు? నిస్సందేహంగా ఇంగ్లీషులోనే! వారు ఇంగ్లీషులోనే పలక రించుకుంటారు. ఇంగ్లీషులోనే తుమ్ముతారు, ఇంగ్లీషులోనే దగ్గు తారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించవలసిన అవస రాన్ని సామాన్య ప్రజలకు వారే గుర్తు చేస్తుంటారు.కొద్దిమంది పండితుల చేతుల్లోనే బందీ ఆయిన తెలుగు సాహిత్యాన్ని విముక్తం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచనలు జరగాలని ఉద్యమించి గెలిచిన యోధుడు గిడుగు రామమూర్తి పంతులు. ఆయన నుంచి తీసు కోవలసిన స్ఫూర్తి ఏమిటి? ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలను కల్పిస్తున్న ఇంగ్లీషు మీడియాన్ని సంపన్న శ్రేణికే పరిమితం చేయకుండా సమస్త ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం కాదా? అటువంటి సంకల్పమే గదా పంతులు గారికి ఇవ్వదగిన నిజమైన నివాళి!మనకు కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు పెద్ద లున్నారు. వృద్ధనారీ పతివ్రతల వంటివారు. తెలుగు మీడియంలోనే చదువుకోవాలని పదేపదే గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు ప్రభుత్వ బడులకూ, బడుగు వర్గాలకే వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వర్గాలను ఉత్తేజితం చేయడం కోసం తమ జీవితమే వారికొక సందేశమని చెబుతారు. తెలుగులోనే చదువుకోవడం వల్ల తాము దిగ్గజాలుగా ఎదిగామనీ, ‘మీరు కూడా తెలుగులోనే చదవండి, మా అంతటివారు అవుతార’ని ఊదరగొడుతుంటారు. అసలు పరభాషా మాధ్యమంలో చదువుకున్నంత మాత్రాన మాతృభాష అంతరించిపోతుందనే వాదనే నిర్హేతుకమైనది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, పీవీ నరసింహారావు, కాళోజి నారాయణరావు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి తదితరు లంతా ఉర్దూ మీడియంలో చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే. మన తాజా తెలుగు పెద్దలతో పోల్చితే మహాదిగ్గజాలే.ఇదొక్క ఇంగ్లీషు మీడియం గొడవ మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సరైన వసతులు, పర్యవేక్షణ, బోధనా పద్ధతులు... వగైరాలన్నింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల ప్రమా ణాలు పడిపోతూ వస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ పరిణామం వేగవంతమైంది. ఇందుకు ప్రధాన కారణం మన పాలకులు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టుబడి పెట్టడం మన ‘సంస్కరణోత్తర’ రాజకీయ వేత్తలకు ఇష్టంలేదు. ఈ కేట గిరీలో ముందు వరసన నిలిచిన రాజకీయవేత్త చంద్రబాబు. విద్య, వైద్యం మాత్రమే కాదు... ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనే ఫిలాసఫీ ఆయనది. ‘మనసులో మాట’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకం నిండా ఈ ఫిలాసఫీయే ఉంటుంది. ఐదేళ్లకు పూర్వం విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ తత్వధారను వారబోస్తూనే వచ్చారు. ‘ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలుండవు. డబ్బులున్న వాళ్లు ప్రయివేటు స్కూళ్లలో చదువుకోండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అన్నీ బాగుంటాయ’ని ఆయన ఉద్బోధించేవారు.వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన మీడియా కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే వచ్చింది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పిల్లలకు అర్థం కాకుండా పోతుందని గగ్గోలు పెట్టారు. కానీ, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల ప్రయోగంతో ఈ సమస్యను ప్రభుత్వం అవలీలగా అధిగమించిందని విద్యా రంగ నిపుణులు పలువురు కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల వైభవం అంతరించిపోతుందన్న అంచనా ప్రజల్లో చాలామందికి ముందే ఉన్నది. కనుకనే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. పూర్తి వివరాలు రాలేదు గానీ, ఈ సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.ప్రజలు ఊహించినట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం సర్కారు బళ్లపై దాడిని ప్రారంభించింది. ‘అమ్మ ఒడి’ ఇవ్వలేదు. ‘వసతి దీవెన’ లేదు, ‘విద్యా కానుక’ లేదు. ‘మధ్యాహ్న భోజనం’, ‘గోరు ముద్దలు’ గాడి తప్పాయి. ఇంగ్లీష్ ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘టోఫెల్’ పరీక్షను తొలగించారు. వెయ్యి స్కూళ్లల్లో అమలవుతున్న సీబీఎస్ఈ సిలబస్ను ఎత్తేశారు. ఉచితంగా లభించాల్సిన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్ను అటకెక్కించారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. నేడో రేపో ఇంగ్లీష్ మీడియానికి కూడా వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి లోకేశ్కు విశాఖ బాలికలు తమ గుండెచప్పుడును వినిపించారు.పేద ప్రజానీకం బిడ్డలకు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం విద్యా సమీక్షా కేంద్రాల (వీఎస్కే)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ, ట్యాబులు, ఐఎఫ్పీల నిర్వహణ వగైరా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ఈ వీఎస్కేల పని. ఇప్పుడా పనులేవీ వీఎస్కేలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలుసుకోవడానికి!ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులపై ఈ ఒక్క నెల రోజుల్లోనే డజన్కు పైగా విషాదకర వార్తలు వెలువడ్డాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో 566 మంది కేవలం మూడు రోజుల్లోనే ఆస్పత్రి పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆ విద్యార్థులు తల్లడిల్లారు. విజయనగరంలోని ఓ ఆశ్రమ విద్యార్థులు 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేజీబీవీలో 20 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్య క్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాప చుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్లో వుండే విద్యార్థుల వసతి, వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది. ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అంద జేయడం ఈ ప్రభుత్వ ఫిలాసఫీ కాదు. అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కార్ దాడిని ప్రారంభించింది. నిశ్చబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే, బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చదువుల తొలకరి
వర్షరుతువు ఊరికే రాదు, చదువుల ఋతువును వెంటబెట్టుకుని వస్తుంది. వేసవి కర్ఫ్యూ నుంచి బయటపడి ఆడా, మగా పిల్లలు గుంపులుగా, అనేక రంగుల పూదోటల్లా వీథుల్లోకి ప్రవహించే దృశ్యం– దేహానికి తొలకరి లానే చూపులకు చందనమవుతుంది. పుస్తకాల బరువుతో బుడిబుడి అడుగుల బాలసరస్వతుల నవ్వుల తళతళలు, మాటల గలగలలు పరిసరాలకు సరికొత్త బాల్యశోభనిస్తాయి. చదువుల నిచ్చెన మీద పిల్లలూ, వాళ్లపై పెట్టుకున్న ఆశల నిచ్చెనపై కన్నవారూ ఏకకాలంలో కొత్తమెట్టు ఎక్కడం ఎల్లెడలా కనిపిస్తుంది. చదువుల చరిత్రనే రాస్తే, అది మెరుపులు; మంచి చెడుల మలుపుల మీదుగా సాగిపోతుంది. ప్రాచీనకాలంలో ఋష్యాశ్రమాలే విద్యాలయాలు. అధికార, ధనబలాలలో తేడాలున్న క్షత్రియుల పిల్లలూ, బ్రాహ్మణుల పిల్లలూ కలసి చదువుకునేవారు. అలా చదువుకున్న ద్రుపద, ద్రోణాచార్యుల మధ్య ఆ తర్వాత వచ్చిన అంతస్తుల తారతమ్యాలు శత్రుత్వానికి దారితీసి మహాభారతంలో కొన్ని కీలక పరిణామాలకు కారణమయ్యాయి. వేటకొచ్చిన రాజులు పరివారాన్ని దూరంగా విడిచి పాదచారులై వెళ్ళి గౌరవప్రపత్తులతో ఋషిని దర్శించుకోవడం గురించి వింటాం. అలాంటి గురుస్థానం చిరుస్థానమై బతకలేని బడిపంతుల స్థాయికి కుదించుకోవడమూ చూశాం. అయితే, నాటి చదువుల వ్యవస్థలోని ఏ కాస్త వెలుగునూ హరించే చీకట్లూ లెక్కలేనన్నే. కొన్ని చదువుల్ని సార్వత్రికం చేయకపోవడం ఒకటైతే; చదువుల్లో ఎక్కువ, తక్కువ తేడాలు ఇంకొకటి. ‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నా’లలో వేటికవే చదువుల తల్లి సిగ పువ్వులన్నది నేటి అవగాహన. సాధారణ విద్యపై సాంకేతిక విద్యది పైచేయి కావడం చూస్తూనే ఉన్నాం. అలా కాలక్రమంలో చదువుల నిర్వచనమూ, ప్రయోజనమూ కూడా మారిపోయాయి. హిరణ్యకశిపుడు రాక్షసుడే అనుకున్నా చదువుల ప్రయోజనం గురించి ఆనాటి అవగాహనతోనే మాట్లాడతాడు. ‘చదవనివాడు అజ్ఞాని అవుతాడు, చదివితే సదసద్వివేచన కలుగుతుంది’ అని కొడుకు ప్రహ్లాదుడితో అంటాడు. ‘సదసద్వివేచన’ అనే మాటకు ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. మంచి చెడుల వివేచన ఒక అర్థమైతే; పారలౌకికంగా సత్యాసత్యాలు, నిత్యానిత్యాలనేవి మరికొన్ని. చదువుకుని వచ్చి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన సమాధానమూ దానికి దీటుగానే ఉంటుంది. ‘ధర్మార్థాలతో సహా ముఖ్యశాస్త్రాలనే కాదు, చదువులలోని మర్మమంతా చదివేశా’నంటాడు. చదువులలోని మర్మమంటే అతని ఉద్దేశం – భక్తి, ఆధ్యాత్మికతలనే! ఆనాడు చదువంటే కేవలం ఉద్యోగానికి ఓ అర్హత కాదు; బ్రహ్మచర్యం, గృహస్థం,వానప్రస్థం, సన్యాసమనే నాలుగు ఆశ్రమాల మీదుగా సాగాల్సిన జీవనయానంలో తొలి అంకం. నాడు రాజాస్థానాల్లో గణకులు, వ్రాయసకాండ్ర వంటి ఉద్యోగాలున్నా వాటి అందుబాటు పరిమితం. దాచుకున్న ధనమూ; పురుషుడికి రూపమూ, కీర్తీ, భోగమూ కలిగించేదీ, విదేశబంధువూ, విశిష్ట దైవమూ, రాజపూజితమూ అంటూ ఏనుగు లక్ష్మణకవి చేసిన అభివర్ణన అన్ని విద్యలకూ వర్తించేదే అయినా పెద్ద పీట వేదశాస్త్రాలదే. ఈ విద్యార్థతలున్నవారు ‘సర్టిఫికెట్’ పుచ్చుకుని ఉద్యోగం వేటలో పడాల్సిన అవసరమే లేదు; గుర్తింపు, గౌరవం, మడిమాన్యాలు అన్నీ వాళ్ళ దగ్గరికే వచ్చేవి. భాషలో అపర శేషువూ; యజ్ఞయాగాదుల్లో, వేదాధ్యాపనలో మునిగితేలేవాడే అయినా సంపన్నుడు కనుక; రాజులేమైనా ఇవ్వబోతే సాలగ్రామాన్ని సైతం పుచ్చుకోడానికి నిరాకరించే ‘మనుచరిత్ర’లోని ప్రవరాఖ్యుడూ కనిపిస్తాడు. వేదాలకు గాదెగా, శాస్త్రాలకు పుట్టిల్లుగా, కళాకలాపాల రచ్చగా తెనాలి రామకృష్ణుడు తన ‘పాండురంగ మాహాత్మ్యం’లో పరిచయం చేసిన సభాపతి అనే ఆయన పశు శిశు దాసీజనం కలిగిన ధనికుడు; ఆపైన వడ్డీవ్యాపారం, సేద్యం కూడా చేస్తూ రాజు దగ్గరికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. తన పేరును నేతిబీరను చేస్తూ చెడు తిరుగుళ్లు మరిగిన నిగమశర్మ ఇతని కొడుకే! ఈ పండితపుత్రుడు ఆగమవాదాల్లో నోరువిప్పడు కానీ విటుల వివాదాలను తీర్చడంలో మాత్రం మహా చురుకని– కవి చురక. బ్రిటిష్ ఏలుబడిలో డిగ్రీ చదువులొచ్చి ఉద్యోగంతో లంకె పడ్డాయి. స్వతంత్ర భారతంలో ఆ లంకె ఇంకా బిగిసింది తప్ప సడలలేదు. అదే సమయంలో దాదాపు అన్ని చదువులూ సార్వత్రికమై మేలూ చేశాయి. సంధిదశలో రెంటికీ చెడ్డ రేవళ్ళను గిరీశం, వెంకటేశం పాత్రల ద్వారా గురజాడ ‘కన్యాశుల్కం’లో బొమ్మ కట్టారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చి రికామీగా తిరిగేవాడు గిరీశమైతే, ‘మీ వల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమే’ నని వాపోయినవాడు వెంకటేశం. ఇంగ్లీషు చదువులు కుదురుకొని చదువు బడులు సమాజాన్ని చదువుకునే బడులుగా మారుతున్న వైనాన్ని కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవలలో అద్భుతంగా చిత్రిస్తారు. చదువుల సారమైన సదసద్వివేచన అడుగంటి చదువు వ్యాపారమై వందలాది కోచింగ్ సెంటర్లను, వేలాది చీటింగ్ తుంటర్లను సృష్టించింది. నీతి తప్పిన ‘నీట్’ ద్రోహంతో కొత్త విద్యాసంవత్సరం మొదలవడం ఈ దుఃస్థితికి ప్రతీకాత్మక అభివ్యక్తి. నిఖిలదేశం హర్షించే మంచికాలం రహించాలని చదువులమ్మను కోరుకుందాం. -
ఇంగ్లీషు మీడియం కొనసాగేనా?
మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి. అలాకాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, పిల్లల తలిదండ్రుల మీద కూడా ఉంది.ఎన్నికల సమయంలో చండీగఢ్లో జరిగిన రాజ్యాంగ రక్షణ సదస్సుకు నేను వక్తగా వెళ్ళాను. అది ఆఖరి ఘట్టం ఎన్నికల ముందు. చివరి ఘట్టంలో పంజాబు రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సదస్సు మే 22న జరిగింది. మరుసటి రోజు అక్కడి మేధావులు పంజాబు గ్రామాల్లో నాకోసం సమావేశాలు ఏర్పాటు చేశారు. నేను మూడు గ్రామాల్లో జరిగిన మూడు మీటింగుల్లో పాల్గొని మాట్లాడాను. మీటింగులో ఆడా, మగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పంజాబులో ప్రభుత్వ పాఠశాల విద్య పంజాబీ భాషలోనే బోధిస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఒక్క సబ్జెక్టు మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో నడుస్తాయి. పంజాబీలు ఇతర దేశాలకు ఎక్కువ వలసపోతారు కనుక వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అని నేను అడిగాను. వాళ్ళు లేదు అన్నారు. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం గురించీ, అది గ్రామాల్లోని పిల్లల్లో తెస్తున్న మార్పుల గురించీ వివరించాను. ‘మా పిల్లలకు కచ్చితంగా అటువంటి ఇంగ్లీషు మీడియం విద్య కావాలి; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల ముందు ఈ డిమాండ్ పెడతా’మని వాళ్లు తీర్మానించుకున్నారు. మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు క్యాబినేట్ ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఉన్నవారంతా గ్రామీణ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం చదువు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించినవారే. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి శాసించే అమిత్ షా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుకు బద్ద వ్యతిరేకి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ళను స్థాపించి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసిన నారాయణ మళ్ళీ మంత్రి అయ్యారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు చంద్రబాబు ప్రైవేటీకరణలో భాగంగా ఎదిగాయి.ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం విద్య ఒక సంక్షేమ పథకం కాదు. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే ఉన్నది. కానీ, భారతదేశంలో ప్రైవేట్ పాఠశాల విద్య ప్రభుత్వ రంగ విద్యను సర్వనాశనం చేసింది. అటువంటి విద్యావిధానం నుండి గ్రామీణ విద్యార్థులను కాపాడే విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, 2024–25 ఎకడమిక్ సంవత్సర స్కూళ్ల ప్రారంభం ఏకకాలంలో జరిగాయి. అయితే ఈ సంవత్సరానికి కావలసిన బైలింగ్వల్ బుక్స్(ఉభయ భాషా పుస్తకాలు), పిల్లలకిచ్చే డ్రెస్సులు, బూట్లు ఈ ప్రభుత్వం సకాలంలో ఇస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో బీదవారు, అగ్రకులాలలో బీదవారి పిల్లలకు 2029 ఎన్నికల నాటికి ఈ విద్యావ్యవస్థ తమకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వనుందో అర్థమయ్యే దశ వస్తుంది. కానీ ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత అటు వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, ఇటు పిల్లల తలిదండ్రుల మీద ఉంది. ఇప్పటి నుండి గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం విద్యా పరిరక్షణ కమిటీలు వేసుకోవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను అధిగమించి విద్యారంగ పరిరక్షణ కోసం కమిటీలు వేసుకుని గ్రామంలోని పిల్లలందరి భవిష్యత్ కాపాడవలసిన బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా ధనవంతులున్నారు. వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదివించగలిగేవారూ ఉన్నారు. ఇటువంటివారు, ఉద్యోగులు, పట్టణాల్లోని ధనవంతులు... బీద బక్క పిల్లలందరికి ఇంగ్లీషు వస్తే తమ పిల్లలు వారితో పోటీ పడాల్సి వస్తుందని భావించి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించే అవకాశం ఉంది.జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగస్థులు, కొంత మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర ధనవంతులు వ్యతిరేకించడంలో తమ పిల్లల భవిష్యత్ స్వార్థం పనిచేసింది. ఈ స్వార్థం కులాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి రిజర్వేషన్ కేటగిరిలో డబ్బున్నవారు తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించి, ప్రభుత్వ తెలుగు మీడియం పిల్లలు తమ పిల్లలతో పోటీ పడకుండా ఉండాలనే స్వార్థం ఓటు వేసే దగ్గర కూడా పనిచేస్తుంది. ఈ స్వార్థపు వేళ్లను తెంపడం చాలా కష్టం. మార్పు తెచ్చే ప్రభుత్వాలను దింపెయ్యాలనే ఈ ధనిక వర్గం ఓటు వ్యవస్థను తమకు అనుకూలంగా తిప్పుకుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వర్గం, హోదా, ఆధిక్యత... నాణ్యమైన ఇంగ్లీష్ విద్యతో ముడిపడి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్మాణాల్లో కూడా ఈ విధంగా ఆలోచించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మార్పు తమ వర్గ శత్రువు అనుకునే శక్తులు వీరు. వీరు గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్కూలు విద్య ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో అది చర్చనీయాంశం అయింది. బహిరంగ సభల్లో సైతం స్కూలు పిల్లలు ఇంగ్లీషు, తెలుగులో వాగ్దాటితో మాట్లాడటం, అదీ బీద కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడటం ఆ యా గ్రామాల్లో, పట్టణాల్లో ధనవంతులు జీర్ణించుకోలేని విషయం. మార్పును అంగీకరించదల్చుకోని విషయం. ఇది వైసీపీ ఓటమికి కొంత దోహదపడి ఉండవచ్చు. ఈ ధోరణిని తిప్పి కొట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రుల తిరుగుబాటు మాత్రమే పనిచేస్తుంది. భారతదేశంలో విద్య మీద గ్రామీణ స్థాయిలో చర్యలు, పోరాటాలు జరగలేదు. కమ్యూనిస్టులు కూడా ఇటువంటి పోరాటాన్ని జరపలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో కొత్త విద్యావిధానాన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు కూడా సహకరించారు. ఆ విధంగా వీరు బీజేపీ భావజాలానికి మద్దతిచ్చారు. అందుకే రానున్న ఐదేండ్లలో సమాన భాష, పురోగామి భావజాల పాఠశాల విద్య కోసం బలమైన పోరాటం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ పోరాటానికి నేతృత్వం వహించాల్సి ఉంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ విషానికి విరుగుడేదీ?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలి. వారి చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది’ అంటూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు.ఇందుకు తగ్గట్టే దేశవిదేశాలు కీర్తించేలా విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించినా ఈనాడు పత్రిక మాత్రం వాస్తవాలను జీర్ణించుకోలేక మరోసారి వికృత రాతలతో విషం జిమ్మింది. ఐదేళ్ల జగన్ పాలనలో విద్య అస్తవ్యస్తమైపోయిందని.. ‘పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!’ అంటూ తప్పుడు రాతలకు బరితెగించింది. జగన్ ప్రభుత్వం పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించింది.మనబడి నాడు–నేడుతో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా సంస్థలే అసూయచెందేలా కొత్త పాఠశాల భవనాలు, టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత ఏపీకి మాత్రమే దక్కింది.దేశంలోనే అత్యత్తమ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చినా ఈనాడు పత్రిక మాత్రం అంగీకరించలేక తన అల్పబుద్ధిని చాటుకుంటోంది. ఈ విద్యా సంస్కరణలే తప్పు అనేలా వక్రీకరణలు చేస్తోంది. ఏదోలా ఈ సంస్కరణలను రద్దు చేసి, పేదింటి పిల్లలను ఉత్తమ విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా సంస్కరణలు 2019కి ముందు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ బడుల్లో పరిస్థితి దిగజారింది. అదే విషయాన్ని ‘అసర్, నాస్’ వంటి సర్వేలు కూడా స్పష్టం చేశాయి. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ సర్వేల అంశాలను ప్రామాణికంగా తీసుకొని పలు కార్యక్రమాలను అమలు చేసింది. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, సపోరి్టంగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కార్యక్రమాలు అందులో కొన్ని. అసర్ నివేదిక ఆధారంగా రూపొందించిన ‘టీచింగ్ ఎట్ రైట్ లెవెల్’ కార్యక్రమంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పలు నూతన విధానాలతో విద్యాబోధన అమలు చేశారు.ఇందుకోసం ప్రత్యేకంగా ‘ప్రథమ్’ సంస్థతో కలిసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించారు. దీనిద్వారా విద్యార్థుల లెర్నింగ్ ఎబిలిటీ, రీడింగ్ ఎబిలిటీ మెరుగుపడినట్లుగా 2022 బేస్లైన్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ‘లిప్’ ప్రోగ్రాం అమలు చేశారు. విద్యార్థుల క్లాస్ రూమ్ పరీక్షల నిర్వహణలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.గతంలో ఫార్మెటివ్ అసెస్మెంట్స్ను ఎక్కడికక్కడ క్లాస్ రూమ్లో టీచర్ రూపొందించి ఇచ్చేవారు. ఇందులో పరీక్ష, ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో నిపుణులతో ప్రశ్నపత్రాలు రూపొందించి అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా ప్రశ్నపత్రాలు అందించారు. బైజూస్ ఉచితంగా అందించిన ఈ–కంటెంట్తోపాటు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన తెలుగు, ఇంగ్లిష్, హిందీ కంటెంట్ను కూడా ఉపాధ్యాయులకు డీటీహెచ్ చానల్స్ ద్వారా, ఈ–పాఠశాల యాప్ ద్వారా అందజేశారు. ఒకే సిలబస్.. బోర్డుల ప్రకారం పరీక్షలుసెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి రాష్ట్రంలో 1,000 పాఠశాలలను అనుసంధానించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మొదటి బ్యాచ్ సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారు. అందుకు అవసరమైన ప్రణాళికను ముందే అమల్లోకి తెచ్చారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతి నుంచి పేద పిల్లలకు ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) విద్యను అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 44,478 స్కూళ్లలోనూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్నే బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే తరహా సిలబస్ ఉంది. పరీక్షా విధానం మాత్రమే ఆయా బోర్డుల ప్రకారం ఉంటుంది. ఇంగ్లిష్ నైపుణ్యాల పెంపునకు టోఫెల్ విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్, మంచి ఇంగ్లిష్ ఒకాబులరీ నైపుణ్యాలను అందించేందుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారు. అన్ని పాఠశాలల్లో టోఫెల్ బోధనకు ప్రత్యేకంగా పీరియడ్ కేటాయించారు. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైసూ్కళ్లలో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ), 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్పీలు మాత్రమే ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఉండటం విశేషం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది. విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. భావి నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమించారు. పేదలకు ‘ఐబీ’తో అంతర్జాతీయ విద్య పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. సంపన్నులు మాత్రమే చదివించగల ఐబీ చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ వారి కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటరీ్మడియెట్ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3 నుంచి 10 తరగతులకు బోధించాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఆ తరహా సేవలు అందిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,582 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి సబ్జెక్ట్ టీచర్లు(స్కూల్ అసిస్టెంట్లు)గా హైసూ్కళ్లకు పంపించారు. ప్రతి స్కూల్లో ఎంత మంది ఉపాధ్యాయులు తగ్గారో ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించని ‘ఈనాడు’ ఈ విషయంలోనూ కాకి లెక్కలు వేసింది. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 7 వేల వరకు ఉన్నాయి. అవన్నీ ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ విద్యార్థుల సంఖ్య 8 నుంచి 15 మంది లోపే ఉన్నా ప్రతి బడికి ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించింది. ఇప్పటి వరకు పాకల్లోనూ, శిథిల గదుల్లోనూ కొనసాగిన వీటికి ‘నాడు–నేడు’ కింద కొత్త భవనాలను నిరి్మస్తోంది. కానీ ‘ఈనాడు’ నోటికొచ్చిన ఓ అంకెను ముద్రించి అసత్యాలను ప్రచురిస్తోంది. హేతుబదీ్ధకరణపైనా అసత్యాలే..రాష్ట్రంలో 2019 కంటే ముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సంస్థల అధ్యయనాలు తేల్చాయి. దీంతో వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి.. 1, 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి పెట్టింది. 3, 4, 5 తరగతులను హైసూ్కల్ విద్యలోకి తీసుకురావడం ద్వారా బీఈడీ, సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉన్న సబ్జెక్ట్ టీచర్ల ద్వారా పిల్లలకు బోధన అందించి అభ్యసనా సామర్థ్యాలను బలోపేతం చేసింది.ఇందుకోసం ప్రాధమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను హైసూ్కల్కు మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలకు పీపీ–1, పీపీ–2తో పాటు ఒకటి, రెండు తరగతుల బోధన ప్రారంభించింది. దీంతో ఏ స్కూల్ను మూసివేయాల్సిన అవసరం తలెత్తలేదు. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించారు. కానీ గత టీడీపీ ప్రభుత్వం మాత్రం విద్యా సంస్కరణలు చేపట్టకుండా సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేయడం గమనార్హం. ఉన్నత విద్యకు అనువుగా ఇంగ్లిష్ మీడియం పదో తరగతి లేదా ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ముగిసిన విద్యా సంవత్సరంలో 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే పరీక్షలు రాయడం విశేషం. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వీరిలో 1.96 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారంటే ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. -
15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్ మీడియం
ములుగు: ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న తరహా లోనే తెలంగాణలో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 15 వేల అంగన్వాడీ సెంటర్లను మినీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా అప్డేట్ చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మంత్రి ములుగు జిల్లా బండారుపల్లి మోడల్సూ్కల్ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున యూనిఫాం, నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీ బలరాంనాయక్ మోడల్ స్కూళ్లను మంజూరు చేయించారని గుర్తు చేశారు. తర్వాత ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొందరి పనితీరుపై మాట్లాడుతూ, ఇష్టం ఉంటే గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి పనిచేయాలని, లేనిపక్షంలో ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఇదే క్రమంలో అర్హత పేరుతో ఆశ కార్యకర్తలకు పరీక్ష నిర్వహించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ పక్కన బైఠాయించారు. క్షేత్రస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న తమకు ఫిక్స్డ్ వేతనంగా రూ.18 వేలు అందించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య కొంత మంది ఆశ కార్యకర్తలను మంత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రం అందించారు. కాగా, ఆశ కార్యకర్తల డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, ఆగస్టు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్య కోసం ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశానికే మోడల్గా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు. ఖమ్మంలోని ఎన్నెస్పీ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఆయన విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో విద్య, నీటి పారుదలశాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో భట్టి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారన్నారు. ఏడాదిలోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్íÙప్ సంఖ్య మరో వంద పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు భట్టి వెల్లడించారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి పదేళ్లయినా.. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు చుక్క నీరు కూడా గత పాలకులు అందించలేకపోయారని భట్టి విమర్శించారు. సీతారామ ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఎక్కడా రిజర్వాయర్ డిజైన్ చేయలేదని, కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే చేసిందని భట్టి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం నీటిని స్టోరేజ్ చేసేలా 10 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ డిజైన్ చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్షలో కలెక్టర్ వీపీ.గౌతమ్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి పాల్గొన్నారు. -
ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియం బోధనను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ) వంటి అధునాతన పద్ధతుల్లో విద్యా బోధన చేస్తోంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటివి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను అందిస్తోంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి కూడా ఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. మరోపక్క 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లోనూ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు–ఇంగ్లిష్ మీడియంలో వర్క్బుక్స్తో కలిపి మొత్తం 391 టైటిళ్లను పీడీఎఫ్ రూపంలో పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచింది. గతేడాది ఆన్లైన్లో ఉంచిన పుస్తకాలను దాదాపు 18 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1,72,482 పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ అవడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పుస్తకాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. త్వరలో ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ వంటి మైనర్ మీడియం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను సైతం వెబ్సైట్లో ఉంచనున్నారు. పాఠాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా అర్ధం చేసుకొని, సామరŠాధ్యలను మెరుగుపరుచుకొనేందుకు ఆన్లైన్ పీడీఎఫ్లోని ప్రతి పాఠానికి ఎస్సీఈఆర్టీ ‘క్యూఆర్’ కోడ్ను జత చేసింది. ఆ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే పుస్తకంలోని పాఠాన్ని ‘దీక్ష’ పోర్టల్లో వీడియో రూపంలో చూసే అవకాశం కూడా కల్పించారు. పీడీఎఫ్ పాఠ్య పుస్తకాలను https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్–2 బోధన అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.ఈసారి పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోగత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది. జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్పర్ట్స్గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. బైలింగ్యువల్లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్ బుక్స్ డైరెక్టర్ కొండా రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని తమ పెత్తందారుల పిల్లలకు ఎక్కడ పోటీకు వస్తారోనని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నత భవిష్యత్ దక్కాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాల్సిందేనని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తాము ఇంగ్లిష్ చదువుల్లేక జీవితంలో ఎదగలేకపోయామని.. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి తలెత్తకూడదని కోరుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ తమ పిల్లలకు మేనమామలా ఉంటూ అనేక విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమ విద్యను అందిస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని 15,784 ప్రైవేటు స్కూల్స్లోనూ ఇంగ్లిష్లోనే బోధన ఉందని గుర్తు చేస్తున్నారు. వాటికి లేని తెలుగు భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ల విషయంలోనే వచ్చిందా.. అంటూ నిలదీస్తున్నారు. తమ పిల్లలకు ఇప్పుడు ఇంగ్లిష్ చదువులు అందకపోతే వారి జీవితం అంధకారమైనట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ’ అనే అంశాన్ని చేర్చడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఎత్తేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. నిరుపేదల పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వారికి సీఎం వైఎస్ జగన్ ఉత్తమ బోధన, ఇంగ్లిష్ మీడియం చదువులను ఉచితంగా అందిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడుతున్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తే మాతృభాష మరుగున పడిపోతుందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఉన్నత విద్యకు ఇంగ్లిష్ తప్పనిసరి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదవాలంటే ఇంగ్లిష్పై గట్టి పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు అర్థం చేసుకోలేక డ్రాపవుట్ కావడమో లేదా సాధారణ డిగ్రీ కోర్సులకు మారిపోవడమో చేస్తున్నారు. వీరిలో ప్రతిభ ఉన్నా ఇంగ్లిష్ భాషపై పట్టులేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యలోనూ అద్భుతంగా రాణిస్తారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా.. 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ఇటీవల ముగిసిన పరీక్షలను దాదాపు 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే రాశారు. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు ఇందులోనే పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీరిలో 1.96 లక్షల మందికి పైగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. దీన్ని బట్టి ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉద్యోగాలు ఎలా? సరైన ఇంగ్లిష్ చదువులు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని అందకుండా చేస్తే పిల్లలు పెద్దయ్యాక ఎలా బతుకుతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? జగన్ ప్రభుత్వం ఉచితంగానే ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తోంది. అమ్మఒడి కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పించాం. ఎల్రక్టీíÙయన్గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఆర్థికంగా భారమే. – షేక్ బాజీ, నజ్మా, గుంటూరు ఇంగ్లిష్ మీడియం పేదలకు వరం కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనం గడవని మాలాంటి కుటుంబాలకు పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చే స్తోమత లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించడం మాలాంటి పేదలకు వరం. మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్లో మీడియంలో చదువుకుంటున్నారు. ఇప్పుడే పేద విద్యార్థులకు మంచి జరుగుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు మించి చదువు చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఇంగ్లిష్ మీడియం వద్దని చెబుతున్నారు. మరి వారి పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నారో చెప్పాలి. వారికో న్యాయం, మాకో న్యాయమా? – రాగోలు విజయలక్ష్మి, వంగర, విజయనగరం జిల్లా పిల్లల భవిష్యత్కు భరోసా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పిల్లల భవిష్యత్కు భరోసా లభిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు ఇంగ్లిష్ విద్యాబోధనపై ఆరోపణలు చేయడం అన్యాయం. పేదల ఉత్తమ చదువులు అందడం ఆయనకు ఇష్టం లేదు. ఇంగిŠల్ష్ మీడియంను రద్దు చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడే ప్రమాదముంది. – వాడపర్తి సుబ్బు, కోటనందూరు, కాకినాడ జిల్లా ఇప్పుడెన్నో సదుపాయాలు మా చిన్నప్పుడు ఇన్ని అవకాశాలను ఏ ప్రభుత్వం కల్పించలేదు. టీడీపీ ప్రభుత్వంలో అయితే పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువులు దేవుడెరుగు.. అసలు స్కూళ్లనే పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంతో పాటు మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం స్థానంలో తెలుగు మీడియం తీసుకువస్తామని చెప్పడం పిల్లల భవిష్యత్ను నాశనం చేయడానికే. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించకలేకపోయాను, కానీ జగన్ దయవల్ల మా మనవళ్లు, మనవరాళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నాను. – కర్రి రామ్గోపాల్, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా -
బీద పిల్లల గురించి ఆలోచించండి!
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్ (పెరియార్ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్కర్ బీసీ రిజర్వేషన్ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బీపీ మండల్ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్షిప్లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్ షా తన కొడుకు జయ్ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్ దెబ్బతింటుంది. గుజరాత్లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బాబొస్తే ఇంగ్లిష్ మీడియం రద్దే..!
సాక్షి, అమరావతి: తన పాలనలో అన్ని రంగాల్లో ‘ప్రైవేటు’కు పెద్దపీట వేసి ప్రభుత్వ రంగాన్ని నిండా ముంచిన చంద్రబాబు చివరకు పేదింటి పిల్లలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలనూ విడిచిపెట్టలేదు. తన జమానాలో కార్పొరేట్ విద్యా సంస్థలైన ‘చై–నా’లకే ఆయన పెద్దపీట వేయడం ఇందుకు నిదర్శనం. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని ఆరు వేల స్కూళ్లను మూసేసి వాటికి మంగళం పాడేశారు. పేదల విద్య ప్రభుత్వ బాధ్యతే కాదని ప్రకటించిందీ కూడా ఆయనే. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అసలు నైపుణ్యం ఉండదనేది చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం. నారాయణ స్కూళ్ల సిబ్బందితో ప్రభుత్వ టీచర్లకు శిక్షణ ఇప్పించిన తెంపరితనం ఆయనది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి పిల్లల చదువులకు పెద్దపీట వేసింది. దేశంలో కనివినీ ఎరుగని స్థాయిలో విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టింది. పేద విద్యార్థులను ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేస్తోంది. దీన్ని చంద్రబాబు, ఆయన ముఠా జీర్ణించుకోలేకపోతోంది. పేద పిల్లలు ఇంగ్లిష్లో నిష్ణాతులైతే ఎక్కడ తమ పెత్తందారుల పిల్లలకు పోటీ వస్తారోనని ఇంగ్లిష్ మీడియం చదువులను తొలగించడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ తాజా మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ విద్య రివ్యూ’ అనే అంశాన్ని చేర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పేద పిల్లల చదువుల ఆనందాన్ని తుంచేయాలనే..వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధనను అందిస్తుంటే తెలుగు మీడియం సరైందంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తద్వారా పేద విద్యార్థుల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారు. ఇదే జరిగితే పేదింటి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను మా ఊళ్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను. ఈ సిలబస్ పూర్తిగా ఇంగ్లిష్లో ఉంది.. దీంతో చదవడం చాలా కష్టమైంది. ఎలాగోలా బట్టీపట్టి పరీక్షలు పాసయ్యాను గాని మంచి మార్కులు సాధించలేకపోయాను. ఇంటర్వ్యూలు ఇంగ్లిష్లోనే చేస్తుండడంతో ప్రశ్నలను అర్థం చేసుకోలేక ఉద్యోగం సాధించలేకపోయాను. నన్ను ఉద్యోగిగా చూడాలన్న నా తల్లిదండ్రుల ఆశను నెరవేర్చలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. స్కూల్ స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు. ఇదే పరిస్థితి నా ఇద్దరు పిల్లలకు రాకూడదని వారిని కాకినాడలో ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించాను. ఇప్పుడు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అని కాకినాడ జిల్లా పోలవరం గ్రామానికి చెందిన ఓ తండ్రి వెల్లడించారు. రాష్ట్రంలో అందరి తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. ఇప్పటి లాగా తాము చదువుకున్నప్పుడు సరైన సదుపాయాలు ఉండి ఉంటే తాము మరింత ఉన్నతంగా ఉండేవారిమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్ల పంపిణీని వారంతా కీర్తిస్తున్నారు. తమలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు సీఎం జగన్ పుణ్యమాని నాణ్యమైన విద్య ఇన్నేళ్లకు అందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పెత్తందారుల పిల్లలకు పేద పిల్లలు ఎక్కడ పోటీ వస్తారోనని.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను రద్దు చేయడానికి కుట్రలు పన్నుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలకు విద్యను ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.విద్య ప్రభుత్వం బాధ్యత కాదని కాడిపారేసిన బాబు.. పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వం బాధ్యత కాదని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని.. ప్రైవేటు బడులు బాగుంటాయని చెప్పిందీ ఆయనే కావడం గమనార్హం. డబ్బున్నవారు వాటిల్లో చదువుకుని మేధావులుగా తయారవుతారని.. పేద పిల్లలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లలో చేరాలని పిలుపునిచ్చిందీ చంద్రబాబే. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. వారి చదువులన్నా ఎంతటి చులకన భావం ఉందో ఈ వ్యాఖ్యలే తెలియజేస్తాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ విద్యను నామరూపాల్లేకుండా చేశారు. తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను చంద్రబాబు మూసివేశారు. అక్కడి విద్యార్థులను గాలికి వదిలేశారు. అంతకుముందు టీడీపీ పాలనలోనే మరో 4,300 ప్రభుత్వ పాఠశాలలను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించారు.ప్రభుత్వ ఉపాధ్యాయులను హేళన చేసి..పేదింటి పిల్లలనే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను సైతం చంద్రబాబు దారుణంగా అవమానించారు. వారిలో బోధనా నైపుణ్యాలు తక్కువగా ఉంటాయని గతంలో బహిరంగంగానే ప్రకటించిన చరిత్ర ఆయనది. అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నారాయణ స్కూళ్ల సిబ్బందితో శిక్షణ ఇప్పించే సాహసానికి కూడా ఒడిగట్టారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుండా, సదుపాయాలు కల్పించకుండా ఫలితాలు తేవాలని ఒత్తిడి తెచ్చారు. ఎవరైనా ధైర్యం చేసి తమ స్కూళ్లకు సిబ్బందిని అడిగితే బహిరంగంగానే చంద్రబాబు సస్పెండ్ చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఎంతోమంది ఉపాధ్యాయులు అవమానభారంతో ప్రాణాలు వదిలిన ఘనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2000లో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచి మరీ అవమానించారు. ఆ సంవత్సరం 100 శాతం ఫలితాలు తేవాలని చంద్రబాబు ఆదేశించారు. తమ పాఠశాలకు సరిపడినంత మంది టీచర్లు లేరని ఆయన ఎదుటే చెబితే.. ఆగ్రహంతో రగిలిపోయిన బాబు అదే వేదికపై సదరు హెచ్ఎంను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2003లో బాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప గోరంట్ల జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్ను చెట్టుకు కట్టేసి కొట్టాలని అనుచరులను రెచ్చగొట్టారు. ఇలా చంద్రబాబు పాలనలో ఉపాధ్యాయులకు అడుగడుగునా అవమానాలే దక్కాయి.చై–నాలపై ప్రేమ అందుకే..తన అనుకూలవర్గానికి చెందిన నారాయణ– చైతన్య విద్యా సంస్థలను తలదన్నేలా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధిస్తుంటే చంద్రబాబు ఈర‡్ష్యతో రగిలిపోతున్నారు. సర్కారు బడులను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నారు. పేదలు ఎప్పుడూ అలాగే ఉండాలి, పైస్థాయికి వెళ్లగూడదన్న కక్షతో ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దంటున్నారు. పెత్తందారుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం, ఐబీ సిలబస్ బోధన ఉండాలని భావిస్తున్నారు. తద్వారా పేద పిల్లలను కూలీలుగా మార్చాలని చూస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 45 వేల ప్రభుత్వ బడులను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం తప్పని, దీనివల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి నారాయణ, చైతన్యతో పాటు రాష్ట్రంలోని మొత్తం 15,784 ప్రైవేటు స్కూళ్లలోను ఇంగ్లిష్ మీడియంలోనే బోధన సాగుతోంది. మరి అక్కడ లేని ఇంగ్లిష్ ఇబ్బంది ప్రభుత్వ బడుల విషయంలోకి వచ్చేసరికి ఏమొచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. సర్కారు బడులను నాశనం చేసి, నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచడమే ఆయన ఎత్తుగడల ఉద్దేశమని అంటున్నారు.పేద పిల్లలు తినే అన్నంలో మన్నుదాదాపు ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చంద్రబాబు ప్రభుత్వం అర్ధాకలితో అలమటించేలా చేశారు. బడికి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం పెట్టే భోజనంలోనూ చంద్రబాబు కక్తుర్తి పడ్డారు. రోజూ ముద్దయిపోయిన అన్నం, నీళ్ల సాంబారు ఇదొక్కటే మెనూ. ఈ అన్నం తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లలు ఆకలితో అలమటించారు. తిన్నవారికి కడుపునొప్పి సర్వసాధారణంగా మారింది. ఇక కౌమార దశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచ్చిన పిల్లల్లో గరిష్టంగా 30 శాతం మంది ఈ నాసిరకం మధ్యాహ్న భోజనం చేయలేకపోయేవారు. రక్తహీనతతో ఆస్పత్రి పాలైన విద్యార్థులు కోకొల్లలు. ప్రభుత్వ బడుల్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చంద్రబాబుకు భుజం కాసే ఎల్లో మీడియా ఏనాడూ బడి పిల్లల ఆకలి కేకలను విననట్టే నటించింది. పేదల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాదని బహిరంగంగానే ప్రకటించిన చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే సర్కారు బడులను నిర్వీర్యం చేసేందుకు మధ్యాహ్న భోజనంలో కోత పెట్టారు. ఏటా సగటున రూ.450 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. ఈ నిధులను సైతం సరుకు సరఫరా చేసిన ఏజెన్సీలకు ఏనాడూ సకాలంలో చెల్లించిందీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యేదాకా సర్కారు బడి పిల్లలను పట్టించుకున్న వారే కరువయ్యారు.పాఠశాల భవనాలకు బీటలు.. బెంచీలకు చెదలుచంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ బడికి భవనాన్ని నిర్మించిన పాపాన పోలేదు. ఏనాడూ అవి ఎలా ఉన్నాయో చూసింది లేదు. బాబు 2014లో ప్రకటించిన మేనిఫెస్టోలో బడుల రూపురేఖలు మార్చడం, హైస్కూల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం, ప్రతి స్కూల్లోనూ బాల, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు వంటి హామీలు ఇచ్చారు. కానీ 2019లో జగన్ సీఎం అయ్యేనాటికి దాదాపు 6 వేల స్కూళ్లను చంద్రబాబు మూసివేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు దాదాపు మూతపడ్డాయి. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట 1,725 స్కూళ్లకు తాళాలు వేసేశారు. 2019 మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు ఇవే అంశాలను పొందుపరిచారు. చివరకు బడిలో సుద్దముక్కలు, పిల్లలు, ఉపాధ్యాయులకు బెంచీలు లేని పరిస్థితిని తెచ్చారు. చాలాచోట్ల పాఠశాలల భవనాలు శిథిలమైపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. గత్యంతరం లేక వేల స్కూళ్ల నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోవడం, అవకాశం లేనివారు బడి మానేసే దుస్థితి బాబు జమానాలోనే సంభవించాయి.బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో దోపిడీఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. వీటికే ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్గా చంద్రబాబు పేరు మార్చారు. కేవలం 33 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన అనుకూలవర్గాల చేతుల్లోని 383 ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. నిరుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులంటూ భారీగా నిధులను దండుకున్నారు.నేడు అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా సంస్కరణలుటీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. పిల్లలను బడికి పంపించే తల్లులకు ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. 43 లక్షల మంది పిల్లలకు సమాన అవకాశాలు అందించారు. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1,958 పాఠశాలలను ఆధునికీకరించారు. వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023లోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్ ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువుతున్నారు.నాడు–నేడుతో బడులకు కొత్త సొబగులువిద్యా సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్ రూ.73 వేల కోట్లను ఖర్చు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 11 సౌకర్యాల కల్పనకు మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరంతరం నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధమైన తాగునీరు, భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం, ఫ్యాన్లు, లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించారు. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించి ప్రజలకు అంకితం చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు.ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ విప్లవం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది.భాషపై పట్టుకోసం టోఫెల్ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేందుకు వీలుగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. భాషపై పట్టు సాధించేందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేంపదుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇస్తోంది. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించింది. ఇందుకోసం అర్హత గల 25 వేల మందికి పైగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హైస్కూళ్లల్లో నియమించింది.సీబీఎస్ఈ బోధన పేదింటి పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దేందుకు వీలుగా మొదటి విడతలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ విద్యార్థులు పదోతరగతి పరీక్షలను సీబీఎస్ఈ సిలబస్లో రాయనున్నారు.బాలికల కోసం జూనియర్ కాలేజీహైస్కూల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ బాలికలకు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చి రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు.ప్రపంచ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా ప్రభుత్వం నియమించింది.పేదలకు ‘ఐబీ’ విద్యపేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి దాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ అమల్లో ఉంది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. -
సమాన అవకాశాల... విద్యా విప్లవం
భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్ పేరెంట్కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్ బస్స్టాప్ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్ పద్ధతిలో... అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్. జగన్ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్రూమ్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్ స్క్రీన్ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్మొబైల్: 94405 95858 -
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
ఇంగ్లిష్ వ్యతిరేకులను చీపుర్లతో స్వాగతించండి
‘ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశానికే దిక్సూచిలా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానం భవిష్యత్తులో ప్రతీ ఒక్కరూ అనుసరించక తప్పదు. వద్దన్న వారికి చీపుర్లతో బుద్ధి చెప్పాలి’ అని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష అమలు, దాని ఫలాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. దేశాన్ని మార్చే విద్యా విధానం.. ఇంగ్లిష్ మీడియం కోసం 1990 నుంచి నేను గళం విప్పాను. మండలి బుద్ధప్రసాద్, ఏబీకే ప్రసాద్, చుక్కా రామయ్య.. వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అంటే నా మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో దాడి చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన పోరాటం చాలా గొప్పది. ఆయన దేశాన్ని మార్చే విద్యా విధానం తీసుకొచ్చారు. మొత్తం బీజేపీ ప్రభుత్వ అజెండాను కూడా మార్చే శక్తి దానికుంది. నిజానికి గ్రామాల్లో నుంచి వచ్చే పిల్లలతో నగరాల్లోని పిల్లలు పోటీ పడలేరు. గ్రామీణ పిల్లలకు కేవలం కమ్యూనికేషన్ ఒక్కటే సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. స్కూలు పిల్లల్ని బహిరంగ సభల్లో తెచ్చి మాట్లాడించిన నాయకుడ్ని నా జీవితంలో చూడలేదు. ఇంగ్లిష్ మీడియం విద్య జగన్ను గెలిపించబోతోంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇటీవల రాహుల్ గాం«దీకి కూడా చెప్పా. దేశమంతా ఆంధ్ర మోడల్ తీసుకురండి.. బీజేపీని ఓడించగలుగుతారు అని. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియంలను నేను అంబేడ్కర్ గుడి అంటాను. 2002లో నేను మా ఊర్లో గుడ్ షెçపర్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టి.. లంబాడి కూలోళ్ల పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాను. ఇప్పుడు అద్భుతంగా వాళ్లు ఇంగ్లిష్లో మాట్లాడుతున్నారు. మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా? వెంకయ్యనాయుడు, రమణ, చంద్రబాబు, పవన్కు చెబుతున్నా. మీ ఆధ్వర్యంలో తెలుగు మీడియం స్కూల్స్ పెట్టించండి. మీ పిల్లల్ని, అగ్రకులాల పిల్లల్ని తెలుగు మీడియంలో బాగా చదివించండి. మేం మాత్రం దిక్కుమాలిన ఇంగ్లిష్లోనే చదువుకుంటాం. మీరు తెచ్చిన నారాయణ, చైతన్య, విజ్ఞాన్ స్కూల్స్ను తెలుగు మీడియంకు మార్చండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి ఊరూరా మహిళలు చీపుర్లతో స్వాగతం చెప్పండి. అలాంటి మేధావులకు అంటిన మురికిని వదిలించడానికి చీపుర్లతో శుభ్రం చేయండి. తొలి మార్పు వైఎస్సార్ నుంచే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2006లో 6 వేల స్కూల్స్లో ప్యారలల్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే పలువురు వ్యతిరేకించారు. ఈ విషయం మీద తనని కలిసిన వారిని మీ పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అని వైఎస్సార్ ప్రశ్నించాక నోరు మూసుకున్నారు. మన పిల్లలకు ఇంగ్లిష్ చదువులు కావాలా? బీదల పిల్లలకి అక్కర్లేదా? అని వారందర్నీ మందలించారు. బహుశా అదే జగన్కు స్ఫూర్తినిచ్చి ఉంటుంది. పాదయాత్రలో పిల్లల పరిస్థితి చూసిన జగన్.. మేనిఫెస్టోలో ఇంగ్లిష్ విద్య గురించి పెట్టారు. ఇచ్చింన మాట ప్రకారం ఆయన ఇంగ్లిష్ మీడియం తేవడానికి ప్రయత్నిస్తే వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్లాంటి వాళ్లంతా వ్యతిరేకించారు. నా దృష్టిలో వాళ్లంతా యూజ్లెస్. కమ్యూనిస్ట్లు, నాతో పనిచేసిన వారు కూడా వ్యతిరేకించారు. ఆఖరికి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రమణ కూడా వీరికి జతకలిశారు. ఆయన తెలుగు భాష గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆయన అసలు ఏం తెలుగు రాశారని? వీళ్లందరికీ ఏం తెలుగు వచ్చని? లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్కు చెబుతున్నా. ఒక్కసారి ఆ పిల్లలతో ఇంగ్లిష్లో మాట్లాడు. మేధావితనం ముసుగు మాత్రమేనని నీకే తెలుస్తుంది. -
ఇంగ్లిష్ మీడియం జగన్ విజన్
► మన పిల్లలు ఇంగ్లిషు చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ► ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. ► కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ► ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ► ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య,పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. ► మన పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ► ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. ► 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. ► 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ► 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ ► మన చిన్నారులకు ట్యాబ్లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెరి్నంగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. మరోపక్క విద్యార్థుల్లో నిర్మాణాత్మకమైన లైఫ్ స్కిల్స్, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, సమాజంలో ఉన్నత విలువలతో ఉన్నతంగా జీవించేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించేందుకు ‘సంకల్పం’ శిక్షణను సైతం ప్రభుత్వం అందిస్తోంది. డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు విద్యార్థుల చెంతకు డిజిటల్పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. ఈనెల 10వ తేదీన టోఫెల్ ప్రైమరీ పరీక్షను నిర్వహించగా 13,104 ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 4,17,879 మంది (92 శాతం) రాశారు. శుక్రవారం (ఏప్రిల్ 12)న జరిగిన టోఫెల్ జూనియర్ పరీక్షకు 5,907 పాఠశాలకు చెందిన 11,74,338 మంది హాజరయ్యారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధనను కూడా తెస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాలి్వంగ్ వంటి నైపుణ్యాలు అందించడంతోపాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మన ఇంగ్లిషు విద్యపై ప్రసంశల జల్లు ► ‘‘ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ► ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ►‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ►‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైసూ్కల్లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. -
Fact Check: బాబు బాగోతమే ‘బెస్ట్’ట..!
సాక్షి, అమరావతి: ఒకటీ రెండూ కాదు.. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. కుల మత బేధాలు లేకుండా 47 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్.. ఒక్కటేంటి చదువుకోవాలనే ఆశ, ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్యనందిస్తోంది ఈ సర్కారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.1.25 కోట్ల ఫీజును చెల్లిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో ‘ఏపీ చదువులు బెస్ట్’ అనిపించుకుంది. కానీ రామోజీకి మాత్రం ఇవి కనిపించకపోగా.. ‘‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’’ అన్న కుసంస్కారికి సంఘ సంస్కర్త అని డబ్బా కొడుతోంది. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను అటకెక్కించేశారంటూ గగ్గోలు పెడుతోంది. దళిత, గరిజన బిడ్డలు చదువులకు దూరం చేశారంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. అట్టడువర్గాల యువతకు అందించే విదేశీ విద్యా పథకం పైనా ఈనాడు విషం కక్కింది. గత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చేస్తే దానిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టి అక్రమాలను వెలికి తీసింది. విదేశీ విద్యా పథకంలో మార్పులు చేసి నిజమైన అర్హులకు అందిస్తోంది. ఎంపిక చేసుకున్న యూనివర్సిటీలకు ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 41 మంది ఎస్సీ విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొంది విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. అడవి బిడ్డలు చదువుకునే గిరిజన విద్యాలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా, వారి భోజన, ఇతర సదుపాయాల కోసం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. అందుకు నిదర్శనమే ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు 2019 నుంచి 23 మధ్య దాదాపు 400 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ర్యాంకులు సాధించారు. ఇవేమీ కనిపించని ఈనాడు పత్రిక కుళ్లు రాతలు రాస్తోంది. ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పథకాలు ఇంతకంటే చాలా గొప్పవని చెబుతోంది. బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ ఎన్ని రామోజీ? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు దివంగత వైఎస్సార్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికే ‘బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్’గా చంద్రబాబు పేరుమార్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన కూటమిలోని సభ్యులు నడుపుతున్న 383 ప్రైవేటు స్కూళ్లలో కేవలం 33 వేల మందిని చేర్పించి, నిరుపేద విద్యార్థులకు బెస్ట్ ఇంగ్లిష్ మీడియం చదువులంటూ భారీగా నిధులను దోచుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని రాష్ట్రంలోని దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం బోధనలోకి మార్చారు. దాంతో 47 లక్షల మంది పిల్లలకు బెస్ట్ విద్య అందుతోంది. ఇక గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రి మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1958 పాఠశాలలను ఆధునికీకరించారు. వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023 సంవత్సరంలోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లు ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికిపైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్ ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువుతున్నారు. గిరిజన వర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల స్థాపన గత ప్రభుత్వంలో ప్రచారానికే పరిమితమైన అడవి బిడ్డల బెస్ట్ విద్యను ఈ ప్రభుత్వం వారి చెంతకు చేర్చింది. ఒకటో తరగతి నుంచి స్కూళ్లలో ఇంగ్లిష్ విద్యను అందించడమే కాకుండా ఉన్నత విద్యను సైతం వారి దరికి చేర్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రూ.153.85 కోట్లతో నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలో సగం సీట్లు (150) గిరిజన విద్యార్థులకే రిజర్వు చేసింది. సాలూరులో రూ.561.88 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని నిర్మిస్తోంది. పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఇవేమీ రామోజీ పచ్చ కళ్లకు కనిపించకపోవడమే విడ్డూరం. ఎస్సీ విద్యా సంస్థల్లో ఉత్తమ విద్య గత టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసి అంతిమంగా పేదలపైన, దళితులపైన భారం మోపారు. చదువులు, వైద్యాన్ని కొనే స్తోమత లేక రెండింటికీ దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్కు బకాయి పెట్టి విద్యార్థులను వేదనకు గురి చేసింది. ఇవేమీ ఈనాడు దినపత్రికలో ఏరోజూ కనిపించలేదు. అలాంటి పరిస్థితులను తొలగిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ, ఎస్టీల కోసం చేపడితే అది తప్పు అన్నట్టు రాస్తోంది. గతంలో కనీస ప్రమాణాలు లేని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీంను అమలు చేసి నిధులను దోచుకున్నారు. ఇప్పుడు విద్యార్థులందరికీ నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ తరగతి గదులు, ఐఎఫ్పీ స్క్రీన్లు, ఇంటర్నెట్, విద్యార్థులకు ట్యాబ్లు, బైలింగువల్ టెక్టŠస్ బుక్స్తో, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. టోఫెల్ శిక్షణనిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. గత ఏడాది ప్రకటించిన జేఈఈ అడ్వాన్డ్, మెయిన్స్ల్లో విద్యార్థులు 99.05 శాతం పర్సంటైల్ సాధించడంతో పాటు 200 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందారు. రూ.వేల కోట్ల నిధుల అభివృద్ధి కనిపించలేదా రామోజీ ఎస్సీ వర్గానికి చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15 వేల చొప్పున రూ.5,335.7 కోట్లు ఇప్పటివరకూ అందించింది. 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.75 కోట్లు అందించింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5.06 లక్షల మందికి పైగా ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.834 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో వేసింది. 83 వేల మంది ఎస్టీల తల్లులకు రూ.135.66 కోట్లను వారి ఖాతాల్లో జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5.4 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. 1.11 లక్షల మంది ఎస్టీ తల్లులకు రూ.346 కోట్లు అందాయి. ఈ పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఇవేమీ బెస్ట్ అవెయిలబుల్కు సాటిరావంటోంది ఎల్లో మీడియా. ♦ గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలను, అవినీతిని, అక్రమాలను గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకు వచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సులలో క్యూఎస్ ర్యాంకింగ్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకుల గల విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా ట్యుషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని మార్చి అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 41 మంది విద్యార్థులు ఎంపికై విదేశాల్లో చదువుకుంటున్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్యకు ఈ స్థాయిలో భరోసా ఇవ్వగలిగిందా? ♦ అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్పైనా ఈనాడు పచ్చి అబద్ధాలు అచ్చేసింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్ మరింత ప్రయోజనకరంగా నిర్వహిస్తోంది. విశాఖలో సివిల్స్ కోచింగ్. విజయవాడలో గ్రూప్స్కి శిక్షణనిస్తోంది. తిరుపతిలో బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణనిస్తోంది. ఈ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉద్యోగ శిక్షణ కోసం ఇప్పటివరకు రు.15 కోట్లు పైగా ఖర్చు చేసింది. అయినా సరే.. బాబు బాగోతమే బాగుందంటోది పచ్చపత్రిక. -
మనబడి ‘ఐబీ’కి అనుకూలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, బహు భాషలు మాట్లాడే విద్యార్థులు, చదువులో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తొట్రుపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు.. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడేతత్వం, పిల్లల్లో సహకార గుణం, క్లాస్రూమ్లో విద్యార్థులు –టీచర్ల మధ్యనున్న అన్యోన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్ మొదలు ఐబీ సిలబస్ను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వం అమలుచేయనున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) ప్రతినిధులు ఫిబ్రవరి 26 నుంచి ఈనెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఏపీ విద్యా సంస్కరణలు, విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం వారిని ఆశ్చర్యపరిచాయి. తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాలల పనితీరు.. సమీక్షలో రోజువారి యాప్స్ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్ సిస్టం, టోఫెల్ శిక్షణ, కంటెంట్ అనుసంధానం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్మెంట్, యూనిఫారం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణపై ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అభినందించారు. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వంపై అభినందన.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుచేసే స్కూళ్లల్లో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్కు అధిక ప్రాధాన్యతనిస్తారు. బహు భాషలు, విద్యేతర అంశాలపై దృష్టిపెడతారు. వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఒకేచోట కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకునే గుణం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇలాంటి వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గుర్తించినట్లు వారు తెలిపారు. తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియాతో పాటు సవర, కొండ, కోయ, సుగాలి, ఆదివాసి, కువి వంటి గిరిజన భాషలు మాట్లాడే పిల్లలు కలిసి ఉన్నప్పుడు వారివారి భాషలను గౌరవించుకోవడం, ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడాన్ని ఐబీ ప్రతినిధులు గమనించి అభినందించారు. తరగతి గదులలో బహుభాషావాదం, ఉపాధ్యాయ–విద్యార్థి సంబంధం, విద్యార్థుల మధ్య ఆత్మవిశ్వాసం, పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రతినిధులు తెలిపారు. ఇక ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయని, ఉపాధ్యాయులకూ తగిన అర్హతలు ఉన్నాయన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచ పోకడలను అర్థంచేసుకునేందుకు, అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు. మరోవైపు.. ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్లో ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బంది శిక్షణనివ్వాలని అధికారులు నిర్ణయించారు. -
తలరాతలు తిరగరాస్తూ..
14 ఏళ్లు, మూడు దఫాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏమిటి? వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చూపించారా? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చి నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించింది చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం, గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం అని నిర్దేశించింది చంద్ర బాబు. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలని ప్రయత్నిస్తున్న మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్తో కాదు! జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత 57 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఒక్క చదువులతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించినట్లు చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా పేదల ఉన్నత చదువులకు భరోసా కల్పించామన్నారు. ప్రభుత్వ టీచర్లకు చెల్లించే జీతభత్యాలు కాకుండా పేద పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తూ వివిధ పథకాలు, సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.73 వేల కోట్లకుపైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకోసం ఇంతగా పరితపిస్తుంటే పెత్తందారులైన దుష్ట చతుష్టయానికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2023 అక్టోబరు–డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఐదేళ్లుగా విద్యారంగ పురోభివృద్ధి కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. పెద్ద చదువులు చదివే 93 శాతం పిల్లలకు లబ్ది.. తరతరాల పేదరికం సంకెళ్లను తెంచేస్తూ పెద్ద చదువులు అనే పునాదులపై ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు దోహదం చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. వంద శాతం ఫీజులను పిల్లల తల్లులకే అందచేసి వారి ద్వారా కాలేజీలకు చెల్లించే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా అమలు చేస్తున్నాం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా ఆ తల్లుల ఖాతాలకు ఫీజుల మొత్తాన్ని జమ చేయడం కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పూర్తి ఫీజులను మీ జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను ఆలోచించమని కోరుతున్నా. ఆదాయ పరిమితిని పెంచాం.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మంది పిల్లలు బాగా చదివి బాగుపడాలని ఆరాట పడ్డాం. ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తపనతో ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో రూ.లక్షకే పరిమితమైన ఆదాయ పరిమితిని ఏకంగా రూ.2.5 లక్షలకు పెంచి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు ఇంతే కడతాం! ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి! మీ చావు మీరు చావండనే గత ప్రభుత్వ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాం. తల్లిదండ్రులు ఎవరూ ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని మన భుజ స్కంధాలపై వేసుకున్నాం. త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమ చేస్తూ కాలేజీలకు అందచేసే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. తాజాగా అందిస్తున్న రూ.708 కోట్లతో కలిపి ఇప్పటిదాకా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి చేస్తూ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.12,609 కోట్లు తల్లులకు అందచేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల భోజనం, వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో రూ.4,275 కోట్లు ఉంటుంది. వచ్చే ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో రూ.1,100 కోట్లు కూడా కలిపితే విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా వెచ్చిస్తున్న సొమ్ము ఏకంగా దాదాపు రూ.18 వేల కోట్లు అవుతుంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలనే సంకల్పంతో ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చింది. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్.. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం 57 నెలల వ్యవధిలో రూ.73 వేల కోట్లు వ్యయం చేశాం. గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చే జీతాల వ్యయం దీనికి అదనం. ఇదంతా పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబు గొప్ప చదువులతో ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా ఎదిగి ఆ కుటుంబాల తలరాతలు మారాలని, భవిష్యత్ బాగుండాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. మన విద్యా విధానంలో మీ అన్న ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఎలాంటి మార్పులు చేసింది? దానివల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనేది ఒకసారి అందరూ గమనించాలని కోరుతున్నా. మన విద్యార్థులు రేపు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారిపోయింది. ఆధునిక చదువులకు అనుగుణంగా మన విద్యా విధానాలను సంస్కరిస్తూ మెరుగైన పద్ధతులు, టెక్నాలజీని మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు అందుబాటులోకి తెస్తూ అడుగులు వేశాం. చదువుల యుద్ధం.. ప్రభుత్వం స్కూళ్లలో మనం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం మన తప్పు! ఇంగ్లీష్ మీడియం తేవాలని తపనపడటం మనం చేసిన తప్పు! ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీస్తే ఏ ఒక్కరూ తెలుగు మీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేదింటి పిల్లలనూ అలాగే చదివిస్తూ మీ జగన్ అడుగులు వేస్తుంటే మాత్రం తెలుగు భాష అంతరించి పోతోందంటూ యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. విద్యారంగంలోనూ క్లాస్ వార్.. ఇప్పుడు విద్యారంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం ఇది. డబ్బున్న వారికి ఒక చదువులు, డబ్బులు లేని వారికి మరో చదువులు అనే ధోరణులపై జరుగుతున్న యుద్ధం ఇది. ఈ క్లాస్ వార్లో మీ కష్టాలు తెలిసిన అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం.ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనసాగకుంటే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు కొనసాగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లోని గొప్ప విశ్వవిద్యాలయాల కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తేవడం విప్లవాత్మక మార్పు. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిష్ మీడియం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. బాబు ఒక్క మంచీ చేయలేదు.. పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి ఆహారం అందుతుందో చంద్రబాబు ఏనాడు కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు – నేడుతో స్కూళ్లను బాగుపరచాలన్న ఆలోచనే చేయలేదు. ఇంగ్లీషు మీడియం ఊసే లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసిందీ లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచనే ఏ రోజూ చేయలేదు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నానే. విదేశీ విద్యా దీవెనతో ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలే నాడు లేవు. రాష్ట్రంలో ఆయన పరిపాలన వల్ల జరిగిన మంచి ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామాలకు, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పిల్లలకు, జాబ్స్ కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని ఆయన చెప్పగలిగే పరిస్థితే లేదు. హాజరైన మంత్రులు, నేతలు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రçఘురాం, టి.కల్పలత, మొండితోక అరుణ్కుమార్, రుహుల్లా, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, దూలం నాగేశ్వరరావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి, ఉన్నత విద్యాచైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నేటి విత్తనం.. రేపు మహా వృక్షం ఇవాళ మన పిల్లలకు కావాల్సింది ఏదో కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే ఫర్వాలేదని భావించే చదువులు కానే కాదు. ఈరోజు మనకు కావాల్సింది క్వాలిటీ చదువులు. ఇవాళ్టి తరం రేపు పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే నాణ్యమైన చదువులు కావాలి. ఈ నిజం, అవసరాన్ని తెలుసుకున్నాం కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా మన అడుగులు ముందుకు పడ్డాయి. ఈ దిశగా ప్రాథమిక విద్యలో కీలక మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతే గవర్నమెంట్ బడుల పరిస్థితులు మారాయి. ఇవాళ ఒకటో తరగతిలో మనం వేసే విత్తనం మరో 10–15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచి భవిష్యత్ లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలా కాకుండా మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. నాడు–నేడుతో గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా మన ప్రయాణం సాగుతోంది. జగన్ అనే వ్యక్తి పక్కకుపోతే...! జగన్ అనే ఒక్కడు పక్కకుపోతే రేపు పిల్లల చదువులు ఉండవు! గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు విద్యారంగం గాలికి పోతుంది! ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులు, వ్యవసాయం గాలికి ఎగిరిపోతాయి. రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు. అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. పేదవాడికి తోడుగా నిలబడుతూ, పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు, మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంటికి ఎవరు మంచి చేశారు? ఎవరి హయాంలో మంచి జరిగింది? అనే ఆలోచన చేయండి. మీ జగన్ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా సైనికులుగా నిలబడండి. నేను చెప్పే ఈ మాటలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత తీసుకున్నారు తోడేళ్లన్నీ ఏకమైనా జగనన్న మనందరి కోసం పోరాడుతున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తేవాలన్న సంకల్పం గొప్పది. వ్యవస్ధలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని భావిస్తూ సంస్కరణలు చేపట్టారు. స్కూళ్లు మొదలయ్యే జూన్, జూలై వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న 30 ఏళ్లు సీఎంగా ఉండాలి. సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంతవరకు ఆయన వెంటే నడుస్తా. ముఠా నాయకులు, ప్యాకేజ్ స్టార్ను ప్రజలు తరిమి కొట్టాలి. ఓ వ్యక్తి ఇటీవల తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి కొత్త కథలు చెబుతున్నాడు. – కైలే అనిల్కుమార్, పామర్రు ఎమ్మెల్యే విద్యార్థులకు వరంలా.. అమ్మలా గోరుముద్ద అందిస్తూ నాన్నలా ఫీజులు చెల్లిస్తున్న మీది గొప్ప మనసు అన్నా. కృష్ణా యూనివర్సిటీలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీటెక్ చదువుకుంటున్నా. నాన్న చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్ల చుట్టూ తిరిగినట్లు చెప్పారు. నేను ఏ ఒక్క ఆఫీస్కూ వెళ్లకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికే వచ్చి పత్రాలు ఇచ్చారు. విజన్ ఉన్న మీరు సీఎంగా ఉండటం విద్యార్థులకు వరం. ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్లీ మళ్లీ సీఎం కావాలి. మీద్వారా మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. – పి.శ్రీ షణ్ముఖ సాయి ప్రియ, విద్యార్థిని గొప్ప ప్రజా నాయకుడు మీరే.. మాది పేద కుటుంబం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. ఆయన జీతంపైనే కుటుంబం గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందా. కరిక్యులమ్ కోర్సులతో పాటు ఇతర కోర్ సబ్జెక్ట్లు నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్ సంపాదించా. సాఫ్ట్వేర్ జాబ్స్కు అర్హత సాధించా. వరల్డ్ టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. మీరు యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లిష్ రచయిత టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు. మీరు కూడా టెన్ థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు. నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్లో గ్రేట్ ప్రొఫెషనల్ పేరు సాధించాక మళ్లీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్పై నిలబడి మాట్లాడతానని మాట ఇస్తున్నా. – దిల్షాద్, విద్యార్థిని తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి.... మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీల్లో సీట్లు సాధిస్తే జగనన్న విదేశీ విద్యా దీవెనతో రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లల డిగ్రీలకు ప్రయోజనం దక్కేలా వారు ఏం చదువుతున్నారు? కరిక్యులమ్లో ఎలాంటి మార్పులు తేవాలి? అత్యున్నత భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలి? అని మొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మీ అన్న మాత్రమే. కరిక్యులమ్ను జాబ్ ఓరియెంటెండ్గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ తీసుకొచ్చింది ఇప్పుడే. మన కరిక్యులమ్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను తొలిసారిగా తీసుకొచ్చాం. చదువుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ తొలిసారిగా అనుసంధానం చేస్తూ అడుగులు వేశాం. డిగ్రీ పూర్తయ్యాక మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించక ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్నదేమిటి? ఇక్కడ లేనిదేమిటి? అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్ను ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది కూడా మన ప్రభుత్వమే. ప్రఖ్యాత వర్సిటీల్లో ఉన్న దాదాపు 2 వేల కోర్సులన్నీ ఆన్లైన్ ద్వారా మన కరిక్యులమ్లో భాగాలుగా మారి సర్టిఫికెట్లు కూడా వారే ఇచ్చేలా అడుగులు వేశాం. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్సీ, ఎల్బీఎస్ లాంటి అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసి పొందిన సర్టిఫికెట్లతో నైపుణ్యాలు సాధించిన మన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే అంతర్జాతీయంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికంటే ముందుంటారు. జగన్నాథ రథం.. విప్లవాత్మక సంస్కరణలతో మన జగన్నాథ రథం వడివడిగా కదులుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతోంది కూడా ఇప్పుడే. గవర్నమెంట్ స్కూళ్లలో బైలింగ్యువల్ టెక్సŠట్బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తోంది కూడా ఇప్పుడే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను పేద పిల్లలకు సైతం అందించింది ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకునే లిటరసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏకంగా ట్యాబ్లు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడు – నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్పీ ప్యానెళ్లు తెచ్చింది మన ప్రభుత్వమే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తోంది కూడా మనమే. పిల్లలకు రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్దను పౌష్టికాహారంతో అందిస్తోంది కూడా ఈ 57 నెలలుగానే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలు, అందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒకటి ఉండాలని ఏర్పాట్లు చేసింది కూడా మన ప్రభుత్వమే. విద్యా వ్యవస్థను మన ప్రభుత్వం ఎంత ఉన్నత స్థాయికి చేర్చిందో చెప్పేందుకు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులు ఐక్యరాజ్యసమితిలో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన అరుదైన ఘట్టమే నిదర్శనం. మన చదువుల ఘనతను చిట్టి చెల్లెమ్మలు ప్రపంచానికి చాటి చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ను చూసినప్పుడల్లా.. ఎమ్మెల్యే అనిల్ని చూసినప్పుడల్లా అందరూ తన మాదిరిగా ఉంటే ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని అనిపిస్తుంది. నిజాయతీ, నిబద్ధత ఉన్న అనిల్ను మీరందరూ దీవించండి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు అడిగాడు. అధికారులను పిలిపించి అవన్నీ కచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తానని హామీ ఇస్తున్నా. పెత్తందారులకో ధర్మం.. పేదలకో ధర్మమా? ఇవాళ నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ దీన్ని గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట! పేదలైన మీకో ధర్మమట! వారి పిల్లలకు ఒక బడి.. మన పిల్లలకు ఇంకో బడట! వారి చదువులు వేరట.. మన చదువులు వేరట! పెత్తందార్లుగా వారుండాలట... పనివారిగా మనం ఉండాలట! పరిశ్రమలు వారివట.. కార్మికులుగా మాత్రమే మనమట! సామ్రాజ్యాలన్నీ వారివట.. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట! వారి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ జగన్ పేద పిల్లలకు ట్యాబ్లిస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ యాగీ చేస్తారు. ఇవన్నీ మన పిల్లలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. -
మీ పిల్లలు చదువుతుంది ఏ మీడియం: సీఎం వైఎస్
-
అంతరాలు అంతం
పేదలకూ పెద్దల తరహాలోనే ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను అధికారులందరినీ ఒకటే అడిగా. మీకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తోందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలో, పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకూ ఇంటి పట్టాలివ్వాలని ఆదేశాలివ్వడమే కాకుండా చట్టంలో మార్పులు చేశాం. ఈరోజు అవే పూర్తి హక్కులతో పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే ఒరవడిని అనుసరిస్తూ ధనిక – పేద అంతరాలను తొలగిపోయేలా విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. నాడు – నేడుతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను పేదింటి పిల్లలకు చేరువ చేయడంతోపాటు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సర్కారీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద లబ్దిదారులకు సర్వ హక్కులతో రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు పండుగలా కొనసాగనున్నాయి. రెండు రకాల రూల్సా..? దేశ చరిత్రలో తొలిసారిగా 31 లక్షల మందికి ఇచ్చిన డీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్న కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి జరుగుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, మంచి చేయడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అంతా గమనించాలి. పేదల బతుకులు మారి వారి బిడ్డలు గొప్పగా ఎదిగేలా 58 నెలలుగా మన ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలకు ఇచ్చే ప్లాట్లకు విధించే నిబంధనలే పేదలకూ వర్తింపచేయాలనే ఉద్దేశంతో కన్వేయన్స్ డీడ్లతో రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా నిబంధనలు ఉండటం సరికాదు. అలాంటి విధానాలపై తిరుగుబాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 58 నెలల ప్రయాణంలో ప్రతి అడుగూ అలాగే వేస్తున్నాం. చదువుల్లో అంతరాన్ని తొలగిస్తూ.. పేదలకో న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని మార్చేయాలనే తపనతో మన అడుగులు పడ్డాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు పేద పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుంటే డబ్బున్న వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మన గవర్నమెంట్ స్కూళ్లలో నాడు–నేడుతో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో పాటు బైలింగ్యువల్ బుక్స్, బైజూస్ కంటెంట్, 8వ తరగతి నుంచి ట్యాబ్లు అందిస్తున్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్ బోధన. ఐఎఫ్పీ ప్యానళ్లు అందుబాటులోకి తెచ్చాం. పేద పిల్లలు కాన్వెంట్ డ్రస్, షూస్ వేసుకుని చిరునవ్వుతో ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్నారు. సీబీఎస్ఈ నుంచి ఐబీ విద్యా విధానం స్థాయికి గవర్నమెంట్ బడులను తీసుకెళుతున్నాం. పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీల నుంచి ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివేలా మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్బులేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయడం అంటే ఇదీ అని చెప్పడానికి గర్వపడుతున్నా. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం ఇవాళ పేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లింది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు ఉచితంగా విస్తరించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అంతేకాకుండా శస్త్ర చికిత్సల తరువాత రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా తెచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందుతోంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. నేను చెప్పే ప్రతి మాటా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను గమనించండి. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడం అంటే ఇదీ. బడుగు, బలహీన వర్గాలకు పదవులు గతంలో పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన నామినేటెడ్ పదవులను చట్టం చేసి ఏకంగా 50 శాతం బడుగు, బలహీన వర్గాల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సామాజిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇదీ. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు... డబ్బున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అనే భావాలను పూర్తిగా తుడిచి వేస్తూ, పేదలకో న్యాయం – డబ్బున్న వారికో న్యాయం అనే విధానాలను రద్దు చేస్తూ మన అడుగులు పడ్డాయి. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీలు.. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ వల్ల ఆస్తిపై అక్కచెల్లెమ్మల హక్కులు భద్రంగా ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు సృష్టించేందుకు వీలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేరు. సచివాలయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లైనా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్న విషయం సచివాలయాల్లో శాశ్వతంగా, భద్రంగా ఉంటుంది. సరిహద్దు రాళ్లతో స్థలం వద్ద అక్కచెల్లెమ్మల ఫొటో తీసి జియోట్యాగింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరూ కబ్జా చేయలేరు. పదేళ్లు కాగానే ఆ పట్టాలను అమ్ముకునేందుకు, వారసత్వంగా ఇచ్చేందుకు, గిఫ్ట్గా ఇచ్చేందుకు పట్టా భూములున్న వారితో సమానంగా ఆటోమేటిక్గా హక్కులు సంక్రమిస్తాయి. ఆ తేదీ వివరాలతో సహా స్పష్టంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో పొందుపరిచాం. ఎన్ఓసీ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. బ్యాంకు రుణాలు కావాలంటే సులభంగా తక్కువ వడ్డీకే అక్కచెల్లెమ్మలకు అందుతాయి. నా అక్కచెల్లెమ్మలు, పేదలకు ఇచ్చే స్థలాలు, హక్కులు, ఆత్మగౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో వారి బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతున్నాం. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇవన్నీ చూస్తుంటే వంద మంది సినిమా విలన్ల కంటే, పురాణాల్లో రాక్షసులందరి కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అనిపిస్తుంది. చివరికి అమరావతిలో మనం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటూ ఆ పెద్దమనిషి నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి తన లాయర్లతో వాదించాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి జంకు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని వాదిస్తే తల్లిదండ్రులంతా గట్టి గుణపాఠం చెబుతారనే భయం లేకుండా చంద్రబాబు పాపిష్టి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణమైన వ్యాఖ్యలు చేసి కూడా బరితెగించి తిరుగుతున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని వ్యాఖ్యానిస్తే బీసీలంతా బుద్ధి చెబుతారన్న భయం కూడా లేకుండా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంతకన్నా దారుణం ఉందా? 650 వాగ్దానాలిచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయకుండా ఎన్నికలొచ్చేసరికి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మేనిఫెస్టోతో సిద్ధమయ్యాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? మన ఖర్మ ఏమిటంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ రామకృష్ణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ ముత్యాలరాజు, కలెక్టర్ ఏఎస్.దినేష్కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంటు కూడా ఇవ్వకపోగా బాబు కుట్రలు.. 2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనుకున్నా కొందరు రాక్షసుల మాదిరిగా అవరోధాలు సృష్టించారు. అధికారంలో ఉండగా పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపానపోని చంద్రబాబు ఇవాళ మనం ఇస్తుంటే అడ్డుపడి ఆయన మనుషుల ద్వారా ఏకంగా 1,191 కేసులు దాఖలు చేశారు. వీటిని అధిగమించి ఇవాళ ఒక్క ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల పట్టాలిస్తున్నాం. ఒంగోలు అర్బన్లో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం యర్రజర్ల హిల్స్లో 866 ఎకరాలను 2020లోనే గుర్తించి 24 వేల ప్లాట్లతో లే అవుట్లు సిద్ధం చేశాం. ఈ గొప్ప కార్యక్రమానికి అడ్డుపడి చంద్రబాబు, ఆయన మనుషులు కోర్టులో కేసు వేశారు. ఒక్క ఒంగోలే కాకుండా ఏ జిల్లాలో చూసినా చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలివ్వలేదు. మనం ఇస్తుంటే ఆయన అసూయ దాగటం లేదు. ఇవన్నీ దాటుకుంటూ మీ బిడ్డ అడుగులు వేశాడు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లేశ్వరపురం, ఎన్.అగ్రహారం, వెంగముక్కపాలెం, యర్రజెర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.210 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరో రూ.21.33 కోట్లు లే అవుట్ అభివృద్ధి కోసం వ్యయం చేస్తున్నాం. ఇదే ఎన్.అగ్రహారం, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్లో, వెంగముక్కపాలెం, యర్రజెర్లలో మరో 32 బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్ షిప్స్ను పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. ఎస్టీపీ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ సప్లయ్ కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ఒంగోలుకు మంచి చేస్తూ పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో రూ.339 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం. బైబై బాబు అంటున్న బాబు సతీమణి చంద్రబాబును నేను ఇవన్నీ ప్రశి్నస్తే నన్ను సవాల్ చేస్తున్నావా? అంటాడే కానీ ఇంటింటికీ ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికీ ఇదిగో ఈ ఈ మంచి చేశానని చెప్పలేడు. జగన్ మాదిరిగా బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాననే మాటలు ఈ పెద్దమనిషి నోట్లో నుంచి రావు. ఆయన చేయలేదు కాబట్టే చెప్పలేడు. ఒకవైపు ఎన్నికలకు మనమంతా సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా అయన సిద్ధంగా లేరని అంటున్నారు. ఏకంగా కుప్పంలోనే బైబై బాబు.. అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తున్నాయి. ఇలాంటి చంద్రబాబును రాష్ట్రంలో ప్రజలెవరూ సమర్థించడం లేదు. కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించడంలేదు. ఏపీకి రానివారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు. నాకు ఆయన మాదిరిగా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మద్దతు లేవు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని కోరుతున్నా. నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు. అడ్డంకులను అధిగమించి.. అధికారంలోకి రాగానే అందరికీ స్థలాలు ఇవ్వడానికి 71,811 ఎకరాలను సేకరించి పంపిణీ చేశాం. 17,005 లే అవుట్లలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు, మంచినీరు, పార్కులు, కామన్ ఏరియాలు, ఇతర సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 8.90 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేశాం. మిగతావి వివిధ దశల్లో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆ ఇంటి స్థలాల విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. ఒంగోలులో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలం విలువ గజం రూ.10 వేల పైచిలుకే ఉన్నట్లు ఇంతకు ముందే అధికారులు చెప్పారు. ఇక్కడ రెండు లే అవుట్లలో పేదలకు ఇచ్చిన ఒక్కో స్థలం విలువే రూ.6 లక్షలు కాగా రూ.2.70 లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు సదుపాయాల కోసం మరో రూ.లక్ష దాకా వెచ్చిస్తున్నాం. ఇలా ఇల్లు పూర్తయ్యే సరికే ఒక్కో ఇంటి విలువ రూ.10 లక్షలు పైమాటే ఉంటుందని చెప్పడానికి సంతోషపడుతున్నా. అక్కచెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా విలువైన స్థిరాస్తిని పెడుతున్నాం. తద్వారా ఏకంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మహిళలకు ఆర్థిక సాధికారత, భద్రత పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలతోపాటు దిశ యాప్, సచివాలయంలో మహిళా పోలీసుల ద్వారా అండగా నిలబడ్డాం. నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ అందుతున్నాయి. ఇవన్నీ గతంలో లేవు. మన పథకాల ఫలితంగా మహిళా ఆర్థిక సాధికారత పెరిగింది. అంతరాలు తగ్గుతున్నాయని నేను చెప్పడం కాదు.. నిన్ననే విడుదలైన జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. ఆర్థిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. గత 58 నెలల్లో డీబీటీతో ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగా ఇందులో 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అందించగలిగాం. -
ఇంగ్లిష్ 'పది'లం
మా లాంటి పేదలకు అండగా సీఎం గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిల్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. ఆ ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. టీచర్లు బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లిష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సమూల సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఇన్నాళ్లూ మాతృభాష ముసుగులో పేద బిడ్డల ఇంగ్లిష్ చదువులకు అడ్డుపడుతూ కొందరు పెత్తందార్లు కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే తెలుగును అణగదొక్కుతున్నారంటూ విష ప్రచారం చేశారు. అందరూ ఆంగ్లంలోనే చదివితే తమ పరిస్థితి ఏం కావాలని కార్పొరేట్ విద్యా సంస్థలు బెంబేలెత్తాయి. ఇవన్నీ అధిగమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సర్కారీ స్కూళ్లలో గత ఐదేళ్లలో దాదాపు 25 శాతం మంది విద్యార్థులు తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారిపోయి పదో తరగతి పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మీడియం చదువులను ముఖ్యమంత్రి జగన్ అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో అత్యధిక విద్యార్థులు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తదితరాలతో కిట్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తోంది. ఇప్పటివరకు జగనన్న విద్యా కానుక కింద రూ.3,366.53 కోట్లను వ్యయం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా కానుక నిధులను సిద్ధం చేస్తూ రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ► వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు రాయనున్న మొత్తం విద్యార్ధులు 6.23 లక్షల మంది ఉండగా ఏకంగా 4.51 లక్షల మందికిపైగా ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాయనుండటం గమనార్హం. వీరిలో ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారు ఏకంగా 3.97 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న వారి సంఖ్య 2.25 లక్షల వరకు ఉంది. ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య త్వరలోనే వంద శాతానికి చేరుతుందంని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలకు పదును పెడుతూ టోఫెల్ శిక్షణ సైతం అందుబాటులోకి తెచ్చిందని ఉదహరిస్తున్నారు. ► చంద్రబాబు హయాంతో పోలిస్తే ఐదేళ్లలో పరిస్థితి తిరగబడింది. సీఎం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాయనున్న విద్యార్ధులు 72.54 శాతానికి పెరిగారు. ఈసారి తెలుగు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్ధులు 26.74 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా అతి స్వల్ప శాతం విద్యార్థులు ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో చదువుతున్న వారున్నారు. ► టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 2.88 లక్షలు కాగా ఇప్పుడు ఏకంగా 4.51 లక్షలకు పెరిగింది. గత సర్కారు హయాం కంటే ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే వారి సంఖ్య 1.63 లక్షలు పెరగడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్థులే కావడం మరో విశేషం. పరీక్షలపై సీఎస్ సమీక్ష వచ్చే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లును సమీక్షించాలని ఆదేశించారు. మంచినీటి సౌకర్యంతో పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్లను నియమించాలని ఎస్పీలను ఆదేశించారు. జగన్ మావయ్య ఆశయాన్ని సాధిస్తా గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య ఇంగ్లీష్ మీడియం పెట్టి మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిళ్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచితంగా మాకు వసతి కల్పిస్తున్నారు. స్కూల్లో టీచర్లు చాలా బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లీష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా. కోరిక నెరవేరింది మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివా. ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నది నా చిన్ననాటి కోరిక. పేదరికం కారణంగా నా ఆశ నెరవేరదేమో అనుకున్నా. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో ఆరో తరగతి చదువుతున్నా. జగన్ మామకు మేమంతా రుణపడి ఉంటాం. మా అమ్మ చిలకమ్మ నన్ను కాన్వెంట్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని బలంగా కోరుకునేది. దళితులమైనందున పేదరికంతో కాన్వెంట్లో చదివించలేకపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో మా అమ్మ కోరిక నెరవేరింది. –సామాబత్తుల లక్ష్మి, కాకినాడ జిల్లా, సంపర ప్రాధమిక పాఠశాల మా అదృష్టం.. కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం మా అదృష్టం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఇంగ్లీష్ మీడియం పునాదిగా ఉపయోగపడుతుంది. మా తల్లిదండ్రులు నాగరాజు, పద్మావతి బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాలాంటి పేదలకు ఇంగ్లీష్ మీడియం అందించిన సీఎం జగన్కు రుణపడి ఉంటాం. –తలారి శ్వేత, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం -
విద్యలో వండర్
‘ఎడెక్స్’తో ఒప్పందం రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో సువర్ణాధ్యాయం. ‘రైట్ టు ఎడ్యుకేషన్’ అనేది పాత నినాదం. ‘రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్’ అనేది మన ప్రభుత్వ విధానం. నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పిల్లల ఉన్నత చదువుల ఖర్చు కోసం వెనుకాడకుండా మానవ వనరులపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక సంస్కరణలతో ఎవరూ ఊహించనన్ని మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి చదువుకోలేని మన విద్యార్థుల కోసం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ‘ఎడెక్స్’ (edX) ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విఖ్యాత వర్సిటీలు అందించే కోర్సుల్లో 2 వేలకు పైగా వర్దికల్స్లో విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబడితే మిగతా ప్రపంచం మనల్ని దాటుకుని ముందుకు వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే చదువుల్లో దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీపడుతున్నామన్నారు. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతభత్యాలు సాధిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబీ) సిలబస్ అందుబాటులోకి తెస్తున్నామని, దీన్ని తొలుత ఒకటో తరగతితో ప్రారంభించి పదేళ్లలో రాష్ట్ర విద్యార్థులు ఐబీ విధానంలో టెన్త్ పరీక్షలు రాసేలా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు చేపట్టిన ఈ సంస్కరణల ఫలాలు కనిపించేందుకు మరో నాలుగైదేళ్లు పట్టవచ్చని తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ‘ఎడెక్స్’ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, 26 వర్సిటీల వీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అనూహ్య సంస్కరణలు.. ఉన్నత విద్యారంగంలో అనూహ్య సంస్కరణలు తెచ్చాం. ఆర్థిక భారంతో ఏ ఒక్కరి చదువులూ మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. ప్రతిభ కలిగిన పేదింటి విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీల్లోనూ కూర్చోబెట్టి చదివిస్తున్నాం. ఏటా జగనన్న వసతి దీవెన ద్వారా అర్హులందరికీ వసతి ఖర్చులు అందజేస్తున్నాం. ప్రతి విద్యార్థి చదువు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా పాఠ్య ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. దాదాపు 30 శాతం స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాం. తొలిసారి డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు, మూడేళ్ల కోర్సులో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశాం. దీనికి అదనంగా మరో ఏడాది ఆనర్స్ డిగ్రీ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా సిలబస్ చదువుకునేలా 400కిపైగా బైలింగ్యువల్ పాడ్కాస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యలో బోధన ప్రమాణాలు పెంచేందుకు కోర్టు కేసులను అధిగమించి 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. 2019లో 257 ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు ఉంటే మనం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలతో 437కు పెరిగింది. బలమైన పునాది.. మానవ వనరులపై పెట్టుబడికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్స్గా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాం. నాడు – నేడుతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మార్చాం. విద్యార్థులను స్కూళ్లకు రప్పించేందుకు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తిని నింపేందుకు అమ్మఒడి, గోరుముద్ద అమలు చేస్తున్నాం. పదేళ్లలో మన విద్యార్థులకు పూర్తిగా ఐబీ విధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ విభాగం ఎస్సీఈఆర్టీ భాగస్వామ్యంతో ఈ ఏడాది టీచర్లకు బోధన విధానాలపై శిక్షణ ఇస్తుంది. వచ్చే ఏడాది ఒకటో తరగతితో ఐబీని ప్రారంభించి ప్రతి ఏడాది ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతాం. తద్వారా 2035 నాటికి పదో తరగతిలో ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. సృజనకు పదును.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు నాంది పలికి 6వ తరగతి నుంచి ఐఎఫ్పీ ప్యానెళ్లతో సృజనాత్మక బోధన చేపట్టాం. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్లు అందించడం ద్వారా చదువుల్లో వేగం పెంచి సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాం. ద్విభాషా పాఠ్యపుస్తకాలు విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించాయి. అంతర్జాతీయ వర్సిటీ కోర్సులు స్థానికంగానే మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ స్థాయిలో అందించేందుకు ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా దాదాపు 2 వేలకు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ కిందకు వస్తాయి. ఎడెక్స్లో విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విద్యా సంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేసి బోధిస్తాయి. అక్కడి ప్రొఫెసర్లతో మన విద్యార్థులు ఆన్లైన్లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లతో పాటు క్రెడిట్స్ దక్కుతాయి. తద్వారా జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్ఛేంజ్, వెల్త్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ లాంటి వర్టికల్స్ కనిపిస్తాయి. మన దగ్గర అవి లేకపోగా నేర్పించే సరైన మానవ వనరులు అందుబాటులో లేవు. ఈ సమస్యలను అధిగమించేందుకు అత్యుత్తమ వర్సిటీల కోర్సులను మన కరిక్యులమ్లో భాగం చేస్తున్నాం. తద్వారా ఆంధ్రా వర్సిటీ నుంచి తీసుకునే డిగ్రీల్లో స్టాక్ ఎక్ఛేంజ్, రిస్క్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్, ఫైథాన్ కోర్సులకు ప్రపంచ వర్సిటీల సర్టిఫికేషన్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం మన వర్సిటీల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. దీని ద్వారా ఉన్నత విద్యలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. వర్సిటీల్లో టెక్నాలజీ వినియోగం పెరగాలి.. యువతకు మనం ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య అందిస్తే పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. అందుకే జగనన్న విదేశీ విద్య ద్వారా అత్యధికంగా ఒక్కో విద్యార్థిపై రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రపంచంలోని టాప్–50 వర్సిటీలు, 21 ఫ్యాకల్టీల్లో టైమ్స్ రేటింగ్స్, క్యూ ఎస్ రేటింగ్స్లోని 320 కాలేజీలలో సీటొస్తే ఉచితంగా చదివిస్తున్నాం. ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రభుత్వ సాయంతో విదేశాల్లో చదువుతున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని వారికి కూడా మనం ఆ స్థాయి విద్యను అందించాలి. వర్సిటీల్లో ఏఐ, అగ్మెంటెడ్ టెక్నాలజీ, 3 డీ లెర్నింగ్ విధానాలను మన కరిక్యులమ్లో అందుబాటులోకి తేవాలని గతంలోనే వీసీలకు సూచించా. ఇప్పటికే పద్మావతి వర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు. కంప్యూటర్ విజన్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇలాంటివి అన్ని వర్సిటీల్లోనూ రావాలి. సీఎం జగన్ దార్శనికతకు నిదర్శనం పద్మశ్రీ అనంత్ అగర్వాల్, ఎడెక్స్ సీఈవో రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే తపనతో 12 లక్షల మందికి ఎడెక్స్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికీ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు ఇది నిదర్శనం. ఉన్నత విద్యలో ఇది నిజంగా గేమ్ ఛేంజర్. పదేళ్ల కిందట ఎడెక్స్ ప్రయాణం మొదలైంది. డిగ్రీ చదివి రెండేళ్లు ఉద్యోగం కోసం ఎదురు చూసిన అక్షయ్ అనే విద్యార్థి కెరీర్పై ఆశలు వదులుకున్న తరుణంలో ఎంఐటీ రూపొందించిన పైథాన్ కోర్సు ఎడెక్స్ ద్వారా నేర్చుకున్నాడు. క్లౌడ్ కంప్యూటింగ్ చేశాడు. ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగానే ఎంపికయ్యాడు. బెంగళూరు విమానాశ్రయంలో నన్ను గుర్తుపట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. సంపన్నుల పిల్లలకు చాలా అవకాశాలు వస్తాయి. వాళ్లు డబ్బు ఖర్చుచేసి మంచి కోచింగ్ సెంటర్లకు వెళ్లి నేర్చుకోగలరు. 36 ఏళ్లపాటు ప్రొఫెసర్గా ఉన్న నన్ను ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు, విజన్ ఆశ్చర్యపరిచాయి. ఎంఐటీ, హార్వర్డ్ లాంటి వర్సిటీల విద్యను పేద విద్యార్థులందరికీ ఇవ్వాలని నాతో చెప్పారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఆ స్థాయి విద్యను ఎలా అందించగలమో నాతో చర్చించారు. ఎడెక్స్తో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలబెడుతుంది. విజ్ఞానం, ఆర్థిక ప్రగతి, మంచి పౌరుడిగా తీర్చిదిద్దడంలో నాణ్యమైన చదువు ఎంతో ముఖ్యం. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి అగ్రపీఠం వేస్తోంది. సామాన్యులకూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోంది. త్వరలోనే వివిధ రాష్ట్రాలు, దేశాలు సైతం ఏపీ విద్యా విధానాన్ని అనుసరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. సీఎం కోరిక మేరకు పాఠ్య ప్రణాళికలను సమర్థంగా తీర్చిదిద్దేందుకు నా వంతు సహకారం అందిస్తా. మరింత రాణిస్తాం.. నాలాంటి ఎంతో మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోరుకుంటున్నారు. మధ్య తరగతి విద్యార్థులు పరిమిత వనరులతో ఉన్నత స్థాయి విద్య అందుకోవడం చాలా కష్టం. అంతర్జాతీయ వర్సిటీల్లో చదువుకోవడం కలే. ముఖ్యమంత్రి జగన్ విజనరీ లీడర్షిప్తో వరల్డ్ క్లాస్ విద్య సాధ్యమవుతోంది. ఏపీని స్టేట్ ఆఫ్ నాలెడ్జ్, స్టేట్ ఆఫ్ ఇన్నొవేషన్, స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడం గొప్ప విషయం. ఎడెక్స్ అందించే అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందిపుచ్చుకుని రాణిస్తాం. – ప్రగతి జైశ్వాల్, బీటెక్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి స్ఫూర్తినిచ్చిన సీఎం జగన్ మా నాన్న చిన్న రైతు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నేను చదువుకుంటున్నా. నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా ఉన్నత విద్యావకాశాలు దక్కుతున్నాయి. కరిక్యులమ్తో మా స్కిల్స్ పెరుగుతున్నాయి. ఎడెక్స్తో టాప్ వర్సిటీల కోర్సులను ఉచితంగా నేర్చుకుని గ్లోబల్ లెవల్ పోటీకి సిద్ధమవుతాం. ముఖ్యమంత్రి జగన్ లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. – ఎ.హరిత, బీటెక్, జేఎన్టీయూ–అనంతపురం మార్కెట్లో మంచి విలువ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్షిప్తో చదువుకునే సమయంలోనే ఉద్యోగ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. మాకంటూ మార్కెట్లో వాల్యూ క్రియేట్ చేశారు. ఇంటర్న్షిప్ ద్వారా నెలకు రూ.8 వేల స్టైఫండ్ పొందుతున్నా. మా అమ్మను నేనే చూసుకోవాలి. జీవితంలో స్థిరపడితేనే ఏదైనా చేయగలను. పోటీని తట్టుకుని నిలబడాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. ఎడెక్స్తో ఇది ప్రతి విద్యార్థికీ దక్కుతుంది. అంతర్జాతీయ వర్సిటీ సర్టిఫికేషన్తో సులభంగా ఉద్యోగాలు వస్తాయి. – అంజలి, బీకాం, మేరీ స్టెల్లా కాలేజీ, విజయవాడ -
పేదలకు ఇంగ్లీష్ వస్తే ... అమెరికాను దాటేస్తాం
-
ఆంగ్ల మాధ్యమం అనుసరణీయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రాథ మిక పాఠశాల స్థాయి నుండి బోధనా మాధ్య మంగా ఆంగ్లాన్ని ప్రవేశ పెట్టాలని తీసుకున్న నిర్ణయం సరైన దిశలో ఒక సాహసోపేతమైన ముందడుగు. ఆంధ్రప్ర దేశ్ ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. ఇంగ్లీషు మీడియం విద్య తన ముఖ్య మైన ఎజెండాల్లో ఒకటిగా చేసుకొంది. ఈ ఏడాది ఢిల్లీలోని రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ తరఫున పాల్గొన్న శకటం ఇంగ్లీషు మీడియం చదువు ప్రాముఖ్యాన్ని ఎలుగెత్తి చాటింది. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాల, కళాశాల స్థాయుల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడా నికి కసరత్తు జరుగుతోంది. ఇంగ్లీషు మాధ్యమం విషయంలో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఇప్పుడు వారూ నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. మొత్తం మీద విద్యావేత్తలు, విద్యా నిర్వాహ కులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ఆంగ్ల మాధ్యమ విద్యకు ఎంతో మద్దతు లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించి నప్పుడు మొదట్లో కొన్ని కార్పొరేట్ పాఠశాలలు, ఇతర స్వార్థ ప్రయోజనాలకుచెందిన కార్టెల్లు వ్యతిరేకించినప్పటికీ, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా కార్యకర్తలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం బలమైన రాజకీయసంకల్పంతో ముందుకు సాగింది. అనేక దళిత సంఘాలు, ఎన్జీఓ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు నిర్వహించి బోధనా మాధ్యమంలో ప్రతిపాదిత మార్పుకు సంఘీభావం తెలిపాయి. ఆంగ్ల విద్య సామాజిక మార్పుకు నాంది పలుకు తుందనీ, సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు విముక్తి కల్పించే సాధనంగా ఉపయోగ పడుతుందనీ వారు భావించారు. ఇంగ్లీషు చదువు వల్ల మాతృభాషకు నష్టం వాటిల్లుతుందని కొందరు అంటున్నారు. కానీ, భయపడాల్సిన పనిలేదు. ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీషును ఒక సబ్జెక్ట్గా బోధిస్తే, పిల్ల లకు ఆ భాషలో కూడా మెరుగైన వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు నడిచే యుగం ఇది. ఇంగ్లీషు పరిజ్ఞానం ఈ రంగాల్లో చాలా అవసరం. ఇవ్వాళ మన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్న పిల్లలకు మెరుగైన అవకాశాలు లభించడం ఖాయం. ఫలితంగా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతుంది. ఇది అంతిమంగా రాష్ట్ర, దేశ అభివృద్ధికి దారితీస్తుంది. ఇంగ్లీషు ప్రాధాన్యతను పెరుగుతున్న సామాజిక–ఆర్థిక అవసరాల కోణంలో చూడాలి. సృజనాత్మక రచన, సాహిత్య ఎదుగుదల మాతృభాష ద్వారానే సాధ్యమవుతుందనేది నిజం. కానీ ఇంగ్లీషు... దేశం లోపలా, బయటా అన్ని చోట్లా ఉనికిలోకి వచ్చింది. లింక్ లాంగ్వేజ్గా ఉంది. ఈ భాష లేకుండా ఈ రోజు ‘ప్రపంచ పౌరుడి’ని ఊహించలేము. ప్రాథమిక పాఠ శాలల నుండే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే సమాజంలో సమూలమైన మార్పు రావడం ఖాయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ పాఠ శాలల్లో అధిక ఫీజులు కట్టి పిల్లలను చదివిస్తూ సతమతమవుతున్న మధ్యతరగతి తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెలుగు మాధ్యమాన్ని ఇంగ్లీషులోకి మార్చడం అనేక సవాళ్లతో కూడుకున్న పని. మొదటి అతి ముఖ్యమైనది ఉపాధ్యాయు లకు కొత్తగా శిక్షణ ఇవ్వడం. ముఖ్యంగా మారు మూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లీషు కమ్యూనికేషన్ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రతి ఒక్కరికీ తెలుసు.అందువల్ల, ఉపాధ్యాయులు ‘ఇంగ్లిష్అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ’ లేదా అటువంటి ఇతర సంస్థల ద్వారా, ‘ఉపాధ్యాయుల ఇండక్షన్ ప్రోగ్రామ్ల’ ద్వారా శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లీషులో సబ్జె క్టుల బోధనకు ఉపయోగించే రీడింగ్/ టీచింగ్ మెటీరియల్స్ తయారీలో ఉపా ధ్యాయుల పాత్ర, విధి ఉంటుంది. మాతృభాష ఆంగ్లం కాని పిల్లలకు బోధించడంలో అత్యంత సమగ్రమైన పద్ధతి, విధానాలు అత్యంత నైపుణ్యం కలిగి ప్రణాళికాబద్ధంగా అమలు చేయబడేవి. దీనికి తోడు ప్రస్తుతంఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కూడా పెంచాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పాటూ ఎన్ఆర్ఐల ఇష్టపూర్వక సహ కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడ తాయని ఆశిద్దాం. - వ్యాసకర్త హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంత హిస్టరీ ప్రొఫెసర్ - కె.ఎస్.ఎస్. శేషన్ -
ఇదిగో.. సామర్థ్య ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో బడ్జెన్ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం. –సాక్షి, అమరావతి ‘విద్య’యీ భవ పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్ సరి్టఫికేషన్ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందిస్తోంది. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్లు, బ్యాగ్లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. రెడీ టు వర్క్ విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్లు, క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్లను అభివృద్ధి చేసింది. ఉన్నతంగా విద్య జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది. ఇంటర్న్షిప్ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది. ప్రొసీజర్స్ను పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది. కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం. గోరుముద్దతో ఆరోగ్యం.. ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. సామర్ధ్యాంధ్ర కేటాయింపులు రూ. 53,508.04 కోట్లు సాధారణ విద్య రూ.33,898.04 కోట్లు వైద్య రంగంరూ.17,916.67 కోట్లు సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు -
ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఏపీ విద్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న జనవరి 30న ఒకటవ తరగతి నుంచే ఐబీ సిలబస్తో పాఠశాల విద్యను ప్రారంభించడానికి ఒక అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లిష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రపంచ ప్రమాణాలకు అనుసంధానం చేయడంలో ఇది మరో ప్రధాన అడుగు. విద్యార్థులు దీంతో ఉమ్మడి సర్టిఫికెట్ పొందుతారు. విజ్ఞాన భారత్ను నిర్మించడంలో భాగంగా, ఏపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో పాఠశాల విద్యపై దృష్టి సారించిందన్న విషయం, గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించిన రాష్ట్ర శకటంలో ప్రతిఫలించింది. గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్లో, ‘పాఠశాల విద్య పరివర్తన’ థీమ్తో ఒక శకటాన్ని ప్రపంచ, జాతీయ నాయకత్వం ముందు ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త దృక్పథాన్ని చూపించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాడుతూ, నృత్యాలు చేస్తూ శకటం వెంట కదిలారు. అధికారులు సృజనాత్మకంగా నిర్మించిన ఆ శకటాన్ని పరేడ్లో ఉంచడానికి ఏపీ ముఖ్యమంత్రికి ధైర్యం, విశ్వాసం అవసరం. దాన్ని వీక్షించిన అంతర్జాతీయ, జాతీయ వీక్షకులు చాలా ఉత్సా హంగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఇది ఇతర రాష్ట్ర శకటాల కంటే ఒక ప్రధాన వ్యత్యాసాన్ని కనబర్చింది. ‘సకల విద్యలకు మేమే సాటి / విశ్వ విద్యకు మేమే పోటీ’ అంటూ పిల్లలు పాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం అందిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యా నాణ్యత గురించి ఈ పాట చెబుతుంది. తమ పాఠశాల యూనిఫారంలో నిల బడి ఉన్న విద్యార్థులు వారి టాబ్లెట్లు, ద్విభాషా పుస్తకాలను చూపు తున్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యాలను, జ్ఞానాన్ని నేర్చుకోవడంలో వారికి సహాయం చేస్తున్నారు. భారతదేశం తన గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. గణతంత్ర దినోత్సవ అతిథిగా వచ్చిన ఫ్రా¯Œ ్స అధ్యక్షుడు మెక్రాన్ దానిని ఆసక్తితో చూశారు. పాఠశాల విద్యకు సంబంధించిన పరివర్తన సందేశం గురించి ఒక అనువాద కుడు ఆయనకు వివరించడం కనిపించింది. గత 74 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపబ్లిక్ డే పరేడ్లలో ఇలాంటి వినూత్న పాఠశాల విద్యా నమూనాను ప్రదర్శించలేదు. నాణ్యమైన విద్య కాకపోయినా, అక్షరాస్యత రేటును చూపించడానికి ధైర్యం చేయగల ఏకైక రాష్ట్రం కేరళ కూడా ఇన్నేళ్లుగా తమ పాఠశాల విద్యా విజయాన్ని ఏపీ ప్రభుత్వం రీతిలో జరుపుకోవాలని అనుకోలేదు. వాస్తవానికి, ప్రతి అధికార రాజకీయ పార్టీ తన పనితీరు, విధాన కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంది. కానీ పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన కొత్త ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య, గ్లోబల్ పవర్ హౌజ్గా మారాలని భావిస్తున్న ప్రజాస్వామ్యంలో హృదయాన్ని కదిలించే విషయం. నాణ్యమైన పాఠశాల విద్య అనే ఆలోచనను జగన్ ప్రైవేట్ నుంచి పబ్లిక్గా మార్చారు. మారుమూల గ్రామాల్లోని పేద పిల్లలు తమ సొంత గ్రామంలోని పాఠశాలల్లో ఆధునిక ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జాతీయ, ప్రపంచ మార్కెట్లలోకి రావాలని ఆశపడుతున్నారు. జగన్ తన ముందున్న అభివృద్ధి నమూనాకు విరుద్ధంగా ఈ అభివృద్ధి నమూనాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు సింగపూర్ వంటి రాజధాని నగరం నిర్మించడానికి 30,000 ఎకరాల భూమిని సమీకరించడంలో రాష్ట్ర వనరులను పెట్టుబడిగా పెట్టారు. ప్రభుత్వ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రైవేట్ రంగ పెట్టుబడి నమూనాయే ఆయన నమూనా. విద్యా రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆయన ప్రోత్సహించారు. ఏపీ శకటం ఇతర రాష్ట్ర శకటాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. గత వైభవం, స్వాతంత్య్ర పోరాట చిహ్నాలు, మతపరమైన చిహ్నాలు లేదా వారి గిరిజన, సాదాసీదా జీవన స్త్రీలను మిగతా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ ఏడాది రిపబ్లిక్ పరేడ్ కవాతును దేశంలో మహిళా సాధి కారతను ప్రత్యేకంగా ప్రదర్శించడానికి ఉద్దేశించారు. సైన్యంలోని అన్ని విభాగాల్లో, ఇస్రో వంటి వైజ్ఞానిక కార్యకలాపాలలో, ప్రతి రంగంలో దేశం మహిళలను ఎలా ప్రోత్సహిస్తోందో ప్రపంచానికి చూపించడానికి దీన్ని రూపొందించారు. అంతరిక్ష శాస్త్రంలో తన సొంత మహిళా శక్తిని ‘ఇస్రో’ తన శకటంలో ఉంచింది. ఆ రకంగా అది దాని సొంత భవిష్యత్తు యోగ్యతను కలిగి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ (రామ్ లల్లాపై తన శకటాన్ని రూపొందించింది) వంటివి తమ సాంప్రదాయ నృత్యం చేసే మహిళలతో తమ శకటాలను రూపొందించాయి. కానీ ప్రపంచీకరణ యుగంలో ఆధునికమైన, చక్కగా అమర్చిన ఇంగ్లిష్ మీడియం విద్యతో, పాఠశాల విద్యను ఈ దేశ భవిష్యత్తుగా చూపిన ఏకైక రాష్ట్రం ఏపీయే. ఇప్పటికీ అర్ధ–మధ్యయుగ జీవన వ్యవస్థలతో వేలాడుతున్న గిరిజన (ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ మొదలైనవి) లేదా గిరిజనేతర మహి ళల భవిష్యత్తు సవాళ్లు ఏమిటో ఆ యా రాష్ట్రాలు చూపలేదు. ముస్లిం మహిళల స్థితిగతులు ఏమిటో ఏ శకటమూ చెప్పలేదు. కశ్మీర్ నుంచి కనీసం అలాంటి ఒక్క శకటాన్నయినా తేవాల్సింది.రాష్ట్ర చరిత్రను చూపించడం ఒక విషయం; పిల్లలకు చక్కగా, ప్రణాళికాబద్ధమైన విద్యనుఅందించడం ద్వారా దేశ భవిష్యత్తును చూపించడం మరొక విషయం. ఆంధ్రప్రదేశ్ దీనిని స్పష్టమైన విజన్ తో చేసింది. ఏపీ శకటం కదులుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని జాగ్రత్తగా గమనించారు. ఆయన సొంత గుజరాత్ మోడల్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అంత బాగా అందించలేకపోయింది. గుజరాత్ కూడా ఇప్పుడు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రైవేట్ పాఠ శాలలపై ఆధారపడుతోంది. అది కూడా ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశం పాశ్చాత్య దేశాలతో, చైనాతో పోటీ పడాలని ఆకాంక్షిస్తున్నప్పుడు, తమ సొంత ప్రాంతీయ భాషలో చక్కటి పునాది కలిగివుండి, ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక మార్గం. జగన్ మోహన్ రెడ్డి చైతన్యపూర్వకమైన ప్రయత్నంతో నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యపై ఆంధ్రా విద్యార్థులకు విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు దాన్నే వైఎస్ జగన్ తన ఎన్నికల ఆయుధంగా మలుచుకున్నారు. ఆ ఆలోచనతోనే ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్లో పాఠ శాల విద్యా శకటాన్ని ప్రదర్శింపజేశారు. పాఠశాల విద్యలో కేంద్రం లేదా రాష్ట్రం ఏదైనా పెద్ద సానుకూల అడుగు వేసిందంటే తప్పనిసరిగా అభినందించాలి. దేశ భవిష్యత్తు అక్కడే ఉంది. సైద్ధాంతిక విభేదాలు ఏ విషయంలోనైనా ఉండవచ్చు, కానీ ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా నాణ్యమైన పాఠశాల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడంలో కచ్చితంగా విభేదాలు ఉండ కూడదు. అప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తుకు ఎదురుదెబ్బ తగ లదు. ఏ పిల్లవాడు అయినా రెండు భాషలను చాలా సులభంగా నేర్చు కోగలడు. మన విషయంలో అది ఇంగ్లిష్, పిల్లల ప్రాంతీయ భాష అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రా విద్యా నమూనాను అర్థం చేసుకుంటుందని, అభినందిస్తుందని ఎవరైనా ఆశిస్తారు. - వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
సీఎం జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే
ఏపీ ముఖ్యమంంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్కు ఇచ్చిన ఇంటర్వ్యూను గమనించారా? ఎంత అందంగా సాగింది! అందం అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే రాజ్ దీప్ ఆంగ్లంలో అడిగిన అన్ని ప్రశ్నలకు అందమైన ఆంగ్ల భాషలో చిరునవ్వుతో జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పడం విని సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు దేశ, విదేశాలలో తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఎదుటివారిని మెప్పించడం అంటే తేలికైన విషయం కాదు. అందులోను ప్రముఖ పాత్రికేయులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా తప్పులు దొర్లకుండా ఉండాలి. వినడానికి కూడా హాయిగా ఉంటుంది. అలా అని తెలుగును విస్మరించాలని ఎవరూ చెప్పడం లేదు. తెలుగు నేర్చుకుంటూనే ఆంగ్లం, హిందీ వంటి భాషలు అభ్యసిస్తే దేశంలోకాని, విదేశాలలోకాని ఎక్కడైనా సులువుగా ఉపాది అవకాశాలు పొందవచ్చు. జీవితం సాఫీగా సాగిపోతుంది. జగన్మోహన్రెడ్డి ఆంగ్ల మీడియంలో చదువుకోబట్టి దాని విలువను గుర్తుంచుకుని ఏపీలోని స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తేవడానికి యత్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చీరాని ఆంగ్లంలో మాట్లాడుతుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోవడం తప్పుకాదు. కాని భాష రాకపోయినా తాను పండితుడినే అనుకుని మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. పైకి ఏమీ అనకపోయినా, ఎదురుగా మాట్లాడకపోయినా, ఆ తర్వాత నవ్వుకుంటారు. దానివల్ల ఆయన నాయకత్వం వహించే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చిన్నతనంగా ఉంటుంది. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటనల సందర్భంగా ఆంగ్ల భాష పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారన్నది అర్ధం అవుతుంది. ఒక విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో సంబంధిత వీడియో వైరల్గా మారింది. బయటనుంచి వచ్చే ప్రముఖులకు తెలుగు రాదు. అందువల్ల వారు ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. దానిని మనం అర్ధం చేసుకుని సమాధానం ఇవ్వకపోతే సంభాషణ గందరగోళంగా మారుతుంది. అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తమకు వచ్చిన భాషలోనే మాట్లాడి అనువదించుకోవాలని చెప్పాలి. జగన్మోహన్రెడ్డికి ఆ ఇబ్బంది లేదు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో రాజ్ దీప్ సర్దేశాయి ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకు ఎక్కడా తడుముకోకుండా స్పష్టమైన జవాబులు ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఇదే రాజ్ దీప్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ప్రధాని మోదీని ఆయన తీవ్రంగా విమర్శించేవారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఏమి చెబుతున్నది అర్ధం చేసుకోవడానికి రాజ్ దీప్ కష్టపడవలసి వచ్చింది. మోడీని ఫలానా విధంగా విమర్శిస్తున్నారా? అని రాజ్ దీప్ మళ్లీ అడిగి తెలుసుకోవలసి వచ్చింది. తిరుపతిలో జగన్మోహన్రెడ్డి చక్కగా మాట్లాడారు. అందుకే ఎడ్యుకేషన్ సమ్మిట్ అంత నీట్గా జరిగింది. అంతేకాక రాజ్ దీప్తో పాటు ఇండియా టుడె ప్రతినిధి బృందం స్వయంగా తిరుపతిలో నాడు-నేడు కింద ఆధునీకరించిన కొన్ని స్కూళ్లను చూసి వచ్చారు. స్కూళ్లు మారిన తీరును గమనించి వారు ఆశ్చర్యపోయారు. స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మంచి మౌలిక వసతులు, స్టార్ హోటల్ స్థాయి టాయిలెట్లు, ఆంగ్ల మీడియం, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్కు చిన్నతనం నుంచే ట్రైనింగ్ వంటి విశేషాలు తెలుసుకుని ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు చేయడం ఎక్కడా చూడలేదని స్పష్టంగా చెప్పారు. ఇదే విధానం కొనసాగితే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు స్కూల్ డ్రెస్ల మొదలు, వారు తినే గోరుముద్ద వరకు ఎంత శ్రద్ద తీసుకుంటున్నది వివరించారు. పిల్లలకు చదువే సంపద అని తన ప్రభుత్వం నమ్ముతోందని, అందుకే ఈ విదమైన మార్పులు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటివారు తెలుగు మీడియంకు మద్దతుగా మాట్లాడుతున్నారు కదా అని రాజ్ దీప్ అడిగినప్పుడు జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం వద్దనేవారు తమ పిల్లలు, తమ మనుమళ్లు ఎక్కడ ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించుకోవాలని జవాబు ఇచ్చారు. ఏపీలో పుస్తకాలన్నిటిని రెండు భాషలలోను ముద్రించిన సంగతిని ఆయన వివరించారు. నిజంగానే వెంకయ్య నాయుడు కాని, చంద్రబాబు నాయుడు కాని, పవన్ కళ్యాణ్ కాని, రామోజీరావు కాని.. వీరెవ్వరూ తమ పిల్లలను, మనుమళ్లను తెలుగు మీడియంలో చదివించడం లేదు. కాని పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. దీనిపై బహుశా దేశంలో ఎక్కడా జరగనంత చర్చ ఏపీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా జగన్మోహన్రెడ్డి వివరించారు. ఇంత మార్పు జరుగుతుంటే సరైన ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారని రాజ్ దీప్ ప్రశ్నించడం విశేషం. ఇంతకాలం కేరళ రాష్ట్రం విద్యారంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఏపీలో క్రమేపి ఆ స్థానానికి చేరుకుంటోంది. ఈ మద్య తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక సెమినార్లో మాట్లాడుతూ ఏపీలో స్కూళ్లలో తీసుకువచ్చిన విశేషమైన సంస్కరణలు, ఆంగ్ల మీడియంలో బోధన వంటివాటి గురించి ప్రస్తావించి వీటిని కొనసాగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన అభినందిస్తూ ఒకవేళ అవి కొనసాగకపోతే ఏపీ వందేళ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. విద్యార్ధులంతా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పరోక్షంగా చెప్పారు. తాను ఇంతవరకు జగన్మోహన్రెడ్డిను కలవలేదని, కలవబోవడం లేదని, అయినా అక్కడ విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను గమనించి ఇలా వ్యాఖ్యానిస్తున్నానని కంచ ఐలయ్య అన్నారు. చంద్రబాబు కొడుకు, కోడలు, మనుమడు అంతా ఇంగ్లీష్లో చదవాలి కాని, దళిత, కమ్మరి, కుమ్మరి, కురుమ, మంగళి తదితర బీసీ వర్గాలు మాత్రం ఆంగ్లమాద్యమంలో చదువుకోరాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ తప్పనిసరిగా ఆంగ్ల బోధన ఉండాలని కోరుకున్నారని కూడా ఐలయ్య చెప్పారు. నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్రెడ్డి ఏపీలో చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే గుర్తింపు రావడం ఆరంభం అయింది. గత ఏడాది ఏపీ పిల్లలు అమెరికాకు వెళ్లడం, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడం వంటివి చేయడంతో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించింది. ఈ నేపధ్యంలో ఈ సమ్మిట్ జరగడం, ఏపీలో విద్యారంగంలో సాగుతున్న సమూల మార్పులకు మంచి ప్రాధాన్యం రావడం శుభపరిణామం అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
పేదరిక నిర్మూలన చదువు ద్వారానే సాధ్యం: సీఎం జగన్
-
అంతరాలపై 'విద్యా యుద్ధం' : సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. అది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలన్నదే మా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ఓ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు. పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి వారి గురించి ఎవరూ పట్టించుకోరని, ఇది దురదృష్టకరమని అన్నారు. అయితే పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే.. సమాజంలో దారిద్య్రం పోతుందని నొక్కి చెప్పారు. పది మంది నిరుపేద విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెరికాకు పంపించడమే కాకుండా వైట్హౌస్కు కూడా తీసుకెళ్లడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలు, పథకాలు చాలా ఆకర్షిస్తున్నాయని ఈ సందర్భంగా రాజ్దీప్ అభినందించారు. రాజ్దీప్, సీఎం వైఎస్ జగన్ మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి. రాజ్దీప్: నిజంగా ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం మధ్య ఉన్న గ్యాప్ను అంత సులభంగా మార్చగలరా? దానివల్ల పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాదా? సీఎం జగన్: గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతి ఒక్కటీ ఒక పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ఒక సమగ్ర విధానంలో కొనసాగుతోంది. ప్రతి పుస్తకాన్ని బైలింగ్యువల్.. అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రిస్తున్నాం. ఇంకా బైజూస్ కంటెంట్ను కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో అనూహ్య మార్పులు చేస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఆరో తరగతి నుంచి, ఆపై తరగతుల్లోని ప్రతి క్లాస్రూమ్లో ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్) ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు 62 వేల తరగతులు ఉండగా, ఇప్పటికే 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్పీలు ఏర్పాటు చేశాం. మిగిలిన తరగతి గదుల్లో వచ్చే నెల చివరి నాటికి ఐఎఫ్పీలు ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఆ విధంగా ఒక ప్రణాళికా బద్దంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పుల దిశలో పని చేస్తున్నాం. బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఐఎఫ్పీల ఏర్పాటు.. ఇలా వీటన్నింటి వల్ల ప్రాథమిక విద్యా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నే కాకుండా.. పిల్లలు 8వ తరగతిలోకి వచ్చే సరికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఇస్తున్నాం. రాజ్దీప్ సర్దేశాయ్ : విద్యా రంగంలో ఇంత మంచి చేస్తున్నా, ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటారు? సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు ఇక్కడి స్కూల్స్ సందర్శించి, అభివృద్ధి పనులు స్వయంగా చూడడం ఎంతో ఆనందంగా ఉంది. అందుకు మీకు అభినందనలు. ఇక్కడ మేము ఏయే పనులు చేశామనేది చెప్పుకోవడం కాకుండా, మీరు స్వయంగా చూడడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. రాజ్దీప్ : సాధారణంగా అన్ని ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలపై ఎక్కువగా వ్యయం చేయవనే విమర్శలు వినిపిస్తుంటాయి. అందుకు భిన్నంగా మీరు ఈ రెండు రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటిని అభివృద్ధి చేసి చూపించాలనుకుంటున్నారా? సీఎం జగన్ : పేదరిక నిర్మూలనకు నాణ్యతతో కూడిన విద్య అనేది కీలకమని నేను గట్టిగా నమ్ముతాను. విద్యా హక్కు అనేది ఇంకా నినాదంగా మిగలకూడదు. నాణ్యతతో కూడిన విద్య అనేది హక్కుగా మారాలి. నిరుపేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. నిరుపేద పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం, అది కూడా కేవలం తెలుగు మీడియంలోనే చదవడం.. మరోవైపు ధనికులైన పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదవడం సరికాదు. నిరుపేదలు, ధనికుల మధ్య కొనసాగుతున్న ఈ వ్యత్యాసం, తేడా తొలగాలి. ధనికుల మాదిరిగా నిరుపేద పిల్లలు కూడా చదవాలి. వారికి ఆ విధంగా విద్యను అందించాలి. ఆ ఆలోచన నుంచి వచ్చినవే ఈ మార్పులు. మా ప్రభుత్వం ఆ దిశలోనే పని చేస్తోంది. నిరుపేద పిల్లలకు కూడా అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగాలి. రాజ్దీప్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన, మూడో తరగతి నుంచే గ్లోబల్ విద్య, టోఫెల్లో శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి నేత కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్: ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తున్నారని విమర్శలు చేస్తున్న వారందరినీ నేను ఒక్కటే అడుగుతున్నాను. వారి పిల్లలు, వారి మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు? వారిని తెలుగు మీడియం స్కూళ్లకే పంపిస్తున్నారా? అదే నా సూటి ప్రశ్న. ఇంగ్లిష్ మీడియం వైపు నా చొరవను ప్రశ్నించే ముందు.. ముందుగా నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రాజ్దీప్ : 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి మీరు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఇచ్చారు. ఇకపై కూడా ఇది కొనసాగుతుందా? సీఎం జగన్: రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతి పిల్లలందరి వద్ద ట్యాబ్లు ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు సందర్భంగా నేను స్వయంగా స్కూళ్లకు వెళ్లి, పిల్లలకు ట్యాబ్లు ఇస్తున్నాను. అది నాకెంతో ఇష్టం, సంతోషం కలిగిస్తోంది. ఇది ప్రతి ఏటా కొనసాగుతుంది. రాజ్దీప్: ప్రభుత్వ యంత్రాంగంలో ఏదీ అంత త్వరగా మారదు, ఇది అందరికీ తెలుసు. కానీ కేవలం పెద్ద నగరాల్లోనే ప్రతిష్టాత్మక స్కూళ్లలో ఉన్న ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ను మీరు తీసుకువస్తున్నారు. దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది? సీఎం జగన్: రాష్ట్రంలో ఐబీ సిలబస్కు సంబంధించి ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్)తో ఈ నెల 31న ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. తొలి ఏడాది.. అంటే 2024–25 విద్యా సంవత్సరంలో కేవలం టీచర్ల సామర్థ్యం పెంపుపైనే పనిచేస్తాం. తర్వాత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఏడాది.. ఫస్ట్ క్లాస్తో మొదలు ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు చేస్తాం. ఆ విధంగా 10 ఏళ్లలో.. అంటే 2035లో ఇక్కడి ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు, పదో తరగతిని ఐబీ సిలబస్తో పూర్తి చేస్తారు. ఆ సిలబస్తోనే పరీక్ష రాస్తారు. వారికి ఐబీ సర్టిఫికెట్ కూడా వస్తుంది. దీనివల్ల వారు ప్రపంచంలో పోటీని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. నాణ్యతతో (క్వాలిటీ) కూడిన విద్య లేకపోతే మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడలేరు. వారు జీవితంలో ఎదగలేరు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే వారు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంతో పోటీ పడగలరు. అయితే ఈ అవకాశం కేవలం ధనికుల పిల్లలు.. ప్రైవేటు స్కూళ్లలో చదువుకున్న వారికే కాకుండా, నిరుపేద పిల్లలకు కూడా ఉండాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది. రాజ్దీప్: మీరు ఆశిస్తున్నట్లు ఆ పిల్లలను ఆ స్థాయిలో తీర్చి దిద్దేలా టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం ఉందా? సీఎం జగన్: ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో కలిసి పని చేస్తున్నాయి. వారు మాతో కలిసి పనిచేసేలా ఐబీ డైరెక్టర్ జనరల్తో నేను స్వయంగా మాట్లాడాను. వారు రాష్ట్ర ఎస్సీఈఆర్టీతో ఒప్పందం చేసుకుని, వారితో భాగస్వామ్యం అయ్యాక.. మాతో పూర్తి స్థాయిలో కలిసి పని చేస్తారు. వారు ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారికంగా ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఇక్కడ వారి భాగస్వామ్యం వస్తుంది కాబట్టి మేము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా 2035 నాటికి మా పిల్లలు (గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు) 10వ తరగతి పరీక్షలు ఐబీ సిలబస్లో రాస్తారు. తొలి ఏడాది టీచర్ల నైపుణ్యం, సామర్థ్యం పెంచుతాం. ఆ తర్వాత ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టి, ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో ఐబీ సిలబస్ ప్రారంభించి, ఆ పిల్లలు 10వ తరగతి చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రాజ్దీప్: ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది కదా? అందుకు తగిన నిధులు ఉన్నాయా? సీఎం జగన్: ఇది ప్రభుత్వ ప్రాజెక్టు, మా లక్ష్యం ఏమిటన్నది ఐబీకి కూడా స్పష్టంగా తెలుసు. అందుకే వారు మాతో భాగస్వామ్యం అవుతున్నారు. అందుకే వారు వ్యాపార ధోరణితో కాకుండా, మా లక్ష్య సాధనలో మాతో కలిసి పని చేస్తున్నారు. ఆ మేరకే అవగాహనకు వచ్చాం. అందుకే ఖరీదైన స్కూళ్ల మాదిరిగా, మేము ఐబీకి రాయల్టీ వంటివి చెల్లించడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఐబీ సిలబస్తో చదివి పోటీ ప్రపంచంలో దీటుగా నిలబడాలన్న మా ప్రభుత్వ లక్ష్య సాధనలో, ఐబీ కూడా పూర్తి భాగస్వామి అవుతోంది. ఇక నిధులకు సంబంధించి చూస్తే.. ఇప్పటికే స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన మొదలైంది. మొత్తం రూ.14 వేల కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే రూ.8,300 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో 44 వేల స్కూళ్లు ఉండగా, నాడు–నేడు తొలి దశలో ఇప్పటికే 15,575 స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించాం. నాడు–నేడు రెండో దశలో 16 వేలకు పైగా స్కూళ్లలో పనులు సాగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి ఆ పనులు పూర్తవుతాయి. దీంతో రాష్ట్రంలో రెండో వంతు స్కూళ్లలో పూర్తి మౌలిక వసతులు ఏర్పడతాయి. మిగిలిన స్కూళ్లలో వచ్చే ఏడాదిలో పనులు చేపట్టి పూర్తి చేస్తాం. రాజ్దీప్: 2018లో రాష్ట్రంలో ప్రాథమిక విద్యా రంగంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 84.48 శాతం ఉండగా.. అప్పుడు జాతీయ స్థాయి సగటు జీఈఆర్ 99.21 శాతం ఉంది. ఇప్పటి పరిస్థితి ఏమిటి? మీ పిల్లల డ్రాపవుట్స్ తగ్గకుండా ఏం చర్యలు తీసుకున్నారు? సీఎం జగన్ : అప్పట్లో జీఈఆర్లో మా రాష్ట్రంలో దేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. 29 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు ఏడింటిలో చూస్తే.. మా రాష్ట్రం జీఈఆర్లో దారుణంగా 32వ స్థానంలో ఉండింది. అలాంటి పరిస్థితుల్లో అన్ని కోణాల్లో ఆలోచించి, వినూత్న చర్యలు మొదలుపెట్టాం. పిల్లలు స్కూళ్లకు ఎందుకు వెళ్లడం లేదన్న కారణాలు తెలుసుకున్నాం. ఆ దిశలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాం. అందులో కీలకమైంది మధ్యాహ్న భోజనం. దాన్ని సమూలంగా మారుస్తూ.. రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తూ గోరుముద్ద అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా.. తల్లిదండ్రులు వారి పిల్లలను బడులకు పంపేలా ప్రోత్రహిస్తున్నాం. ఫలితంగా జీఈఆర్ను వంద శాతానికి తీసుకెళ్లాం. రాజ్దీప్: తమిళనాడులో పిల్లలకు మ్యాంగో షేక్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు వారంలో ప్రతి రోజూ ఒక్కో మెనూతో పథకం అమలు చేస్తున్నామంటున్నారు. ఇది నిజమా? మా రిపోర్టర్లు స్కూళ్లకు వెళ్లి చెక్ చేయొచ్చా? సీఎం జగన్: నిరభ్యరంతంగా వెళ్లొచ్చు. ఎక్కడికైనా వెళ్లి చూడొచ్చు. గోరుముద్దలో ఏమేం ఇస్తున్నామో చూడొచ్చు. అదేవిధంగా పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తున్నాం. నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్స్, 6వ తరగతి నుంచి క్లాస్రూమ్లో ఐఎఫ్పీ ప్యానెల్స్, పిల్లలకు పరిశుభ్రమైన మంచినీరు, స్కూళ్లకు అవసరమైన మరమ్మతులు, పెయింటింగ్.. ఇలా 10 రకాల మార్పులు చేస్తున్నాం. రాజ్దీప్: ఇది రాష్ట్రంలో ప్రతిచోటా అమలవుతోందా? సీఎం జగన్: ఇక్కడ మానిటరింగ్ వ్యవస్థ పక్కాగా ఉంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మాత్రమే కాకుండా.. నా స్థాయిలో నేను కూడా స్వయంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాను. సీఎం స్థాయిలో ఈ ప్రక్రియలో పాలుపంచుకుని, పనిచేస్తున్నప్పుడు.. మిగిలిన యంత్రాంగం కూడా ఎలా పనిచేస్తుందో తెలుసు కదా? రాజ్దీప్: విద్య అనేది ఉద్యోగ, ఉపాధి కల్పన దిశలో ఉండాలనేది కూడా ఒక సవాల్. ఈ పరిస్థితిని మీరెలా మార్చగలుగుతారు? సీఎం జగన్: రాష్ట్రంలో మా ఫోకస్ కేవలం స్కూళ్ల మీదనే కాదు.. ఉన్నత విద్యా రంగంలో కూడా చాలా మార్పులు చేశాం. ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా కరికులమ్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశాం. వేసవి సెలవులు కూడా ఉపయోగించుకుని, ఇంటర్న్షిప్ చేసేలా అవకాశం కల్పిస్తున్నాం. అన్ని డిగ్రీ కోర్సులను అనర్స్గా మార్చి, నాలుగేళ్లు చేస్తున్నాం. కరికులమ్లో భాగంగా ఆన్లైన్ వర్టికల్స్ ప్రారంభిస్తున్నాం. ఇంటర్న్షిప్, కరిక్యులమ్లో మార్పులు.. ఇవన్నీ కూడా మా లక్ష్య సాధనకు మార్గం వేస్తున్నాయి. ఎడెక్స్తో కూడా వచ్చే నెలలో ఒప్పందం చేసుకోబోతున్నాం. మనకు 1800 సబ్జెక్టŠస్ ఉన్నాయి. ఈ కోర్సులు అందించడం కోసం ఎడెక్స్తో ఒప్పందం చేసుకోబోతున్నాం. కరికులమ్ను కూడా మారుస్తున్నాం. హార్వర్డ్, ఎల్లెస్సీ వంటి ప్రీమియమ్ సంస్థలను ఎడెక్స్ ద్వారా కోర్సులను ఆన్లైన్లో ఆఫర్ చేసేలా చర్యలు చేపడుతున్నాం. రాజ్దీప్: దానికి సంబంధించి ఉదాహరణ చెప్పగలరా? సీఎం జగన్: ఉదాహరణకు.. బికామ్ కోర్సు తీసుకోండి. ఆ కోర్సు విద్యార్థులు కూడా ఎసెట్ మేనేజ్మెంట్ తదితర అంశాలు నేర్చుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నాం. అవన్నీ పాఠ్య ప్రణాళికలో భాగం చేస్తున్నాం. పశ్చిమ దేశాల్లో మాత్రమే కనిపించే అంశాలను, ఇక్కడ కరికులమ్లో చేరుస్తూ.. పిల్లలను ఆ స్థాయిలో తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నాం. ఎడెక్స్ ఒప్పందం ద్వారా ఆన్లైన్ విద్యాబోధన ద్వారా.. ప్రతిష్టాత్మకమైన ఎల్లెసీ, హార్వర్డ్ సంస్థలు.. సర్టిఫికెట్ ఇస్తాయి. ఇది మా పిల్లలకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుంది. రాజ్దీప్: ఇక్కడ సీఎం జగన్ అక్షరాస్యత వృద్ధి కోసం ఎంతో చేస్తున్నారు. విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇవన్నీ మిమ్మల్ని ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తాయని అనుకుంటున్నారా? సీఎం జగన్: రాజకీయాలు వేరు. పిల్లలు, విద్యార్థులు ఓటర్లు కారు కాబట్టి, వారి గురించి ఎవరూ పట్టించుకోరు. ఇది దురదృష్టకరం. అయితే పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే.. సమాజంలో పేదరికం పోతుంది. పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే.. వచ్చే 10, 15 ఏళ్లలో వారు ఎంతో వృద్ధి చెందుతారు. తద్వారా సమాజం కూడా మారుతుంది. పిల్లలకు ఈ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తే వారు పోటీ ప్రపంచంలో ధైర్యంగా నిలబడగలరు. ప్రపంచ స్థాయిలో పోటీ ఎదుర్కోగలరు. రాజ్దీప్: మీ స్పష్టమైన విజన్ను అందరూ అభినందించాల్సిందే. మీ విజన్ సఫలమైతే విద్యా రంగంలో మీరు ఆంధ్రా మోడల్ను అవిష్కరించిన వారవుతారు. (అందరూ చప్పట్లతో అభినందించారు) -
అభివృద్ధిలో సరికొత్త నమూనా
భారత్లోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రపంచ మార్కెట్ వ్యవస్థలకు అనుసంధానించడంలో విద్యదే కీలక పాత్ర. ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా జగన్ దీన్ని సాధ్యం చేశారు: 1. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. 2. పాఠశాల మౌలిక సదుపాయాలు, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి వనరులను ఖర్చు చేయడం. దాని భవిష్యత్తు ప్రభావాన్ని దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. 2024 సాధారణ ఎన్నికలకు ముందు భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక, పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే నాలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని మునుపెన్నడూ ఊహించని పథంలోకి మార్చింది. సాధారణంగా అభివృద్ధి అంటే... ఎత్తయిన భవనాలు, మంచి రోడ్లు వంటి పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి విధానాలను రూపొందించడమే అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో బడ్జెట్ నిధులను పెద్ద కాంట్రాక్ట్ నిర్మాణాలకు వెచ్చిస్తాయి. ప్రపంచీకరణ యుగంలో నయా ఉదార వాద ఆర్థికవేత్తలు అలాంటి ఖర్చును మంచి అభివృద్ధిగా పరిగణి స్తారు. ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నమూనానే అనుసరిస్తోంది. సోషలిస్ట్ ఎకానమీ నుండి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపునకు మారిన చైనా కూడా ఇదే నమూనాను అవలంబించింది. వీటితో పోలిస్తే భారతీయ కుల అసమానతలకు కాస్త భిన్నమైన విధానం అవసరం. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ, దాని అసాధారణమైన కుల అడ్డంకులు ప్రజల కేంద్రిత అభివృద్ధికి అనేక అవరోధాలను సృష్టించాయి. రెండవది, భారతీయ గ్రామాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వ్యవసాయాభివృద్ధి పూర్తిగా వ్యవసా యాన్ని పెట్టుబడిగా మార్చే దశకు చేరుకోలేదు. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రజలను జాతీయ, ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానించడంలో వారి విద్యే కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి... గ్రామీణ పిల్లలకు, యువతకు విద్యను అందించడానికి ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభు త్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఐదేళ్లలో తన బడ్జెట్లో ఎక్కువ భాగం గ్రామీణ విద్యా మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ స్కిల్స్ను నిర్మించడం కోసం కేటాయించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గత పదేళ్లలో టీడీపీ, వైఎస్సా ర్సీపీ ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలను ఎలా ఎంచుకున్నాయో చూడాలి. టీడీపీ ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న 30,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని, రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం అమరావతిని నిర్మించేందుకు కేటాయించడా నికి సిద్ధమైంది. పెద్ద నగరాలు మాత్రమే పెట్టుబడులు తెస్తాయనీ, వెలుపలి నుంచి వచ్చే పెట్టుబడితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది నయా ఉదారవాద ఆర్థిక ఆలోచన. ఇది భారీ స్థాయి పెట్టుబడులతో కూడిన సిటీ మాల్ మార్కెట్లలోకి విస్తారమైన గ్రామీణ ప్రజలను తీసుకోలేదు. అందుకే, ధనవంతుల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పాఠశాల విద్యతో సరిపోయే పాఠశాల వ్యవస్థలో వారిని విద్యావంతులను చేయాలి. ఆ ప్రైవేట్ పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలో కొనసాగాలి. గ్రామీణ వ్యవసాయాధారిత పిల్లలకు ప్రభుత్వ రంగంలో ఇలాంటి విద్యను అందించకపోతే వారు రాష్ట్ర, జాతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చేరలేరు. విప్లవాత్మక అభివృద్ధి నమూనా భారీ మల్టీ లేన్ రోడ్లు, పెద్ద విమానాశ్రయాలు, ఓడరేవులతో కూడిన ‘హైవే ఎకానమీ’, ప్రభుత్వ రంగ పరిశ్రమలను భారీగా ప్రైవేటీకరించడం ఆర్ఎస్ఎస్ దృక్పథానికి బాగా సరిపోతుందని మితవాద ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆరెస్సెస్కి సంబంధించిన ఈ ఆధునిక ఆలోచన పురాతనమైన మధ్యయుగ వర్ణ ధర్మ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంది. ఆ వ్యవస్థలో శూద్ర ఉత్పాదక ప్రజానీకానికి ఆస్తులపై యాజమాన్యం ఉండకూడదు. ఈ నమూనాతో చంద్రబాబు శ్రుతిమించి పోయారు. వైఎస్ జగన్ మాత్రం అభివృద్ధి నమూనానే మార్చేశారు. దీన్ని నేను శూద్ర అభివృద్ధి నమూనా అని పిలుస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా అన్ని కులాలు, కార్మిక వర్గాలను కలిగి ఉన్న వ్యవసాయ, చేతివృత్తుల ఉత్పాదక ప్రజానీకానికి ఉద్దేశించినదని సూచించడానికి నేను శూద్ర అనే చారిత్రక పదాన్ని ఉపయోగిస్తున్నాను. మొత్తం వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పాదక ప్రజానీకంలో (ఆదివాసీ, దళిత వర్గాలు, రిజర్వుడ్ శూద్ర ఓబీసీలు, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్రిజర్వుడ్ శూద్రులు అందరూ ఇందులో ఉంటారు) నైపుణ్యాలు, వనరుల పునాదిని తప్పనిసరిగా మార్చాలని వైఎస్ జగన్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడిని పాఠశాల, కళాశాల విద్య, గ్రామ పరిపాలనలోకి మార్చడం ద్వారా ఈ పరివర్తన సాధ్యమవుతుంది. వైఎస్ జగన్ రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా ఇదంతా సాధ్యం చేశారు: 1) ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. ఇది నైపుణ్యం, జ్ఞానం రెండింటిలోనూ గ్రామాన్ని ప్రపంచంతో కలుపుతుంది. విద్యా ఖర్చుల కోసం డబ్బును బదిలీ చేయడం ద్వారా పాఠశాల, కళాశాల పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడాన్ని కూడా దీనికి జోడించారు. 2) పాఠశాల మౌలిక సదుపాయాలను, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి రాష్ట్ర అభివృద్ధి వనరులను ఖర్చు చేయడం. ప్రధాన వ్యాపారాలు లేని, శ్రమతో పని చేసే సాంప్రదాయ శూద్రులందరికీ ఈ నమూనాలో కొత్త నైపుణ్యాలు, ప్రపంచ భాషతో వ్యవహరించడానికి ప్రవేశం లభిస్తుంది. దాని భవిష్యత్తు ప్రభావాన్ని ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా. పెట్టుబడుల కేంద్ర మార్పు ఈ నమూనా... పెట్టుబడిని కేంద్రీకృత పట్టణ రంగాల నుండి వైవిధ్యమైన గ్రామీణ సమాజాలకు మారుస్తుంది. ఇది పట్టణ బ్యాంకుల్లోని డబ్బు నిల్వలను గ్రామీణ మార్కెట్లకు తరలిస్తుంది. ఇది విస్తారమైన గ్రామీణ ప్రజల ఆరోగ్యం, వ్యయం, ఉత్పత్తి, విజ్ఞాన పునాదిని మెరుగుపరుస్తుంది. మొత్తంగా సంపద కేంద్రీకరణను పట్టణ ధనవంతుల నుండి విస్తారమైన గ్రామీణ ప్రజానీకానికి బదలా యిస్తుంది. ఈ పెట్టుబడి ఉచితాల కిందికి రాదు. ఇది భవిష్యత్ విప్లవా నికి సంబంధించిన పెట్టుబడి. సాధారణంగా విప్లవం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు కూడా భారతీయ కుల–సాంస్కృతిక సమాజంలో విప్లవం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. బెంగాల్లో వారి 34 ఏళ్ల పాలన గ్రామీణ ప్రజానీకాన్ని ప్రపంచీకరణ ప్రక్రియతోనూ, ఆంగ్ల విద్యతోనూ ముడిపెట్టకుండా ఎలా దూరంగా ఉంచిందో నిరూపించింది. ఈ విప్లవం భారతదేశ అభివృద్ధిపై రెండు ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంది. చారిత్రాత్మకంగా జ్ఞాన వ్యవస్థను నియంత్రిస్తున్నందున సంపద మొత్తంగా ద్విజ సంఘాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. పురాతన కాలంలో ఇది సంపదను, సంస్కృత భాషను నియంత్రించింది. మధ్యయుగ కాలంలో ద్విజులు ముస్లిం పాలకులతో కలిసి సంపదను, పర్షియన్ భాషను నియంత్రించారు. గత 75 ఏళ్లుగా వారు సంపదను, ఆంగ్ల భాష ఆధారిత జ్ఞానాన్ని నియంత్రించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యపై దృష్టి సారించడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం సంపదను, విజ్ఞానాన్ని వ్యవసాయ, చేతివృత్తుల వారి చేతుల్లోకి తెచ్చింది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
AP: చక్కదిద్దారు!
బ్లాక్ బోర్డుపై రాసేందుకు నాలుగు సుద్ధ ముక్కల కోసం కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్లు, ఐఎఫ్పీ స్క్రీన్స్, స్మార్ట్ టీవీలతో మన ప్రభుత్వ స్కూళ్లు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. పగిలిన గోడలు.. పెచ్చులూడే శ్లాబులు.. చెట్ల కింద వానాకాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. నాలుగంటే నాలుగేళ్లలోనే సాకారమైన మార్పులు ఇవన్నీ! సాక్షి, అమరావతి: చదువుకునేందుకు లక్షలు ధారపోయాల్సిన పరిస్థితి నుంచి పిల్లలు సర్కారు బడికొస్తే చాలు ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రోత్సహిస్తోందీ వైఎస్ జగన్ ప్రభుత్వం. మనసుంటే మార్పు వచ్చి తీరుతుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణల బాటతో మన విద్యా వ్యవస్థ 2019కి ముందు.. ఆ తర్వాత అని దేశమంతా చర్చించుకునేలా చేశారు. విద్యారంగంపై వెచ్చిస్తున్న వ్యయాన్ని భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పెట్టు పెట్టుబడిగా దృఢంగా విశ్వసించారు. కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ బోధన బాట పట్టించారు. అక్షరానికి అగ్రాసనం వేస్తూ పేదింటి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. నాడు – నేడు ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమైంది. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి సంతృప్తిగా భుజించేలా రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నారు. ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్ల బడ్జెట్ను పిల్లల భోజనం కోసం కేటాయించింది. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు, మూడు రోజులు రాగిజావ, బెల్లం చిక్కీను అందచేస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను అత్యుత్తమ చర్యగా విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. సర్కారు స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే టోఫెల్ శిక్షణతో పాటు 2025–26 నుంచి ఐబీ సిలబస్ను సైతం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ.71 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్య సంస్కరణలను అమలు చేసింది. ‘మనబడి నాడు–నేడు’ ద్వారా మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులను సమకూర్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా మారుస్తూ నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20లోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది. నవరత్నాలు పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి 2022–23 వరకు రూ.25,809.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యా రంగ సంస్కరణల కొనసాగింపు, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివి ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. సదుపాయాలు.. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు ద్వారా శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 సదుపాయాలను కల్పించింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించారు. రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు వడివడిగా చేపట్టారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 33 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. దేశంలో 25 వేల ఐఎఫ్పీలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో విప్లవంగా నిలిచిపోయింది. డిజిటల్ శకం.. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ కంటెంట్ ఉచితంగా అందించేందుకు అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందిస్తుండడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ లాంటి వాటి ద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది. సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంతో అవసరం. అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం టోఫెల్ శిక్షణ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ బోధన అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాల సంస్కరణ.. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. మూస పద్ధతిలో ఉన్న పాఠాలను 2020–21 నుంచి సమూలంగా మార్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను అమలు చేస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలలను ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలుగా మార్చింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాన్ని తీర్చేలా భారీగా పదోన్నతులు కల్పించారు. బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణనిచ్చింది. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ.. మండలానికో కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను ప్రారంభించింది. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీపై శిక్షణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ లాంటి పది విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆర్టీ, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమిస్తున్నారు. ఐబీ దిశగా అడుగులు.. ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’ అన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధన ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఐబీ’ బోధనను ప్రభుత్వ స్కూళల్లోకి తెచ్చి పేద పిల్లలకు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేశారు. 2025 – 26 నుంచి ఐబీ బోధన ప్రవేశపెట్టి ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుతూ + 2 వరకు అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలకు సాన పెట్టడంతోపాటు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్థాయిలో ఉద్యోగాలుయ పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే ఇన్ని అద్భుతమైన సంస్కరణలు తవిద్యారంగంలో తేవడం చరిత్రాత్మకమని, ఇది ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా సాధికారత.. స్కూళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో పాటు ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాదులను నిర్మిస్తోంది. ఇప్పడు మన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉత్తమ విద్యతో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం సాధ్యమేనని బలంగా నమ్ముతున్నా. – ప్రొఫెసర్ కె.శ్రీరామమూర్తి, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తారు.. గతంలో నేను ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు పుస్తకాలు, యూనిఫారం లాంటివి డొనేట్ చేసేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక నోటు పుస్తకాల నుంచి యూనిఫారం, బూట్లు వరకు ఆ అవసరం లేకుండా అన్నీ ఉచితంగా అందిస్తోంది. స్వేచ్ఛ న్యాప్కిన్స్ ఇస్తున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. పిల్లలకు నేర్పే విధానం, నేర్చుకునే విధానం సంపూర్ణంగా మారింది. ప్రభుత్వ విద్యలో ఇదో గొప్ప సంస్కరణ. కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇన్ని వసతులు లేవు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు మరో 10 ఏళ్లలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. – డాక్టర్ రాజశేఖర్, గైనకాలజిస్ట్, కర్నూలు ఆ ఇబ్బందులు తొలగించారు.. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు లేకపోవడం బాలికలకు అతి పెద్ద సమస్య. ఈ ప్రభుత్వం ఆ సమస్యను దూరం చేసింది. బాలికలకు స్వేచ్ఛ పేరుతో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. నాడు–నేడుతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ శిక్షణ, రక్తహీనత నివారణకు బెల్లం చిక్కీతో పాటు ఐరన్ మాత్రలు ఇవ్వడం ప్రశంసనీయం. – వడిశెట్టి గాయత్రి, పీజీ లెక్చరర్, పిఠాపురం -
AP: ప్రభుత్వ చదువులకు సలాం
► ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం. – ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ► ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు అద్భుతంగా ఉంది. – సంజయ్ కుమార్, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి ► ఏపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి) ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందజేయడం గొప్ప పరిణామం. మనబడి నాడు–నేడు పథకాన్ని మా రాష్ట్రంలోనూ అమలు చేస్తాం. – నవీన్ జైన్, విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ..ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను కొనియాడుతున్నారు. విద్యా రంగంలో ఏపీనే తమకు ఆదర్శమని ఎలుగెత్తి చాటుతున్నారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన విద్యా విధానాలను వారి రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన ప్రభుత్వ విద్యా సంస్కరణలను కొనియాడారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు, సీబీఎస్ఈ విద్యా విధానం, ఇంగ్లిష్ మీడియం బోధన, బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీని తెలుసుకుని అభినందించారు. ఈ పథకాలతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే కాదు.. వాటిని కళ్లారా చూస్తున్న తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ చదువులకు సలాం కొడుతున్నారు. పేదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగిపోరాదని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లల్లో విద్యా సంస్కరణలకు ఏకంగా రూ.71,017 కోట్లు ఖర్చు చేశారు. ఫలితంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా తమ రూపురేఖలు మార్చుకున్నాయి. వాటిలో సకల వసతులు వచ్చి చేరాయి. దీంతో 43 లక్షల మంది పేదింటి విద్యార్థుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. – సాక్షి, అమరావతి కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ బడి ప్రభుత్వం మనబడి నాడు–నేడు కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాల సౌకర్యాలు కల్పించింది. నాడు–నేడు కింద మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. పనులు పూర్తయిన వాటిల్లో హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టింది. రెండు విడతల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో 9,52,925 ట్యాబ్లను అందించింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో జరిగిన రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షల్లో 93% మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వీరిలో 39 లక్షల మందికి పైగా ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తుండడం విశేషం. మరోవైపు బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి చేర్పించేందుకు, వారి చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కింద నగదు జమ చేస్తోంది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది ఒకటి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరారు. అలాగే గత విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించింది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. గతంలో ఇన్ని సదుపాయాలు లేవు.. ప్రభుత్వ బడుల్లో ఇన్ని సదుపాయాలు, విద్యా సంస్కరణలు గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ను సైతం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. మా పెద్దమ్మాయి అరుణ కేజీబీవీలో పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతోంది. చిన్నమ్మాయి చైత్ర ప్రణవి ప్రభుత్వ బడిలోనే తొమ్మిదో తరగతి సీబీఎస్ఈ సిలబస్లో విద్యనభ్యసిస్తోంది. ఇంత ఉత్తమ చదువులు నాలాంటి సామాన్యులకు అందుకోవడం గతంలో సాధ్యమయ్యేది కాదు. కానీ పేద, మధ్య తరగతి పిల్లల చదువుల భారం పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటోంది. ఇప్పుడు ప్రైవేటు కంటే ప్రభుత్వ స్కూళ్లే అద్భుతంగా ఉన్నాయి. – రుత్తల పాపయ్య, అల్లిపూడి, కాకినాడ జిల్లా ఇలాంటి గొప్ప చదువులు మాకు వరం అటవీ ప్రాంతమైన మా సీలేరు గ్రామం ఇంగ్లిష్ చదువులకు చాలా దూరం. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వచ్చింది. ఇప్పుడు సీలేరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెబుతున్నారు. వచ్చే ఏడాది పదో తరగతి కూడా ఇంగ్లిష్లోనే ఉంటుందన్నారు. నా కూతురు జ్యోత్స ్న స్థానిక జెడ్పీ స్కూల్లో 9వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతోంది. ఇప్పుడు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతోంది. ఇది మాకెంతో గర్వంగా ఉంది. ఇలాంటి గొప్ప చదువులు మాలాంటి వారికి వరం. – పెయ్యల సింహాద్రి, సీలేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పౌష్టికాహారం.. గోరుముద్ద ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే గొప్ప ఆలోచనతో 2020, జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నం మాత్రమే పెట్టేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు వారానికి 16 రకాల ఐటెమ్స్తోపాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో భోజనం పెడుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో విద్యార్థులకు వేడిగా రుచి, శుచితో పోషకాహారాన్ని అందిస్తోంది. అలాగే వారిలో రక్తహీనతను అరికట్టడానికి వారంలో 3 రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డును తప్పనిసరి చేసింది. ఎలా వండితే నచ్చుతుందో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని ఆ మేరకు వంటలో మార్పులు సైతం చేశారు. పర్యవేక్షణ కోసం ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ (ఐఎంఎంఎస్)’ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన రూ.450 కోట్లు ఖర్చు కంటే ఇది నాలుగు రెట్లు అధికం. ప్రభుత్వ బడులకు ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. రక్తహీనతను అరికట్టేందుకు మాత్రలూ ఇస్తున్నారు. -
అది పేపరా.. పట్టిన పీడా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలోనేమో ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఉండొచ్చు! స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు! కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం అవి ఉండకూడదా? ఇది సరైన పోకడేనా?’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరంతా ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ‘పేద పిల్లలకు ట్యాబ్లు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా అంటున్నారు. ట్యాబ్లు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు. మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలపై తప్పుడు రాతలు రాస్తున్నారు. ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబ్లు ఇవ్వొద్దని ప్రతి రోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గురువారం అల్లూరి జిల్లా చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. దిక్కుమాలిన మాటలు.. ‘‘మీ పిల్లల చేతుల్లో ఇవన్నీ ఉంటే చెడిపోరుగానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబ్లు, ల్యాప్టాపులు, స్మార్ట్ ఫోన్లు ఉంటే చెడిపోతారా? మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి! పేద పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియం బడులకు వెళ్లకూడదు..! ఇంగ్లిషులో చదవకూడదా? పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట! కానీ వాళ్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలట! ఇది ధర్మమేనా? ఆలోచన చేయండి. దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు’’ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలపై కడుపు మంట.. ‘‘జగన్ బర్త్డే బహుమతి.. చెడగొడుతోంది మతి! గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్’ అని ఈనాడులో కథనాలు రాశారు. ఇది పేపరా..! పేపరుకు పట్టిన పీడా?’’ అని సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి పేపర్ను చదవొచ్చా? అని ప్రశ్నిస్తూ ఈనాడు పత్రికని నేలకేసి కొట్టారు. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్ధించే రాజకీయ పార్టీలకు ఒకటే చెబుతున్నా. ఇంతగా దిగజారి రాతలు రాయకండి.. ఇంతగా దిగజారి మాట్లాడకండి అని చెబుతున్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెబుతున్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపు మంట వద్దండీ! అని చెబుతున్నా. ఈరోజు మీరంతా అన్నీ చూస్తున్నారు. ఒకవైపు జగన్ ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పుల పాలై పోయిందని రాస్తారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో, ఆరు గ్యారంటీలు అంటూ పతాక శీర్షికల్లో ప్రచురిస్తారు. జగన్ ఇచ్చే వాటికన్నా వాళ్లు చెబుతున్నవి మూడింతలు ఎక్కువ. 2014 – 19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అప్పుడూ ఉన్నారు. రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారు. పొదుపు సంఘాల మహిళలను దగా చేశారు. ఇంటికో జాబ్ లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి అంటూ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదు. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, రైతులు, పిల్లలు.. ఇలా ఎవరినీ వదలకుండా మోసం చేశారు. ఎంత దారుణమంటే ప్రజలు కొడతారేమోననే భయంతో చివరకు మేనిఫెస్టోను సైతం మాయం చేశారు. నాడు అసాధ్యం.. నేడు ఎలా సాధ్యమైంది? ఈ రోజు మీ బిడ్డ 99.5 శాతం వాగ్దానాలను అమలు చేశాడు. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? గతంలో పరిపాలన చేసిన వాళ్లు మీ బిడ్డలా ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే.. అప్పట్లో ఓ గజదొంగల ముఠా పరిపాలన చేసింది కాబట్టే! ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, జన్మభూమి కమిటీల నుంచి మొదలుపెడితే ఇసుక, మద్యం, స్కిల్ స్కామ్, పైబర్ గ్రిడ్ దాకా ఏది చూసినా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే. ఇక అప్పుల గురించి విమర్శలు చేస్తున్నారు. గత సర్కారు హయాంతో పోలిస్తే అప్పుల పెరుగుదల ఇవాళ తక్కువగానే ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు. ఎవరైతే మీకు మంచి చేశారో వారిని గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ల ముందు నిలబడి మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాడు. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా, అండగా నిలబడండి. ప్రజలంతా మీ వెంటే.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన మన సీఎంకు ధన్యవాదాలు. గిరిజన ప్రాంత ప్రజలకు కనీస అవసరాలు తీరుస్తూ మన గిరిజన హక్కులు కాపాడుతున్న మన అభినవ అల్లూరి జగనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ విజనరీ లీడర్షిప్లో విద్యా రంగానికి మీరు ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు కూడా పోటీ పడాలని మీరు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మా గిరిజనులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. చంద్రబాబు బాక్సైట్ జీవో 97 తీసుకువస్తే, మీరు గిరిజనుల పక్షాన నిలబడి అధికారంలోకి రాగానే రద్దు చేశారు. నాడు వైఎస్సార్ హయాంలో అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే.. నేడు మన జగనన్న ఒక్క పాడేరు నియోజకవర్గంలోనే 1,13,000 మందికి 2,27,000 ఎకరాల భూమిపై హక్కు కల్పించి రికార్డు సృష్టించారు. మా నియోజకవర్గంలో రూ.1,251 కోట్లు నేరుగా ప్రజల అకౌంట్లో జమ అయ్యాయి. సామాజిక న్యాయానికి సంపూర్ణ అర్థం చెప్పిన జగనన్నను మేం ఎప్పటికీ మరువం. ఏపీ ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారు. – కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే మామయ్యా.. మీ వల్లే చదువుకుంటున్నాం జగన్ మామయ్యా.. హ్యపీ బర్త్ డే.. మా నాన్న పేద రైతు కావడం వల్ల మమ్మల్ని చదివించడం ఇబ్బందిగా ఉండేది. మీరు సీఎం అయ్యాక అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నారు. నేనే కాదు.. నాలాగ వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటే అమ్మ ఒడే కారణం. ఒకప్పుడు మా స్కూల్ సరిగా లేదు. మా జగన్ మామయ్య సీఎం అవ్వడం వల్లే రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మాకు ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు. ఒకప్పుడు నాకు ఇంగ్లిష్ రాక ఇబ్బంది పడేదాన్ని. నేను ఇప్పుడు ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడుతున్నాను. బైలింగ్యువల్ టెక్ట్స్బుక్స్ చాలా బాగున్నాయి. గతంలో స్కూల్కు వెళ్లాలంటే ఇష్టం ఉండేది కాదు. మీరు తీసుకొచ్చిన మార్పుల వల్ల, సహాయం వల్ల ఇవాళ ఇష్టంగా స్కూలుకు వెళ్తున్నాం. మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు. రోజుకోరకం మంచి ఆహారం ఇస్తున్నారు. మాకు మంచి ట్యాబ్లు ఇచ్చారు. ఐఎఫ్పీలు ఏర్పాటు చేశారు. చక్కగా చదువుకుంటున్నాం. ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా టాపర్స్కు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మేం బాగా చదువుకుని మంచి జాబ్ వచ్చే వరకు మీరే మాకు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. – ధారామణి, ఆశ్రమ పాఠశాల గిరిజన విద్యార్ధిని, చింతపల్లి -
‘ఇంగ్లిష్’లో మనమే టాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ తీసుకువచ్చిన సంస్కరణలతో మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. గతంలో ఏదైనా పరీక్షను ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి వెనకంజ వేసే మన రాష్ట్ర విద్యార్థులు ఇప్పుడు ఆ భయం పోగొట్టుకుని ముందంజలో దూసుకెళుతున్నారు. ఇటీవల ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన విషయంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్)–2023లో మన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభ చూపించారు. ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ సాధించడం గమనార్హం. అంతేగాక జాతీయ సగటు కంటే ‘డబుల్’ రెట్లకు పైగా మన విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే నిర్వహించింది. ఇంగ్లిష్ మీడియం చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి పరీక్ష నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థుల జాతీయ సగటు 37.03 శాతంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శాతం 84.11గా ఉండటం విశేషం. ముఖ్యంగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించడం సాధ్యమైంది. బైలింగువల్ (ఇంగ్లిష్–తెలుగు) టెక్టŠస్ బుక్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్తో విద్యార్థులకు నిరంతరం ప్రత్యేక బోధన అందించడంతో విద్యార్థులు ఆంగ్ల పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకుంటున్నారు. అలాగే ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో రాయడం వల్ల వారు భాషపై పట్టు సాధిస్తున్నారు. మూడు తరగతుల విద్యార్థులపై అంచనా పరీక్ష దేశ వ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి (ఎఫ్ఎల్ఎన్) సర్వేను ఏటా నిర్వహిస్తుంది. 2021లో కేంద్రం ఎన్ఏఎస్, 2022లో ఎఫ్ఎల్ఎన్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన అప్పటి సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలు సైతం అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ఏఎస్–2023 సర్వేలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 3, 6, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి సర్వే పరీక్ష నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయడానికి 1,12,72,836 మందిని ఎంపిక చేయగా 41,74,195 మంది (37.03 శాతం) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 6,42,496 మందిని ఎంపిక చేస్తే 5,40,408 మంది (84.11 శాతం) ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాశారు. ఈ పరీక్షలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు మనకంటే వెనుకబడడం గమనార్హం. పేదింటి పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అని భావించిన సీఎం జగన్మోహన్రెడ్డి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. బోధన, పరీక్షా విధానంలో సంస్కరణలు దేశంలో ఉత్తమ విద్యా సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరణలను, పథకాలను అమలు చేస్తోంది. బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్, ఐఎఫ్పీ స్క్రీన్లు, ఇంగ్లిష్ ల్యాబ్స్తో పాటు, విద్యార్థి సామర్థ్యాల ఆధారంగా బోధన అందిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతేగాకుండా ఏపీ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను రూపొందించి అమలు చేస్తున్నారు. దాంతో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన రెండు ఫార్మెటివ్ అసెస్మెంట్ (యూనిట్ టెస్ట్)లలో 91.03 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లిష్ మీడియం సర్వేలో పాల్గొన్న విద్యార్థులు ఇలా.. -
పెత్తందార్ల పెద్దా.. ఇదేనా మీ బాధ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బలహీన వర్గాలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రలపైనా పెత్తందార్ల పెద్ద రామోజీరావు విషం చిమ్మారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సాధించిన అభివృద్ధికి సూచికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్రలు విఫలమవుతున్నాయంటూ అసత్యాలను అచ్చేస్తున్నారు. సామాజిక సాధికార సభలకు ఊరూ వాడా జనం వెల్లువలా వస్తున్నా, సభలు జనసంద్రాన్ని తలపిస్తున్నా ఆ వాస్తవాన్ని దాచిపెట్టి, సభ ప్రారంభానికి ముందో, ముగిసిన తర్వాతో ఖాళీగా ఉన్న నాలుగు కుర్చీల ఫొటోలు తీసి, వాటినే అచ్చేసి, అదే నిజమనేలా పాఠకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అణగారిన వర్గాల కార్యక్రమాల మీదా ఇలా విషం చిమ్మడం ఇదేమి పైశాచికత్వం? బడుగు, బలహీనవర్గాలకు జరుగుతున్న మేలును హుందాగా స్వీకరించలేరా? పెత్తందారీ పోకడలకు ఫుల్స్టాప్ పెట్టలేరా? పచ్చ మెదళ్లు ఇక బాగుపడవా? సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీనవర్గాలకు ఉచితంగా స్థలాలు, ఇళ్లు ఇస్తుంటే మనసొప్పదు. బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే జీర్ణించుకోలేరు. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వారున్న చోటుకే వెళ్లి ఇస్తుంటే చూడలేరు.. బడుగు, బలహీన వర్గాలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, పిల్లలు, విద్యార్థులు.. ఎవరికి ఏ మేలు జరిగినా కోర్టులో కేసులు వేసో, మరో మార్గంలోనో అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పది తలలతో విషం చిమ్ముతున్నారు. బడుగు, బలహీనవర్గాలకు అందాల్సిన ప్రయోజనాలు కూడా పెత్తందార్ల జేబుల్లోకే వెళ్లాలన్న తీరులో వ్యవహరిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధిస్తే తమ పప్పులు ఉడకవని వణుకుతున్నారు. అందుకే నిత్యం తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. అయినా సీఎం వైఎస్ జగన్ సంకల్పం ముందు వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. బడుగు, బలహీనవర్గాలకు పథకాలు, ప్రయోజనాలు ఆగడంలేదు. పెత్తందార్లపై పేదల విజయానికి సూచికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. తమ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రత్యక్షంగా జరుగుతున్నదీ కనిపించదా? రాష్ట్రంలో అక్టోబర్ 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి. నియోజకవర్గమే వాటి పరిధి. శనివారం వరకూ మూడు ప్రాంతాల్లో 43 నియోజకవర్గాల్లో జరిగాయి. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే సభకు ఆ నియోజకవర్గం ప్రజలే హాజరవుతారు. సభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలే ప్రసంగిస్తారు. పేదల విజయాన్ని ప్రతిఫలిస్తూ ప్రతి సభకూ వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటిదాకా పూర్తయిన 43 నియోజకవర్గాల్లో సుమారు 13 లక్షల మంది పేదలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ సాధించిన సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించారు. తమ కుటుంబం, గ్రామం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసం జగనే రావాలి.. జగనే కావాలి అంటూ నినదించారు. ఇవన్నీ బహిరంగ సభలే. ప్రతి సభకూ ప్రత్యక్ష ప్రసారం లింక్ను కూడా వైఎస్సార్సీపీ అందుబాటులో ఉంచింది. పలు ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారమూ చేశాయి. ఈ యాత్రల్లో బడుగు, బలహీన వర్గాలన్నీ ఒక్కటై.. జగన్నినాదమై సామాజిక సాధికారతను ప్రతిధ్వనిస్తున్నాయని సామాజిక మాధ్యమాలూ చాటిచెబుతున్నాయి. ఈ వాస్తవాన్ని మరుగున పరిచి అసత్యాలతో వార్తలు రాస్తే జనం నమ్ముతారనుకోవడం రామోజీ భ్రమే. అన్నింటా అగ్రభాగం బలహీనవర్గాలకే సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా పేదలకు డీబీటీ రూపంలో రూ.2.40 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.70 లక్షల కోట్లు.. వెరసి రూ.4.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ లబ్ధిదారుల్లో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఇది ఆ వర్గాల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా, నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి సీఎం జగన్ అభివృద్ధి చేశారు. పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న సమున్నత లక్ష్యంతో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా 2.07 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అందులో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లోనూ సింహభాగం ఆ వర్గాలకు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. వాటి ద్వారా ఆ వర్గాలు రాజకీయ సాధికారత సాధించాయి. ఆసరా, చేయూత వంటి పథకాలతోపాటు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకూ మార్గం సుగమం చేశారు. ఇలా అన్ని వర్గాలూ అభివృద్ధి సాధించడాన్ని పెత్తందార్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ–జనసేన పొత్తును చిత్తు చేస్తున్న జనం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లాక్కున్నప్పుడే ఆ పార్టీ పెత్తందార్ల పార్టీగా మారిపోయింది. పెత్తందార్ల నాయకుడు చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పవన్ జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. వీరిద్దరూ కలిసి పదేళ్లుగా అనేక నాటకాలు అడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం కోసం జనసేన పోటీ నుంచి తప్పుకొంది. చంద్రబాబు వారిస్తే పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చామని జనసేన అధ్యక్షుడు పవనే పలుమార్లు చెప్పారు. అప్పట్లో 650 హామీలతో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో అమలు పూచీ నాది అంటూ పవన్ నమ్మబలికారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారు. వాటిపై జనం నిలదీస్తారన్న భయంతో మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేయించారు. చంద్రబాబు చేసిన మోసాలను పవన్ ఎన్నడూ నిలదీయలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు వామపక్షాలు, బీఎస్పీలతో కలిసి పవన్ పోటీకి దిగారు. ఇక రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం ద్వారా చంద్రబాబును అధికారంలోకి తేవడానికి టీడీపీ–జనసేన కలిసి పోటీ చేస్తాయని పవనే ప్రకటించారు. ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అంటూ వారిద్దరూ మరో నాటకానికి తెరతీశారు. అయితే, ప్రజలు వారిని నమ్మడంలేదు. వారి నాటకాలు రక్తికట్టడంలేదు. ఇది టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలకు బడుగు, బలహీన వర్గాలు బ్రహ్మరథం పడుతున్నాయి. ఇది టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడానికే సామాజిక సాధికార యాత్రలు వెలవెలబోతున్నాయంటూ రామోజీరావు తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారని మండిపడుతున్నారు. -
పవన్.. ఇవన్నీ ఎందుకు?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక చెప్పాల్సింది ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం చదివే పిల్లలపై కూడా కేసులు పెడతామని. ఏమో! ఆ మాట కూడా చెప్పేస్తారేమో! మంచి విద్యాబుద్దులు ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడేవారు కారేమో! ఆయనకు ఉన్నది మిడిమిడి జ్ఞానం, అత్తెసరు చదువు. అదృష్టం కలిసి వచ్చి యాక్టర్ అయ్యారు. దానినే రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. అది ఆయన ఇష్టం. కాని తనకు తోచిందల్లా చెప్పి పేదలపైన, ఆంధ్రప్రదేశ్ పైనా విషం చిమ్ముతానంటే ప్రజలు సహిస్తారా?. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంగ్ల మీడియంకు సంబంధించిన చదువులు పెట్టినందుకు పవన్ అధికారంలోకి రాగానే కేసులు పెడతారట. ఐబీ సిలబస్ ఎందుకు? టోఫెల్ పరిజ్ఞానం ఎందుకు? యూట్యూబ్ చూస్తే అమెరికా యాక్సెంట్ వచ్చేస్తుందని పవన్ చెబుతున్నారు. మరి అదేదో తాను నేర్చుకుని అమెరికాలో అప్పచెప్పి ఉండాల్సింది కదా!. అమెరికా లో ఒక యూనివర్శిటీకి వెళ్లి , అక్కడి అమెరికన్ విద్యావేత్త ఒకరు అడిగిన ప్రశ్నకు తడుముకుంటూ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వంక చూడడం ఎందుకు?. జగన్ పేదల చదువులకు వేలకోట్లు ఖర్చు పెట్టడం కూడా తప్పేనట!. అసలు ఏపీలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఏనాడైనా పవన్ కల్యాణ్ పరిశీలించారా?. కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏమి చెబితే అదే ఉపన్యసిస్తూ, తన అమాయక అభిమానుల్ని రెచ్చగొట్టి, తానేదో సాధించేశానని అనుకుంటున్నారు. ✍️నిజానికి పవన్ కల్యాణ్ వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాని ఆయన తెలిసి, తెలియక అజ్ఞానంతో మాట్లాడి ఆంధ్రుల పరువు తీస్తున్నారనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఏదో తెలుగుదేశం కోసం పనిచేసుకోకుండా, మధ్యలో ఆయనకు ఇంగ్లీష్ మీడియం గొడవ ఎందుకు?. నిజంగానే ఆయనకు ఆ మీడియంపై అంత వ్యతిరేకత ఉంటే.. తన పిల్లలను మంచి,మంచి అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఓక్రిడ్జ్ వంటి స్కూళ్లలో ఎందుకు చదివించారు. ఆ సందర్భంగా ఆయన అబ్బో ఇది గొప్ప స్కూలు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని అన్నారే!. అదే ప్రకారం ఏపీలో కూడా సిలబస్ నుంచి అన్నింటిలో మార్పులు తెచ్చి పిల్లలకు మేలైన విద్య అందించాలని జగన్ తలపెడితే మాత్రం ఎక్కడలేని అక్కసా? అసలు ఐబీ అంటే ఏమిటో, ఏఐ అంటే ఏమిటో? టోఫెల్ అవసరం ఎందుకో? పిల్లలకు వాటిలో ట్రైనింగ్ ఇస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో పవన్ కల్యాణ్కు తెలిసి ఉంటే ఇలా పిచ్చితనంతో మాట్లాడేవారా?. ఇలాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండి ,ప్రజలకు సందేశాలు ఇవ్వడం కన్నా ఏపీకి అవమానం ఏమి ఉంటుంది చెప్పండి!. ఒకవేళ పవన్కు విషయాలపై అవగాహన ఉంటే ఫలానా విధంగా అమలు చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వొచ్చు. అలాకాకుండా ఈ సిలబస్, విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్న జగన్ను, అందుకు బాధ్యులైన అధికారులు, ఇతరులపై కేసులు పెడతామని అంటే ఏమని అనుకోవాలి. పైగా అతి తెలివిగా యూట్యూబ్లో అన్నీ తెలుసుకోవచ్చట. ఆయన తన పిల్లలకు అలాగే చేస్తారా?. యూట్యూబ్ చూసి చదువుకోండి అని చెబుతారా?. ఇక్కడే ఆయన పెత్తందారి బుద్ది తెలిసిపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ✍️పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. తెలుగు అంటూ పెద్ద ఉపన్యాసాలు చేసే నాయకుల పిల్లలు ఎవరూ తెలుగు మీడియంలో చదవలేదు. వారి మనుమళ్లు కూడా అంతే. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనే చదువుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు దేవాన్ష్ ఏ స్కూలులో చదువుతున్నది, ఏ మీడియంలో అభ్యసిస్తున్నది ఎన్నడైనా చెబుతున్నారా! పోనీ పవన్ కల్యాణ్ అయినా అడిగి తెలుసుకున్నారా!. అలాగే రామోజీరావు కుమారులు, మనుమళ్లు,మనుమరాళ్లు అంతా ఆంగ్ల మీడియం దారిలోనే చదువుకున్నారు. ఆయన పెట్టిన స్కూల్ కూడా ఆంగ్ల మీడియంలోనే బోధిస్తోంది. కాని ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో పేదలకు ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసి విషం చిమ్ముతుంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వరస అంతే. మిగిలిన తెలుగుదేశం మీడియా వారిది అదే బాట. కాని నీతులు చెబుతుంటారు. ✍️తెలుగును ఎవరూ వద్దనడం లేదు. కాని తెలుగుతోపాటు ఆంగ్ల మీడియంలో చదివితే అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు కూడా పోటీపడతారన్నది జగన్ ప్రభుత్వ ఆకాంక్ష. ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల పిల్లల బృందం ఒకటి అమెరికాలో పర్యటించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా మాట్లాడి వచ్చింది. అక్కడ వారు మాట్లాడింది ఇంగ్లీష్లోనే. అక్కడకు వెళ్లి తెలుగులో మాట్లాడితే తెల్లమొహం వేసుకుని చూడాల్సిందే. ఆంగ్లం రావడం వల్ల వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం వస్తుంది. పోటీ సమాజాన్ని సమర్ధంగా ఎదుర్కోగలుగుతారు. అలాంటివాటిని పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ వంటివారు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కొత్తగా వస్తున్న మార్పులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ లు ఇస్తే ప్రజలే గుణపాఠం చెప్పాలి. ఏపీలో ఏదైనా మంచి చేయాలంటే ఎంత కష్టమో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటివారిని చూస్తే అర్థమవుతంది. ప్రతిదానికి అడ్డుపడడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. నాలుగేళ్లుగా అదే గేమ్ సాగించారు. కానీ ఆకస్మికంగా పరిస్థితి మారింది. చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లవలసి వచ్చింది. అంతే!. పవన్ కల్యాణ్ స్వరంలో అవినీతి గురించి మార్పు వచ్చింది. అబ్బే! అవినీతి అనేది కామన్.. దానిని కొంతవరకు ఆమోదించవచ్చని ఆయన చెప్పే దశకు చేరుకున్నారు. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు పై రూ. 240 కోట్ల అవినీతి అభియోగాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని చెబుతున్నట్లుగా ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లోనే కాదు. ఫైబర్ నెట్, అస్సైన్డ్ భూముల కేసులు ,ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మొదలైనవన్నివాటిలో వందల కోట్లు తినడం పెద్ద తప్పు కాదని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. అవినీతిపై వచ్చిన కేసుల గురించి మాట్లాడని పవన్ కల్యాణ్, చంద్రబాబుపై వచ్చిన వందల కోట్ల అవినీతి గురించి నోరెత్తని పవన్ కల్యాణ్ ఆంగ్ల మీడియం తెచ్చి స్కూళ్లను బాగు చేసినందుకు జగన్ పైన, ఇతర సంబంధిత వ్యక్తులపైన కేసులు పెడతానని అంటున్నారు. ఇలాంటి వాళ్లు ఏపీకి అవసరమా?... :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
భాషా పాఠాలకూ 'డిజిటల్' రూపం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధించే భాషా పాఠాలు డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు అనువుగా ఈ–పాఠాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందించింది. ఇప్పటికే సబ్జెక్టు పాఠ్యాంశాలను ఈ కంటెంట్లో బోధిస్తుండగా, ఇప్పుడు తెలుగు, ఇంగ్లిష్, హిందీ డిజిటల్ పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారి ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు ఆయా భాషల పాఠ్యాంశాలను తయారు చేసింది. పదో తరగతి మినహా మిగిలిన తరగతుల కంటెంట్ను ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్పీ) ద్వారా డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. సబ్జెక్టు పాఠాలను డిజిటల్ రూపంలోకి మార్చి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించింది. ఇప్పటివరకు ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. వచ్చే ఏడాది పదో తరగతి ఇంగ్లిష్ మీడియం పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ తరగతి పాఠాలను సైతం డిజిటల్ రూపంలో సిద్ధం చేశారు. యూట్యూబ్లోనూ.. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి కలిగించేందుకు డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ‘ఈ–విద్య’ చానెళ్ల ద్వారా టీవీల్లో కూడా ప్రసారం చేస్తోంది. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానెల్ ద్వారాను, ఆరు నుంచి 9వ తరగతి వరకు మరో చానెల్ ద్వారాను పాఠ్యాంశాలను టెలీకాస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్లోని ‘ఈ–పాఠశాల’ చానెల్ ద్వారా ఎప్పుడు కావాలన్నా పాఠాలు వినేందుకు అవకాశం కల్పిస్తూ అన్ని పాఠాలను అప్లోడ్ చేశారు. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. అన్ని మాధ్యమాల్లోను ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను ఉంచారు. అందుబాటులోకి వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని పాఠాల కంటెంట్ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని విద్యార్థులకు ఐఎఫ్పీల్లో బోధించడంతో పాటు, ట్యాబ్స్లోను అప్లోడ్ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్, కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్–ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వారికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాల కంటెంట్ను అందుబాటులోకి తెచ్చారు. -
ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు. తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు. నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి. ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి. కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్ స్టార్’.. ‘పంచర్స్టార్’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ బెస్ట్గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు. వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్) ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు. పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ సిలబస్. తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన తర్వాత, ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్మెంట్ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్ కల్యాణ్:ది లాస్ట్ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్తో చదివించారో కూడా పవన్, మనోహర్లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్ హెచ్ఎమ్వి రికార్డులాంటోడు. అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్ టెస్ట్ తల్లీ! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పేద పిల్లల విద్యపై విషమెందుకు?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేక, విషం కక్కుతున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తే పేద పిల్లలు గొప్పగా ఎదుగుతారని, ఇది ఇష్టం లేకే కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నేషనల్ బకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుపై పచ్చ పత్రిక కథనాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు విధివిధానాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే, అదేదో తప్పు చేసినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగా బైజూస్ కంటెంట్తో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, తరగతి గదుల్లో అత్యాధునిక ఐఎఫ్పీ స్క్రీన్లతో బోధనను డిజిటలైజ్ చేశామన్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడేలా టోఫెల్ శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకు ఇస్తున్న టోఫెల్ శిక్షణను ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఏటా ఒక తరగతి పెంచాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు మార్గదర్శకాల రూపకల్పనపై ఒప్పందం జరిగితే.. ఎకాయెకిన సిలబస్ అమలు చేస్తున్నామని, అందుకోసం వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐబీ సిలబస్ అమలు ప్రాథమిక స్థాయిలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి నిధులూ ఖర్చు చేయలేదని చెప్పారు. ఇవన్నీ సిలబస్ అమలు సమయంలో వచ్చే అంశాలన్నారు. ఐబీ సిలబస్ అమలు 12 ఏళ్ల దీర్ఘకాలిక ప్రక్రియ అని తెలిపారు. ఐబీ సిలబస్ అమలుకు ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయని గుర్తుచేశారు. మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా మన విద్యార్థులు ప్రగతి సాధించకపోతే వెనుకబడిపోతారని, వారిని ఉన్నతంగా నిలపడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. సామాన్య కుటుంబాల్లోని విద్యార్థులకు మంచి జరుగుతుంటే సెలబ్రిటీ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని మంత్రి విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభుత్వ లక్ష్యం మారదని, పేద పిల్లలకు అంతర్జాతయ విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
ఇంటింటా ఇంగ్లిష్ వసంతం
ఈ 2023 అక్టోబర్ 5... 206వ భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం. భారతదేశంలో పరిపాలనా భాషగా మనుగడ సాగించిన ఈ 206 సంవత్సరాల్లో ఇంగ్లిష్ అతి సంపన్నుల ఆస్తిగా మిగిలిపోయింది. దేశంలో అతి ధనవంతులు లేక స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను చెప్పించగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల కాలంలో భారతదేశంలోని విద్యా నమూనానే మార్చివేశారు. ఈ నమూనాలో వ్యవసాయ కార్మికుల పిల్లలు, ఆదివాసీలు, చేతివృత్తుల వారితోపాటు, పేదల్లోకెల్లా నిరుపేదలు కూడా కేవలం ఇంగ్లిష్ మాధ్యమం విద్యనే కాదు, పూర్తిగా భిన్నమైన విద్యను పొందుతున్నారు. మన దేశంలో అతి ధనవంతులు లేక సక్రమంగా ఉద్యోగం చేస్తూ స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు పరిమితమైన స్థాయి నుండి ఉన్నత తరగతి ఇంగ్లిష్ మీడియం విద్యను చెప్పించగలిగారు. దేశంలోని అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులందరూ తమ పిల్ల లను ఇంగ్లిషు మీడియంలో చదివించేవారు. నాగాలాండ్ వంటి చిన్న ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ ఏదో ఒక రకమైన ఇంగ్లిష్ మాధ్యమ విద్యను అందిస్తున్నాయి. రాజధాని ఢిల్లీ నుంచి దేశాన్ని అత్యధిక కాలం పాలించిన భారత జాతీయ కాంగ్రెస్, 15 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇప్పుడు ఇంగ్లిష్ భాషా విద్యను ధనవంతులకు సొంతం చేశాయి. ఈ పార్టీల అభివృద్ధి నమూనాలో పాఠశాల విద్యకు అతితక్కువ ప్రాధాన్యత మాత్రమే లభించింది. వెనుకబడిన నైజాం రాష్ట్రంలో సరైన తెలుగు మీడియం పాఠశాల కూడా లేని ఒక కుగ్రామంలో పుట్టి, ఇంగ్లిష్ నేర్చుకోవడంలో దుర్భ రమైన కష్టాన్ని అనుభవించిన వ్యక్తిగా బతికిన నేను, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాల విద్యపై ఇంత శ్రద్ధ చూపుతారని ఎన్నడూ ఊహించలేదు. నా 71 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విడిపోయిన ఏపీ, తెలంగాణలలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. నేను అనేక రాష్ట్రాల్లో పర్యటించాను. ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రుల పరిపాలనా పద్ధ తుల గురించి చదివాను. అయితే పాఠశాల విద్యా కార్యక్రమాలకు ఏపీ ముఖ్యమంత్రి వెచ్చిస్తున్నంత సమయాన్ని ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధాన మంత్రి కానీ వెచ్చించలేదు. గతంలో సిద్ధరామయ్య కర్ణాటకకు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పినరయి విజయన్ రెండు పర్యాయాలు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వారితో మాట్లాడి ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని అభ్యర్థించాను. అయితే అగ్రవర్ణ మేధాజీవులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆ ఇద్దరూ భయపడ్డారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో పేదల్లోకెల్లా నిరుపేదలకు ఈ రోజువరకూ ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడం లేదు. దీన్ని అలా పక్కన బెడితే రాష్ట్ర విద్యావ్యవస్థ పనితీరును సమీక్షించడానికి ఏ ముఖ్య మంత్రీ జగన్లా పాఠశాల విద్యపై ఇంత డబ్బు, సమయం, శక్తి వెచ్చించలేదు. ‘నా రాష్ట్ర పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించాలని కోరుకుంటున్నాను, అదే వారి భవిష్యత్ ఆస్తి’ అని జగన్ మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. పాఠశాల, కళాశాల పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి సుమారు 35 వేల రూపాయలు జమ అవుతున్నాయి. ఆ డబ్బును వారు తమ విద్యా అవసరాలకు ఖర్చు చేస్తారు. పిల్లల బూట్లు, బ్యాగుల నాణ్యత, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల సౌకర్యాలు వంటివాటిపై ఏపీ ముఖ్యమంత్రి నిత్యం సమీక్షిస్తున్నారు. దేశంలోని ఏ భాగానికి చెందిన పాఠశాల మౌలిక సదుపాయాలు కూడా భారతదేశ చరిత్రలో ఏపీలోని పిల్లలకు ఉన్న నాణ్యతతో ఎన్నడూ లేవు. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణాన్ని రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి అని ఎప్పుడూ నిర్వచించలేదు. బడా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వారిని బలిపించడం నుంచి చిన్న కాంట్రాక్టర్ల దిశగా అభివృద్ధి ఆలోచనలను జగన్ మోహన్ రెడ్డి మార్చి వేశారు. ఇలాంటి చిన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు గ్రామ, పట్టణ మార్కెట్లలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో వేతనాలు పొందే కార్మికులు గ్రామాలు, పట్టణాలలో విస్తరించారు. ఈ నమూ నాలో అభివృద్ధి పెద్ద నగరాల్లో మాత్రమే కేంద్రీకృతం కాదు. గ్రామ మార్కెట్లు ఎంతగానో పుంజుకుంటాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఐదేళ్ల చంద్రబాబు పాలనను, తెలంగాణలో చంద్రశేఖర్ రావు పదేళ్ల పాలనను చూశాను. వారు తమ తమ రాష్ట్రాల్లోని పాఠశాల విద్యా నిర్మాణాలను ఎప్పుడూ సమీక్షించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పుడూ రాష్ట్ర పేద పిల్లల జీవితం, అభివృద్ధి గురించి చర్చించే స్థలంగా ఉండలేదు. పాఠ శాల, కళాశాల విద్యను కార్పొరేట్ వ్యాపార సంస్థలకు అప్ప జెప్పడంలో వీరు పేరొందారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ పాఠశాలలకు వైఫై, స్మార్ట్ టీవీలు ఇవ్వడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ వినూత్న విద్యా పద్ధతులను సమీక్షిస్తూ, గ్రామీణ పాఠశాలలకు వాటిని జోడిస్తూనే ఉన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో నడిచే దేశం, రాష్ట్రాలు ఈ ఏడాది భారతీయ ఇంగ్లిష్ దినోత్స వాన్ని జరుపుకోవాల్సిన నేపథ్యం ఇది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి మాట్లాడటం నేను టీవీ ఛానళ్లలో చూశాను. తెలుగు కంటే వారి ఇంగ్లిష్ చాలా బాగుంది. ఎందుకు? వారు అగ్రశ్రేణి ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలల్లోనూ, అమెరికాలో కూడా చదువుకున్నారు. కానీ ఆ కుటుంబం, ఆయన పార్టీ 2019లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడానికి జగన్ కోర్టు పోరాటాలు, మీడియా పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఏపీకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమణ ఆ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువు తున్న నిరుపేదలకు, తల్లులకు ఆర్థిక సాయంతో జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. అలాంటి కార్మిక పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడే సుసంపన్న దేశమైన అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి విద్యా సమావే శాలలో, వైట్ హౌస్లో ధైర్యంగానూ, విశ్వాసంతోనూ మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి చప్పట్లు స్వీకరించారు. ఇది కచ్చితంగా భారతదేశ భవిష్యత్ పాఠశాల విద్యా వ్యవస్థకు ప్రేరణాత్మక ఉదాహరణ. ఈ రోజు పేదలు, గ్రామ పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడంపై సంబ రాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 1817లో మన జాతీయ జీవనంలోకి వచ్చిన ఇంగ్లిష్ విద్య కొత్త మార్గాన్ని సుగమం చేసింది. కొత్త ఆశను సృష్టించింది. మన విద్యావ్యవస్థలో ఇద్దరు సంస్కర్తలు విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ 206 సంవత్సరాల క్రితం అక్టోబర్ 5న మొదటి పాఠశాలను ప్రారంభించారు. అయితే ఆ భాషా ఫలాలు వ్యవసాయాధారిత ప్రజానీకానికి, పట్టణ పేదల పిల్లలకు ఇప్పటికీ చేరలేదు. ఉన్నత స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య నుండి వచ్చిన ఏ విద్యావేత్త కూడా సమాన విద్యా మాధ్యమం కోసం పోరాడలేదు. మన దేశంలో ప్రాంతీయ భాషల వేడుకలను ఎవరూ వ్యతిరేకించరు. కానీ అదే సమయంలో భారతీయ ఇంగ్లిష్ను సెలబ్రేట్ చేసుకోవడం, ఆ ప్రపంచ భాషని మన గ్రామాల్లోకి విస్తరించడం అనేది మన సొంత రూపాంతరంలో ఇంగ్లిష్ని తీర్చిదిద్దుతుంది. 206 సంవత్సరాల పాటు ఇంగ్లిష్ అగ్రవర్ణ ధనవంతులు భద్రపరుచు కున్నదిగా ఉండిపోయింది. ఇంగ్లిష్ భాషను ధనవంతుల ఇళ్లకు, ఉన్నత కార్యాలయాలకు, మాల్ మార్కెట్లకు, విమానాశ్రయాలకు పరిమితం చేయడం నేరం. ఇది గ్రామ మార్కెట్లు, గ్రామ బస్టాప్ లతోపాటు వ్యవసాయ క్షేత్రాలకు చేరుకోవాలి. అక్కడే అది మరింతగా భారతీయతను సంతరించుకుంటుంది. ఏ భాషనూ ఒక వర్గ ప్రజల ఆస్తిగా పరిగణించకూడదు. జగన్ ప్రభుత్వం ఆ తొలి అడుగు వేసింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇండియన్ ఇంగ్లిష్ను వేడుకగా జరుపుకొని, ఆ రోజున మన పిల్లలను, యువతను ఒక పుస్తకాన్ని చదివేలా చేద్దాం. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఏపీ విద్యా సంస్కరణలు పేద పిల్లలకు వరం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక విద్యా సంస్కరణలు తమలాంటి పేద పిల్లలకు వరంగా మారాయని అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యార్థులు ఆ దేశ అధికారులకు వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతోపాటు డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు తమలాంటి పేద విద్యార్థుల జీవితాలను సమూలంగా మార్చాయన్నారు. బాలికా విద్య, వారి సంరక్షణకు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు, పథకాల గురించి వివరించారు. రాష్ట్రం తరఫున ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్లిన 10 మంది ప్రభుత్వ విద్యార్థుల బృందం తమ పర్యటనలో భాగంగా మంగళవారం యూఎస్ డిపార్ట్మెంట్ స్టేట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతపై ప్రతినిధులు మాట్లాడారు. ముఖ్యంగా బాలికా విద్య ఎంత ముఖ్యమో చర్చించారు. ఇంగ్లిష్ మీడియం వల్లే మీతో మాట్లాడగలుగుతున్నాం.. అమెరికాలో అమలవుతున్న విద్యావిధానం గురించి అమెరికా ప్రతినిధి రోసీ ఎడ్మండ్ మన విద్యార్థులకు వివరించారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలు, ఫలితంగా సాధించిన ప్రయోజనాలను రాష్ట్ర విద్యార్థులు అమెరికా అధికారులకు ప్రదర్శన రూపంలో తెలియజేశారు. జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, బాలికా విద్య కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను యూఎస్ అధికారులు ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గతంలో ఇంగ్లిష్ మీడియం లేదని.. సీఎం వైఎస్ జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని విద్యార్థులు తెలిపారు. దాని ఫలితంగానే ఇప్పుడు తాము మీతో ఇంగ్లిష్లో మాట్లాడగలుగుతున్నామని అమెరికా ప్రభుత్వ అధికారులకు వివరించారు. నాడు–నేడు కింద కొత్తరూపు సంతరించుకున్న ప్రభుత్వ పాఠశాలల ఫొటోలను విద్యార్థులు.. అధికారులకు చూపించారు. అలాగే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, అత్యాధునిక ఫర్నీచర్, ప్లేగ్రౌండ్స్, డిజిటల్ లైబ్రరీ, బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్, ప్రత్యేక టాయిలెట్స్ సౌకర్యాల గురించి కూడా వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు జగనన్న విదేశీ విద్యా కానుక పథకం కూడా ఉందని విద్యార్థులు యూఎస్ అధికారులకు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కృషికి అమెరికా అధికారుల ప్రశంసలు ఈ సందర్భంగా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో ఇండియా డెస్క్ ఆఫీసర్గా ఉన్న రజనీ ఘోష్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి డిప్లొమాట్ కావడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లిష్ చాలా అవసరమని, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధిస్తే భవిష్యత్లో దౌత్యవేత్తలు కూడా అవుతారన్నారు. యూఎస్లో ఉన్నత చదువుల కోసం ఏపీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు తమ విభాగం సిద్ధంగా ఉందని వెల్లడించారు. విద్యార్థ్లు ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలను పరిశీలించి ఆమె వారిని అభినందించారు. పేద పిల్లలను రాష్ట్రం తరఫున ప్రతినిధులుగా అమెరికా పంపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయం ఏపీలోని లక్షలాది మంది విద్యార్థులు విద్యను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రశంసించారు. పేద విద్యార్థులకు టోఫెల్ శిక్షణ సహాయపడుతుంది.. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారి రోజీ ఎడ్మండ్ మాట్లాడుతూ.. కొలంబియా, ప్రిన్స్టన్, హార్వర్డ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ ఇవ్వడం ఎంతో మంచి నిర్ణయమని కొనియాడారు. పేద మెరిట్ విద్యార్థులకు ఈ శిక్షణ సహాయపడుతుందన్నారు. అమెరికాలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఆర్థిక సహాయం కూడా అందుతుందని తెలిపారు. 400 యూనివర్సిటీలు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గుర్తింపు పొందాయని.. విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. యూఎస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ డిప్లమసీ ఎఫైర్స్ ఆఫీసర్ ఎరిక్ క్రిస్టెన్సన్ మాట్లాడుతూ.. విద్య, సమాచార మార్పిడి.. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యా అవకాశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు విద్యార్థులు చక్కటి ఇంగ్లిష్లో మాట్లాడడాన్ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సీనియర్ ఎక్స్టర్నల్ ఆఫీసర్ మోలీ స్టీఫెన్సన్ ప్రశంసించారు. చిన్న వయసులోనే చాలా తక్కువ సమయంలో భాష నేర్చుకుని ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. యూఎస్ విద్యార్థుల ప్రతినిధి బృందంలో 8 మంది బాలికలకు అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యూఎన్వో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ మాట్లాడుతూ.. యూఎస్ డిపార్ట్మెంట్ స్టేట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఎస్పీడీ, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లిష్ మీడియం భేష్
తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యావిధానం ప్రవేశపెట్టడం ద్వారా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి వంటి మహానుభావుల ఆశయాలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. తాను దర్శకత్వం వహించి నిర్మించిన ‘యూనివర్సిటీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా శనివారం తిరుపతి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష అమ్మ అయితే.. ఇంగ్లిష్ భాష నడిపించే నాన్న అని, జీతం, జీవితం ఇంగ్లిష్పై ఆధారపడి ఉందని అన్నారు. భక్తుల రక్షణకు కర్ర ఓ ఆయుధం తిరుమల కాలినడక మార్గంలో క్రూర మృగాలు భక్తుల ప్రాణాలు తీయడం మనసును కలచివేసిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. నడకదారి భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించడం ఆహా్వనించదగ్గ విషయమన్నారు. అడవులకు, పొలాలకు వెళ్లే సమయంలో అడవి జంతువుల నుంచి తమకు తాము కాపాడుకోవాలంటే కర్రనే ఉపయోగించారని చెప్పారు. కర్ర పైకి ఎత్తి మనిషి గాండ్రిస్తే ఎంతటి క్రూర మృగమైనా పారిపోవాల్సిందేనన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా వీలైతే సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, విద్యావ్యవస్థ, నిరుద్యోగ సమస్య, పేద విద్యార్థుల, తల్లిదండ్రుల వేదన, నిరుద్యోగ భారతం కాదు ఉద్యోగ భారతం కావాలని, విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలనే విషయాలు ప్రధానాంశాలుగా యూనివర్సిటీ సినిమా తీశానని, అక్టోబర్ 4న విడుదల కానుందని చెప్పారు. -
సార్... దిస్ అబ్బాయి బీట్ మీ... బట్ ఐయామ్ నాట్ తిరిగి బీట్!
అస్సాంలోని పచిమ్ నగామ్ గ్రామంలోని ‘న్యూ లైఫ్ హైస్కూల్’లో పిల్లలు ఇంగ్లిష్లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పిలిపించి ‘టెల్ మీ, వాట్ హ్యాపెన్డ్?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు. ‘ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్లో చెప్పలేక సైన్ లాంగ్వేజ్ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి. -
ఒంటిమామిడి..నిల‘బడి’oది!
అది నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఊరు మొత్తం రైతు కుటుంబాలు. పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలని వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. విద్యార్థులెవరూ లేకపోవడంతో ఊర్లోని సర్కారు బడి మూతబడింది. ఒకసారి రాలేగావ్ సిద్ధి నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పిన మాటలు వారిలో ప్రేరణ రగిలించాయి. ప్రైవేట్ స్కూళ్లకు కట్టే డబ్బులతో మన ఊరి పాఠశాలను తెరిపించుకోవాలనుకుని నిశ్చయించుకుని స్కూల్ను తెరిపించుకున్నారు. ఇప్పుడు ఆ పాఠశాల.. నో అడ్మిషన్ బోర్డు పెట్టేవరకు చేరుకుంది. ఇదీ.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పాఠశాల విజయగాథ. – సాక్షి, వరంగల్ డెస్క్ మూతబడినా... ఒంటిమామిడి గ్రామస్తులందరూ తమ పిల్లలను వరంగల్లోని ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. 2005లో విద్యార్థుల సంఖ్య జీరోకు చేరుకోవడంతో పాఠశాల మూతపడింది. 2014–15లో ఆ గ్రామం నీటి సంరక్షణలో రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామస్తులు మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామానికి వెళ్లి నీటి సంరక్షణలో అన్నా హజారే చేపడుతున్న చర్యలను గమనించారు. వాటిని గ్రామస్తులకు వివరించేందుకు కంపచెట్లతో నిండిపోయిన ఆ పాఠశాల ఆవరణను శుభ్రం చేసి సమావేశమయ్యారు. రాలేగావ్సిద్ది నుంచి వచ్చిన ఓ వక్త మాట్లాడుతూ నీటి సంరక్షణలో మీ గ్రామం బేషుగ్గా ఉంది.. మరి మీ పాఠశాల ఎందుకు మూతపడింది అన్న మాటలు గ్రామస్తులను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎంతమంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారో సర్వే చేశారు. 270 మంది పిల్లలు ఏటా చదువు కోసం రూ.35 లక్షలు కడుతున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఆ డబ్బులో కొంత మన పాఠశాల నిర్వహణకు పెట్టుకుని తెరిపించుకుందామని గ్రామసభలో తీర్మానం చేశారు. దీన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అనుమతి ఇచ్చారు. దీంతో పాఠశాల 270 మంది విద్యార్థులతో పునఃప్రారంభమైంది. తర్వాత టెన్త్ వరకు అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 496 మంది విద్యార్థులు ఉన్నారు. అయినా 9 మంది ఎస్జీటీలే ఉండటంతో మరో 11 మంది ప్రైవేట్ టీచర్లను పెట్టుకుని పాఠశాలను నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందంగా ఫీజు చెల్లింపు పాఠశాల నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి కొంత ఫీజు రూపంలో విరాళం ఇస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులు సంవత్సరానికి రూ.5 వేలు, హైసూ్కల్ విద్యార్థులు రూ.6 వేలు ఇస్తుంటారు. ప్రైవేట్గా పెట్టుకున్న టీచర్లకు నెలకు రూ.2.20 లక్షలు వేతనం చెల్లిస్తుండటం గమనార్హం. పాఠశాల నిర్వహణలో చైర్మన్ పొన్నాల రాజు ఆధ్వర్యంలోని 24 మంది సభ్యులున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఇక్కడ ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు ఇన్చార్జీలుగా ఉంటారు. ఆ తరగతికి సంబంధించి అన్ని అంశాలను వారే చూసుకుంటారు. పాఠశాల ప్రత్యేకతలివీ.. ♦ ప్రతి తరగతి గది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ♦ మధ్యాహ్న భోజనం వండేందుకు ముగ్గురు వంట మనుషులను పెట్టి ఒక్కొక్కరికి రూ.4,500 వేతనం ఇస్తున్నారు. ♦ ముగ్గురు స్కావెంజర్లను నియమించుకున్నారు. ♦ మంచినీటి కోసం ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్ఏర్పాటుచేశారు. ♦ అన్ని హంగులతో డీజీ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, లైబ్రరీ ♦ ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహణ ♦ మండలంలో టెన్త్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన ఏకైక పాఠశాలగా గుర్తింపు పొందింది. పలువురు విదేశీయులు పాఠశాలను సందర్శించారు. ఏకతాటిపై నిలబడ్డాం గ్రామస్తులందరం ఒక్కతాటిపై నిలబడి పాఠశాలను నిలబెట్టుకున్నాం. పిల్లలు బాగా చదువుతున్నారు. ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతో ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టీచర్లు లేరు. రేషనలైజేషన్, బైఫర్కేషన్ కాలేదని స్కూల్ అసిస్టెంట్లను ఇవ్వడం లేదు. ఐదు అదనపు తరగతి గదులు కావాలి. స్థలం కూడా సరిగా లేకపోవడంతో ఇరుకుగా ఉంది. – పొన్నాల రాజు, ఎస్ఎంసీ చైర్మన్ పిల్లలను ఇన్వాల్వ్ చేసి బోధిస్తాం విద్యార్థులు ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు బడినుంచి వెళ్తారు. స్టడీ అవర్స్లో టీచర్లు దగ్గరుండి చదివించడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి అంశంలో పిల్లలను ఇన్వాల్వ్ చేసి బోధన సాగుతుంది. ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు పెట్టాం. – ఆరోగ్యమ్మ గోపు, హెచ్ఎం అర్థమయ్యేలా చెబుతారు బట్టీ విధానం ఉండదు. ప్రతి పాఠం సుల భంగా అర్థమయ్యేలా చెబుతారు. కంప్యూటర్ తరగతులు కూడా ఉన్నాయి. స్టడీ అవర్స్ వల్ల మేము బాగా చదవగలుగుతున్నాం. మధ్యాహ్న భోజనం కూడా బాగుంటుంది. – పరకాల సాత్విక, టెన్త్ విద్యార్థిని -
ఆంగ్ల మాధ్యమం.. సీఎం జగన్ దూర దృష్టికి నిదర్శనం: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక విద్య నుంచి ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి దార్శనికత, దూర దృష్టికి నిదర్శనమని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మొఘల్రాజపురంలోని సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో "విద్య ఉపాధి అవకాశాలు - ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత" అంశంపై గురువారం నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే తరానికి ప్రపంచ వ్యాప్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించే ఇంగ్లీషు మీడియం విద్యను సీఎం జగన్ ప్రోత్సహించారని ఆయన అన్నారు. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు, సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందినవారు పేద పిల్లలకు ప్రభుత్వం కల్పించే ఇంగ్లీషు మీడియం విద్యను వ్యతిరేకించడం తగదన్నారు. ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించడం అంటే, తెలుగు భాషకు ద్రోహం తలపెట్టినట్లు కాదనే విషయం ఈ వర్గం పెద్దలకు ఎందుకు బోధ పడడంలేదో తమకు అర్ధం కావడం లేదన్నారు. ఇంగ్లీషుకున్న ప్రాధాన్యత దృష్ట్యా చిన్న వయస్సు నుంచి నేర్చుకుంటే, ఆ భాషలో ప్రావీణ్యం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా పూలబాల వెంకట్ రచించిన "ఇండియన్ సోనెటీర్" అనే ఆంగ్ల పద్య సంపుటిని ఛైర్మన్ ఆవిష్కరించారు. నవరత్నాలు అమలు, పర్యవేక్షణ కమిటీ వైస్ చైర్మన్ ఏ.ఎన్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ఇంగ్లిష్ ప్రపంచ వ్యాప్తంగా అనుసంధానం భాష అన్నారు. ఇంగ్లిష్ని నేర్పించడం ద్వారా ఒక తరం బాగుపడేలా సీఎం జగన్ చేస్తోన్న ప్రయత్నాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం లేదన్నారు. అనంతపురానికి చెందిన "సత్య నాదెండ్ల", తమిళనాడుకు చెందిన "సుందర్ పిచాయ్" లు ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారంటే ఇంగ్లిష్ నేర్చుకున్నందువల్లనే అని ఆయన అన్నారు. అరుదైన ప్రజ్ఞతో, ఆంగ్ల కవిత్వ ప్రక్రియ "సోనెట్" ప్రయోగంతో పుస్తకాన్ని వెలువరించిన వెంకట్ పూలబాలను ఆయన అభినందించారు. చదవండి: ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్ ప్రొ. ఎస్.ఏ. రహీమాన్ సాహెబ్ మాట్లాడుతూ,21 వ శతాబ్దంలో విద్యార్థుల భవిష్యత్తు ఆంగ్లంలో వారికివున్న ప్రావీణ్యంపై ఆధార పడుతుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెస్సర్గా తమకున్న 47 సంవత్సరాల బోధనా అనుభవంతో చెబుతన్నామని సమాజంలో ఆంగ్ల విద్య నేర్చుకోకపొతే, కూపస్థ మండూకంలా మిగిలిపోవడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలుగు భాష మన మనుగడకు ఎంత ఉపయోగ పడుతుందో, వృత్తికి, జీవనోపాధికి ఇంగ్లిష్ భాష అంత ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి తల్లి తొలి గురువని, పిల్లలు ఏభాషలో చదవాలనేది నిర్ణయించే అధికారం తల్లిదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం హర్షించదగినదని ఆయన అన్నారు. సీఆర్ మీడియా అకాడమీ సెక్రెటరి మామిళ్లపల్లి బాల గంగాధర తిలక్ మాట్లాడుతూ, భావాన్ని వ్యక్తీకరించేదే భాష అన్నారు. ఏ భాష నైనా ఇష్టంగా నేర్చుకోవడం ముఖ్యమన్నారు. కవిత్వాన్ని ప్రేమించేవారు భాషను తొందరగా నేర్చుకోగలరని తమ అధ్యాపకులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వేగంగా మారుతున్న ప్రపంచ స్థితిగతులను అందుకునేందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమన్నారు. పాఠశాల విద్యనుంచి ఇంగ్లిష్ ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. ఆంగ్లంలో కవిత్వం వ్రాయడం అంత సులువైనది కాదని ఆయన అన్నారు. "ఇండియన్ సానెటీర్" ఆంగ్ల కవితల రచయిత వెంకట్ పూలబాలను ఆయన అభినందించారు. చదవండి: మేనిఫెస్టోనే మాయం చేశారు.. ఇక ఇప్పుడిచ్చే హామీలకు మిమ్మల్ని నమ్మేదెలా? ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్. కృష్ణం రాజు మాట్లాడుతూ, పాత్రికేయులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా మీడియా అకాడమీ పనిచేయాలని కోరిన తొలితరం పాత్రికేయుల్లో తాము కూడా ఉన్నామన్నారు. పాత్రికేయలుకు పలు సామాజిక, సాంస్కృతిక అంశాల్లో సదస్సులు ఏర్పాటు చేసేందుకు తమ కార్యాలయాన్ని వేదికగా ఏర్పాటు చేస్తూ మంచి కార్యక్రమాల నిర్వహిస్తున్న చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అభినందించారు. ఇన్ని కార్యక్రమాలు విరామం లేకుండా చేపట్టడం కొమ్మినేనికి మాత్రమే సాధ్య మని ఆయన అన్నారు. సొనెట్ ఆంగ్ల కవిత్వ ధోరణి లో ఒక విశిష్ష్ట మైన ప్రక్రియ అని ఆయన అన్నారు. ఈ ప్రక్రియలో శ్రీ వెంకట్ పూలబాల రాణించారన్నారు. వారి ఇతర రచనలు సైతం తెలుగులో ఆదరణకు నోచుకున్నాయని ఆయన అన్నారు. డా.వెంకట నారాయణ మాట్లాడుతూ వివిధ దేశాల్లో భారతీయులు ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం ఇంగ్లీష్ భాషలో వారికివున్న ప్రజ్ఞ వల్లనే అని అన్నారు. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అన్నారు. అంజన మాట్లాడుతూ భాషను నేర్చుకోవడంతో పాటు, దైనందిన వ్యవహారాల్లో భాషను ఉపయోగించే తీరుతెన్నులు తెలిసి వుండాలన్నారు. వివిధ భాషలు నేర్చుకోవడం ఏంతో అవసరమని ఆమె సూచించారు. "ఇండియన్ సానెటీర్" పుస్తక రచయిత పూలబాల వెంకట్ మాట్లాడుతూ, తాము రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావుకు కృతజ్ఞతలు చెప్పారు. 'సొనెట్' కు ఇంగ్లిష్ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం వుందన్నారు. 14 పంక్తులు కలిగి, అంత్యాను ప్రాసతో పద్యం నడవాల్సి వుంటుందన్నారు. ప్రతి ఆంగ్ల కవి 'సోనెట్' ప్రక్రియ ప్రయోగంలో తమ ప్రతిభ నిరూపించుకోవాలని తహతహ లాడుతారని ఆయన పేర్కొన్నారు. 'సోనెట్' కవితా వైభవంలో భావోద్రేకం (ఎమోషన్స్) ప్రధానంగా కనిపించే లక్షణమని ఆయన తెలిపారు. "భారత వర్ష" అనే పద్య గద్య కావ్యాన్ని తెలుగు లో రచించామని ఆయన చెప్పారు. అలవోకగా తెలుగు, ఇంగ్లిష్ పద్యాలను రాగయుక్తంగా ఆలపించి సభికులను ఆయన ఆశ్చర్య పరిచారు. అకాడమీ ఛైర్మన్ ఓఎస్.డి ఎస్. శ్రీనివాస జీవన్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో అకాడమీ ఎస్. ఓ.ఎం.ఎస్.ఎన్.రావు, కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న అందించిన పథకాల వల్లే నేను స్టేట్ 2వ ర్యాంక్ సాధించగలిగాను
-
Telangana: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాదుడు.. ఎల్కేజీకి లక్షన్నర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు ఈసారి ఫీజులు భారీగా పెంచినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని బడుల్లో ఏకంగా 50 శాతం వరకూ ఫీజులు పెంచారని వాపోతున్నారు. కోవిడ్ తర్వాత గత ఏడాది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని తల్లిదండ్రుల నుంచి అందినంతా దోచేస్తున్నాయి. అదీగాక, సగం ఫీజును ముందుగానే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అంటూ అదనపు బాదుడు సరేసరి. ఇంకోవైపు డీజిల్ ధర విపరీతంగా పెరిగిందంటూ రవాణా చార్జీలూ 30 శాతం వరకూ పెంచారు. దీంతో పేదవాడికి ప్రైవేటు విద్య తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా అంతంతమాత్రంగానే చదువు సాగుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. చదవండి: కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజ్.. నియంత్రణ ఏమైనట్టు? ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. దీంతో ఫీజుల నియంత్రణ కోసం 2016లో ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. స్కూల్లో విద్యార్థిని చేర్చేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్లు, కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకూ పెంచుతున్నట్లు కమిటీ దృష్టికొచ్చింది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఇష్టానుసారం కాకుండా మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని కమిటీ సూచించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ విధానం కనుమరుగు... రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఫీజుల నియంత్రణను బడ్జెట్ స్కూళ్లు (వార్షిక ఫీజు రూ. 20 వేలలోపు ఉండేవి) స్వాగతించాయి. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15% ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇక్కడే సమస్య వస్తోంది. పెద్ద స్కూళ్లు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతీ గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపి 25 శాతం ఫీజు పెంచారు. ప్రతీ స్కూలు 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చు. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల నియంత్రణ కమిటీ పరిశీలిస్తుంది. పాఠశాల యాజమాన్యం ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానాతోపాటు గుర్తింపు రద్దు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఫీజుల పెంపును పరిశీలించేందుకు 2018లో తిరుపతిరావు కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. దాదాపు 4,500 స్కూళ్లు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘంగత ఏడాది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫీజులనియంత్రణ కార్యాచరణకు నోచుకోలేదు. -
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తున్నప్పటికీ, పరీక్షలను విద్యార్థులు వారి మాతృభాషగా ఉన్న ప్రాంతీయ భాషలో రాసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించింది. విద్యార్థులు కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ, వారు పరీక్షలలో ప్రాంతీయ భాషను ఎంచుకొనేందుకు అవకాశవిువ్వాలని అన్ని సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని విశ్వవిద్యాలయాలకు బుధవారం లేఖ రాసింది. స్థానిక భాషల్లో ఉన్నత విద్యా కోర్సులను ప్రోత్సహించేందుకు, బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ పేర్కొంది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలన్న నూతన విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో రూపొందించడం, ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను బోధనలో వినియోగించడానికి ఈ విధానం ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. స్థానిక భాషలకు పెరుగుతున్న ప్రాధాన్యత వివిధ పోటీ పరీక్షల్లో, ఉద్యోగ రాత పరీక్షల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో స్థానిక భాషలకు అవకాశం కల్పించాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో యూజీసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షలను గతంలో హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహించేవారు. తరువాత పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి వారి ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జేఈఈ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలు, ఇతర ఉద్యోగ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఇదే తరహాలో వివిధ విశ్వవిద్యాలయాల్లోనూ వివిధ కోర్సుల్లో స్థానిక భాషల్లో పరీక్షలు రాసుకొనేలా యూజీసీ నిర్ణయం తీసుకుంది. స్థానిక భాషలో పరీక్ష రాస్తే విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశాలను సంపూర్ణంగా సమాధానాలుగా రాయగలుగుతారని, వారిలోని పరిజ్ఞానాన్ని మరింత లోతుగా మూల్యాంకనం చేసేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. ఉన్నత విద్యలో చేరికలను పెంచేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉన్నత విద్యలో గరిష్ట చేరికలు 27 శాతం కాగా, దీన్ని 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్నది నూతన విద్యా విధానం లక్ష్యమని, దీనిని సాధించడానికి నూతన విధానం ఉపకరిస్తుందని పేర్కొంది. -
సత్ఫలితాలనిస్తున్న ఏపీ ప్రభుత్వ సంస్కరణలు
-
మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి హైదరాబాద్: ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మోడల్ స్కూల్స్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2023–24 సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్ను మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఉషారాణి సోమవారం విడుదల చేశారు. 6వ తరగతితో పాటు, 7–10తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకానుండగా, ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 16న నిర్వహిస్తారు. ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా, 6వ తరగతిలో 19,400సీట్లతోపాటు, 7–10 తరగతుల్లో మరికొన్ని ఖాళీ సీట్లున్నాయి. విద్యార్థులు http:// telanganams.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజుగా జనరల్ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, ఈడబ్లూŠఎస్ విద్యార్థులు రూ.125 ఫీజుగా చెల్లించాలన్నారు. ప్రవేశాలు ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. ప్రవేశాల షెడ్యూల్ ►ఆన్లైన్లో దరఖాస్తు: 10–01–2023 నుంచి 15–02–2023 ►హాల్టికెట్ల డౌన్లోడ్: 08–04–2023 ►పరీక్షతేదీ: 16–04–2023 ►సమయం: 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ►7–10 తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ►ఫలితాల ప్రకటన 15–05–2023 ►పాఠశాలల వారీగా ఎంపికైనవారి జాబితా ప్రకటన 24–05–2023 ►సర్టిఫికెట్ వెరిఫికేషన్ 25–5–2023 నుంచి 31–5–2023 వరకు క్లాసుల నిర్వహణ 1–6–2023 -
తెలుగు మీడియం పేద పిల్లలే చదవాలా..?
-
.. అలా భయపడతారేం! ఆయనన్నది కేంద్రంలో ఉన్న అధికార పక్షాన్ని!
.. అలా భయపడతారేం! ఆయనన్నది కేంద్రంలో ఉన్న అధికార పక్షాన్ని! -
ఏపీ బాలల బడ్జెట్ బహుబాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి ఆంగ్ల మాధ్యమంలో మంచి చదువులు అందిస్తూ వారి సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. బాలల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం అద్భుతమని మెచ్చుకుంటున్నాయి. జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఈపీఏ–నీపా)) బుధవారం నిర్వహించిన వర్చువల్ వర్క్షాప్లో రాష్ట్రం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘స్టూడెంట్ బేస్డ్ ఫైనాన్సియల్ సపోర్టు సిస్టమ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన ఈ వర్క్షాప్లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి రాష్ట్రం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాల గురించి విని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు సాహసోపేతమైన చర్యగా పలువురు అభినందించారు. నాడు–నేడు కింద రాష్ట్రంలోని ఫౌండేషన్ స్కూళ్లు మొదలు 60 వేల వరకు ఉన్న పలు విద్యాసంస్థలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం పట్ల నీపా అధికారులు మెచ్చుకున్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని ప్రశంసించారు. పైగా అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో వాటి భద్రత నిర్వహణ కోసం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిటెట్ల నిర్వహణ, పారిశుధ్య పనులకోసం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటుచేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దేలా కృషి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు విద్యారంగంలో ముఖ్యంగా పిల్లలను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా వారిని మార్చేలా జగనన్న విద్యాకానుక కింద ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చుచేస్తూ 43 లక్షల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ పెరుగుతున్నాయి. మనబడి నాడు–నేడు కింద రన్నింగ్ వాటర్తో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్చాక్బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్, పెయింటింగ్లు, కాంపౌండ్ వాల్, కిచెన్షెడ్ల నిర్మాణం వంటి ఏర్పాటు ద్వారా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే వీలు ఏర్పడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేలా రోజుకో మెనూతో అందిస్తున్న భోజనం గురించి ప్రతినిధులు తెలుసుకున్నారు. ఇందుకు ఈ ఏడాది ప్రభుత్వం 1,595.55 కోట్లు ఖర్చుచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి తల్లి తన పిల్లలను ఆర్థిక స్తోమత లేక చదువులకు దూరంగా ఉంచకుండా బడులకు పంపేలా ఏటా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తున్న సంగతి విని ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2022–23 విద్యాసంవత్సరంలోనే తల్లులకు రూ.6,500 కోట్లు అందించారు. చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ వినూత్న ఆలోచన ► చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై నీపా అధికారులు, ఇతర ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఈ బడ్జెట్ ఎలా రూపొందిస్తున్నారో తెలుసుకున్నారు. ► కుల, లింగ, వైకల్యాలు, తరగతి, మత, సాంస్కృతిక ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలిగే వాతావరణా న్ని సృష్టించడమే ఈ చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ లక్ష్యం. ► 2021–22లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా ఈ బాలల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022–23లో రూ.16,903 కోట్లు కేటాయించారు. ► బాలల పథకాల కోసం వందశాతం నిధులు కేటాయించే కార్యక్రమాలు మొదటి విభాగం కాగా అవసరాల మేరకు నిధులు కేటాయించే సంక్షేమ పథకాలు రెండో విభాగంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. ► వివిధ శాఖల ద్వారా పిల్లల కోసం పలు పథకాలను అమలు చేయిస్తున్నారు. మొదటి విభాగంలో 15 స్కీములు, రెండో విభాగంలో 18 స్కీములు అమలు చేస్తున్నారు. -
‘ఇంగ్లిష్ మీడియానికి అనుమతించండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 40 ప్రభుత్వ పాఠశాల్లో 9, 10 చదివే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో అదనపు తరగతుల నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర నేతలు రాజాభానుచంద్ర ప్రకాశ్, రాజుగంగారెడ్డి విద్యామంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కోరారు. టెన్త్ ఫీజు చెల్లించే తేదీలు ప్రక టించినా ఇంకా ఇంగ్లిష్ మీడియానికి అను మతించలేదని, దీంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందని తెలిపారు. వెంటనే ఉపాధ్యా య బదిలీలు చేపట్టాలని, తమ సంఘం లేవ నెత్తిన అనేక అంశాలు పెండిగ్లో ఉన్నాయని మంత్రికి వివరించారు. తమ విజ్ఞప్తిపై సబిత సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు -
విద్యపై విషపు రాతలా?
సాక్షి, అమరావతి: ‘వెనుక‘బడి’నా గొప్పలే’ అంటూ ఈనాడు దినపత్రిక సోమవారం వండివార్చిన కథనంలో అన్నీ అసత్యాలేనని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుర్బుద్ధితో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి. రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కథనాన్ని రాసిందని, ఇందులో దురుద్దేశమే కాకుండా నేరపూరిత ఆలోచనలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు రాసిన కథనంలోని ప్రతి అంశమూ అసత్యమేనని సవివరంగా స్పష్టంచేశారు. అంశాల వారీగా ఈనాడు తప్పుడు రాతలను రాజశేఖర్ ఎండగట్టారు. ఆయన ఏమన్నారంటే.. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టుపై ఈనాడుకు అవగాహనలేదు.. జాతీయ విద్యా విధానంలో 5+3+3+4 విధానాన్ని కేవలం కరిక్యులమ్ వరకు మాత్రమే అమలుచేయాలని చెప్పిందని.. 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయాలని ఎక్కడా చెప్పలేదని, ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి తలొగ్గి టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు విలీనం చేస్తున్నారంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే.. వరల్డ్ బ్యాంకు సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టు మీద ఈనాడుకు అవగాహనలేదు. దానిపేరు సాల్ట్ (సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్). గత మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లోని ప్రగతిని గమనించి ఆ ప్రభుత్వాలకు ఆర్థిక సహకారమిచ్చి మరింత ముందుకుపోయేలా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్లను అందిస్తోంది. గతంలో మాదిరిగా తాను ఎలాంటి జోక్యం చేసుకోకుండా కేవలం సాధించే ఫలితాల ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త విధానాన్ని ప్రపంచబ్యాంకు చేపట్టింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు 139 మంజూరు చేయగా అందులో ఏపీ ఒక్కటి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధిస్తున్న పురోగతిని గమనించి ప్రపంచబ్యాంకు ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇందులో ఎలాంటి షరతుల్లేవు. రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా రాలేదు. అయితే, ఈనాడులో ప్రపంచ బ్యాంకు ఒత్తిడిచేసి విలీనం చేయిస్తోందని తప్పుడు వార్త రాసింది. ఎన్ఈపీలో విద్యార్థులకు అన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తెచ్చేలా వనరులన్నిటినీ వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా 5+3+3+4 విధానాన్ని అనుసరించాలని ఎన్ఈపీ 7.5 పేరాలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ, దీనిపై అవగాహన లేకుండా ఈనాడు ప్రజలను తప్పుదోవపట్టించింది. చేరికల అంకెల్లోనూ అడ్డగోలు రాతలే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయని తప్పుడు అంకెలతో కథనం రాశారు. అసలు చేరికల లెక్కలకు సంబంధించి కేంద్రం ప్రామాణికంగా నిర్దేశించిన యూడైస్ ప్లస్ గణాంకాల ఇంకా ఖరారు కాలేదు. ఇష్టమొచ్చిన సంఖ్యలు రాశారు. ఈనెల 14, 15 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ దక్షిణాది రాష్ట్రాలతో వర్కుషాపును నిర్వహించాక ఈ గణాంకాలు ఖరారవుతాయి. ఈ ఏడాది లెక్కలు ఇంకా ఖరారుకానందున ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగానికి గత ఏడాది గణాంకాలను అందించాం. యూడైస్ ప్లస్ ఏడాదికి ఒక్కసారే అప్డేట్ అవుతుంది. కానీ, రాష్ట్రంలో చైల్డ్ ఇన్ఫో పేరుతో రోజువారీ అప్డేషన్తో గణాంకాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడినుంచో కొన్ని అంకెలను తీసుకుని ఈనాడు ప్రభుత్వంపై విషం చిమ్మింది. ఏ విద్యార్థీ బడిబయట ఉండరాదన్న ఉద్దేశంతో అమ్మఒడి సహ అనేక కార్యక్రమాలను ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. చరిత్రలో ఎవరూ పెట్టని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టిపెట్టింది. ప్రతి పిల్లాడినీ బడిలో చేర్చేలా కసరత్తు చేశాం. రాష్ట్రం ఏర్పాటయ్యాక గణాంకాలు పరిశీలిస్తే.. 2014–15లో 72,32,771 చేరికలు కాగా 2015–16కు 69,07,004కు తగ్గింది. 2016–17లో 68,48,197, 2017–18లో 69,75,526, 2018–19లో 70,43,071లుగా చేరికలు ఉన్నాయి. ఇక 2019–20లో ఆ సంఖ్య 72,43,269లకు 2020–21లో 73,12,852కు పెరిగింది. 2021–22లో 72,45,640కు చేరింది. ఇక 2022–23లో సెప్టెంబర్ 30 వరకు 71,59,441లుగా చేరికలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 86,199 తగ్గింది. ఈ తగ్గడం ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మైగ్రేషన్వల్ల 16,857, సీజనల్ మైగ్రేషన్వల్ల 38,951, మరణాలవల్ల 1,289 మంది చేరికలు తగ్గాయి. ఇక జనాభా తగ్గుదలవల్ల దేశవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరికలు తగ్గాయి. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా 29,102 మంది తగ్గారు. సీజనల్ మైగ్రేషన్ అయిన వారిని తిరిగి స్కూళ్లలో చేర్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 12వేల మంది చేరారు. చేరికలు ఐదు లక్షలకు పైగా పెరిగాయి ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు చూస్తే.. వాటిపై శ్రద్ధ గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి మధ్యనున్న తేడా తెలుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో 2014–15లో 41,83,441 మంది పిల్లలుండగా 2015–16లో 39,24,078కు, 2016–17లో 37,57,000లకు, 2017–18లో 37,29,000లకు, 2018–19లో 37,20,988లకు చేరింది. అదే 2019–20లో 38,18,348లకు పెరగ్గా 2020–21లో 43,42,874లకు చేరింది. అంటే ఏకంగా 5 లక్షల మేర చేరికలు అదనంగా పెరిగాయి. 21–22లో 44,29,569లు కాగా 2022–23లో అది 40,31,239లుగా ఉంది. కరోనావల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి చేరికలు పెరిగాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, ఈ చేరికల్లో ఏపీ 14 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉన్నాయి. అసర్ నివేదిక కూడా ఇదే చెబుతోంది. జనాబా తగ్గుదలవల్ల కూడా చేరికలు తగ్గుతున్నట్లు ఎన్సీఈఆర్టీ నివేదిక చెబుతోంది. 2025 నాటికి 14 శాతం మేర తగ్గుతుందని నివేదించింది. ఇక 2019–20లో ప్రభుత్వ స్కూళ్లలో 38,18,348 మంది పిల్లలుండగా ప్రైవేటులో 32,28,681 మంది ఉన్నారు. అదే ప్రస్తుత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో 40,31,239 మంది పిల్లలున్నారు. అంటే రెండు లక్షల మంది అదనంగా పెరిగారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 2019–20తో పోలిస్తే 2,12,407 చేరికలు తగ్గాయి. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తగ్గాయని ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. కరోనా పరిస్థితులు తగ్గి ఆర్థిక స్థితి కొంత పెరిగి తిరిగి ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని అనుకున్నా అందరూ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లడంలేదని ఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు పథకాలు, ఇతర కార్యక్రమాలవల్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఐఏఎస్ అధికారులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారంటే రాష్ట్రంలో విద్యారంగంలో ప్రమాణాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టమవుతోంది. ఇక బెండపూడి స్కూలులో ప్రసాద్ అనే టీచర్ చేసిన ప్రయత్నంవల్ల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. దీన్ని రాష్ట్రంలోని ఇతర స్కూళ్లలోనూ అమలుచేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇంత మంచిగా కార్యక్రమాలు జరుగుతూ విద్యారంగం అభివృద్ధి సాధిస్తుంటే వెనుకబడిపోయిందని ఈనాడు తప్పుడు రాతలు రాయడం సరికాదు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వెనుక ఈనాడుకు నేరపూరిత ఉద్దేశాలున్నాయి. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమనా ఈనాడు ఉద్దేశ్యం? ఆంగ్ల మాధ్యమంలో ఒక్క వాక్యాన్నీ చదవలేకపోతున్నారని రాశారు. కానీ, అది అవాస్తవం. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో తెలుగు మీడియంలో 1,08,543 మంది హాజరైతే 43.97 పాసయ్యారు. ఇంగ్లీషు మీడియంలో 4,22,743 మంది రాస్తే 77.55 శాతం పాసయ్యారు. ఈ పరీక్షలను ఎలాంటి వాతావరణంలో నిర్వహించామో అందరికీ తెలుసు. మాస్కాపీయింగ్ చేసిన వారిని, దానికి సహకరించిన టీచర్లను కూడా సస్పెండ్ చేశాం. ఇంత పకడ్బందీ నిర్వహణలోనూ ఇంగ్లీషు మీడియం పిల్లలు పాస్ అత్యధికంగా ఉంది. ఏదీ రాయడం, చదవడం రాకుండానే ఇంతమంది పాసవుతారా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మిస్లీడ్ చేయడం వెనుక ఈనాడు ఉద్దేశమేమిటి? ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అయ్యాయంటూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమని పిల్లలకు చెబుతున్నారా? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. -
భారతీయ గ్రామాల్లో ఇంగ్లిష్ విప్లవం
ఇంతవరకు దేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్రాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్ పదాలు వచ్చిచేరాయి. ఇంగ్లిష్ పదాలతో మార్కెట్ అనేది మార్పుకు అసలైన యజమానిగా మారిపోయింది. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆపలేవు. అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అదే రోజు భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం కూడా. భారతదేశంలో ఇంగ్లిష్ భాషలో విద్యకు 205 సంవత్సరాల చరిత్ర ఉంది. యాదృచ్ఛికంగా అక్టోబర్ 5న నా 70వ జన్మదినం కూడా! ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తేవాలంటూ గత 30 సంవత్స రాలుగా నేను చేస్తూ వస్తున్న ప్రచారం ఇప్పుడు ఒక అర్థవంతమైన దశకు చేరుకుంది. విలియం కారీ, రాజా రామమోహన్ రాయ్ 1817లో నాటి కలకత్తాలో దేశంలోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. 2022 నాటికి ప్రధానంగా వైద్యశాస్త్రం వల్ల ప్రపంచం కాస్త ఉపశమనం చెందింది. అంతర్జాతీయ ప్రసార కర్తగా ఇంగ్లిష్ భాషను ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం నిజంగానే ప్రపంచం ధ్వంసం కాకుండా కాపాడింది. సైన్స్, ఇంగ్లిష్ రెండూ కలిసి మనలేకపోయి ఉంటే, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మరుభూమి అయిపోయి ఉండేది. భారతదేశంలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ఒకట్రెండు రాష్ట్రాలే తమ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తప్పనిసరి చేశాయి. భారతదేశంలో విద్యా విప్లవానికి ఇదే నాంది. ఇప్పటికే చాలాకాలంగా నాగాలాండ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలోనే బోధన కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం ప్రారంభించాయి. కశ్మీర్ చాలా కాలానికి ముందే ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ని తప్పనిసరి సబ్జెక్టుగా ప్రారంభిం చేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ బోధించడాన్ని ఎంతగానో ప్రోత్సహించింది. వీటితో పాటుగా, భారతదేశ వ్యాప్తంగా వేలాది ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కూడా ఉన్న విషయం తెలిసిందే. నా చిన్నతనంలో నా కుల ప్రజలు మానవులతోనే కాకుండా, జంతువులతో కూడా కురుమ అని పిలిచే భాషలో మాట్లాడేవారు. చాలా కొద్దిమంది ప్రజలు మాత్రమే ఆ భాషను అర్థం చేసుకునేవారు. దానికి లిపి ఉండేది కాదు. నా మొత్తం కమ్యూనిటీ నిరక్షరాస్య కమ్యూనిటీ. లిపి లేని భాష తమలో తాము మాత్రమే మాట్లాడుకునేది. ఇతర గ్రామీణులకు ఆ భాష అర్థమయ్యేది కాదు. నా చిన్ని గ్రామం చుట్టూ లంబాడా గిరిజన గుడిసెలు ఉండేవి. వారు గొర్ బోలి అనే లంబాడా భాషను మాట్లాడేవారు. గ్రామం లోపల కొన్ని ముస్లిం ఇళ్లు ఉండేవి. వారి పిల్లలు ఉర్దూ మాట్లాడే వారు. ఇక వ్యవసాయ పనులు చేసే అనేక కులాలు తెలంగాణ మాండలికంలోని తెలుగు మాట్లాడేవారు. దాంట్లో చాలా ఉర్దూ పదాలు ఉండేవి. గత 65 సంవత్సరాల నా చైతన్యపూర్వకమైన, భావ ప్రసార జీవితంలో ఒక మందగమనంతో కూడిన నిశ్శబ్ద విప్లవం చోటుచేసుకుంది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, గ్రామీణులు, పట్టణ వాసులు తేడా లేకుండా అన్ని ఇళ్లలో నిదానంగా ఇంగ్లిష్ మెల్లగా అడుగుపెట్టేసింది. మార్పు తీసుకురావడానికి ఇది ప్రారంభం. ఈ క్రమంలో బియ్యం స్థానంలో రైస్ అనే పదం వచ్చి చేరింది. మాంసం స్థానంలో మటన్ వచ్చి చేరింది. చేపలు అనే పదాన్ని ఫిష్ తోసి పారేసింది. కోడికూర స్థానంలో చికెన్, కూరగాయల స్థానంలో వెజిట బుల్స్ వంటి ఇంగ్లిష్ పదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల్లో, కుగ్రామాల్లో అన్ని కమ్యూనిటీలకు సొంతమైపోయాయి. గ్రామాల్లోని అన్ని సంతల్లో, అంగళ్లలో కూడా తెలుగు పదాలు పక్కకుపోయి ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరాయి. ఒక తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సరుకులకు ఉపయోగించే రోజువారీ పేర్లు, పదాలకు సంబంధించి కూడా ఇంగ్లిష్ పదాలు చలామణిలో ఉంటున్నాయి. నిదానంగా అయినా సరే, భారతీయ జీవనం తప్పనిసరిగా ఆంగ్లీకరణకు గురవుతోందని చెప్పాలి. తెలుగు, ఉర్దూ లేదా లంబాడి భాష మాట్లాడే ప్రజలు కూడా నిత్యం ఉప యోగించే ఆహార పదార్థాలు, పేర్లు, నూతన టెక్నాలజీలకు ఇంగ్లిష్ పదాలు జోడించడం అలవాటైపోయింది. వారి జీవితంలోకి ప్రవేశి స్తున్న ఇంగ్లిష్ వారి భవిష్యత్తును కూడా మారుస్తోంది. ఇప్పటికైతే ప్రతి గ్రామంలోనూ స్త్రీ పురుషులకు కొన్ని వందల ఇంగ్లిష్ పదాలు తెలుసు. ఈరోజు ఇంగ్లిషులో ఉన్న మెషిన్లను ఉపయోగిస్తున్నవారు సెల్ ఫోన్ వంటి ఇంగ్లిష్ పేర్లనే వాడుతున్నారు. వీరి మాతృభాషలో సెల్, ఫోన్ వంటి ఇంగ్లిష్ పదాలకు సరిసమాన పదాలు లేవు. ప్రాంతీయ టీవీ ఛానల్స్ అయితే 30 నుంచి 40 శాతం వరకు ఇంగ్లిష్ పదాలు, వాక్యాలనే వాడుతున్నాయి. మార్నింగ్ న్యూస్, ఈవెనింగ్ న్యూస్, బర్నింగ్ టాపిక్, గన్ షాట్, బిగ్ ఫైట్, బిగ్ డిబేట్, న్యూస్ ఎక్స్ప్రెస్ వంటివి తెలుగు టీవీ స్క్రీన్లపై సాధారణంగా ఉపయో గించే పదాలుగా మారిపోయాయి. ప్రాంతీయ భాషలను మాత్రమే ఉపయోగించే ఛానల్స్కు వీక్షకులు పెద్దగా లేరు. 1950లలో బస్సు, ట్రెయిన్ వంటి ఇంగ్లిష్ పదాలు మన గ్రామా లను చేరుకున్నాయి. ఎందుకంటే ఈ వాహనాల్లో వారు ప్రయాణిం చడం మొదలెట్టారు. అలా ప్రయాణిస్తున్నప్పుడు టికెట్, కండక్టర్ వంటి పదాలను కూడా వారు నేర్చేసుకున్నారు. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచే కొద్దీ పనిముట్ల పేర్లు, మెషిన్లు వంటి యంత్రాల పేర్లకు పలు ఇంగ్లిష్ పదాలు వాడటం వారి జీవితంలో భాగమై పోయింది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర అనే తేడా లేకుండా ఈ మార్పు జరుగుతూ వచ్చింది. నా తొలి బాల్యంలో నేను ఉపయోగించిన కురుమ భాష అంతరించిపోయినందుకు నేను విచారించలేదు. అప్పట్లోనే అనేక ఉర్దూ పదాలు కలిసిపోయిన తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. మా గ్రామం మాజీ నిజాం రాజ్యంలో ఉంటున్నందున నాటి తెలుగును గ్రామంలో లేదా సమీ పంలోని పట్టణంలో చాలామంది ప్రజలు అర్థం చేసుకునేవారు. ఇప్పుడు అన్ని వ్యక్తీకరణల్లోనూ మెల్లగా తెలుగు పదాల స్థానంలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరుతున్నాయి. వ్యాకరణంతో కూడిన భాషలో మాట్లాడకుండానే ఒక ఇంగ్లిష్ పదం లేదా పేరును ఉపయోగించడం ద్వారా చాలామంది ప్రజలు ఇప్పుడు పరస్పరం భావ ప్రసారం చేసుకుంటున్నారు. గ్రామంలో ఉత్పాదక భాష ఎన్నడూ వ్యాకరణ కేంద్రకంగా ఉండేది కాదు. అది భావ ప్రసార కేంద్రకంగా ఉండేది. ఇంగ్లిష్ పదాలు తమ కమ్యూనికేషన్ పరిధిని విస్తరించుకున్నాయి. నా తొలి బాల్యంలో గ్రామస్థులు ఇంగ్లిష్ పేర్లు కలిగి ఉన్న మెషిన్లను వాడటం మొదలెట్టారు. వాటి విడిభాగాలు కూడా ఇంగ్లిషులోనే ఉండేవి. ఉదా. 1960ల మొదట్లో సైకిల్ అనే పేరున్న వాహనం వారి జీవితంలోకి వచ్చేసింది. అలాగే చైన్లు, హ్యాండిల్స్ వంటి పదాలు కూడా. ఆ కాలంలోనే వారి గ్రామంలోకి వచ్చిన కరెంట్ అదే పేరుతో చలామణీ అయ్యేది. ఆయిల్ ఇంజిన్ అదే పేరుతో పిలిచేవారు. వాటి పేర్లతోనే ప్రజలు వాటి పాత్రలను, విధులను అర్థం చేసుకునేవారు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి మాతృభాషా పదాల స్థానంలో విప్లవాత్మకంగా ఇంగ్లిష్ పదాలు వచ్చిచేరాయి. ఆరెస్సెస్– బీజేపీ, కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు లేక ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చినా, లేకున్నా ఈ భాషా విప్లవాన్ని ఆపలేకపోయాయి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టులు, పార్సీలు వంటి అన్ని మతాల వాడుకలో ఇంగ్లిష్ పదాలు వచ్చి చేరాయి. మతాచరణలు, మత ఛాందసత్వాలు, మతతత్వం వంటివి ఈ భాషా విప్లవాన్ని ఆప లేవు. ఇంగ్లిష్ పదాలతో మార్కెట్ అనేది మార్పుకు అసలైన యజ మానిగా మారిపోయింది. ఈ మార్పును నేను చూడగలిగాను. ఇత రుల భాషను అర్థం చేసుకోలేని గ్రామాల్లోని ఇరుగుపొరుగు వారు కూడా ఇంగ్లిష్ పదాలను ఉత్తమంగా అర్థం చేసుకోవడం మొద లెట్టారు. ఎందుకంటే ఇంగ్లిష్ పదాలు వారిని మార్కెట్కు అను సంధానం చేశాయి. ఇంగ్లిష్ పదాలతో గ్రామ ప్రజలు ఇండియన్స్ అయిపోయారు. ఇంగ్లిష్ వారిని జాతీయవాదులను చేసింది. హిందీతో సహా ఏ ఇతర ప్రాంతీయ భాష కూడా దీన్ని సాధించలేకపోయింది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించుకునే కుటుంబాలకు – ‘ఇంగ్లిష్ మీడియం’ అందు బాటులోకి తీసుకురావాలని కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భిన్న అభిప్రాయాలకు, చర్చలకు దారి తీసింది. ఇప్పుడు ‘ఉచిత– పథకాల’ గురించి కోర్టుకు వెళ్లినట్టుగానే, అప్పట్లో ‘ఇంగ్లిష్– మీడియం’ విషయం కూడా కోర్టు వరకూ వెళ్ళింది. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన 30 ఏళ్ళ కాలంలో విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం తెలిసిందే. మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లల విద్య నాణ్యత విషయంగా ప్రభుత్వం ఎటువంటి వైఖరిని అనుసరించాలి? ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ తర్వాత, ఒక ఉద్యోగి ఇండియాలో పనిచేసినా లేదా విదేశాల్లో పనిచేసినా పని నాణ్యతా ప్రమాణాల విషయంలో ఈ రోజున ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు చదువు పూర్తి చేసుకుని ‘జాబ్ మార్కెట్’లోకి వచ్చే యువతకు ప్రాథమిక విద్య స్థాయిలోనే ‘వర్క్ ప్లేస్’ సవాళ్లు ఎదుర్కొనే నైపుణ్యాలను బోధించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. ‘ప్రొఫెషనల్ కోర్సు’లు పూర్తి చేసుకుని, ఉద్యోగాల్లో చేరుతున్న దశలో నైపుణ్యాల బోధన లేని కారణంగానే, మళ్ళీ వారికీ ‘స్కిల్ డెవలప్మెంట్’ కోర్సులు అవసరం అవుతున్నాయి. ప్రభుత్వం ఆ అవసరాన్ని గుర్తించి దాన్ని కనుక పట్టించుకోకపోతే, చదివిన డిగ్రీలతో పనిలేకుండా... జీవిక కోసం ‘మార్కెట్’లో చౌక ‘లేబర్’గా వీరు మారుతారు. దాంతో వీరి చదువుల కోసం ప్రభుత్వం చేసిన ‘వ్యయం’, తిరిగి వీరి సర్వీసుల ద్వారా జాతీయ స్థూల ఉత్పత్తికి అవుతున్న ‘జమ’ మధ్య వ్యత్యాసం తగ్గదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు స్థిరంగా– ‘జాబ్ మార్కెట్’లో నిలబడగలగడానికి– ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య స్థాయిలో ఇవ్వాల్సిన తర్భీదు ఎలా ఉండాలి? కొన్నేళ్లుగా ‘ఇంటర్నేషనల్ స్కూళ్లు’ ఉనికిలోకి వచ్చాయి. వాటి ‘కేంపస్’లు కూడా విశాలమైన స్థలం, భవనాలు, వసతులతో అలరారుతున్నాయి. అటువంటప్పుడు– అదే కాలంలో అదే ప్రాంతంలోని సమాజాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే బోధనా ప్రమాణాలు ఎలా ఉండాలి? పబ్లిక్ స్కూళ్లలో ‘యజమాని’ ప్రభుత్వ స్కూళ్లలో ‘ఉద్యోగి’ తయారయ్యే ఇటువంటి వైరుధ్యం, వ్యత్యాసం ఇలా విద్యార్థికి ‘కిండర్ గార్డెన్’ దశలోనే మొదలవుతున్నప్పుడు, దీనిపై... సమీక్ష సంస్కరణల చర్యల అవసరం ఉందా లేదా? ఇంకా ఈ వ్యత్యాసం కొనసాగడానికి ప్రభుత్వం ‘చెక్’ పెట్టే చర్యలు కనుక చేపడితే, అందుకు మన పౌర సమాజ స్పందన ఎలా ఉండాలి? ఉపాధి అంశం కంటే సున్నితమైనది మరొకటి ఉంది. అది– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలకు అందవలసిన ‘ఎమోషనల్ సపోర్ట్’. దీన్ని అర్థం చేసుకోవడానికి, ఒకప్పుడు మురికివాడలు అని మనం పిలిచిన పట్టణ శివారు కాలనీల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యే ‘ఫ్యామిలీ కేసులు’ ఎటువంటివో చూస్తే, ఆ కుటుంబాల్లో పెరిగే పిల్లలకు బడిలో టీచర్ల నుంచి అందవలసిన సాంత్వన ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. విజయవాడ వంటి రైల్వే జంక్షన్ పరిధిలో వీధి బాలల కోసం పని చేస్తున్న– ఎన్జీఓలు చెప్పగలరు– పిల్లల పట్ల మనం చూపే నిర్లక్ష్యం ముగింపు ఎలా ఉంటుందో! (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) పాఠశాల విద్యాశాఖలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల విషయంలో జరుగుతున్న వాద వివాదాలను... బయట నుంచి, దూరం నుంచి చూస్తున్న పౌరసమాజపు క్రియాశీలత అవసరమైన సమయమిది. ఈ పిలుపు ఒకరికి అనుకూలం, మరొకరికి ప్రతికూలం కాదు. ఇది మన కొత్త రాష్ట్రం కోసం. (క్లిక్: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!) - జాన్సన్ చోరగుడి సామాజిక విశ్లేషకులు -
ఇంగ్లిష్ మీడియంతోనే దేశాభివృద్ధి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రపంచ దేశాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన చేపట్టాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. సోమవారం తెల్లాపూర్లోని అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేస్తుందని దానిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం సైతం విద్యాభివృద్ధికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేయాలని సూచించారు. ధనవంతులు మాత్రమే ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడితే చైనా లాంటి దేశాలతో పోటీ పడగలుగుతామని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల కొత్తగా ఎనిమిది లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చేరారని తెలిపారు. అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కుల, మతాలకతీతంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాజకీయ నాయకులకు సైతం పలు సబ్జెక్టులో శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఇంగ్లిష్లో మాట్లాడేలా శిక్షణ ఇస్తామన్నారు. (క్లిక్: వారు నమ్మనివే... నేడు జీవనాడులు) -
ఏపీలో చదువు సూపర్.. ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ బృందం
సాక్షి, అమరావతి/పెనమలూరు: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన మౌలిక వసతులు, ఇంగ్లిష్ మీడియం అమలు, ద్వి భాష పుస్తకాలపై ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ బృందం ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలు తీరును అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ ప్రతినిధి బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఈ బృందం 3 రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్(ప్రయాగ్రాజ్) ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ శుక్లా, బృందం సభ్యుడు, లెక్చరర్ కుల్దీప్ పాండే సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈడుపుగల్లు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల ఉచ్ఛారణ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన విధానాలు, ద్వి భాషా పుస్తకాలు, శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. ఇంగ్లిష్ మీడియం బోధనలో మెళుకువలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి.. వారి ప్రతిభను పరిశీలించారు. శుక్లా మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్పై పట్టు సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఏపీలో అమలవుతున్న విద్యా విధానం, ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు బాగున్నాయని.. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ లెక్చరర్ సరికొండ సతీష్, ప్రధానోపాధ్యాయులు దుర్గాభవాని, సురేష్, పద్మ బాయి, పెనమలూరు ఎంఈవో కనక మహాలక్ష్మి పాల్గొన్నారు. -
ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి.. జేఈఈలో 99 శాతానికి పైగా వారే!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యావకాశాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తమ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారు అతి తక్కువ మంది కాగా.. వారిలోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్ సాధించిన వారు శూన్యం. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. డిమాండ్ల నేపథ్యంలో.. ఉన్నత విద్యావకాశాలను ముఖ్యంగా ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతేడాది నుంచి జేఈఈ మెయిన్ను ఆంగ్లంతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహింపజేస్తోంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్ రాసేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ముందు జేఈఈ నిర్వహణ బాధ్యతలు చూసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2014 వరకు ఆంగ్లం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ మాధ్యమాల్లో జేఈఈని నిర్వహించేది. 2016 తర్వాత ఆంగ్లం, హిందీ, గుజరాతీల్లో జేఈఈని కొనసాగిస్తూ మరాఠీ, ఉర్దూలను తొలగించారు. తమ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో జేఈఈ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నందున బెంగాలీ భాషా మాధ్యమంలో ఈ పరీక్షలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేయడంతో.. ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ మెయిన్ నిర్వహణకు బీజం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండటం, తమిళనాడు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఆ భాషా మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఎన్టీఏ.. జేఈఈలో ఆంగ్లం, హిందీ, గుజరాతీలతో పాటుగా కొత్తగా మరో 10 ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
అనవసర ఉద్యమాలు ఎందుకు?
సాధారణంగా పాదయాత్రలు, ఉద్యమాలు ఓ పవిత్రమైన, ప్రజోపయోగకరమైన పనులు కోసం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత మూడేళ్లుగా నిరసన యాత్రలు, ఉపవాస యాత్రల పేరు మీద జరుగుతున్న ఉద్యమాలు అర్థం లేనివి. ఆ మధ్య అమరావతి రాజధానిగా ఉండాలని 900 రోజుల ‘దండుగ పండుగ’ను చూస్తే అభివృద్ధి నిరోధక ఉద్యమాలు కూడా ఉంటాయన్న విషయం అతి సామాన్యడికి కూడా అర్థమైంది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, మరి కొందరు ఇతరులూ హాజరయ్యారు. సీపీఐ నారాయణ, రామకృష్ణలతో పాటు సీపీఎం నాయకులు, చుక్కా రామయ్య, నాగేశ్వర్, కోదండరాం లాంటి వాళ్ళంతా హాజరై అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనడం హాస్యాస్పదంగా ఉంది. ఇంతకీ అమరావతిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎందుకుండాలి? రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసం, మూడు ప్రాంతాల మధ్య సహోదర భావం నెలకొల్పడానికి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండటానికి మూడు రాజధానులు ఏర్పరిస్తే నష్టమేంటి? దీన్నెందుకు వ్యతిరేకించాలి? ఏదో మునిగిపోతున్నట్టు ఏండ్ల తరబడి నిరసనలు, అభివృద్ధి నిరోధక ఉద్యమాలు ఎందుకు? ఇలాంటి ప్రతీఘాత ఉద్యమాల నెన్నింటినో ఎదుర్కొని జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్నారు. ఈ ఉద్యమం వల్ల రాజధానుల నిర్మాణం మరింత ఆలస్యమవ్వడం తప్ప వేరే ప్రయోజనం లేదు. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రజలు రాజధాని లేనివారిగా మిగిలారు. వారు తమకు రాజధాని నిర్మాణం త్వరగా కావాలని కోరుకోవాలి కానీ నిర్మాణాన్ని అడ్డుకునే ఉద్యమాలు చేయడం సరైనదేనా? ఇంతకీ అమరావతితో పాటు మరో రెండు చోట్ల రాష్ట్ర రాజధాని ఉండటం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? అమరావతి ప్రాంతం చుట్టూ ఉన్న పాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఓ బలమైన సామాజిక వర్గం రాజకీయంగానూ, ఆర్థికంగానూ మొదటి నుంచి ఈ పెత్తనం సాగిస్తోంది. ఆ పెత్తనానికి భంగం కలుగుతుందన్న అపోహ ఈ ఉద్యమానికి ఒక కారణం. అలాగే అక్కడి భూములతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే అవకాశం పోతుందన్న కొందరి అక్కసూ దీని వెనుక ఉంది. నిజానికి ఆ ప్రాంత సామాన్య రైతుకు ఏ నష్టమూ లేదు. రాజధాని కొరకు సేకరించిన భూములను అవసరం ఉన్న మేరకు ఉంచుకొని మిగతావి వారికి అప్పజెప్పవచ్చు. లేదా ఆ భూములకు ఒప్పందం ప్రకారం తగిన ధర కట్టి ఇవ్వవచ్చు కదా! ఇక అభ్యంతరమేంటి? ఈ ఉద్యమాన్ని విరమించుకొని మూడు రాజధానుల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివాటిల్లో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఇలా చేస్తే ఆ సామాజిక వర్గంతో పాటు ఆ యాపార్టీలకు కొంతైనా పరువు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో బలంగానూ, తెలంగాణలో నామ మాత్రంగానూ జరుగుతున్న మరో అభివృద్ధి నిరోధక ఉద్యమం తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే తెలుగు మృత భాష అవుతుందట! ఇదేం వాదమో అర్థం కాదు. ఇంగ్లీషు మీడియం అయినా... ఒక సబ్జెక్టుగా తెలుగు ఉంటుందని ప్రభుత్వాలు చెబుతున్నా ఆ మాటను పట్టించుకోవడం లేదు వీరు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలంతా గ్రామీణ పేద బహుజన కులాలవారు. వాళ్లు కార్పొరేట్ ఫీజులను భరించలేక ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మాధ్యమం కోరుకుంటున్నారు. (క్లిక్: పవన్ కల్యాణ్.. ఉండాలంటాడా? పోవాలంటాడా?) 70 శాతం విద్యార్థులు తెలుగసలే లేకుండా కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుతుంటే తెలుగు మృతభాష కాదా! కనీసం ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుందనీ, మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ను ఏర్పాటు చేసి అక్కడికి ప్రతి గ్రామం నుంచి పిల్లలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామనీ ఏపీ ప్రభుత్వం చెబుతూనే ఉంది. నిజంగా తెలుగు మీడియం మాత్రమే చదవాలనుకునేవారు ఆ పాఠశాలల్లో చదువుకోవచ్చు. అయినా ఈ విషయాలనేమీ పట్టించుకోకుండా గుడ్డిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను వ్యతిరేకించడం సరి కాదు. (చదవండి: ‘రాజనీతి’లో రేపటి చూపు!) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీవేత్త -
ఇంగ్లిష్ మీడియం మంచిదేగా..!
తెలుగు మీడియంను రద్దు చేస్తే తప్పు బట్టాలి గానీ ఇంగ్లిష్ మీడియం ఉండటం వల్ల నష్టం ఏముంది? ఇంగ్లిష్ మీడియం కావాలని తల్లి దండ్రులు కోరుకుంటున్నారు. ప్రస్తుత విధానం కొనసాగితే బాగుంటుంది. అంతిమంగా నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేయాలి. – జీవో 117పై వాదనల సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గత నెల 10న జారీ చేసిన జీవో 117 అమలుకు మరో నెల సమయం పడుతుందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం డేటా సేకరణ మాత్రమే జరుగుతోందని, అంతకు మించి ఏమీ లేదని వివరించారు. ఏ ఒక్క పాఠశాలనూ మూసివేయడం లేదన్నారు. ఫలానా మీడియంలోనే చదవాలని ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయడం లేదని శ్రీరామ్ తెలిపారు. ఏ మీడియం ఎంచుకోవాలన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగానే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మనబడి నాడు–నేడు పథకం విజయవంతమైందని, దాదాపు 7.30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది ఏ రాజకీయ నాయకుడో, రాష్ట్ర ప్రభుత్వమో చెప్పిన మాట కాదని, స్వయంగా కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో సహా వెల్లడించిదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా మీడియం గురించి ప్రస్తావించలేదని, పిటిషనర్లు ఏవో ఊహించుకుంటూ తెలుగు మీడియం తీసేస్తున్నట్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రెండు మీడియంలు అమల్లో ఉంటాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు శ్రీకాకుళంలో తెలుగు, ఇంగ్లీష్, ఒరియా మీడియంలను ప్రవేశపెట్టామని చెప్పారు. కర్నూలులో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలను తీసుకొచ్చామన్నారు. విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయడం లేదని వివరించారు. కొత్త విధానంతో మూతపడే అవకాశం... జీవో 117, తదనుగుణ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పంగా సత్యవతి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పల్లేటి శేషగిరి, మరో ముగ్గురు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గంగారావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల పలు పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. నూతన విద్యా విధానాన్ని సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని హైకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడంతో ఆ పనిని ప్రభుత్వం ఇప్పుడు పరోక్షంగా చేస్తోందన్నారు. 8వ తరగతి వరకు కేవలం ఒకే మీడియం ఉంటుందని, 9, 10వ తరగతుల్లోనే ఇంగ్లీషు, తెలుగు మీడియంలు ఉంటాయన్నారు. రోస్టర్ ప్రకారం.. ఒక దశలో న్యాయమూర్తి జీవో 117 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధం కాగా శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. యథాతథస్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం న్యాయమూర్తి సిద్ధమయ్యారు. అయితే జీవో 117 విషయంలో ఇప్పటికప్పుడు ఏమీ జరగదని, తమ కౌంటర్ పరిశీలించకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోరడంతో న్యాయమూర్తి సమ్మతించారు. కాగా ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు చట్ట నిబంధనలను సవాలు చేశారని, రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పరిశీలన జరిపిన అనంతరం ఏజీ వాదనతో ఏకీభవిస్తూ ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
ఆధునిక అవసరాలు తీర్చే విద్య కావాలి
విద్య అనేది ఒక సామాజిక, సాంస్కృతిక జీవన మార్గాన్ని రూపొందిస్తుంది. అది ప్రపంచ జ్ఞానానికి మార్గం. ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుంది. మానవ జీవన సోపానమైన విద్య ప్రపంచ వ్యక్తిత్వాన్ని మనకు ఆవాహనం చేస్తుంది. మానవుడు విద్యను స్వార్థానికి ఉపయోగిస్తున్న సందర్భంగా అది కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ మెదడుకు ఒత్తిడిని కలిగించి, జ్ఞానాన్ని ధ్వంసించి పరీక్షోన్ముఖమైన దారి చూపుతుంది. ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నవారు కొందరు.. తమ పిల్లల్ని కార్పొరేట్ విద్యలోకి నెట్టి జ్ఞానశూన్యమైన విద్యా సోపానాన్ని ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకు అధిక ధనాన్ని విద్యార్జన కోసం వెచ్చిస్తున్నారు. మనిషి మౌఖిక సాంప్రదాయం నుంచి వచ్చిన వాడు. దళిత బహుజన మైనారిటీ విద్యను బోధనా పటిమ నుండి అందుకోవలసి ఉంటుంది. విద్యను ఒక జ్ఞాన స్రవంతిగా, వాస్తవ జీవన ప్రవాహంగా అభ్యసించినప్పుడే వాళ్ళు ప్రపంచ గమనంలోకి వెళ్లగలుగుతారు. దానికి భిన్నమైన కృత్రిమ విద్య వారు గ్రహించలేరు. అందుకే విద్యాంతరాలు ఏర్పడుతున్నాయి. విద్యలోకి కూడా మత, కుల, వర్గ భేదాలు జొరబడ్డాయి. నిజానికి ప్రకృతిలో ఉండే అనేక శక్తుల్ని మానవుడు బయటకు తీశాడు. వాటిని శాస్త్రాలుగా అభివృద్ధి చేశాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం... ఇలా ఎన్నో శాస్త్రాలను అభివృద్ధి చేశాడు. ఈ శాస్త్రాలతో అంతఃసంబంధం ఉన్న బడుగు వర్గాల విద్యార్థులకు ఇవి బాగా మెదడులోకి చొచ్చుకు వెళతాయి. అయితే ఇప్పుడు విద్యా బోధనలో నాణ్యత తీసుకురావడమే ముఖ్యమైన అంశం. కార్పొరేట్ విద్యా లయాల్లో ఉన్న వ్యాపార సంస్కృతిని ప్రభుత్వం నేరమై నదిగా గుర్తించాలి. వాటిలో ఆటస్థలాలు లేవు. లాబ్లు లేవు. ఎన్రోల్మెంట్ కూడా వేరే ప్రభుత్వ కాలేజీల్లో చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించవలసి ఉంది. ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందాలంటే ప్రపంచ భాషగా అభివృద్ధి చెందిన ఇంగ్లిష్ మాధ్యమ బోధన అనివార్యం. అంత మాత్రాన మాతృభాషను విస్మరించ కూడదు. మాతృ భాషలో జీవశక్తులు ఉంటాయి. ఆ జీవ శక్తులను నేర్చుకునే భాషలోకి పరివర్తితం చేయగలగాలి. ఇంగ్లిష్ భాషని మనం నేర్పే క్రమంలో గృహాన్ని కూడా మోడ్రన్ స్ట్రక్చర్లోకి తీసుకు వెళ్ళాలి. విద్యార్థులకు ప్రత్యేకమైన గదులుండాలి. టేబుళ్లుండాలి. డిక్షనరీలు ఉండాలి. టేబుల్ మీద గ్లోబ్ ఉండాలి. ‘బైజూస్‘ లాంటి తగిన నూతన పరికర ప్రాయోగిక అంశాలు... గృహ వాతా వరణం లేకుండా వర్ధిల్లవు. ప్రపంచ వేగాన్ని బట్టి, సమాజ పరిణామాన్ని బట్టి అవన్నీ అవసరం. తల్లిదండ్రుల్ని కూడా వయోజన విద్యాపరులుగా మార్చాలి. మరీ ముఖ్యంగా తాగుడుని పూర్తిగా నిర్మూ లించకుండా గృహ సంస్కృతిలో విద్య వర్ధిల్లదు. టీవీ సీరియల్స్ ప్రమాదకరంగా మారాయి. మధ్యతరగతి గృహిణుల గృహ వాతావరణాన్ని విద్వేషపూరితంగా సీరియల్స్ ద్వారా మారుస్తున్నాం. దానివల్ల విద్యార్థులకు విద్యా వాతావరణం గృహాల్లో లేదు. కార్పొరేట్ విద్యాశాలలు బలవంతమైన విద్యను బుద్ధి మీద రుద్దుతున్నాయి. దాని వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం ముందుకు వచ్చేసింది. విద్యార్జనకు సంబంధించిన శారీరక శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థికి లేదు. హైస్కూళ్ళలో అసెంబ్లీ మొదలయ్యే సమయానికి విద్యార్థులకు రాగి బిస్కట్లు, క్యాల్షియం బిస్కట్లు, ఒక గ్లాసు పాలు ఇవ్వాలి. దానిమ్మ, యాపిల్, బొప్పాయి, జామ వంటి పండ్లు ఉదయం 11 గంటలకు అందివ్వాల్సి ఉంది. విద్యార్థులు పోషకాహార లేమితో రక్తహీనతతో బాధపడుతున్నారు. డేట్స్ జెల్ వారికి పాలలో కలిపి ఇవ్వాల్సి ఉంది. జీడిపప్పు, బాదం పప్పు, వేరుసెనగ పప్పు వంటి బలవర్ధకమైన ఆహారాలు విద్యార్థులకు అందివ్వాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఇజ్రా యిల్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాలలోని స్కూల్స్లో తప్పనిసరిగా అందిస్తున్నారు. మెదడు చురుకుగా పనిచేయడానికి కావలసిన శక్తి మంచి ఆహారం వల్లనే లభిస్తుంది. శారీరక శక్తి లేని విద్యార్థులు చివరి పీరియడ్ కల్లా బల్లమీద ఒరిగిపోతున్నారు. విద్య అంటే అది జీవన సంస్కృతీ నిర్మాణం. మానవాభ్యుదయానికి అది సోపానం. ఈనాటి ప్రభుత్వ విద్యలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఎంత ముఖ్యమో... సామాజిక వాతావరణ రూపకల్పన కూడా అంతే అవసరం. జీవించడం అంటే సమాజంతో జీవించడమే. మానవత్వంతో జీవించడమే. ఈర్ష్య, ద్వేషాలను ప్రక్కనపెట్టినవారే అత్యున్నతమైన స్థానాలకు వెళ్తారు. ప్రపంచ వ్యాప్తంగా విద్య పెరుగుతోంది. విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. భాషాధ్యయనమే ఒక ఉపాధిగా కూడా పెరుగుతోంది. వరల్డ్ బ్యాంక్, యూఎన్ఓ, యునెస్కో, డబ్లు్యహెచ్ఓ, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో భాషా నిపుణుల అవసరం ఉంటోంది. ఇప్పుడు ఒక్క ఇంగ్లిషే కాదు... చైనీస్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ వంటి అన్ని భాషలూ నేర్చుకోవాల్సిన అవసరం ముందుకొచ్చింది. వివిధ భాషలతో పాటు శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, కవిత్వం వంటి అనేక కళలూ; క్రీడల సామర్ధ్యం, సాంకేతిక విద్యలు కూడా ఈనాడు విద్యార్థులు అభ్యసించవలసిన అవసరం ఏర్పడింది. (క్లిక్: ఉన్నవి అమ్ముతూ వ్యయం తగ్గింపా?) ప్రభుత్వం, ప్రజలు మమేకమై... విద్యా సాంస్కృతిక వికాసానికీ, కుల, మత రహిత జీవన విధాన అభ్యసనా నికీ; ఆచరణకూ, భారత రాజ్యాంగ స్ఫూర్తికీ... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాన్ని సాఫల్యం చేసే దిశలో ముందడుగు వేయవలసిన చారిత్రక సందర్భమిది. (క్లిక్: రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం?) - డాక్టర్ కత్తి పద్మారావు దళిత ఉద్యమ నిర్మాత -
ఇంగ్లిష్ .. ఫుల్ జోష్!
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘నాక్కూడా ప్రైవేటు బడిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని ఉండేది. కానీ నాన్న ఆకస్మికంగా చనిపోవటం, అమ్మకు నన్ను ప్రైవేటు బడికి పంపే స్తోమత లేకపోవడంతో మా సీతారాంకుంట తండా ప్రభుత్వ బడిలో ఐదవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నా. కానీ ఈ ఏడాది మా మారేపల్లి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టగానే అక్కడ చేరా. ఇంగ్లిష్ మీడియంలో కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సంపాదించి అమ్మకు గిఫ్ట్గా ఇస్తా..’అని సంగారెడ్డి జిల్లా మారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరిన అపర్ణ అనందంతో చెప్పిన మాటలివి. ఒక్క అపర్ణే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువుతున్న సుమారు పదకొండున్నర లక్షల మంది నిరుపేద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మూతపడిన స్కూళ్లు మళ్లీ కళకళ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతూ క్లాసులు మొదలవటంతో మెజారిటీ విద్యార్థులు తెలుగు మీడియం నుండి ఇంగ్లిష్ మీడియానికి (1 నుండి 8వ తరగతి వరకు) మారిపోతున్నారు. ఇక కొత్తగా ఒకటవ తరగతిలో చేరే వారు నూటికి నూరుశాతం ఇంగ్లిష్నే ఎంచుకుంటున్నారు. ఉమ్మడి పది జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో గతంలో విద్యార్థులు లేక మూతపడ్డ పాఠశాలలు సైతం ఈ మారు తెరుచుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కేశారం పాఠశాల విద్యార్థులు లేక మూతపడగా, ప్రస్తుతం ఇంగ్లిష్ విద్యాబోధనకు సిద్ధం చేయటంతో 25 మంది విద్యార్థులు ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చేరారు. దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే వెనుకబడిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పేద విద్యార్థులు భారీ సంఖ్యలో ఇంగ్లిష్ మీడియం వైపు ఆకర్షితులవుతుండటం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్లో ఇంగ్లిష్ మీడియంలో చేరికలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్లో తెలుగు మీడియం కన్నా రెట్టింపు సంఖ్యలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు. దక్షిణ తెలం గాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో మాత్రం తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. సమస్యలు అధిగమిస్తే సక్సెస్సే.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు మంచి స్పందన కనిపిస్తున్నా, తొలి ఏడాదిలో ఉపాధ్యాయుల సన్నద్ధత, పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల్లో మన ఊరు మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులు పదిశాతం కూడా పూర్తి కాకపోవటం, ఇప్పటికీ 25 శాతమే పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రావటం వంటి అంశాలు ప్రతి బంధకాలుగా మారాయి. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సహకారంతో ఉపాధ్యాయులకు ఆఫ్లైన్ –ఆన్లైన్లో ఇంగ్లిష్ బోధనపై బ్రిడ్జికోర్సు, ఇతర శిక్షణలు నిర్వహించినా ఉపాధ్యాయుల సన్నద్ధతపై ఇంకా కొంత సందిగ్ధత ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉపాధ్యాయులను ఇంగ్లిష్ బోధనలో సుశిక్షితులుగా చేయటంపై ప్రభుత్వం దృష్టి సారించి, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయటంతో పాటు బై లింగ్వల్ (ఇంగ్లిష్ –తెలుగు ద్విభాషల్లో)లో రూపొందించిన పాఠ్య పుస్తకాలు వీలైనంత త్వరగా సరఫరా చేయగలిగితే.. ఆంధ్రప్రదేశ్లో ‘నాడు – నేడు’విజయవంతమైనట్టే తెలంగాణలో ‘మన ఊరు–మన బడి’విజయవంతం అవుతుందని విద్యారంగ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తెరుచుకున్న స్కూళ్లివే.. ► నాలుగేళ్ల క్రితం మూతపడిన నిజామాబాద్ జిల్లా కేశా రం పాఠశాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు పాఠశాలలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కొము రం భీం జిల్లాలో పన్నెండు, ఆసిఫాబాద్లో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది విద్యార్థులతో నిండాయి. కొమురం భీం జిల్లా కోయగూడ ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్ల తర్వాత 15 మంది విద్యార్థులు చేరారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో 22 స్కూళ్లు తెరుచుకున్నా యి. మళ్లీ ప్రారంభం అవుతున్న పాఠశాలల్లో అత్యధి కం గిరిజన తండాల్లోనే ఉన్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శిక్షణ ఇచ్చేందుకు ఇఫ్లూ రెడీ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఇంగ్లిష్లో శిక్షణ ఇచ్చేందుకు, మెళకువలు నేర్పేందుకు ఇంగ్లిష్ అండ్ ఫారెన్లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) సిద్ధంగా ఉంది. దేశంలో ఇంగ్లిష్ భాష విస్తరణే లక్ష్యంగా 1958లో ఏర్పడిన సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (సీఫెల్) ఇప్పుడు ఇఫ్లూగా స్థిరపడింది. ఇఫ్లూ ప్రస్తుతం 105 దేశాల రాయబారులు, ఇతర ముఖ్యులకు ఇంగ్లిష్లో మెళకువలు నేర్పుతోంది. అలాగే తెలంగాణ రేపటి భవిష్యత్తు కోసం ఏం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. – సురేశ్కుమార్, వైస్ చాన్స్లర్, ఇఫ్లూ ఆత్మగౌరవంతో బతకడానికి.. ఇంగ్లిష్ అనేది ప్రపంచంలో మన వాళ్లు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది. అందుకే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టాలని నేను చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు నాడు –నేడు పేరుతో పాఠశాల విద్యను ఆధునీకరించి బలోపేతం చేశారు. తెలంగాణలోనూ ఓట్ల పథకంలా కాకుండా నిజాయితీగా ఇంగ్లిష్ మీడియంను ముందుకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొందరికే లబ్ధి చేకూర్చే దళితబంధు లాంటి పథకాలు ఎత్తేసి దళితులు, బలహీనవర్గాలకు అన్నివిధాలా మేలు చేసే విద్య కోసం నిధులు కేటాయించాలి. నా వంతు చేయూతగా యూట్యూబ్లో ఇంగ్లిష్ క్లాస్లు అందుబాటులోకి తేబోతున్నా. – ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఇంటి వద్దే ఇంగ్లిష్ పాఠాలు.. ఇంగ్లిష్ మీడియం కోసం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు కొత్తగా మా పాఠశాలకు వస్తున్నవారంతా ఇంగ్లిష్ మీడియాన్నే ఎంచుకుంటున్నారు. – బిందుశ్రీ, టీచర్, ఆదిలాబాద్ ఇంటి వద్దే ఇంగ్లిష్ పాఠాలు.. నేను ఇంతకు ముందు ఆటోలో పక్క గ్రామానికి వెళ్లేవాడిని. ఇప్పుడు మా ఇంటి వద్ద స్కూల్లోనే ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు. దీంతో నేను ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో చేరా. – బి.శివ, కేశారం, నిజామాబాద్ జిల్లా -
చంద్రబాబు నీ పిచ్చి మాటలు ఆపు: మంత్రి బొత్స సత్యనారాయణ
-
ఇంగ్లిష్ మీడియం చదువు.. అందరి చూపు సర్కారీ స్కూళ్ల వైపు!
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి సారించారు. ‘ఉన్న ఊళ్లోనే ఇంగ్లిష్ చదువు దొరుకుతుంటే, ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ పట్టణాల్లో ఉండటమేమిటీ?’అనే ఆలోచన చాలామందిలో కన్పిస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం గురించి పెద్దసంఖ్యలో ప్రభుత్వబడులను సంప్రదిస్తున్నారని విద్యాశాఖ చెబుతోంది. ‘ఇంగ్లిష్ అత్యవసర భాషగా ఇప్పటికే అన్నివర్గాలూ గుర్తించాయి. బోధనలో వెనక్కి తగ్గే అవకాశమే లేదు’అని వరంగల్కు చెందిన శాంతికుమార్ అనే ఉపాధ్యాయుడు అంటున్నారు. శిక్షణలో చిత్తశుద్ధి ఎంత? రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. ఇందులో 1–10 తరగతులు చదివేవారు 20 లక్షలమంది ఉంటారు. ప్రజల్లో స్పందన చూస్తుంటే ఈసారి కనీసం 2 లక్షలమంది కొత్తగా సర్కారు స్కూళ్లల్లో చేరే వీలుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం 1.06 లక్షల మంది టీచర్లు ఉండగా, ఇంకా 21,500 ఖాళీలున్నాయి. ప్రేమ్జీ వర్సిటీ శిక్షణ కన్నా ముందు 60,604 మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియం చెప్పగలిగే టీచర్లున్నారని గుర్తించారు. ప్రస్తుతం 80 వేల మందికి ప్రేమ్జీ వర్సిటీ ద్వారా ఆంగ్ల బోధనపై నెల రోజులపాటు శిక్షణ ఇప్పించారు. అయితే తెలుగు నేపథ్యం నుంచి వచ్చిన టీచర్లకు నెలరోజుల శిక్షణ సరిపోదనే భావన వ్యక్తమవుతోంది. ‘శిక్షణకాలంలో ఇంగ్లిష్ భాష ద్వారా భావాన్ని వ్యక్తం చేసే తరహాలో వీడియోలు ప్రదర్శించారు, దీంతోపాటే సంభాషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుండేది’అని ఆదిలాబాద్కు చెందిన కుమార్ వర్థన్ వ్యాఖ్యానించారు. ఆంగ్లం అంత కష్టమేమీ కాదు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంగ్లిష్పై విద్యార్థులు పట్టు సాధించడం ఈ తరంలో పెద్ద సమస్యేమీ కాదు. స్మార్ట్ ఫోన్ వాడని, ప్రతి దానికీ గూగుల్ సెర్చ్ చేయని పిల్లలున్నారా? ఫస్ట్ క్లాస్ నుంచే ఈ అలవాటు ఉంది. నిజానికి మనకు తెలియకుండానే 40 శాతం ఇంగ్లిష్ వాడకం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ భాష నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుమానాలు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడితే, క్రమంగా సమస్యలు సర్దుకుంటాయి. –స్వామి శితికంఠానంద, డైరెక్టర్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ బోధించే స్కిల్స్ ఉన్నాయి ఉపాధ్యాయుల్లో బోధించే నైపుణ్యం ఉంది. తెలుగు మీడియం నుంచి వచ్చినా, మారిన ప్రపంచంలో ఎంతోకొంత ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే బోధించేటప్పుడు భయం బ్రేకులు వేస్తోంది. మొదటిదశ శిక్షణలో ఇది కొంత దూరమైంది. మరో దఫా 5 వారాలు శిక్షణ ఉంటుంది. కాబట్టి, టీచర్లందరూ క్రమంగా ఆంగ్లంలో బోధించగలరు. –చెరుకు ప్రద్యుమ్న కుమార్, ప్రభుత్వ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కేంద్రం కో ఆర్డినేటర్ -
బాలికల విద్యకు భరోసా.. ప్రతి మండలానికో జూనియర్ కళాశాల: సీఎం జగన్
కాకినాడ జిల్లా బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్పై మంచి పట్టు సాధించారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా.. ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్ విద్యార్థులకు నేర్పించిన ఆంగ్ల బోధనా విధానాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)గా రూపొందించాలన్నారు. ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ తరహా బోధనా విధానాన్ని ప్రవేశ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఫొనెటిక్స్(ధ్వనిశాస్త్రం)పై ప్రస్తుతం పరిశోధన చేస్తున్న వారిని ఇందులో భాగస్వాములను చేయాలని, భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్ (యాస), డైలెక్ట్ (మాండలికం) చాలా ప్రధానమైన అంశాలని చెప్పారు. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ప్రతి టీచర్ మొబైల్లో ఉండేలా చూడాలన్నారు. ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్ను ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల అదనపు తరగతి గదులు అవసరం. నాడు–నేడు రెండో దశలో వీటి నిర్మాణం చేపట్టనున్నాం. ఇంగ్లిష్ భాషా బోధన, అభ్యాసం, ఫొనెటిక్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ సహకారంతో ‘గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్’ను రూపాందించాం. దీనిని శుక్రవారం (నేడు) అందుబాటులోకి తేనున్నాం. సమగ్రమైన ఇంగ్లిష్ బోధనకు ఈ యాప్ చాలా ఉపయోగకరం. అమ్మ ఒడికి బదులుగా రాష్ట్రంలో 8.21 లక్షల మంది విద్యార్థులు ల్యాప్టాప్లు కావాలని ఆప్షన్ ఎంచుకున్నారు. – సీఎం వైఎస్ జగన్తో అధికారులు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యావకాశాలను విస్తృత పరచడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలికల కోసం మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వ విద్యా విధానం మెరుగు పడడమే కాకుండా ఎక్కువ మంది వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మరుగుదొడ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 245 మండలాల్లో మాత్రమే బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మిగిలిన 434 మండలాల్లో జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అందుకోసం కేజీబీవీ లేదా హైస్కూల్ను ప్లస్ 2 స్థాయికి పెంచడం లేదా ఉన్న కాలేజీల్లోనే బాలికలకు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తే విద్యార్థులు వినియోగించుకునే అవకాశాలు మెరుగు పడతాయని చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడుతున్న బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు మేఘన, తేజస్విని, రిష్మ, అనుదీప్, వెంకన్నబాబు 23,975 స్కూళ్లలో నాడు–నేడు రెండోదశ ► పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు నాడు–నేడు కార్యక్రమం చేపట్టాం. రెండో దశలో భాగంగా 23,975 స్కూళ్లలో రూ.8 వేల కోట్లతో సమూల మార్పులు చేయాలి. అన్ని స్కూళ్లలో నెల రోజుల్లో పనులు నూరు శాతం ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ► ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచేలా చర్యలు తీసుకోవాలి. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చూడాలి. అందుకోసం పక్కాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటించాలి. ► గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)పై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఎక్కడా రాజీ పడకుండా పూర్తి నాణ్యతతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్), స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్), గోరుముద్ద పథకాన్ని మరింత మెరుగ్గా ఎలా అమలు చేయవచ్చో అధికారులు ఆలోచించాలి. ► విద్యార్థులకు అందించే విద్యా కానుక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కిట్లు ఉండాలి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరిచే జూలై 4 నాటికి కిట్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జూన్లో అమ్మ ఒడి అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. ► ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీ స్ఫూర్తితోనే ఇంగ్లిష్లో ప్రావీణ్యం ► బెండపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సీఎం వైఎస్ జగన్తో అనర్గళంగా ఇంగ్లిష్లో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియంలో బోధన వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా మీరే మాకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ► విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇన్ని గొప్ప పథకాలు ప్రవేశపెడుతున్నారని, మీ వల్లే ఇంత గొప్పగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోగలుగుతున్నామని ఎనిమిదో తరగతి విద్యార్థిని తేజస్విని ఆనందం వ్యక్తం చేసింది. తన చెల్లితో కలిసి కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న డబ్బులు రూ.929 సీఎంకు విరాళంగా అందజేసింది. అయితే బాలిక గుర్తుగా సీఎం కేవలం రూ.19 తీసుకుని మిగతా డబ్బును తిరిగిచ్చారు. ► పదో తరగతి విద్యార్థిని మేఘన ఇంగ్లిష్లో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడిందని, తాను తన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆంగ్ల భాషపై పట్టు సాధించానని చెప్పింది. అంతర్జాతీయ ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లు కూడా తన భాషా పరిజ్ఞానానికి ఎంతో ఉపయోగపడ్డాయంది. ► మరో విద్యార్థిని రిష్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టింది సీఎం జగన్ మాత్రమేనని, తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ప్రపంచంతో అనుసంధానం అయ్యేందుకు ఇంగ్లిష్ మాత్రమే ఉపయోగ పడుతుందని పేర్కొంది. ► ఏడో తరగతి విద్యార్థి అనుదీప్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దు. మీ నిర్ణయంపై మీరు (సీఎం) య«థావిధిగా ముందుకెళ్లాలి. మీ నమ్మకాన్ని మేం వమ్ము చేయం. మీ వెనుక మేముంటాం. నేను బాగా చదువుకుని ఐఏఎస్ అవుతా. అప్పుడూ మీరే సీఎంగా ఉండాలి. నేను మీ వద్ద సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు విమర్శిస్తున్న అందరి నోళ్లు మూయిస్తా. నాకు ఆ అవకాశం ఇస్తానని మాటివ్వండి’ అని కోరాడు. అనుదీప్ మాటలపై సీఎం జగన్తో పాటు అక్కడున్న అధికారులంతా ఆనందపడ్డారు. -
నేను ఐఏఎస్ అయ్యేదాకా మీరే సీఎంగా ఉండాలి సార్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై కొందరు అనవసర రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ వారి వాదనను తప్పని నిరూపించారు కాకినాడ బెండపూడి విద్యార్థులు. దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ప్రస్తావించారు బెండపూడి విద్యార్థులు. జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న ఆ విద్యార్థుల ఆంగ్ల భాషా పటిమకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. గురువారం తాడేపల్లికి ఆ విద్యార్థులను రప్పించుకుని కాసేపు మాట్లాడారాయన. ఈ సందర్భంగా.. రేష్మా అనే పదో తరగతి విద్యార్థిని మాట్లాడిన తీరుకు సీఎం జగన్ మురిసిపోయారు. హామీలన్నింటిని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి మీరని(సీఎం జగన్ను ఉద్దేశించి).. ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడవచ్చని చెప్పింది రేష్మా. ఇక మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. సగటు విద్యార్థిగా ఉన్న తనను.. మంచి వక్తంగా, అదీ ఇంగ్లీష్ ద్వారా రాటుదేల్చారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యేకించి.. మీ(సీఎం జగన్ను ఉద్దేశించి) ఇంగ్లీష్ ఇంటర్వ్యూలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పింది మేఘన. అనుదీప్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని, అందుకు కృతజ్ఞతలని అన్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. విద్యార్థులంతా మీ వెన్నంటి ఉంటామని చెప్పాడు. తనకు ఐఏఎస్ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని, తాను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదాకా మీరు సీఎంగా కొనసాగాలని, మీ దగ్గర పని చేయడం తన కోరికని, ప్రామిస్ చేయమని సీఎం జగన్ను కోరాడు అనుదీప్. ఆ చిన్నారి మాటలకు సీఎం జగన్ సహా అక్కడున్న వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇంగ్లీష్ మాట్లాడటంలో మంచి ప్రతిభను చూపుతున్న బెండపూడి విద్యార్థులను అభినందించిన సీఎం జగన్.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనసారా ఆశీర్వదించారు. చదవండి: ‘బెండపూడి’ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్ -
వారికో న్యాయం.. ఊరికో న్యాయం
రాజకీయ, న్యాయపరమైన అవరోధాలను అధిగమించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పాలసీని ఆంధ్రప్రదేశ్ ముందుకు తెచ్చింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏది బోధనాభాషగా ఉండాలి అనే అంశాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవడానికి తాను వ్యతిరేకిని కానంటూ కాంగ్రెస్ పార్టీకి చోదక శక్తిలాంటి రాహుల్ గాంధీ కూడా ఎలాంటి ఊగిసలాట లేకుండా స్పష్టత ఇవ్వడం గమనార్హం. కానీ బోధనా మాధ్యమానికి సంబంధించి తమ సొంత పిల్లల, కార్మిక వర్గ పిల్లల భవిష్యత్తు విషయంలో పూర్తిగా వ్యతిరేక వైఖరులను తీసుకుంటున్న మన ప్రజామేధావులతోనే అసలు సమస్య! ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా మేధావుల పాత్ర కీలకం. ప్రజాప్రయోజనాలకు ఏది వ్యతిరేకమని భావిస్తారో వాటిని వారు సవాలు చేస్తారు. భారత చరిత్రలో విద్యారంగం అత్యంత శక్తిమంతమైన వివక్షాపూరిత పాత్రను పోషిస్తూ వచ్చింది. రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యం అనేక వివక్షా వ్యతిరేక విధానాలకు మార్గం తెరిచింది. ఈ ప్రక్రియలో మన పాఠశాల, యూనివర్సిటీ విద్యావ్యవస్థ నిరంతరం మార్పులకూ, మలుపులకూ లోనవుతోంది. 2022 మే 7న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్లో కొంతమంది ప్రజా మేధావులను, కార్యకర్తలను కలవాలని కోరుకున్నారు. ఆయనను కలవాల్సిందని నాకూ ఆహ్వానం వచ్చింది. ఎలాంటి ప్రత్యేక ఎజెండా లేదనుకోండి! ప్రధానంగా రెండు అంశాలపై ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్లాను. ఒకటి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యపై, దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలలతో సరితూగే లాగా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను అభివృద్ధి చేసే సమస్యపై రాహుల్ అభిప్రాయం ఏమిటి? రెండు: ఆర్థికంగా వెనుకబడిన (ఓబీసీ) వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏమిటి? ఈ రెండింటికీ తెలంగాణలో తక్షణ ప్రాసంగికత ఉంది. రాహుల్ వరంగల్లో మే 6న భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ రైతులపై ఒక తీర్మానం చేసింది తప్ప ఇతర సమస్యలపై మౌనం వహించింది. ఆ తర్వాత మే 7న హైదరాబాద్లో భేటీ సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పట్ల ఆయన వైఖరి ఏమిటని రాహుల్ గాంధీని అడిగాను. తాను వ్యతిరేకం కానని రాహుల్ సమాధాన మిచ్చారు. తన పక్కనే ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈ అంశంపై వారి వైఖరి ఏమిటని రాహుల్ అడిగారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 2022–23 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తీసుకొస్తున్నట్లు ప్రకటిం చింది. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ఉంటుందని తెలిపింది. రాహుల్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ పాఠ శాలల్లో ఇంగ్లిష్ మీడియంకు టీ–కాంగ్రెస్ అనుకూలమని రేవంత్ రెడ్డి జవాబిచ్చారు. రాహుల్ ఆహ్వానించిన ప్రజా మేధావుల్లో ఒకరు జోక్యం చేసు కుని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. తెలుగు మీడియంలోనే తాను చదువుకున్నందున ఇంగ్లిష్ మీడియంలో చదవటం కంటే తెలుగు మీడియంలో చదవడం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఒక వామ పక్ష మేధావి నుంచి ఇలాంటి దృక్పథం నాకు ఆశ్చర్యమేసింది. ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మీడియం పట్ల వ్యతిరేకత కలిగి ఉంటున్న వారితో సమస్య ఏమిటంటే, వీరు తమ పిల్లలను మాత్రం తాము భరించ గలిగిన ఉత్తమ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివిస్తుంటారు. ఆశ్చర్యకరంగా రాహుల్తో భేటీ అయిన ఒక ముస్లిం మేధావి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే ముస్లిం యువతకు ఉద్యోగాలు కల్పించగల నైపుణ్యాలు అవసరమనీ, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఆ నైపు ణ్యాలు బోధించే పరిస్థితి లేదనీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను తాను వ్యతిరే కించడం లేదని రాహుల్ గాంధీ ప్రైవేట్ సంభాషణల్లో అయినా సరే, అంగీకరించడం ముఖ్యమైన విషయం. ఎందుకంటే 2015లో నాటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను ఆయన అధికారిక నివా సంలో నేను ముఖాముఖిగా కలిసినప్పుడు, కర్ణాటక ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం గురించి ఆలోచించమని సూచించాను. ఆయన స్పందనలో రెండు కోణాలున్నాయి. ఒకటి, అలాంటి విద్యా విధానాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోదు. రెండోది, యూఆర్ అనంత మూర్తి, గిరీష్ కర్నాడ్ వంటి కన్నడ మేధావులు చాలా కాలం నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రతి పాదనను వ్యతిరేకిస్తున్నారు. అందుకని సిద్ధరామయ్య సమాజంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మేధావులు, మీడియా తన ప్రభుత్వా నికి ఈ విషయంలో సమస్యలను సృష్టించవచ్చని చెప్పారు. కాబట్టి, ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి సమస్యలను కొనితెచ్చుకోవడం కంటే, టిప్పు సుల్తాన్ అంశాన్ని ఎత్తుకోవడానికే ఎంచుకున్నారు. అది బీజేపీని బలోపేతం చేసింది. రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఒక చోదకశక్తిగా ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇంగ్లిష్ వ్యతిరేక వైఖరిని కలిగి ఉంటున్న నేపథ్యంలో ఈ అంశంపై రాహుల్ వైఖరి కీలకమైనది. మరోవైపున భారత హోంమంత్రి అమిత్ షా మరో ముందడుగు వేసి, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలూ ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడాలని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏది బోధనాభాషగా ఉండాలి అనే అంశాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవడానికి తాను వ్యతిరేకిని కానంటూ రాహుల్ గాంధీ ఎలాంటి ఊగిసలాట లేకుండా స్పష్టత ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ మాత్రమే తప్ప ఏకీకృత రాష్ట్రం కాదని రాహుల్ నమ్ముతున్నందున, ఆయన పార్టీ రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ జాతీయ స్థాయిలో భాషా విధానాన్ని సూత్రీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. అసలు సమస్య ఎక్కడుందంటే– విద్యకు, ప్రత్యేకించి బోధనా మాధ్యమానికి సంబంధించినంత వరకూ తమ సొంత పిల్లల భవిష్యత్తు విషయంలో, కార్మిక వర్గ పిల్లల భవిష్యత్తు విషయంలో పూర్తిగా వ్యతిరేక వైఖరులను తీసుకుంటున్న మన ప్రజామేధావుల కపట పాత్రేనని చెప్పాల్సి ఉంది. యూరోపియన్–అమెరికన్ దేశాల్లో ప్రజా మేధాతత్వం అనేది వామపక్ష ఉదారవాద తత్వంగా ఆవిర్భవించింది. ‘నిజాయితీ భావన’ను, ప్రతి రంగంలోనూ మానవ సమానత్వం కోసం పోరా టాన్ని వ్యాప్తి చెందించడానికి ఆ దేశాల్లో వామపక్ష ఉదారవాదం వృత్తిగతంగా ఏర్పడుతూ వచ్చింది. ఆఫీసులో ఒకటి, వ్యక్తిగత జీవితంలో ఒకటి మాట్లాడటానికి ప్రజా మేధావులనేవారు అటు రాజకీయవాదులూ కారు, ఇటు సంస్థాగతంగా శిక్షణ పొందిన బ్యూరోక్రాట్లు అసలే కారు. ప్రత్యేకించి ప్రజా సమస్యలకు సంబంధిం చినంత వరకు వీరు సమాజాన్నీ, ప్రభుత్వాన్నీ వ్యతిరేక దిశల్లో నడిపించే విధంగా కాకుండా నిజాయితీ, చిత్తశుద్ధితో కూడిన వైఖరిని కలిగి ఉండాలి. ప్రజామేధావి తమకు ఏది మంచిదో ఇతరులకూ అదే మంచిదని చూడాలి. ఇతరుల ప్రయోజనం కోసం వీరు పోరాడాలి. ఏ సమాజంలో అయినా ప్రజామేధావులు అలాంటి స్థిరమైన వైఖరిని కలిగి ఉంటే, విస్తృత ప్రజానీకానికి సంబంధించిన అంశాలపై రాజ కీయ నేతలు తమ వైఖరిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రాహ్మణుల నియంత్రణలో సంస్కృతం ఆధిపత్యం చలాయిం చిన కాలంలో మన దేశ ఉత్పాదక ప్రజారాసులు చారిత్రకంగా నష్టపోయారు, వెనుకబాటుతనంలో కూరుకుపోయారు. ఇప్పుడు పేద ప్రజలకు ఇంగ్లిష్ భాషా విద్యకు సంబంధించి ఇలాంటి బౌద్ధిక నిజాయితీ రాహిత్యం కారణంగా ఇంగ్లిష్ విద్యకే గ్రామీణ, పట్టణ శ్రామిక ప్రజారాశులు దూరమైపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, మొన్నటి ఆంతరంగిక సమావేశంలో రాహుల్ గాంధీ వ్యక్తపరిచిన వైఖరిని ‘గ్రాండ్ ఓల్డ్’ జాతీయ పార్టీ పాటించినట్లయితే, అప్పుడు దేశం ఒక సరికొత్త విద్యావిధాన దశలోకి ప్రవేశిస్తుంది. అదే జరిగి నప్పుడు బీజేపీ కూడా అదే మార్గాన్ని అనుసరించక తప్పదు. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. హోంమంత్రి కౌంటర్
సాక్షి, విజయవాడ: ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కౌంటర్ ఇచ్చారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని ఆమె అన్నారు. ‘‘వాళ్ల పిల్లలను విదేశాల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకోవచ్చు.. పేదలు ఇంగ్లీష్ చదువులు చదవకూడదన్నదే చంద్రబాబు రూల్’’ అంటూ మంత్రి మండిపడ్డారు. చదవండి: బాబు పర్యటనకు దూరంగా గంటా శ్రీనివాసరావు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా?.ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకూ తెలియదంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘ఈ మూడేళ్లు రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వాల కంటే సంతోషంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నారు. కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారో వారికే తెలియదు. ఇప్పుడేమో జనాన్ని ఉద్దరించేస్తామని తయారయ్యారు. సీఎం జగన్ను పిల్లలందరూ మేనమామగా భావిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం’’ అని మంత్రి తానేటి వనిత అన్నారు. -
ఏపీ పథకాల వైపే అందరి అడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీని సందర్శించి ఆయా పథకాలు అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా అమల్లోకి తెస్తున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మెచ్చుకోవడమే కాకుండా ఆ రాష్ట్రంలోనూ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఏపీలో అమలవుతున్న బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ (ద్విభాషా పాఠ్యపుస్తకాలు)ను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించడానికి సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ద్విభాషా పాఠ్య పుస్తకాలను తమ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు పంపిణీ చేయనున్నట్లు మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ఇటీవల వారి అసెంబ్లీలో ప్రకటించారు. ఏపీలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అమల్లో ఉండేది. దీంతో ఆ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యలో, ఉద్యోగావకాశాల్లో వెనుకబాటుకు గురయ్యేవారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం లేనందున ఆయా సంస్థలు వీరివైపు దృష్టి సారించేవి కావు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్.. దూర దృష్టితో ఆలోచించి, ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కింద అందించే కిట్లలో డిక్షనరీని కూడా చేర్పించారు. ఆంగ్ల భాషా పదాలు సులభంగా అర్థమవ్వడంతో పాటు ఆ సబ్జెక్టు అంశాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకొనేందుకు తెలుగు మాధ్యమంలో కూడా అవే పాఠాలు ఒకే పుస్తకంలో అందేలా ఏర్పాట్లు చేయించారు. టెక్టŠస్ పుస్తకంలో పాఠ్యాంశం ఒక పేజీలో ఆంగ్లంలో, మరోవైపు తెలుగులో (మిర్రర్ ఇమేజ్) ఉండేలా ఈ పుస్తకాలను తీర్చిదిద్దారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. పాఠ్య పుస్తకాలు తక్కువ బరువుతో ఉండేలా ఇంజనీరింగ్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో మాదిరిగా పాఠశాల స్థాయిలోనూ సెమిస్టర్ విధానంలో ముద్రించి ఇస్తున్నారు. 2020–21లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు, 2021–22లో ఏడవ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో 8వ తరగతి విద్యార్థులకు కూడా అందించనున్నారు. డిగ్రీలోనూ ద్విభాషా పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా (ఇంగ్లిష్–తెలుగు) పాఠ్య పుస్తక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కోర్సులకు సంబంధించి మొత్తం 13 సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్ పుస్తకాలను ఈ విధానంలో ముద్రించారు. మన నాడు–నేడుపై తెలంగాణ మక్కువ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రారంభించారు. తద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పడడమే కాకుండా, సర్వాంగ సుందరంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఈ పథకాన్ని ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అనుసరిస్తోంది. ఈ పథకానికి వినియోగించిన సాఫ్ట్వేర్ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందించాలని ఆ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ ప్రధాన కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. ఏపీ ఆ సాఫ్ట్వేర్ను తెలంగాణకు అందించడమే కాకుండా ఇతరత్రా సహకారం అందించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఈ ఏడాది మార్చి 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మన ఊరు – మనబడి పేరుతో వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు. 26,065 స్కూళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో మహర్దశ రాష్ట్రంలో నాడు–నేడు కింద రూ.16,450.69 కోట్లతో 61,661 స్కూళ్ల రూపు రేఖల మార్పునకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,713 స్కూళ్లను రూ.3,697.86 కోట్లతో సర్వాంగ సుందంగా తీర్చిదిద్దారు. మిగతా వాటిలో రెండో దశ కింద పనులు చేపట్టారు. మొత్తంగా ఈ పథకం కింద పనులు చేపట్టనున్న స్కూళ్లు, వ్యయం వివరాలు ఇలా ఉన్నాయి. -
స్టార్స్.. మెమ్స్!
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఈ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022–2023) నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ స్కూళ్లను మరింత ఆధునీకరించబోతున్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ. 25 కోట్లు అవసరమవుతాయని గుర్తించారు. గురుకుల పాఠశాలల స్థాయిలో ఆశ్రమ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 326 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిల్లో మూడు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. 1.05 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లకు ఉచిత వసతి, భోజన సౌకర్యము కల్పిస్తారు. ఇవిగాక 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 30 వేల మంది పిల్లలున్నారు. ఈ పాఠశాలన్నీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలోకి మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల పేర్లను ‘ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (స్టార్)’గా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ (మెమ్స్)గా పేరు మార్చనున్నారు. ఆశ్రమ పాఠశాలలన్నింటినీ గురుకుల పాఠశాల మాదిరి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా టీచర్లకు శిక్షణ ఆశ్రమ, గిరిజన ప్రభుత్వ పాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చే క్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. లైబ్రరీ, ప్రయోగ శాలలు, ఆట వస్తువులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, టీచర్లలో బోధన సామర్థ్యం పెంపు, బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రాథమిక సౌకర్యాల కోసం కనీసం రూ.25 కోట్లు అవసరమని గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. మరింత లోతుగా ప్రణాళిక తయారు చేస్తోంది. మరోవైపు ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లకు శిక్షణ తరగతులను గిరిజన సంక్షేమ శాఖ ప్రారంభించింది. విడతల వారీగా అన్ని కేటగిరీల్లోని టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది. -
జాతీయవాదానికి ఊతమిచ్చింది ఇంగ్లిషే
భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ బ్రిటిష్ వారితో పోరాటంలో ఆనాడు కీలక పాత్రను పోషించారు. శతాబ్దాలుగా విద్యకు దూరమైపోయిన శూద్ర, దళితులకు తక్కువ స్థాయిలో అయినా సరే ఇంగ్లిష్ విద్య అందిన నేపథ్యంలోనే జాతీయవాద భావన దేశంలో మోసులెత్తింది. కానీ నెహ్రూవియన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్కు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత భారత జాతి భావన ప్రత్యేకించి 19వ శతాబ్దం మధ్యనుంచి మాత్రమే చైతన్య పూరితంగా నిర్మితమవుతూ వచ్చింది. కచ్చితంగానే అంతకు ముందు మనకు జాతిభావన లేదు. మనం నివసిస్తూ వచ్చిన ప్రస్తుత భూభాగం కోసమే ఆధునిక భారత జాతి అనే స్పష్టమైన రేఖకు సంబంధించిన బెంచ్ మార్క్ వ్యవస్థాపితమైంది. బ్రిటిష్ వలస పాల కులకు వ్యతిరేకంగా భారతీయుల ప్రప్రథమ తిరుగుబాటు 1857లోనే జరిగింది. మరి ఆనాడు ఆ తిరుగుబాటును ప్రేరేపించి, అమలు పర్చడానికి తమ భౌతిక, మానసిక శక్తిని వెచ్చించిన శక్తులు ఏవి? బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి నియంత్రణ నుంచి భూభాగాన్ని కాపాడటానికి తమ భౌతిక శక్తి ద్వారా దోహదం చేసిన శక్తులు ప్రధా నంగా శూద్రులు, దళితులు, ఆదివాసీల్లోనే రూపుదిద్దుకున్నాయి. బ్రిటిష్ సైన్యంలోని వివిధ రెజిమెంట్లలో శూద్రులు, దళిత రైతాంగం, వారి పిల్లలు లేకుండా ఉంటే, 1857 తిరుగుబాటు సాధ్యమయ్యేదే కాదు. వేదాలు, రామాయణం, మహాభారతం వంటి బ్రాహ్మణ పుస్త కాలను పోలిన చరిత్ర రాసిన ఆర్ఎస్ఎస్, హిందుత్వ లేదా వామపక్ష ఉదార ద్విజ రచయితలు కానీ.. ఆవు, పంది కొవ్వు వంటి సెంటి మెంట్లు కానీ ఆనాటి తిరుగుబాటుకు బాధ్యులు కారు. బ్రిటిష్ పన్నుల వ్యవస్థ పీడన, బ్రిటిష్ వలసవాద ప్రభుత్వానికి జీతం రాళ్లకోసం పనిచేస్తూ వచ్చిన అనేక మంది ద్విజ అధికారులతోపాటు, బ్రిటిష్ అధికారులు కలిసి సాగించిన దోపిడీనే... రైతు కమ్యూనిటీలు గ్రామస్థాయి నుంచి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాయి. బ్రిటిష్ ప్రభుత్వం కోసం ఆ రోజుల్లో ఏ శూద్ర, దళిత, ఆదివాసీ అధికారులూ పనిచేసిన చరిత్ర లేదు. బ్రిటిష్ వారు ఇక్కడికి రాక ముందే మొఘల్ పాలనలోకూడా ముస్లిం అధికారులతోపాటు, ద్విజులు (ప్రధానంగా బ్రాహ్మణులు, కాయస్థులు, ఖాత్రిలు) మాత్రమే అధికారులుగా పనిచేశారు. ముస్లిం రాజరిక పాలన పొడ వునా బనియాలు గ్రామ, పట్టణ స్థాయిలో వ్యాపార కార్యకలాపాల్లో కొనసాగుతూ వచ్చారు. బ్రిటిష్ పాలనలో కూడా వీరు తమ వృత్తికే పరిమితమయ్యారు. వర్ణధర్మ నియమాలను ధిక్కరించి శూద్రులను, దళితులను, ఆదివాసులను విద్యావంతులుగా చేయలేకపోయారు కాబట్టే ఈ మూడు విభాగాలకు చెందినవారు ఆనాడు ప్రభుత్వ ఉద్యో గాల్లోకి అసలు ప్రవేశించలేకపోయారు. భారతదేశంలో అతిపెద్ద మానవ జనాభా శూద్రులదే. భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. జాతి మొత్తం శారీరకంగా, మేధోపరంగా ఒక్కటై మానవతావాద తాత్విక పునాదిపై నిలిచి పోరాట రూపాలను, పద్ధతులను రూపొందిం చుకున్నప్పుడే దురాక్రమణ శక్తి నుంచి మన భూభాగాన్ని చేజిక్కిం చుకోవడం సాధ్యపడుతుంది. అప్పుడు మాత్రమే విదేశీ బంధనాల నుంచి మన భూభాగం విముక్తి చెంది జాతిగా మనగలుగుతుంది. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలు అలాంటి కీలక పాత్రనే ఆనాడు పోషించారు. కానీ, బ్రిటిష్ పాలనాయంత్రాంగం తన పాలన చివరి దశాబ్దాల్లో స్కూల్ విద్యను శూద్ర, దళిత, ఆదివాసీలకు తెరిచి ఉంచింది. దీనివల్లే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బీఆర్ అంబేడ్కర్ మొట్టమొదటి శూద్ర, దళిత మేధావులుగా ఆవిర్భవించి, వెయ్యేళ్లకు పైబడిన పురాతన వర్ణధర్మ దోపిడీని, కుల అణచివేతను సవాలు చేయగలిగారు. ఈ కమ్యూనిటీల సజీవ చరిత్రలో తొలిసారిగా విద్యా వంతులైన మేధావులు ఇంగ్లిష్ని చదవడం, రాయడం, అర్థం చేసు కోవడం సాధించగలిగారు. ఇక్కడే వారి తొలి విముక్తి మార్గం ఆరంభ మైంది. కానీ నెహ్రూవియన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యకు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల, దళితుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రిటిష్ ఇండియన్ ఇంగ్లిష్ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల పాలక భాషగా 1835లో రూపుదిద్దుకున్న సమయానికి, శూద్ర, దళిత, ఆదివాసీలు విద్యావ్యవస్థకు పూర్తిగా అవతలే ఉండిపోయారు. 1817లో కలకత్తాలో తొలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభించిన తర్వాత, ఆ వలస భాషకూడా అప్పటివరకు సంస్కృతంపై అదుపు సాధించిన ద్విజుల ఇళ్లలోకే ప్రవేశించింది. బెంగాలీ బ్రాహ్మణ జమీం దారీ కుటుంబానికి చెందిన రాజా రాంమోహన్ రాయ్ (1772– 1833) బ్రిటిష్ అధికారులతో తన కుటుంబ సంబంధాల ద్వారా ఇంగ్లిష్ని 18వ శతాబ్ది చివరలోనే నేర్చుకోగలిగాడు. భారత్లో సంస్కృత బ్రాహ్మణులకు, గొడ్డు మాంసం ఆరగించే బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడే అధికారులకు మధ్య భాషా బాంధవ్యం అలా ఏర్పడింది. రామ్మోహన్ రాయ్ తండ్రి రమాకాంత్ రాయ్ వైష్ణవ బ్రాహ్మణుడు. అయినా రామ్మోహన్ రాయ్ని సంస్కృతంతోపాటు పర్షియన్, ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అనుమతించాడు. రామ్మోహన్ రాయ్తో ప్రారం భమైన ఇంగ్లిష్ విద్య తర్వాత బెంగాల్లో మిషనరీగా జీవించిన విలియం కారే, రాయ్ అధ్వర్యంలో పాఠశాల విద్యా వ్యవస్థగా మారింది. ఆధునిక భారతదేశంలో రెండో అతి విశిష్ట వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ (1825–1917). ఇతను పార్సీ జొరాస్ట్రియన్ గుజరాతీ కుటుం బంలో పుట్టాడు. ఎల్ఫిన్స్టోన్ ఇనిస్టిట్యూట్ స్కూల్లో చదువు కున్నాడు. ఇది బహుశా బాంబే ప్రావిన్స్లోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం స్కూల్ అయివుంటుంది. బరోడా రాజు షాయాజీరావు గైక్వాడ్–3 సంరక్షణలో పెరిగిన నౌరోజీ తర్వాత బరోడా రాష్ట్రానికి దివాన్ అయ్యాడు. పార్సీ కమ్యూనిటీలో చాలాతక్కువ జనాభా ఉన్న ప్పటికీ విద్యలో చాలాముందుండేది. నౌరోజి తర్వాత బ్రిటిష్ పార్ల మెంటు సభ్యుడయ్యారు. తర్వాత 1885లో స్కాటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి ఏఓ హ్యూమ్తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించారు. విద్యావంతులైన భారతీయులతో కలిసి భారత ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని హ్యూమ్ కోరుకున్నారు. నౌరోజీ కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలేకి (1827–1890) దాదాపు సమకాలికుడే కావచ్చు. కానీ నౌరోజీ తన కమ్యూనిటీ విద్యా నేపథ్యం వల్ల బరోడా మహారాజు నుంచే కాకుండా బ్రిటిష్ అధికారులనుంచి కూడా సహాయం పొందగలిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బరోడా మహారాజుది శూద్ర కుటుంబం. కానీ ఆయన రాజరిక స్థానం బట్టి క్షత్రియ ప్రతి పత్తిని కట్టబెట్టారు. ఇలాంటి శూద్ర రాజరికాలన్నీ బ్రాహ్మణ మంత్రులు, పూజారుల ద్వారానే కొనసాగేవి. ఇలాంటి దయామయు డైన రాజు కూడా తన సొంత వర్గానికి చెందిన పిల్లలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు పంపేవారు కాదు. ఉన్నత విద్యకోసం వారిని ఇంగ్లండుకు పంపేవాడు కూడా కాదు. అయితే ఈ బరోడా రాజ కుటుంబమే తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు అమెరికాలోని కొలం బియా యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందిం చింది. అయితే వారి ఆర్థిక ప్రతిపత్తి ఏదైనా సరే శూద్రులను విద్య మాటెత్తితేనే భయపెట్టేవారు. విద్య శూద్రేతరమైనదనీ, శూద్రులు చదివినా, రాసినా దేవతలే ఆగ్రహిస్తారనీ పుకార్లు రేపేవారు. ఈ విధమైన భ్రమలూ, మూఢనమ్మకాలూ హిందూ చారిత్రక వార సత్వంలో భాగమైపోయాయి. విద్య అంటేనే శూద్రులు వణికిపోయే పరిస్థితిని కుల నియంత్రణపై పట్టున్న బ్రాహ్మణ భావజాలం వెయ్యి సంవత్సరాలుగా చొప్పిస్తూ వచ్చింది. విద్యపట్ల భయాన్ని శూద్రులు, దళితులలో మానసికంగానే రూపొందించేశారు. అందుకే బ్రిటిష్ వలసపాలనా కాలంలో కూడా శూద్రులు, దళితులు చదవడానికి, రాయడానికి నోచుకోలేక తమ తమ స్థానిక భాషల్లో మాట్లాడటం వరకే పరిమతమైపోయారు. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
‘ఏ టు జెడ్’ పట్టు చిక్కేలా..
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించడంతో.. విద్యాశాఖ కసరత్తును వేగవంతం చేసింది. ద్విభాషా (ఇంగ్లిష్, తెలుగు) బోధనకు అనుగుణంగా పుస్తకాలను ముద్రించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 20వేల మంది రిసోర్స్ పర్సన్స్ను విద్యా శాఖ ఎంపిక చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం కోసం పెద్దగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరమేమీ లేదని.. బోధనకు ఉపాధ్యాయులను సమాయత్తం చేయడమే ప్రధాన అంశమని అధికారులు చెప్తున్నారు. దశలవారీగా టీచర్లు ఆంగ్లంపై పట్టుసాధించేలా చేయడంపైనే దృష్టిపెట్టినట్టు పేర్కొంటున్నారు. పెరిగిన పోటీ చాలా వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నామని చెప్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లల్లో 30 లక్షల మంది విద్యార్థులుంటే.. అందులో 95 శాతం ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తంగా 22.93 లక్షల మంది చదువుతున్నారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం వారి సంఖ్య 10.21 లక్షలే. వీరికి కూడా ఇంగ్లిష్ మీడియం బోధన అరకొరగా సాగుతోంది.\\ తెలుగులోనే పాఠాలు చెప్తున్న పరిస్థితి. విద్యార్థులకు సరిగా అర్థంకాకపోవడమే దీనికి కారణమంటూ టీచర్లు సాకులు చెప్తున్నారన్న విమర్శలున్నాయి. నిజానికి చాలామంది ఉపాధ్యాయులు ఇంగ్లిష్లో బోధన అంటే భయపడుతున్నారని ఇటీవల విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, వారిలో భయం పోగొట్టాలని.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా బోధించేలా చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఎక్కువ రోజులు శిక్షణ.. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఉపాధ్యాయులకు ఎక్కువ రోజులు ఇంగ్లిష్పై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2009లో సక్సెస్ స్కూళ్లు పెట్టినప్పుడు 13 రోజులే శిక్షణ ఇచ్చారు. తమకు కనీసం 3 నెలలైనా శిక్షణ అవసరమని టీచర్లు చెప్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా శిక్షణ మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. సగానికిపైగా టీచర్లకు శిక్షణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అందులో 60 వేల మంది వరకు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో బోధిస్తున్న స్కూళ్లలో పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది తగిన శిక్షణ లేకున్నా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులే(ఎస్జీటీలే) అని విద్యాశాఖ పరిశీలనలో గుర్తించింది. హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ) ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. విద్యాశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. 23 వేల మంది ఎస్జీటీలు, 27 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు, మరో 5 వేల మంది భాషా పండితులు ఇంగ్లిష్లో పాఠాలు చెప్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించని వారితోపాటు ఇప్పటికే బోధిస్తున్నవారిలోనూ కొందరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారవర్గాలు గుర్తించాయి. -
Telangana: ఈ ఏడాది నుంచే ఇంగ్లిష్ మీడియం
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలంటూ కేబినెట్కు సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇందుకు సంబం ధించిన విధి విధానాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఈ భేటీలో పాల్గొన్నా రు. ఇంగ్లిష్ మీడియం అమలుపై సీఎంతో చర్చించాక విధివిధానాలు రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. ఈలోగా ఆంగ్ల మాధ్యమానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించింది. విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా ద్విభాషా విధానంలో పాఠ్య పుస్తకాలను ముద్రించాలని కోరింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, విద్యార్థుల్లో ఆంగ్లంలో ప్రత్యేక మెళకువలు నేర్పేందుకు అవసరమైతే టీ–శాట్ ద్వారా కోర్సులను అందుబాటులోకి తేవాలని సూచించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ఉపసంఘం చర్చించింది. దీని పై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, అధికారులు సయ్యద్ ఒమర్ జలీల్ పాల్గొన్నారు. -
ఆంగ్లమూ అనర్గళంగా..ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యార్థులకు సరిగా బోధన అందించేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దాలని.. అందుకోసం వారికి ఆంగ్లభాషలో పట్టుపెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతస్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు టీచర్లు కూడా.. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్కు మంచి భవిష్యత్ ఉంటుందని గుర్తించారు. ఆంగ్ల భాషలో బోధనకు అవసరమైన సామర్థ్యం పెంచుకునేందుకు సంసిద్ధమయ్యారు. విద్యాశాఖ అంతర్గత సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.02 లక్షల మంది టీచర్లు ఉండగా.. అందులో 10 శాతమే ఆంగ్ల మీడియంలో చదువుకున్న వారున్నారు. మరో 15% సొంతంగా ఆ భాషను నేర్చుకున్నట్టు గుర్తించారు. మిగతా 75 % మందికి ఆంగ్ల భాషపై పట్టు పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట స్పోకెన్ ఇంగ్లిష్తో.. విద్యార్థికి ఇంగ్లిష్ మీడియంలో బోధించే స్థాయిలో ఉపాధ్యాయుడికి ఏ తరహా శిక్షణ కావాలనే దానిపై కొందరు టీచర్లు తమ అనుభవాలను వెలిబుచ్చారు. ఇంగ్లిష్లో బోధించే సామర్థ్యమున్నా.. దానికి మెరుగులు దిద్దే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చిత్తశుద్ధితో శిక్షణ అందిస్తే.. అంతే నిబద్ధతతో నేర్చుకుంటామని అంటున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనతో సక్సెస్ స్కూళ్లను పెట్టినప్పుడు కేవలం 13 రోజులే శిక్షణ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి చాలా మంది తెలుగు మీడియంలో చదువుకున్నా.. తర్వాత అవసరాల రీత్యా ఇంగ్లిష్ భాషపై పట్టుపెంచుకున్నారు. కానీ ఇంగ్లిష్లో మాట్లాడే సామర్థ్యం మాత్రం తక్కువ. ఈ నేపథ్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పాలని, భయాన్ని పోగొట్టేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మొక్కుబడిగా కాకుండా.. ప్రాక్టికల్ క్లాసులు ఉండాలంటున్నారు. సాధారణంగా క్లాస్రూమ్లో విద్యార్థులు, టీచర్లు పరస్పరం ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంభాషణ పూర్తిగా ఇంగ్లిష్లోనే సాగేలా ఉండాలని టీచర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ స్థాయికి ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తర్వాత కూడా భాషపై పట్టు పెంచుకునేందుకు పాఠశాలల్లో ఇంగ్లిష్ రిఫరెన్స్ బుక్స్, లాంగ్వేజ్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆసక్తి ఉన్నవారితో శిక్షణ శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ కొంతమంది సుశిక్షితులను ఎంపిక చేస్తుంది. కానీ గతంలో ఈ విషయంగా పొరపాట్లు జరిగాయని ఉపాధ్యాయులు అంటున్నారు. శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్లను వారి సమ్మతి లేకుండా ఎంపిక చేశారని.. వారు టీచర్లను సన్నద్ధం చేయడం కన్నా, ఏవో కొన్ని క్లాసులు చెప్పి వెళ్లారనే విమర్శలున్నాయి. ఇప్పుడైనా శిక్షణ ఇవ్వడంలో ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయాలని టీచర్లు కోరుతున్నారు. పదాలపై పట్టు ముఖ్యం ఇంగ్లిష్లో బోధించేప్పుడు సమాంతర పదాలు చాలా తెలియాలి. ఉదాహరణకు వెన్నెముక ప్రాణులు– వెన్నెముక లేని ప్రాణులను ఇంగ్లిష్లో ‘వర్టిబ్రే.. ఇన్ వర్టిబ్రే’అంటారు. కేవలం స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటే ఇలాంటి వాటిపై అవగాహన ఉండదు. అందువల్ల పదాలపై పట్టు సాధించాలి. నిరంతర అధ్యయనం వల్లే ఉపాధ్యాయుడికి సాధ్యం. మహాసముద్రాలు అనే పదాన్ని ఇప్పటికీ ఓషన్స్ అని చెప్పకుండా లార్జ్ బాడీస్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నారు. కాబట్టి టీచర్లకు పదాలపై పట్టు పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – చెరుకు ప్రద్యుమ్నకుమార్, ప్రభుత్వ ఇంగ్లి్లష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్ టీచర్లలో భయం తొలగించాలి నేను ఎస్జీటీగా ఉన్నప్పుడు రిసోర్స్ పర్సన్గా పనిచేశాను. టీచర్లకు శిక్షణ ఇచ్చేప్పుడు తాము ఇంగ్లిష్ నేర్చుకున్నా.. బోధించగలమా? అనే భయం కనిపించేది. ఇది శిక్షణ ఇవ్వడంతోనే తొలగిపోదు. ప్రాక్టికల్ క్లాసుల ద్వారా ఈ భయాన్ని పోగొట్టాలి. శిక్షణ ఇచ్చేప్పుడు పరస్పర సంభాషణ తరగతులు ఎక్కువగా ఉండాలి. మోడల్ క్లాసులు నిర్వహిస్తే ఏ టీచర్ అయినా బోధించే మెళకువలు తెలుసుకోవడం కష్టమేమీ కాదు. మొదట 15 రోజులు.. కొన్నాళ్ళ విరామం తర్వాత మరో 15 రోజులు.. కలిపి కనీసం నెల రోజుల శిక్షణ ఉండాలి. – కలకుంట్ల రాజేశ్వర్రావు, బయో సైన్స్ టీచర్, మాజీ రిసోర్స్ పర్సన్, జిల్లెల్ల, రాజన్న సిరిసిల్ల మెళకువలను నిద్రలేపితే చాలు పూర్తిగా తెలుగు మీడియంలో చదువుకున్నా డిగ్రీ వరకూ ఇంగ్లిష్ సబ్జెక్టు ఉండేది. ప్రతీ టీచర్ పిల్లల కోసమో, సమాజంలో గౌరవం కోసమో ఇంగ్లిష్పై అవగాహన పెంచుకున్నారు. కాకపోతే స్కూళ్లలో తెలుగు మీడియమే ఉండటం వల్ల ఇంగ్లిష్లో మాట్లాడలేకపోతున్నాం. స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తే.. ఏడాదిలోనే మాకు మేం గ్రామర్ కూడా నేర్చుకుంటాం. కొంతకాలం బోధనకు ముందే టీచర్ ఇంటి దగ్గర పాఠం ప్రిపేరవ్వాల్సి వస్తుంది. – పణితి రామనాథం, స్కూల్ అసిస్టెంట్, మోరంపల్లి బంజర్, బూర్గంపహాడ్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం -
అందరి ఆకాంక్షల చదువు
ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఇప్పటికే ఈ విషయంలో చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటిదాకా విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవంతులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలిప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలవు. విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అధ్యాపకులందరినీ వృత్తిపరమైన క్రమశిక్షణను అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయం భారతీయ జనతా పార్టీ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వేసిన మాస్టర్ స్ట్రోక్! ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మ ఒడి వంటి పథకాలు జనసామాన్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అటు పట్ట ణాలు, నగరాల్లో మాత్రమే కాదు... పల్లెపట్టుల్లోనూ వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ప్రజల్లోనూ అలాంటి పథకాలు తమకూ అందుబాటులోకి వస్తే బాగుంటుందన్న కాంక్ష బలపడటం అసహజమేమీ కాదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు ఈ రెండు పథకాలు కలిసివస్తాయనడం లోనూ ఎలాంటి సందేహం లేదు; 2018 ఎన్నికల్లో రైతు బంధు మాదిరిగా! జాతీయ పార్టీల తీరు అటు బీజేపీ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను అంగీకరించలేవు. ఎందుకంటే ప్రాంతీయ భాషల సెంటిమెంటుతోనే ఈ పార్టీలు 70 ఏళ్లుగా తమను తాము బలపరుచుకుంటున్నాయి మరి! కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతో ఈ అంశంపై ఒకసారి చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం ఇంగ్లిష్ మీడియం బోధనపై సమస్యలు సృష్టిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేరళ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని నాతో వ్యక్తం చేశారు. అయితే... ఈ మేధా వులు, చదువుకున్న వారందరూ కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారన్న సంగతి మరచిపోకూడదు. భారతీయ జనతా పార్టీని తీసుకుంటే... రాష్ట్ర, జాతీయ స్థాయిలు రెండింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై ఆలోచన చేయడం లేదు. కానీ.. ధనికుల పిల్లలు చదువుకునేందుకు ప్రైవేట్ స్కూళ్లు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే నడిపేందుకు మాత్రం ఓకే చేస్తుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ శాలల, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్య పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలని అంటోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. ఆ పార్టీకి ఆర్థికంగా మద్దతిచ్చే పారిశ్రామిక వేత్తలు, భూస్వామ్య పోకడలున్న వారు సులువుగా డబ్బు సంపా దించేందుకు దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియం విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర విభాగాలేవీ కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాము ఇంగ్లిష్ బోధన అందిస్తామని చెప్పలేక పోతు న్నాయి. మతం, కమ్యూనలిజంల చుట్టే ఆ పార్టీ అజెండా ఉంటుం దన్నది వేరే సంగతి. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని ఇప్పుడు గ్రామీణ ప్రజలు సైతం అర్థం చేసుకున్నారు. పేద, ధనిక తార తమ్యాన్ని తగ్గించడం విద్య వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలి ప్పుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. మౌలిక సదుపాయాలు తోడైతేనే... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు మౌలిక సదు పాయాలూ తోడైతే అవి ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడగలిగే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలంటే ఎయిర్ కండీషన్ ఉన్న తరగతి గదులు కావాలని కాదు. ఈ దేశానికి అలాంటివి అస్సలు అవసరం లేదు. కావాల్సిందల్లా ప్రాథమిక అవసరాలను తీర్చగలిగేవి మాత్రమే. మంచి తరగతి గదులు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివన్నమాట. వీటన్నింటికీ మించి నిబద్ధతతో పాఠాలు బోధించే మంచి ఉపాధ్యాయుల అవసరమూ ఎంతో ఉంది. పాఠ్యపుస్తకాల్లోనివి వల్లెవేసే వారు కాకుండా... పరిస రాలను అర్థం చేసుకుని కనీస జ్ఞానంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జా తీయ అంశాలను పిల్లలకు పరిచయం చేయగలిగిన వారు కావాలి. పాఠ్యపుస్తకాలు ఇతర టీచింగ్ మెటీరియల్ సరఫరా కూడా కీలకమే. 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలు... దేశంలో విద్యకు సంబంధించి గత 73 ఏళ్లుగా ద్వంద్వ విధానాలే అమల్లో ఉన్నాయి. ధనికులకు ఇంగ్లిష్లో, పేదలకు ప్రాంతీయ భాషల్లో బోధన సాగుతూ వచ్చింది. ఇరు వర్గాల మధ్య సౌకర్యాల అంతరమూ చాలా ఎక్కువే. ఫలితంగా పేదవారు, గ్రామీణ విద్యా ర్థులు జీవితంలో అన్ని దశల్లోనూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఈ విద్యావ్యవస్థ ధనికులను మరింత ధనవం తులుగా మారిస్తే... పేదలను మరింత దరిద్రంలోకి నెట్టేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులకు ధైర్యంగా నిర్ణయించడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటివరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇంతటి వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పుకు యోచన కూడా చేయలేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని ప్రకటించినా ఏడేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన గురించి ఆలోచన కూడా చేయలేకపోయారు. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థలను బలపరిచే చర్యలు చేపట్టినా... గ్రామీణ స్థాయిలో పాఠశాల విద్యా బోధన నాణ్యత పెంచడం పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఒక దశలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంతో బలహీనమైంది కూడా. పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్యోగాలకు పోటీ పడే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటర్మీడియెట్ స్థాయిలో బోధన సక్రమంగా లేకపోవడంతో కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపింది. పాఠశాల స్థాయి ఉపా ధ్యాయులు మాత్రమే కాదు.. విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకుల ఇంగ్లిష్ ప్రావీణ్యత అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఆహ్వానించదగ్గ పరిణామం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ తగిన మౌలిక సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియం వైపు మళ్లించడం ఈ మార్పుల దిశగా వేసే తొలి అడుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలు పెట్టడం ఎంతైనా ఆహ్వానించదగ్గది. అయితే ఇది ఇక్కడితో ఆగి పోరాదు. పాఠశాల ఉపాధ్యాయులకు భాషతోపాటు కంటెంట్కు సంబంధించి తగిన శిక్షణ ఇవ్వడం ఒక పార్శ్వమైతే... టీచింగ్ వ్యవ స్థకు కొంత క్రమశిక్షణ నేర్పటం ఇంకోటి. ఉపాధ్యాయులు, అధ్యాప కుల ప్రజాస్వామ్య హక్కులకు గౌరవమిస్తూనే... విద్యాసంబంధిత అంశాల్లో పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ అందరినీ వృత్తి పరమైన క్రమశిక్షణ అనుసరించేట్టు చేయడం తప్పనిసరి. చైనీయుల మాదిరిగా విద్య నాణ్యత పెంచాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి అంతగా ఉన్నట్లు లేదు. జాతీయ విద్యా విధానం ఒక్కటే వ్యవస్థలో అన్ని మార్పులూ తీసుకురాదు. బీజేపీ మతతత్వ వాదం మైనార్టీలను ఆ పార్టీకి దూరం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలో విద్యావ్యవస్థనేమీ అంతర్జాతీయ స్థాయికి చేర్చలేదు. లేదా గ్రామీణ విద్యావ్యవస్థను చైనా మాదిరిగా మెరుగు పరచలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలు ఈ దిశగా వేస్తున్న అడుగు లకు అందరూ తమవంతు మద్దతివ్వాల్సి ఉంది. వ్యాసకర్త: ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
జీవో 317ను సవరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను గత నెలరోజులుగా మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్థానికత కోల్పోయి ఇతర జోన్లు, జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అయిన ఉద్యోగులను అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. సీనియారిటీపై అప్పీల్స్, సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రకటనలకే పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పేద వర్గాలకు ఉపయోగకరమే అయినప్పటికీ తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేస్తే ఆయా వర్గాలకే నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలన్నారు. 22న ఆన్లైన్ బహిరంగ సభ.. ఈ నెల 22 నుంచి 25 వరకు పార్టీ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తమ్మినేని తెలిపారు. 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నాయకులు ప్రసంగిస్తారన్నారు. -
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన
-
Telangana: అందరిదీ ఆం‘గళమే’
సాక్షి, హైదరాబాద్: ఆంగ్ల భాష ప్రపంచాన్ని శాసిస్తోందన్న విషయం అందరికీ అవగతమైంది. ఇంగ్లిష్పై పట్టు ఉంటేనే పిల్లలు పోటీ పరీక్షలు గట్టెక్కగలుగుతారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజిక్కించుకోవడంలో ముందుంటారనే వాస్తవాన్ని అన్ని వర్గాలు తెలుసుకున్నాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియంలో బోధనను కోరుకుంటున్నారు. వ్యయ ప్రయాసలతో కూడినదైనా కుగ్రామాల ప్రజలు సైతం తమ పిల్లల్ని స్కూలు బస్సులు, వ్యానులు ఎక్కించి మరీ, సమీప పట్టణంలోనో, మండల కేంద్రంలోనో ఉన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు పెరుగుతున్న డిమాండ్ను గుర్తించిన ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇంగ్లిష్ వైపే ఎక్కువ మంది తెలంగాణలో 42,575 స్కూళ్లుంటే ప్రభుత్వ పాఠశాలలు 31 వేలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు ఎక్కువైనా విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్లకే వెళ్తున్నారు. దీనికి కారణం అక్కడ ఆంగ్ల బోధన ఉండటమే. ప్రైవేటులో ఫీజు కట్టలేని వారే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియంలో చదివే విద్యార్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ‘సక్సెస్’సాధించిన స్కూళ్లు ఇంగ్లిష్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 2008లో సక్సెస్ స్కూళ్ల పేరుతో 6–10 తరగతులకు ఇంగ్లిష్ మీడియం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 5 వేలకు పైగా స్కూళ్లలో ఇలా సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. తర్వాత 2016లో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన చేపట్టారు. 1,800 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఉంటే, 4,500 వరకు ప్రాథమికోన్నత ఆపై తరగతుల్లో ఇంగ్లిష్ బోధన ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే ఇంగ్లిష్కున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో (గురుకులాలు కలిపి) మొత్తం 26,18,413 మంది విద్యార్థులుంటే, ఇందులో 12,35,909 (47.24 శాతం) మంది తెలుగు మీడియంలో చదువుతుంటే 12,72,776 (48.61 శాతం) ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 గురుకుల పాఠశాలల్లో ఉన్న 4,29,540 మంది ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో 84,234 మంది ఉంటే, ఇందులో 19,491 (23.14 శాతం) మంది తెలుగు మీడియం, 56,387 (66.94 శాతం) మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లలో 32,49,344 మంది విద్యార్థులకు గాను కేవలం 42,416 (1.31 శాతం) మంది తెలుగు మీడియంలో ఉంటే, 31,79,633 (97.85 శాతం) మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే ఉన్నారు. లోతైన అధ్యయనం చేయాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నా కార్యాచరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా బోధించే సత్తా సర్కారీ స్కూళ్ళకు ఉన్నప్పటికీ ఆచరణ లోపాలే సమస్యగా మారుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంగ్లిష్ మీడియం అమలుకు కావాల్సిన వనరులేమిటి? సాధ్యాసాధ్యాలేంటి? అనే విషయాలపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నడుస్తున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు, గతంలో కొన్ని పాఠశాలలు మూతపడ్డానికి కారణాలు పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయుల సంగతేంటి? రాష్ట్రంలో 1.06 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 10 శాతం మాత్రమే ఇంగ్లిష్ నేపథ్యంలో చదువుకున్న ఉపాధ్యాయులున్నారు. మరో 15 శాతం టీచర్లు ఇంగ్లిష్ బోధించగల సామర్థ్యం ఉన్నవాళ్ళని విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. మొత్తం మీద 25 శాతం ఉపాధ్యాయులు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. 2017లో జరిగిన డీఎస్సీలో 980 మందిని మాత్రమే ఆంగ్ల మాధ్యమం కోసం ప్రత్యేకంగా నియమించారు. కాబట్టి 75 శాతం ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లంతా క్వాలిఫైడే ఉంటారు. కాకపోతే వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు నేపథ్యం నుంచి వచ్చారు. ఇంగ్లిష్ భాషపై పట్టు కోసం శిక్షణ ఇస్తే బోధించే సామర్థ్యం వస్తుంది. కాబట్టి మొదట టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. మరోవైపు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తే 22 వేల మంది ఆంగ్ల భాష నేపథ్యం ఉండేవాళ్ళు వస్తారు. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పేదోడి జీవితమే మారుతుంది ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం ఊళ్ళను వదిలేసి పట్టణాలకు పోతున్నారు. గ్రామాల్లో ఇంగ్లిష్ బోధన అందుబాటులోకి వస్తే పేదవాడి జీవితంలో ఊహించని మార్పులొస్తాయి. ఇలాంటి ఉన్నతమైన చదువును పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీనిని చిత్తశుద్ధిగా అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని మార్పులు ఖాయం. – తుపాకుల వెలగొండ, మాజీ సర్పంచ్, విద్యార్థి తండ్రి, వి.కృష్ణాపురం, ఖమ్మం జిల్లా విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ప్రపంచంతో పోటీపడాల్సిన పరిస్థితుల్లో ఇంగ్లిష్పై పట్టున్న విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. అందరికీ ఆంగ్ల బోధన చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేయడం అభినందనీయమే. చిన్నప్పటి నుంచే ఆంగ్లంపై అవగాహన పెంచితే ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అన్ని తరగతులకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమ బోధన అంటే కొంత కష్టం కావొచ్చు. పెద్ద తరగతుల్లో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం అంటే విద్యార్థి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. – కె. శేషగిరి రావు (ఉపాధ్యాయుడు, హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా) -
‘సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అభినందనీయం’
కాచిగూడ (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను, ఎయిడెడ్ పోస్టులను, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల టీచర్ పోస్టులను, కస్తూరిబా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,500 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
Andhra Pradesh: డిగ్రీ కోర్సులు.. ఆంగ్ల మాధ్యమంలోనే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ తదితర కోర్సులు అభ్యసిస్తున్న యువతకు ఉద్యోగావకాశాలను మరింత చేరువ చేసేందుకు వీలుగా విద్యాశాఖ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులను 2021–22 విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అందించాలని నిర్ణయించింది. నిజానికి.. ఆంగ్లంలో నైపుణ్యాలున్న వారిని, ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించిన వారినే పలు సంస్థలు ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తున్న విషయాన్ని వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ‘ఫైండింగ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ వర్క్ : గ్లోబల్ ఎనాలసిస్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ వర్క్ ప్లేస్’.. పేరిట కేంబ్రిడ్జి యూనివర్సిటీ విడుదల చేసిన ఓ నివేదికలో ఆంగ్ల నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని వెల్లడించింది. అలాగే, దేశంలోని వివిధ సంస్థల యాజమాన్యాల్లో 90 శాతానికి పైగా మేనేజ్మెంట్లు తమ సంస్థల్లో పనిచేయడానికి ఇంగ్లీషు నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు మరో సర్వేలో తేటతెల్లమైంది. వాస్తవంగా కూడా రాష్ట్రంలోని బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న వారిలో ఆంగ్ల నైపుణ్యాలున్న వారు మాత్రమే ఉద్యోగావకాశాలను అందుకోగలుగుతున్నారు. తెలుగు మాధ్యమంలో డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఆంగ్ల నైపుణ్యాలు కొరవడి అవకాశాలు దక్కడంలేదు. తెలుగు మీడియంలో తగ్గుతున్న అడ్మిషన్లు ఈ నేపథ్యంలో.. డిగ్రీ కోర్సుల్లో క్రమేణా తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు కోరుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. 2020–21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో నిర్వహించిన ప్రవేశాల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో 2.62 లక్షల మందికి ఉన్నత విద్యా మండలి సీట్లు కేటాయించింది. వీరిలో 65,981 మంది తెలుగు మాధ్యమంలో చేరిన వారు. వీరిలో 24,007 మంది బీఏ, 16,925 మంది బీకాం, 24,960 మంది బీఎస్సీ, 89 మంది ఇతర కోర్సులను ఎంపిక చేసుకున్నారు. వీరికి ఉపాధి అవకాశాలు పెద్దగా రాకపోవడంతో గత కొన్నేళ్లుగా తెలుగు మాధ్యమం కోర్సుల్లోని సీట్లు 10 శాతం కూడా భర్తీ కావడంలేదు. దీంతో పలు కాలేజీలు ఆయా కోర్సుల నిర్వహణపై విముఖత చూపుతున్నాయి. ఫలితంగా 558 కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమాలుగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి ఉద్యోగావకాశాలను మరింత చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే తెలుగు మాధ్యమంలో చేరిన విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని యధాతథంగా కొనసాగించుకోవచ్చు. వారి మాధ్యమంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ విద్యాసంవత్సరంలో చేరిన వారు మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతారు. చేరికలు లేని కాలేజీలకు సీట్ల కేటాయింపు నిల్ రాష్ట్రంలో అత్యుత్తమ విద్యా బోధనను అందించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి పలు చర్యలు చేపడుతోంది. కనీస ప్రమాణాలు లేకపోవడంతో పాటు గత కొన్నేళ్లుగా చేరికల్లేకుండా కొనసాగుతున్న డిగ్రీ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో సీట్ల కేటాయింపును నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇలాంటి కాలేజీలకు నోటీసులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 1,551 కాలేజీలుండగా వాటిలో 0–10 శాతం మాత్రమే చేరికలున్న కాలేజీలు 502 ఉన్నాయి. 10–20 శాతంలోపు చేరికలున్నవి 490 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. చేరికల్లేని, ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఒక్క విద్యార్థీ చేరని 40 కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో పూర్తిగా సీట్ల కేటాయింపును నిలిపివేయనుంది. అలాగే, 257 కాలేజీల్లో విద్యార్థులు చేరని 454 కోర్సులకు కూడా ఈ ఏడాది చేరికలు నిలిపివేస్తోంది. ఇలా చేరికల్లేని 112 కోర్సులను పలు కాలేజీలు ఉపసంహరించుకున్నాయి. 23 నుంచి వెబ్ ఆప్షన్లు ఇక రాష్ట్రంలోని అన్ని నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 22తో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పూర్తికానుంది. 23–26 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి 29న మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. గత ఏడాది డిగ్రీ ప్రవేశాలు ఇలా.. జిల్లా మహిళలు పురుషులు మొత్తం తెలుగు మీడియం అనంతపురం 10,293 12,034 22,327 4,184 చిత్తూరు 12,685 16,228 28,913 2,737 తూర్పు గోదావరి 14,575 13,291 27,866 8,077 గుంటూరు 9,350 11,347 20,697 4,005 కడప 7,120 7,971 15,091 2,320 కృష్ణా 9,390 9,346 18,736 3,569 కర్నూలు 10,634 12,605 23,239 5,597 నెల్లూరు 6,486 7,040 13,526 1,027 ప్రకాశం 7,591 8,434 16,025 3,160 శ్రీకాకుళం 9,546 8,563 18,109 11,280 విశాఖపట్నం 11,672 11,839 23,511 6,986 విజయనగరం 7,807 8,338 16,145 8,512 పశ్చిమ గోదావరి 8,510 8,688 17,198 4,527 మొత్తం 1,25,659 1,35,724 2,61,383 65,981 ఎయిడెడ్ కాలేజీల్లోని సీట్లు.. మరోవైపు.. ప్రభుత్వ ఎయిడ్తో నడుస్తున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో గత కొంతకాలంగా చేరికలు భారీగా తగ్గిపోయాయి. ఈ సంస్థల్లోని అన్ ఎయిడెడ్ సెక్షన్లలో కొంతమేర చేరికలుంటున్నా ఎయిడెడ్ సెక్షన్లలో సీట్లు భర్తీ కావడంలేదు. ఈ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఈ నేపథ్యంలో.. వీటిని ప్రభుత్వంలోకి తీసుకుని ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టాలని ఆయా యాజమాన్యాల అంగీకారాన్ని కోరింది. అయితే, కొన్ని సంస్థలు అంగీకరించగా కొన్ని నిరాకరిస్తున్నాయి. దీంతో చేరికల్లేని ఈ కాలేజీల్లోని ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. ఇక నుంచి ఆ కాలేజీలు అన్ ఎయిడెడ్ కాలేజీల కింద కొనసాగుతాయి. ఈ యాజమాన్యాలు అన్ ఎయిడెడ్ సెక్షన్లను ఏ మేరకు కొనసాగిస్తాయో ఆయా వర్సిటీలకు తెలియజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. -
తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!
తెలుగు భాష గొప్పతనం పట్ల ఎవరికీ సందేహాలు లేవు. అదే సమయంలో జీవితంలో ఎదగడానికి ఇంగ్లిషు అవసరాన్ని కూడా ఎవరూ నిరాకరించలేరు. ఆంగ్ల మాధ్యమంలో పిల్లలను చదివించడానికి వైసీపీ ప్రభుత్వం చేసే ప్రయత్నం, తెలుగు భాష గొప్పతనాన్ని తక్కువ చేయడం కాదు. అది కాలానుగుణమైన విధానం. నిరుపేదలకు ఆంగ్ల సరస్వతిని దగ్గర చేయడం. అయినా తెలుగు నెపంతో ప్రతిపక్షాలు విమర్శించడం దురుద్దేశాలతో కూడుకున్నది. పోనీ తెలుగు మీద ఇంత అభిమానం కనిపిస్తున్నట్టుగా నటిస్తున్న ఈ నేతలు తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారా, చదివిస్తున్నారా, చదివిస్తారా? ఆచరణలో పెట్టని నీతులకు విలువ ఉండదు. అది ప్రజలకు స్పష్టంగా తెలుసు. తెలుగు భాష గొప్పదే. దానిని అంతా కాపా డుకోవలసిందే. అదే సమయంలో తెలుగు యువత జీవితాలు అంతకన్నా గొప్పవి. వారు ఉన్నతంగా ఎదగడా నికి తెలుగుతో పాటు ఇతర భాషలు కూడా అధ్యయనం చేయవలసిన రోజులివి. తెలుగును వాడుక భాషలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయనకు నివాళి అర్పించే సందర్భంగా తెలుగు విశిష్టత గురించి మాట్లాడుకోవడం ఆహ్వానించదగిందే. కానీ ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వంపై ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయాలన్న తలంపు కొందరికి రావడమే దురదృష్ట కరం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రకటన చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు కోసం ఈయన చేసినంత కృషి ఇంకెవరూ చేయలేదేమోనన్న భావన కలుగుతుంది. బోధన భాషగా, పాలన భాషగా ఉన్నప్పుడే ఆ భాష రాణిస్తుందని చంద్ర బాబు సెలవిచ్చారు. తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు దాదాపు పద్నాలు గేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తెలుగును బోధన భాషగా, పాలనభాషగా ఎంత వృద్ధి చేశారు? ఇంగ్లిష్ మీడియం గురించి చర్చ జరుగుతున్నప్పుడు మున్సిపల్ స్కూళ్లలో తొలుత తానే ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టానని ఎందుకు చెప్పారు? పోనీ తన పాలనా కాలంలో ఒక శాఖలో అయినా తెలుగులో ఫైళ్లను నడిపారా? తెలుగును నీరుకార్చమని ఎవరూ చెప్పరు. కానీ ప్రపంచంతో పాటు మనం నడవకపోతే ఎంత వెనుకబడిపోతామో తెలుగు మీడి యంలో చదివి నానాపాట్లు పడుతున్నవారిని అడిగితే తెలుస్తుంది. తెలుగులో చదువుకున్న కొద్దిమంది ఉన్నత స్థానాలలోకి వెళ్లి ఉండ వచ్చు. అంతమాత్రాన అంతా తెలుగులోనే చదవాలని చెప్పడం కరెక్టు కాదు. తెలుగు, తెలుగు అని గొంతు చించుకుంటున్న ప్రముఖుల పిల్లలుగానీ, మనుమళ్లు గానీ ఎవరూ తెలుగు మీడియంలో ఎందుకు చదవడం లేదన్న ప్రశ్నకు ఎవరూ జవాబు ఇవ్వరు. 1950 నుంచి 1980 వరకు ప్రైవేటు రంగంలో విద్య పెద్దగా లేదు. ఎవరైనా చదువు కోవాలంటే వీధిబడో, ప్రభుత్వ పాఠశాలనో మాత్రమే ఉండేవి. కానీ కాలక్రమేణా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభు త్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు. పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడం సంగతి అలా ఉంచి, తెలుగులో చదవడమే అంతంతమాత్రంగా తయారైంది. సైన్స్, ఇతర సాంకేతిక పుస్తకాలు తెలుగులో అనువదించినా అర్థం కాని పరిస్థితి. మరో వైపు ప్రైవేటు స్కూళ్లలో మంచి విద్య ఇస్తున్నారన్న భావన, క్రమశిక్షణ ఉంటుందన్న అభిప్రాయం ఉండేది. అంతకుమించి ఇంగ్లిష్ మీడియం వల్ల తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని తల్లిదం డ్రులు నమ్మారు. అందువల్లే ముప్పై, నలభై ఏళ్ల క్రితం కొత్తగా పెట్టిన మిషనరీ స్కూళ్లకు విపరీతమైన గిరాకీ ఉండేది. కాస్త స్థోమత కలిగిన వారంతా ఆ స్కూళ్లలోనే చదువుకునేవారు. ఆ తర్వాత మెజారిటీ స్కూళ్లు ప్రైవేట్ రంగంలోనే స్థాపితమయ్యాయి. దాంతో ప్రభుత్వ స్కూళ్లు నిరుపేదల పిల్లలకే పరిమితం అయ్యాయి. ఇందులో సమా జంలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్లారు కదా, ఆయన తెలుగు మీడియంలోనే చదివారు కదా, పది వాక్యాలు ఆంగ్లంలో వాగ్దాటితో మాట్లాడగలరా అన్న ప్రశ్నను ఆయన రాజకీయ ప్రత్యర్థులు వేస్తుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ఆంగ్లం బాగానే మాట్లాడగలరు. కాకపోతే తెలుగులో అంత ప్రావీణ్యత సాధించలేక పోయారు. దానికి కారణం చంద్రబాబేనని అనవచ్చా? లోకేష్ను తెలుగు మీడియంలో ఎందుకు చదివించలేదు? ప్రభుత్వ స్కూల్లో ఎందుకు వేయలేదని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? లోకేష్ కూడా వాడుక భాష గురించి సందేశం ఇచ్చారు. మరి ఆయన తన కుమారు డిని ఇప్పుడు ఎక్కడ చదివిస్తున్నది కూడా చెప్పి ఉంటే ఆదర్శంగా ఉండేది కదా! దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు పీజీ చేసి, లా కూడా చదివారు. తెలుగు మీడియంలోనే చదువుకో వడం వల్ల ఆంగ్లంలో ప్రావీణ్యుడు కాలేకపోయారు. పార్లమెంటులో ఆయన ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే ఎన్నో తప్పులు దొర్లేవి. పాత్రికే యులు సరదాగా ఆయనతో ఈ విషయం ప్రస్తావిస్తే, ‘మనం ఏమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివామా? నాకు వచ్చిన భాషతోనే మాట్లాడా’నని సరదాగా చెప్పేవారు. ఆయన పిల్లలు ఢిల్లీలో మంచి స్కూల్లో చదువుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు, లోక్సభ సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఆంగ్లంలో ఎంత బాగా మాట్లాడ గలుగుతున్నారు! ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుందా, లేదా! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పిల్లలు ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుకుంటు న్నారని గతంలో చెప్పినట్లు గుర్తు. అక్కడ తెలుగు మీడియం ఉందా, ఆంగ్ల మీడియం ఉందా? ఆయా దేశాలలో ఉండే కొందరు తెలుగువారు భాష గురించి కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ ఆ దేశాలలో వారి పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఏపీలో కానీ, తెలంగాణలో కానీ ఎంపీలు, ఎమ్మెల్యేల పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుతున్నారా? మరి సామాన్యుల విషయంలో మాత్రం కొందరు నేతలు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వీరే కాదు, కొందరు పత్రికాధిపతులు తాము తెలుగును ఉద్దరిస్తున్నామన్న ట్లుగా ప్రచారం చేసుకుంటుంటారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం పెద్ద, పెద్ద ఆంగ్లమీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారు. అలాకాకపోతే ఈ నేతలు కానీ, పత్రికాధిపతులు కానీ, ఉన్నతస్థానాలలో ఉన్నవారు కానీ గుండెమీద చేయి వేసుకుని తమ పిల్లలు తెలుగు మీడియంలోనే చదివారనో, ఇకపై చదివిస్తామనో చెప్పమనండి! అంతేకాదు, తెలుగు గురించి ఇన్ని చెప్పేవారు తాము స్థాపించిన స్కూళ్లను ఆంగ్ల మీడియంలో ఎందుకు నడుపుతున్నారంటే దానికి జవాబు ఉండదు. ఆచరించి చూపితేనే వాటికి విలువ ఉంటుంది. చెప్పేటందుకే నీతులు అన్నట్లు వ్యవహరిస్తే ప్రజలు అర్థం చేసుకోలేని అమాయకులా? తెలంగాణలో ఈ మధ్య డిగ్రీ క్లాసులకు అడ్మిషన్లు అడిగినవారిలో తొంభై శాతం మంది ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో వారికి తెలుసు కనుకే అలా ఎంపిక చేసుకున్నారు. అంత మాత్రాన వారికి తెలుగు రాదని, రాకూడదని కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మీడియంను చిన్న తరగతుల నుంచే ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. ఇంతవరకు అనేక ప్రైవేటు స్కూళ్లలో అసలు తెలుగే లేకపోయినా ఎవరూ అడగలేదు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం అనగానే ఏదో కొంప మునిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ఆయా సబ్జెక్టు లలో ఇంగ్లి్లష్, తెలుగులలో ఒకే పుస్తకంలో పాఠ్యాంశాలు ఇస్తోంది. ఇది తెలుగును పరిరక్షించినట్లు కాదా! పిల్లలకు మరింత సులువుగా ఉండే మార్గం కాదా! ‘నాడు–నేడు’ కింద స్కూళ్లను వేల కోట్ల వ్యయంతో బాగుచేస్తున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. దానికి తోడు ఆంగ్ల మీడియంను కూడా జోడిస్తుండటంతో సుమారు ఆరు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో పెరిగారు. దానిని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గిడుగు రామ్మూర్తి పంతులు తీసుకు వచ్చిన వాడుక భాష వల్ల తెలుగుకు మేలు కలిగింది. అందులో సందేహం లేదు. కానీ ఆయన తెలుగులోనే చదవండి, మరే భాష నేర్చుకోవద్దు అని చెప్పలేదు. వర్తమాన సమాజంలో ఏది మంచో, ఏది కాదో ప్రజలకు తెలుసు. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర దేశాలకు వెళ్లాలన్నా ఆంగ్ల మాధ్యమమే కీలకం అన్న సంగతి పదే, పదే చెప్పనక్కర్లేదు. తెలుగు తప్పనిసరిగా నేర్చుకోండి, కానీ ఆంగ్లంలో చదువుకోండి అన్న నినాదం తెలుగువారికి ఎంతైనా మేలు చేస్తుందని చెప్పాలి. వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు ప్రముఖ జర్నలిస్ట్ -
‘ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు’
సాక్షి, చిత్తూరు: ఆంగ్ల బోధనపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కొడుకు లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు లోకేష్ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు.. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని నిలదీశారు. విద్యకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ మిథున్రెడ్డి గుర్తుచేశారు. చదవండి: ‘టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి’ -
Govt Schools: ఇంగ్లిష్.. చిక్కుముడి
►రాష్ట్రంలో సర్కారీ స్కూళ్లల్లో ఆంగ్లమాధ్యమంలో చేరే విద్యార్థులు పెరుగుతున్నారు. అయితే తెలుగు మాధ్యమ టీచర్లు 80% ఉండ గా, ‘ఇంగ్లిషు’లో బోధించేవారు 20% ఉన్నారు. ►ఇంగ్లిష్ టీచర్ల సంఖ్యను పెంచేందుకు కొత్తగా నియామకాలు చేపట్టాలి. లేదా తెలుగు మీడియం టీచర్లకు ఇంగ్లిష్లో తర్ఫీదు ఇవ్వాలి. నియామకాలు చేపడితే తెలుగు మీడియం టీచర్లు మిగిలిపోతారు. వీరిని ఏం చేయాలన్నది విద్యాశాఖను వేధిస్తున్న సందేహం. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. జిల్లా స్థాయి అధికారులు సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు? విద్యార్థులు ఎక్కువ ఉండి, టీచర్లు తక్కువ ఉన్న స్కూళ్లు ఎన్ని ఉన్నాయనే డేటాను సేకరిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని 1.08 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80% వరకు తెలుగు మాధ్యమంలో బోధించేవారే ఉన్నారు. కాగా 2009లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. అప్పట్నుంచీ ఆ మాధ్యమంలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అదే ఏడాది జరిగిన డీఎస్సీలో ఆంగ్ల మాధ్యమం బోధించే అధ్యాపకుల నియామకం జరిగింది. అయితే స్వల్ప సంఖ్యలోనే ఈ నియామకాలు జరిగాయి. ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ (నిష్టా) ఆధ్వర్యంలో తెలుగు టీచర్లకు ఆంగ్లంలో శిక్షణ ఇస్తూ పరీక్షలు నిర్వహించి పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మొత్తం టీచర్లలో ఇంగ్లిష్ మీడియం బోధించే వారి సంఖ్య 20 శాతానికి మించకపోవడం సమస్యగా మారింది. 2009 నుంచి ఇప్పటివరకు ఎక్కువ స్కూళ్ళల్లో తెలుగు మీడియం టీచర్లే ఆంగ్లంలో బోధిస్తున్నారని, దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పెద్ద సమస్య! రాష్ట్రవ్యాప్తంగా 40,898 ప్రభుత్వ, ప్రైవేటు పాఠాశాలలుండగా వీటిల్లో 60,06,344 మంది విద్యార్థులున్నారు. 2019–20 యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) లెక్కల ప్రకారం ఇంగ్లిష్ మీడియంలో ఉన్న వాళ్ళు 73.60 శాతమైతే, తెలుగు మాధ్యమంగా చదివేవాళ్ళు 23.84 శాతమే ఉన్నారు. ఇక మొత్తం స్కూళ్లలో 30 వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 26.87 లక్షల మంది చదువుతున్నారు. వీరిలో 10 లక్షల మంది వరకు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నట్టు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరేవారిలో 65 శాతం ఇంగ్లిష్ మాధ్యమాన్నే కోరుకుంటున్నారని తేలింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధించే ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా పెరగాలి. 2019–20 లెక్కల ప్రకారం మొదటి తరగతిలో (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి) 6.55 లక్షల మంది చేరితే, ఇందులో 4.63 లక్షల మంది ఇంగ్లీష్ మీడియాన్నే ఎంచుకున్నారు. దీన్నిబట్టి చూసినా సర్కార్ స్కూళ్ళలో సైతం ఆంగ్ల మాధ్యమం బోధించే ఉపాధ్యాయుల సంఖ్య భారీగా పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేం ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు మీడియం బోధించే వారికి అవసరమైన నైపుణ్యం కల్పించడమా? లేదా మిగులు టీచర్లను డీఈవో పూల్లో పెట్టడమా? అనే దానిపై ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో సమగ్ర డేటా సేకరించిన తర్వాత పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆంగ్లంలో బోధన జరగకపోతే విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళకు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యానికి రేషనలైజేషన్ ఓ సవాల్గా మారనుందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. టీచర్లకు శిక్షణలో ‘నిష్టా’కీలకపాత్ర ఆంగ్ల మాధ్యమంలో బోధించే టీచర్ల సంఖ్య పెంచేందుకు జాతీయ స్థాయిలో కృషి జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ‘నిష్టా’కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా కాలంలోనూ ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు కూడా ఇస్తోంది. తెలంగాణలోని మొత్తం టీచర్లలో 20 శాతం మంది మాత్రమే ఆంగ్లంలో బోధించేవారుండగా, వీరిలో సగం మందికి నిష్టాయే శిక్షణ ఇచ్చింది. వాస్తవానికి విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై శిక్షణ తరగతులు నిర్వహించాలి. అయితే తెలుగు మీడియం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు దీనిపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారని అధికారులు అంటున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి సెలవుల్లో శిక్షణపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇంగ్లిష్లో సంభాషణ పెరగాలి ఇంగ్లిష్ మీడియంలో సైతం బోధన సరిగా జరగడం లేదనే విమర్శలున్నాయి. అయితే తెలుగు మాతృభాషగా ఉన్న విద్యార్థులకు అర్థం కాకపోవడం వల్లే తెలుగులో బోధిస్తున్నట్టు టీచర్లు చెబుతున్నారు. ఇంగ్లిష్లో పరస్పర సంభాషణ క్రమంగా పెంచుకుంటూ వెళితే అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయుడికీ ఇంగ్లిష్ భాష మీద పట్టు వస్తుందని నిష్టా అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లిష్లో పాఠం చెప్పాలంటే కనీసం ఒక రోజు ముందు ప్రిపేర్ కావాలని పేర్కొన్నారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఉన్నత విద్యావంతులేనని, కాస్త శ్రద్ధ పెడితే వారంతా ఆంగ్లంలో బోధన వైపు తేలికగా మళ్ళొచ్చని నిష్టా పరిశీలనలో వెల్లడైంది. అందరికీ ఆదర్శం ‘బోరేగావ్’ సాధించాలనే తపన, శ్రద్ధ ఉంటే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దొచ్చనడానికి నిజామాబాద్ జిల్లా బోరేగావ్ గ్రామ హైస్కూల్ ఓ ఉదాహరణ. అక్కడి ప్రధానోపాధ్యాయుడి ప్రత్యేక పర్యవేక్షణలో 1,100 మంది విద్యార్థులు ఆంగ్ల బోధనలో విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లిష్ మీడియంలో చెప్పగలిగేలా ఆయన వారిలో స్ఫూర్తిని రగిలించారు. టీచర్లలో కొందరు నిష్టా ద్వారా శిక్షణ పొందారు. కార్యాచరణలో చిత్తశుద్ధి అవసరం చిత్తశుద్ధి గల కార్యాచరణ ప్రణాళికతో ముందుకువెళ్తే ఉపాధ్యాయులు తమ నైపుణ్యం పెంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇది అన్ని స్థాయిల్లోనూ జరగాలి. ఇప్పటికే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. సోషల్, బయోసైన్స్ చెప్పే టీచర్లు మినహా మిగతా సబ్జెక్టులు చెప్పే తెలుగు మీడియం టీచర్లు ఇంగ్లిష్లో బోధించేలా తర్ఫీదు ఇవ్వొచ్చు. దీనికి టీచర్ల సంఘాలూ సహకరిస్తాయి. పిల్లలు, తల్లిదండ్రులు సంతృప్తి చెందేలా బోధన జరగాల్సిన అవసరమైతే ఉంది. అయితే ఈ ప్రక్రియను క్రమంగా, ప్రణాళిక బద్ధంగా ముందుకు తీసుకెళ్ళాలి. – జంగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు 2019–20 లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళలో ఏ మాధ్యమంలో ఎంతమంది విద్యార్థులు... మాధ్యమం విద్యార్థుల సంఖ్య ఇంగ్లిష్ 44,21,111 తెలుగు 14,32,098 ఉర్దూ 1,45,545 హిందీ 3229 మరాఠీ 2515 కన్నడ 1441 బెంగాలీ 250 తమిళం 155 -
ఏపీలో విద్య దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి : నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, విద్యా కానుక, నూతన విధానాల్లో బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని విద్యా విధానం దేశానికే ఆదర్శం అని విద్యా రంగం నిపుణులు కొనియాడారు. ‘75 వసంతాల స్వరాజ్యంలో విద్యా సంస్కరణలు– ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో శనివారం మేధావుల వర్చువల్ సమావేశం నిర్వహించారు. పలువురు మేధావులు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గడిచిన రెండేళ్లలో విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయన్నారు. నాడు – నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లిష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు బా టలు వేశారని చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తుండటం మంచి పరిణామం అని ప్రశంసించారు. అమ్మ ఒడి, విద్యా కానుకతో ఎంతో సామాజిక ప్రయోజనం ఉందని విశ్లేషించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభం కానున్న తరుణంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలువురు విద్యావేత్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని సమావేశ సమన్వయకర్త, ఎరుక పత్రిక సంపాదకులు జి.ఆంజనేయులు వివరించారు. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పి.విజయప్రకాష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లకు రెండు కమిషన్లు తేవడం మంచి పరిణామమన్నారు. ఫీజు రీయింబ ర్స్మెంట్ ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు. ఒక్క ఏడాదిలోనే రూ.25,714 కోట్లు 2014– 2019 మధ్య 5.62 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్గా మారితే, గత రెండేళ్లుగా 6.63 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా చేరారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ బాలమోహన్ దాస్ తెలిపారు. విద్య కోసం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రూ. 25,714 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 1,60,75, 373 మంది లబ్ధిదారులకు లాభం చేకూరిందని, 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్లు వారి ఖాతాలలోకి నేరుగా వేశారన్నారు. నీతి అ యోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2016 – 2018 మధ్య కాలంలో దాదాపు ఆరువేల స్కూల్స్ మూతపడ్డాయని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎన్.వెంకట్రావు తెలిపారు. సీఎం జగన్ గొప్ప ఆలోచన తీరు వల్ల నేడు ఆ పరిస్థితి మారి, మూత పడ్డ స్కూల్స్ తెరుచుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పిల్లలు పరుగెత్తుకుంటూ స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ ముత్యాలనాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ లక్ష్యం ఎంతో ఉపయుక్తం సోషల్ జస్టిస్, సమానత్వం అనేది విద్యతోనే సాధ్యం అని, వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ వై.హరగోపాల్ రెడ్డి ప్రశంసించారు. ఈ పరిణామం మంచి విజ్ఞానవంతులను, మంచి పౌరులను అందించి మంచి సమాజాన్ని తయారు చేస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ వర్గాలకు ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్దే అని రాయలసీమ యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ కె.కృష్ణ నాయక్ కొనియాడారు. -
తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పలు కాలేజీలు తమ తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలికి దరఖాస్తులు సమర్పించాయి. 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటాయని, తెలుగు మాధ్యమ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు కన్వర్షన్కు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఈ నెల 12వ తేదీ గడువు ముగిసే సమయానికి రాష్ట్రంలోని 557 కాలేజీలు తాము నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేయాలని దరఖాస్తు చేశాయి. దీనితో పాటు విద్యార్థులు చేరని పలు కోర్సులను ఉపసంహరించుకుంటూ 111 కాలేజీలు దరఖాస్తు చేశాయి. రాష్ట్రంలో మొత్తం డిగ్రీ కాలేజీల్లో 154 ప్రభుత్వ పరిధిలో ఉండగా 111 కాలేజీలు ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలుగా కొనసాగుతున్నాయి. 1,022 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయి. -
అంగన్వాడిలు ఇక ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ..
సాక్షి,శ్రీకాకుళం: కార్పొరేట్ ప్లే స్కూళ్లకు దీటుగా పేదింటి చిన్నారులకు ఆంగ్ల విద్యా బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేస్తోంది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించిన వైఎస్సార్ సీ పీ సర్కారు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను వైఎ స్సార్ ప్రీ ప్రైమరీస్కూళ్లుగా మార్చి మూడేళ్ల ప్రా యం నుంచే చిన్నారులకు ఏబీసీడీలు నేర్పించేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్య మా దిరిగా పీపీ–1, పీపీ–2 తరగతులను అందుబాటులోకి తెచ్చారు. నూతన విద్యా విధానం ప్రకారం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పంపిణీ చేశారు. 3–6 ఏళ్ల లోపు చిన్నారులకు ఆంగ్ల బోధన చేసేందుకు రూపొందించిన పా ఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన శిక్షణను ఇప్పటికే కార్యకర్తలకు అందజేశారు. ఒక్కో కిట్లో 8 పుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అంగన్వాడీ కేంద్రా ల్లో పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు చే సేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం పీపీ–1, పీపీ–2 పాఠ్య పుస్తకాలు రూపొందించింది. ఆయా పుస్తకాల్లో ఆంగ్లం, తెలుగు, గణి త అక్షరాలు, చిన్నపాటి కథలను పాఠ్యాంశాలుగా పొందుపరిచింది. జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలను ఐసీడీఎస్ అధికారులు 4,191 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. కోవిడ్ తీవ్రత తగ్గి, కేంద్రాలు తెరిచిన తర్వాత వీటితోనే కార్యకర్తలు పూర్వ ప్రాథమిక విద్యను బోధించనున్నారు. మూడేళ్లు నిండిన చిన్నారులకు పీపీ–1 పుస్తకాలు, నాలుగేళ్లు నిండిన వారికి పీపీ–2 పుస్తకాలు ఇవ్వనున్నారు. ప్ర తి అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో పీపీ–1, పీపీ–2 కిట్లను అందజేశారు. ఒక్కో కిట్లో 8 పుస్తకాలు చొ ప్పున ఉన్నాయి. ఆంగ్లం, తెలుగు, గణితం, ఆంగ్లం వర్క్బుక్, డ్రాయింగ్, యాక్టివిటీ తదితర సబ్జెక్టులు ఉన్న పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రావ డం లేదు. రానున్న రోజుల్లో కేంద్రాలు తెరిస్తే ప్ర భుత్వం ఇచ్చిన పుస్తకాలను చిన్నారులకు ఇచ్చి పాఠాలు చెప్పనున్నారు. -
టీచర్లకు ఇంగ్లిష్ సర్టిఫికెట్ కోర్సు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల టీచర్లు తమ ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నెల రోజుల పాటు శిక్షణతో కూడిన సర్టిఫికెట్ కోర్సు అందించాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంలో భాగంగా దీన్ని అమలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్(సీఈఎల్టీ) శిక్షణను అందించనున్నారు. ఈనెల 19 నుంచి ఆగస్టు 17 వరకు నెల పాటు ఆన్లైన్ ద్వారా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్(సౌత్ ఇండియా, బెంగళూరు) సంస్థ ఈ శిక్షణ ఇవ్వనుంది. అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాధికారులకు సమగ్ర శిక్ష ఆదేశాలిచ్చింది. ఈ ట్రైనింగ్కు జిల్లా నుంచి 25 మంది చొప్పున టీచర్లను ఎంపిక చేయనున్నారు. ఆన్లైన్ శిక్షణకు ఆసక్తి వ్యక్తీకరణను టీచర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విభిన్న ప్రతిభావంతులైన వారికి చోటు కల్పించాలి. కొత్తగా నియమితులైన టీచర్లకు ప్రాధాన్యమివ్వాలి. ఇంతకుముందు శిక్షణ పొందిన వారిని ఎంపిక చేయకూడదు. 50 ఏళ్లలోపు వయసున్న వారినే ఎంపిక చేయాలి. టీచర్లకు ఇంటర్నెట్ సదుపాయం, ఇతర డిజిటల్ డివైజ్లు అందుబాటులో ఉండాలి. అలాగే ఇంగ్లిష్ బోధిస్తున్న వారిని గుర్తించి డీఈవోలు, ఏపీవోలు ఈనెల 5లోపు జాబితా పంపించాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. -
డిగ్రీ @ ఇంగ్లిష్ మీడియం
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరించే పరిజ్ఞానం ఆంగ్లం ద్వారానే సమకూరుతున్నందున రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు భారీగా తగ్గుతుండగా ఆంగ్ల మాధ్యమంలో పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పరిజ్ఞానంతో కూడిన సబ్జెక్టులు ఆంగ్ల మాధ్యమం ద్వారానే అందుబాటులో ఉన్న నేపథ్యంలో డిగ్రీ కోర్సులన్నిటినీ 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలుగు మీడియం కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకోవాలని ఆయా కాలేజీలకు సూచించింది. ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థుల మొగ్గు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అత్యుత్తమ ప్రమాణాలు, నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థులకు చాలా కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత చదువుల వైపు తల్లిదండ్రులు, యువత మొగ్గు చూపుతున్నారు. 2020–21లో డిగ్రీ కోర్సుల్లో చేరిన వారిలో 76% విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రవేశాలు పొందడం గమనార్హం. తెలుగు మాధ్యమంలో చేరికలు 24 శాతమే ఉన్నాయి. ఇంటర్ తెలుగు మాధ్యమంలో చదివిన వారు సైతం డిగ్రీలో ఇంగ్లిష్ మీడియం ఎంచుకుంటున్నారు. మొత్తం విద్యార్థుల చేరికలు 2.62 లక్షల వరకు ఉండగా ఆంగ్ల మాధ్యమంలో 1,96,322 మంది, తెలుగు మాధ్యమంలో 65,981 మంది ప్రవేశాలు పొందారు. ఆంగ్లం వైపు అణగారిన వర్గాల చూపు గతేడాది డిగ్రీలో చేరికల గణాంకాలను పరిశీలిస్తే ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు పొందిన వారిలో అత్యధికులు బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారే ఉన్నారు. మొత్తం చేరికల్లో ఓసీలు 23 శాతం ఉండగా, ఈడబ్ల్యూఎస్ 1 శాతం, బీసీలు 54 శాతం, ఎస్సీలు 19 శాతం, ఎస్టీలు 3 శాతం ఉన్నారు. తెలుగు మాధ్యమంలో చేరిన వారిలో ఓసీలు 11 శాతం, ఎస్సీలు 24 శాతం, ఎస్టీలు 10 శాతం ఉండగా తక్కిన వారంతా బీసీలున్నారు. తెలుగు మాధ్యమంలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల వారే ముఖ్యంగా బాలికలే ఎక్కువగా ఉన్నారు. సమీపంలోని కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం, దూర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటులేక వీరు తెలుగు మాధ్యమంలో చేరుతున్నారు. మొత్తం విద్యార్థుల్లో పట్టణ ప్రాంతాల వారు 75,578 మంది ఉండగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు 1,91,227 మంది ఉన్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థుల్లో 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను (లాంగ్వేజ్లు మినహా) ఇంగ్లిష్ మీడియంలోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులకు కూడా వారికి సమీప కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగాలకు ఇంగ్లిష్ ముఖ్యం... ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2019 ప్రకారం నేర్చుకోవడంలో చురుకుదనం, అనుకూలతతో పాటు ఇంగ్లిష్లో నైపుణ్యాలున్న వారికి ఆయా సంస్థల యజమానులు నియామకాల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. ఇదే కాకుండా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వెలువరించిన 2016 నివేదిక ‘ఫైండింగ్స్ ఆఫ్ ఇంగ్లిష్ ఎట్ వర్క్: గ్లోబల్ ఎనాలిసిస్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ వర్క్ ప్లేస్’లో కూడా భారత దేశంలో 90 శాతం మంది తమ సంస్థల్లో ఉద్యోగాలకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు ముఖ్యమని చెప్పినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిగ్రీ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో అందించడం ద్వారా యువతకు ఆంగ్ల నైపుణ్యాలతో పాటు ఆయా సబ్జెక్టుల్లో పరిజ్ఞానం పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్సీలో అత్యధికం ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బీఎస్సీ, బీకాంలకు ప్రాధాన్యమివ్వగా తెలుగు మాధ్యమంలో బీఎస్సీ, బీఏలకు సమప్రాధాన్యమిచ్చారు. -
ఏపీ: ఆంగ్ల మాధ్యమంలో డిగ్రీ కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు రానున్న కొత్త విద్యా సంవత్సరం నుండి ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ప్రోగ్రాములను అందించాలని గత ఫిబ్రవరి 12న ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. దీని ప్రకారం కొత్త, అదనపు ప్రోగ్రామ్ల మంజూరు.. ఆయా కోర్సుల కాంబినేషన్ మార్పు, ప్రస్తుతం నడుస్తున్న మాధ్యమాన్ని ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఏప్రిల్ 27న నోటిఫికేషన్ జారీచేసింది’.. అని మండలి కార్యదర్శి ఆ ప్రకటనలో వివరించారు. అలాగే, 2021–22 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల అన్ఎయిడెడ్ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) హానర్స్ ప్రోగ్రాముల కోసం దరఖాస్తులను ఆంగ్ల మాధ్యమానికి మాత్రమే అనుమతిస్తామని కూడా స్పష్టంచేసింది. అలాగే, ఇప్పటికే తెలుగు మాధ్యమంలో అన్ఎయిడెడ్ కోర్సులను అందిస్తున్న అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు ప్రస్తుతం ఉన్న అన్ని తెలుగు మీడియం విభాగాలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకునేందుకు ప్రతిపాదనను పంపించాలని మండలి సూచించింది. లాంగ్వేజ్ కోర్సులు మినహాయించి ఇతర విభాగాల కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడానికి ఈనెల 18 నుంచి 28వ తేదీలోపు ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంది. అలా ఇవ్వని పక్షంలో 2021–22 నుండి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులివ్వలేమని స్పష్టంచేసింది. గడువు దాటాక ఎలాంటి ప్రతిపాదనలను స్వీకరించబోమని పేర్కొంది. అలాగే, అన్ఎయిడెడ్ ప్రోగ్రాములలో నిర్వహణ సాధ్యంకాని, నిర్వహించని యూజీ ప్రోగ్రాములను ఉపసంహరించుకోవాలనుకునే ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు తమ ప్రతిపాదనలను కూడా ఈనెల 18 నుంచి 28లోగా సమర్పించాలని సూచించింది. మీడియం మార్పిడి, ప్రోగ్రామ్ల ఉపసంహరణకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని మండలి పేర్కొంది. కొత్తగా చేరే వారికే ఆంగ్ల మాధ్యమం ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలుగు మీడియం చదువుతున్న 65,981 మంది విద్యార్థులు యధాతథంగా ఆయా కోర్సుల్లో కొనసాగుతారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం అమలవుతుంది. -
డిగ్రీ కోర్సులన్నీ ‘ఇంగ్లిష్’లోనే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2021 – 22)నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులన్నిటిలో ఆంగ్ల మాధ్యమమే అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో ఉన్నత విద్యామండలి ఇందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. ఇంజనీరింగ్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన నిర్వహిస్తుండగా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మాత్రం పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమం అమలులో లేదు. ఇంగ్లీషు మాధ్యమంలో డిగ్రీ పూర్తిచేసిన వారితో పోలిస్తే తెలుగు మాధ్యమంలో చదివిన వారు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఫలితంగా డిగ్రీ చదివినా నిరుద్యోగులుగా లేదంటే చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగించాల్సి వస్తోంది. పోటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకే మొగ్గు చూపుతున్నారు. టెన్త్, ఇంటర్ తెలుగు మీడియంలో చదివిన వారు సైతం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా ఆన్లైన్లో చేపట్టిన డిగ్రీ ప్రవేశాల్లో ఈ అంశం తేటతెల్లమైంది. 80 శాతానికి పైగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీలో చేరారు. గతంతో పోలిస్తే ఆంగ్ల మాధ్యమంలో చేరికలు 20 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 4,24,937 సీట్లు ఉండగా ఈ ఏడాది 2,62,805 మంది విద్యార్థులు చేరారు. వీరిలో తెలుగు మీడియం వారు 65,989 మంది ఉండగా ఇంగ్లీషు మీడియంలో చేరిన విద్యార్థులు 1,96,816 మంది ఉన్నారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలు: ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం లక్ష్యంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అనే మూడు అంశాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఉంటుందని చెప్పారు. డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తూనే ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్ నైపుణ్యాలు మెరుగుపర్చేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా డిగ్రీ కోర్సులలో ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తేనున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. ఒకే పాఠ్యాంశం ఒకవైపు ఆంగ్లంలో, రెండోవైపు తెలుగులో ఉండేలా ఈ పాఠ్యపుస్తకాలు ఉంటాయన్నారు. దీనివల్ల పాఠ్యాంశాలను ఆంగ్లంలో చాలా త్వరగా నేర్చుకోగలుగుతారని వివరించారు. ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేనున్నందున డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్లో కూడా మార్పులు చేర్పులు చేయనున్నట్లు చెప్పారు. -
అంగన్వాడీల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లో కూడా ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పాఠశాల విద్యాశాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంగ్లీషులోనే బోధించాలని, వారితో ఇంగ్లీషు మాట్లాడించటం అలవాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలతో సహా పీపీ-1లలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. నాడు-నేడు కింద తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు. అలాగే, జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. పిల్లలకు నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్ మాట్లాడుతూ.. మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యేనాటికి పిల్లలందరికీ విద్యాకానుక అందాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈపై టీచర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని.. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. -
‘టెట్’కు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే తప్పనిసరిగా అవసరమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం జీవో 23ను విడుదల చేశారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో టెట్లో ఇంగ్లిష్ ప్రొఫెషియన్సీ ప్రశ్నలను ఈసారి తప్పనిసరి చేస్తున్నారు. 1–5 తరగతులకు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్–1ఏను, 6–8 తరగతులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు పేపర్–2ఏను నిర్వహించనున్నారు. పేపర్–2ఏ రాసేవారు ఆసక్తి ఉంటే పేపర్–1ఏ కూడా రాయొచ్చు. కాగా, ప్రత్యేక స్కూళ్ల పోస్టులకు పేపర్–1బీ, పేపర్–2బీ నిర్వహిస్తారు. ఇకపై ఏడాదికి ఒకసారే టెట్ ఉంటుంది. కాగా, టెట్ నోటిఫికేషన్ను మేలో విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది. పేపర్–1ఏకు అర్హతలు ఇలా.. పేపర్–1ఏకు ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్రుగాడ్యుయేషన్లో ఓసీలు 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం) మార్కులు సాధించి ఉండాలి. రెండేళ్ల డీఎడ్ కోర్సు లేదా నాలుగేళ్ల బీఈడీ కోర్సు, రెండేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా బీఈడీ పూర్తి చేసి ఉండాలి. ► 2010 ఆగస్టు 23 కంటే ముందు డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉన్నవారిలో ఓసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. ► పేపర్–1బీకి సంబంధించి విభాగాలను అనుసరించి వేర్వేరుగా 11 రకాల అర్హతలను నిర్దేశించారు. పేపర్–2ఏకు అర్హతలు ఇలా.. పేపర్–2ఏకు గ్రాడ్యుయేషన్ (సంబంధిత సబ్జెక్టు)లో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండడంతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. బీఈడీలో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. లాంగ్వేజ్ పోస్టులకు సంబంధిత లాంగ్వేజ్లో బీవోఎల్, పీజీతోపాటు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు అర్హులు. స్పెషల్ స్కూళ్లకు సంబంధించి పేపర్–2బీలో ఆయా విభాగాలను అనుసరించి అర్హతలను నిర్దేశించారు. 150 ప్రశ్నలు.. 2.30 గంటల సమయం ► టెట్ను 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించనున్నారు. పరీక్ష సమయం 2.30 గంటలు. ► చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సబ్జెక్టుల్లో ప్రతిదానిలో 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. వీటికి 30 మార్కుల చొప్పున ఉంటాయి. ► పేపర్–1ఏలో స్కూళ్లలో ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, తమిళం, ఒడియాలలో అభ్యర్థి ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి ఆ భాషను 1–10 వరకు ఒక సబ్జెక్టుగా అభ్యసించి ఉండాలి. లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్) అభ్యర్థులందరికీ తప్పనిసరి. ► పేపర్–1బీలో కూడా ఇదేవిధమైన ప్రశ్నలు, ఆప్షన్లు ఉంటాయి. పేపర్–2ఏలో చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్)లలో 30 ప్రశ్నలు చొప్పున 30 మార్కులకు ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, కన్నడం, ఒడియా, తమిళం, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి 60 మార్కులకు 60 ప్రశ్నలు ఉంటాయి. పేపర్–2బీలో చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్ –2 ఇంగ్లిష్తోపాటు డిజేబిలిటీ స్పెషలైజేషన్ అంశాలుంటాయి. అర్హత మార్కులు ఇలా.. టెట్ పరీక్షలు రాసే జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్టుగా పరిగణిస్తారు. టెట్ స్కోర్కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. టెట్లో ఆయా అభ్యర్థుల స్కోరుకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. టెట్ నుంచి 20 శాతం, డీఎస్సీ నుంచి 80 శాతం వెయిటేజ్ కలిపి మెరిట్ను నిర్ణయిస్తారు. -
ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక
సాక్షి, అమరావతి: అమ్మ ఒడి, నాడు–నేడు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది జగనన్న విద్యాకానుక బడ్జెట్ కూడా భారీగా పెరగనుంది. రూ.731.30 కోట్లతో ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారం, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్లు, నోట్ బుక్లతో పాటు ఈసారి అదనంగా ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో జగనన్న విద్యాకానుకలో ఈ ఏడాది కొత్తగా డిక్షనరీని చేర్చారు. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల మద్దతు ► పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. పాఠశాలల్లో చేరే పిల్లలు, వారి తల్లిదండ్రులు 96.17% మంది ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాన్ని తప్పనిసరి చేశారు. ► 2020–21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు అమలైన ఆంగ్ల మాధ్యమం.. 2021–22 నుంచి ఏటా ఒక్కో తరగతి చొప్పున వరుసగా పదోతరగతి వరకు అమలు కానుంది. దీంతో పాటు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానం అమలు చేయడానికి సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. ► ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లిష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. ► పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం జగన్ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు. నాణ్యతలో రాజీ లేదు.. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మునిసిపల్, వివిధ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గుర్తింపు ఉన్న మదర్సాలల్లో 1–10 వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. గతేడాదితో పోలిస్తే దాదాపు నాలుగు లక్షల మంది పిల్లలు పెరిగారు. 2020–21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.648.10 కోట్లకు పైగా వెచ్చించగా, ఈ ఏడాది రూ.731.30 కోట్లను మంజూరు చేసింది. వీరందరికీ యూనిఫారం కుట్టు కూలీగా 1–8 విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.120, అదే విధంగా 9–10 విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.240 చొప్పున నిధులు అందిస్తోంది. స్టూడెంట్ కిట్ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని సూచించారు. -
ప్రారంభమైన వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు
సాక్షి, అమరావతి: అంగన్వాడీ స్కూళ్లు.. సోమవారం ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు’గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ స్కూళ్లున్నాయి. వీటిలో 8.5 లక్షల మంది బాలలు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు విద్యాబుద్ధులు నేర్పే పద్ధతులు మార్చి ఆట వస్తువుల ద్వారా విద్యను నేర్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు 85 శాతం మంది తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేస్తూ లిఖిత పూర్వకంగా అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పిల్లలు స్కూళ్లకు హాజరయ్యారు. అంగన్వాడీ స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ప్రీ ప్రైమరీ1, ప్రీ ప్రైమరీ2, ప్రీ ఫస్ట్క్లాస్ తరగతులుగా విభజించి ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను నేర్పించే కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల్ని మెరుగుపరిచింది. కాగా, రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. -
ఏప్రిల్ 1 నుంచి రెండో విడత మనబడి నాడు–నేడు
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 9,476 ప్రైమరీ పాఠశాలలు, 822 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 2,771 రెసిడెన్షియల్ స్కూళ్లు, హైస్కూళ్లు, 473 జూనియర్ కాలేజీలు, 1,668 హాస్టళ్లు, 17 డైట్ కాలేజీలు, 672 ఎంఆర్సీఎస్, 446 భవిత కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. మనబడి నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, కేర్ టేకర్కు సగటున రూ.6 వేలు చెల్లిస్తామని చెప్పారు. టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. వెయ్యికి పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో టాయిలెట్ కేర్ టేకర్లు నలుగురు ఉంటారని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి తానేటి వనిత అంగన్వాడీల్లో మార్చిలో తొలి దశ పనులు ► అంగన్వాడీ కేంద్రాల్లో నాడు– నేడు కింద 2021 మార్చిలో మొదటి దశ పనులు మొదలు పెట్టి, రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసేలా నిర్ణయించాం. తొలి విడతలో 6,407 కొత్త అంగన్వాడీల నిర్మాణం, 4,171 అంగన్వాడీల్లో అభివృద్ధి పనులు చేపడతాం. ► మొత్తం 27,438 కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మించడంతో పాటు 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఇందుకోసం మొత్తంగా సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా. వైఎస్సార్ ప్రీ ప్రైమరీలు ► అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్న నేపథ్యంలో చిన్నారుల కోసం రూపొందించిన పుస్తకాలను మంత్రి ఆదిమూలం సురేష్, అధికారులు సీఎంకు చూపించారు. ► పుస్తకాల నాణ్యత బాగుండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామని అధికారులు తెలిపారు. జగనన్న విద్యాకానుక ► వచ్చే ఏడాది ఇవ్వాల్సిన విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ► స్కూలు యూనిఫామ్స్ సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభమవుతుందన్నారు. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనపై సినిమా తీస్తా’
సాక్షి, విశాఖపట్నం : సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై సినిమా నిర్మించనున్నట్లు ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని తెలిపారు. ఆదివారం నర్సీపట్నం వచ్చిన ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక అంశాల ఆధారంగా సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందన్నారు. కరోనా చిత్ర పరిశ్రమంపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఈ కారణంగా సినిమా నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. తాను తీయబోయే సినిమాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో చిత్రీకరిస్తానని తెలిపారు. చదవండి: అపర భగీరథుడు.. సీఎం జగన్ -
అప్పటి దాకా మీరు సీఎంగా ఉండాలి మామయ్యా
సాక్షి, పునాదిపాడు: ‘మనలాంటి పేదలకేం కావాలో, ఏమిస్తే ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో, ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మామయ్య మనకు దొరుకుతాడా.. అందుకే జగన్ మామయ్య అంటే నాకు ఎంతో ఇష్టం’ అంటూ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతునన్న షేక్ తస్లీం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు, వారి తలిదండ్రులు మాట్లాడారు. విద్యార్థిని షేక్ తస్లీం మాట్లాడుతూ.. ‘మన జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక, విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు. ఈ రోజు జగనన్న విద్యా కానుక. నాకొక కోరిక ఉంది. అది ఏంటంటే, నేను బాగా చదువుకుని కలెక్టర్ అయి మీరు పెట్టిన ఈ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూడాలని. అప్పటి దాకా మీరు సీఎంగా ఉండాలి, ఉండి తీరాలి’ అని కోరింది. ‘కాన్వెంటు పిల్లలను చూసి వాళ్లలాగా బూటూ, సూటూ వేసుకుని వెల్లాలని ఉంటుంది. ఆ కోరిక నాకు ఈ ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా తీరబోతుంది. మా నాన్న చెప్పారు, జగనన్న విద్యా కానుక ద్వారా అందించిన వస్తువులను కొనాలంటే 3500 రూపాయలు అవుతాయని చెప్పారు. ఇప్పుడు మాకు ఆ బాధలేదు. అంతేకాదు నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు రూపురేఖలు మార్చేశారు. మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టిహారం అందించారు. దాంతో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మనకేం కావాలో, ఏమిస్తే మనలాంటి పేదలు గొప్పవాళ్లమవుతామో ఆయనకు తెలుసు. ఈ వనరులను ఉపయోగించుకుని కలెక్టర్ అవుతాను’ అని చిన్నారి తస్లీం స్పష్టం చేసింది. (చదవండి: ‘జగనన్న విద్యా కానుక’లో ఏమున్నాయంటే...) జగన్ మామయ్య నాకిచ్చిన బహుమతి అయిదో తరగతి విద్యార్థిని లీలా లహరి మాట్లాడుతూ..‘జగనన్న విద్యాకానుక, అది జగన్ మామయ్య నాకిచ్చిన బహుమతి. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది, నేను మాటిస్తున్నాను, బాగా చదవి తరగతిలో ఫస్ట్ ర్యాంకు సాధిస్తాను. నా ఫ్రెండ్స్ను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరమని ఎంకరేజ్ చేస్తాను. నా తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్ధితి సరిగా లేకపోవడం వల్ల నేను గతేడాది మండల పరిషత్ స్కూల్లో నాలుగో తరగతిలో చేరాను. గతేడాది మా అమ్మ జగనన్న అమ్మఒడి కింద రూ.15వేలు అందుకుంది. నిజంగా ఈ డబ్బులు మా తల్లిదండ్రులకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇది నా విద్యా జీవితంలో చాలా మంచి మార్పు. ఈ సంవత్సరం మరో మంచి మార్పు నా విద్యా జీవితంలో రాబోతుంది. అదే జగనన్న విద్యాకానుక. మాకు కావాల్సిన వాటిని ఈ విద్యా సంవత్సరంలో మా తరగతులు ప్రారంభం కాకముందే ఇవ్వడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అన్నది. (చదవండి: అమ్మఒడితో కొండంత భరోసా) విద్యార్థులు, తలిదండ్రులు మీ వెనుకే.. పాఠశాల పేరెంట్స్ కమిటీ మెంబర్ ఉషా కుమారి మాట్లాడుతూ.. ‘ఈ రోజు జగనన్న విద్యాకానుక కింది ఇచ్చిన వస్తువులన్ని పేద, మద్యతరగతి, నిరుపేద తల్లిదండ్రులకు ఈ కరోనా టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదే కాకుండా అమ్మఒడి పథకం కింద 15వేల రూపాయలు ఆర్ధికంగా వాళ్లు ఎదిగేందుకు మాకు అందజేశారు. మరి నాడు–నేడు కార్యక్రమంలో స్కూళ్లు రిపేర్లు, ఆడపిల్లలకు ప్రత్యేక బాత్రూంలు, స్కూళ్లో వాటర్ ట్యాంకులు, బోర్డులు, ఫ్యానులు అన్నీ సమకూర్చారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఈ గవర్నమెంటు స్కూళ్లను నిలబెట్టిన మా జగనన్నకు మా తల్లిదండ్రులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకుని ఎన్నో అవరోధాలు సృష్టించినప్పటికీ., మా పేద, మద్యతరగతి పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందజేసినందుకు మీకు చాలా, చాలా ధన్యవాదములు. ఇంగ్లిషు మీడియం కోసం పేద, మద్యతరగతి వాళ్లు ప్రైవేటు స్కూళ్లకు పంపలేరు. దీన్ని ఇలాగే కొనసాగించండి. మీ వెనుక మేం తల్లిదండ్రులందరం ఉన్నామని స్వయంగా చెపుతున్నాం’ అన్నారు. (చదవండి: చక్కని వసతులు.. ఇంగ్లిష్ మాటలు) మీరిలాగే ముందుకు వెళ్లాలి. ‘నేటి బాలలే రేపటి పౌరులగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూలిపనులకెలుతుంటే పిల్లలు ఏం తింటారనే బెంగలేకుండా.. మధ్యాహ్న భోజన పథకంలో ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో మా పిల్లలకు వెజిటబుల్ బిర్యానీ, చిక్కీ, పొంగల్, గుడ్డు పెడుతూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇకపై పిల్లలకు అక్షరాభాస్యం చేసేటప్పుడు ఏ దేవుడు పేరో రాయకుండా జగన్ మామయ్య అని రాసే రోజులు ఎంతో కాలం లేవని ఘంటాపధంగా తెలియజేస్తున్నాం. రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవరకు మీరు మా ముందుండి నడిపించి ఇలానే ముందుకు వెళ్లాలి’ అని కోరుకుంటున్నాము అన్నారు. -
ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరైన నేపథ్యంలో దాన్ని పిల్లలకు నేర్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంగ్లం/తెలుగు మాధ్యమాలు కోరుకునేవారికి రెండు మాధ్యమాలు ఒకే పాఠ్యపుస్తకంలో ఉండేలా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆంగ్ల పాఠాలు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఆంగ్ల మాధ్యమ పాఠాల సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక ప్రాజెక్టు అధికారిగా ఐఏఎస్ అధికారిణి వెట్రిసెల్విని నియమించారు. ఇతర రాష్ట్రాలతోపాటు సింగపూర్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల సిలబస్తోనూ తులనాత్మక పరిశీలన చేశారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త మాయా గుణవర్థన నేతృత్వంలో నిపుణుల బందాన్ని, మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, హైదరాబాద్లోని ఇఫ్లూలను పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములుగా చేశారు. పాఠ్యాంశాలకనుగుణంగా బొమ్మలు, అందమైన లేఔట్ డిజైన్లను రూపొందించారు. సులువుగా అర్థమయ్యేలా పేజీకి ఒకవైపు ఆంగ్లం, రెండోవైపు తెలుగులో ఉండేలా పుస్తకాలు సిద్ధం చేయించారు. సిలబస్లో అనేక మార్పులు 1 నుంచి 6వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్లో మార్పులు చేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇకపై మూడో తరగతి నుంచే ఉంటుంది. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు వర్క్బుక్స్ను అందించనున్నారు. తెలుగులో గతంలో 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, అన్ని మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యంశాలుగా తీసుకోవడం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటిలోనూ తెలు గును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. తెలుగు భాషా సామర్థ్యాలను పెంచుకోవడం, భాషా సౌందర్యాన్ని తెలుసుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందాయి. సెమిస్టర్ విధానంలో పాఠ్యపుస్తకాలు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల స్థాయి నుంచే సెమిస్టర్ విధానం పెట్టి పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందిస్తాం. దీనివల్ల పాఠ్యపుస్తకాల బరువు చాలా తగ్గుతుంది. విద్యార్థులు ఏయే సెమిస్టర్లలో ఏమేరకు రాణిస్తున్నారు? ఎక్కడ వెనుకబడి ఉన్నారో సులభంగా అంచనా వేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాల వల్ల టీచర్లకు, విద్యార్థులకు బోధనాభ్యసనం సులువుగా ఉంటుంది. – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇష్టంగా చదువుకునేలా పాఠాలున్నాయి.. గతంలో పాఠాలు చెప్పి అభ్యాసాల్లోని వ్యాకరణం, ఇతర ప్రక్రియలను విద్యార్థులతో చేయించేవారు. ఇప్పుడు కృత్యాధారిత అభ్యసనం ద్వారా నేర్చుకోనున్నారు. పాఠాల వెనుక ప్రశ్నలు, జవాబులు, అభ్యాసాలు ఉండవు. అవన్నీ పాఠంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఇష్టంగా చదువుకునేలా ప్రస్తుత పాఠ్యాంశాలున్నాయి. – డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి అన్ని మాండలికాలకు పెద్దపీట తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతో పాఠ్యాంశాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని ప్రాంతాల మాండలికాలు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అంశాలకూ పెద్దపీట వేశాం. – డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి -
ఇంగ్లిష్ మీడియాన్ని వ్యక్తిగతంగా సమర్థిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఇంగ్లిష్ మీడియంలో బోధనను వ్యక్తిగతంగా సమర్థిస్తానని, అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలను విచారణలో చొప్పించలేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంబంధించి జారీచేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, న్యాయవాది మెహ్ఫూజ్ ఎ.నజ్కీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వు.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే అనేకమంది దళిత, మైనారిటీ, నిరుపేద విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిందని పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుంటూ ఇదే విషయమై కర్ణాటకకు సంబంధించిన పిటిషన్ కూడా ఉందని, రెండింటిని కలిపి విచారిస్తామని చెప్పారు. ఇది ముఖ్యమైన, అత్యవసరంగా వినాల్సిన, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పరిష్కరించాల్సిన అంశమని సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ నివేదించారు. మండల కేంద్రంలో తెలుగు మీడియం పాఠశాల ఉంటుంది విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 96 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారన్నారు. ప్రతి మండల కేంద్రంలో తెలుగు మీడియం పాఠశాల అందుబాటులో ఉంటుందని, అక్కడ చదువుకోవాలనుకునేవారికి ఉచిత రవాణా సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. చదువుకునే మీడియం నిర్ణయించుకునే హక్కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పిందని నివేదించారు. సీజే జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీరు చెల్లుబాటు అయ్యే ఒకే కోణం చెబుతున్నారు. వ్యక్తిగతంగా నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఈ ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులం ఏకీభవిస్తున్నాం. ఇంగ్లిష్ థ్రూ అవుట్ అవర్ లైవ్స్ (ఇంగ్లిష్ మన జీవితంలో భాగమైంది).. మేం వ్యక్తిగతంగా మీతో ఏకీభవిస్తున్నాం. కానీ మా అభిప్రాయాలను విచారణలో ఆపాదించాలని అనుకోవడం లేదు. సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. పిల్లలకు మాతృభాషలో పునాది పడడం చాలా ముఖ్యం..’ అని పేర్కొన్నారు. గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని వ్యాఖ్యానిస్తూ ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
రైతుల పిల్లలకు ఇంగ్లిష్ విద్యే ఆక్సిజన్
దేశంలో సమాన మాధ్యమ విద్యా ప్రేమికులు ప్రతి ఏటా అక్టోబర్ 5ని భారతీయ ఇంగ్లిష్ దినోత్సవంగా జరుపుకుంటారు. దేశంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ఆవిర్భవించి నేటికి 203వ సంవత్సరం. ఒక చర్మకార వృత్తి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బ్రిటిష్ మిషనరీ విలియం క్యారీ కలకత్తాలో మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించాడు. ఈయన 1793లో భారత్ వచ్చి సుప్రసిద్ధ సెరాంపూర్లో స్థిరపడి, తన విద్యాపరమైన ఎజెండాను మొదలెట్టారు. 1817లో రాజారామమోహన్ రాయ్తో కలిసి అక్టోబర్ 5న మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం కూడా. దేశంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య కొనసాగిన ఈ 203 సంవత్సరాల్లో ఇంగ్లిష్ని ఎవరు నేర్చుకున్నారు? ఇంగ్లిష్ విద్యకు దూరమై నష్టపోయిందెవరు? ఈ పాఠశాల విద్య చరిత్రను నిశి తంగా పరీక్షించాల్సి ఉంది. అన్ని పాఠశాలల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోనే, ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ భాషల్లోనే బోధన కొనసాగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వ నూతన విద్యా విధానం చెబుతున్న నేపథ్యంలో దీనికి ఎంతో ప్రాధాన్యముంది. కానీ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమే కొనసాగుతోంది. అలాగే చిన్న, మధ్యస్థాయి, బడా విద్యా వ్యాపార సంస్థలు నడుపుతున్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియమే ఉంటుంది. ఇకపోతే గుత్తపారిశ్రామిక సంస్థలు నిర్వహిస్తున్న కొన్ని స్కూల్స్ అయితే బ్రిటిష్, అమెరికన్ స్కూల్ విద్యా నమూనా ప్రకారం నడుస్తున్నాయి. 12వ తరగతి వరకు ఈ విద్యా సంస్థల బోధనా క్రమం మొత్తంలో ఒక్క ప్రాంతీయ భాషకూ చోటు లేదన్నది గమనార్హం. చారిత్రకంగా చూస్తే దేశంలో మెజారిటీ ప్రజలు శూద్రులే. దేశ జనాభాలో వీరు 56 శాతంగా ఉన్నారు. వీరిలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, యాదవులు, రెడ్లు, కమ్మ, కాపు, వెలమ, నాయికర్లు, నాయర్లు, మరాఠాలు, లింగాయతులు, వొక్కలింగ తదితరులంతా సాధారణ విభాగంలోనే పోటీపడుతుంటారు. ఈ కులాలతోపాటు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ఓబీసీలందరూ శూద్రులలో భాగమే. వీరితర్వాత దేశజనాభాలో దళితులు 18 శాతం, ఆదివాసీలు 7.5 శాతంగా ఉన్నారు. ఏ రంగంలోనైనా సరే ఇంగ్లిష్ రచయితలను చూస్తే వీరిలో శూద్రులు కనిపించరని అర్థమవుతుంది. సైద్ధాంతిక రచనలు (రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక), ఫిక్షన్, కవిత్వం, జర్నలిస్టిక్, కళావిమర్శ వంటి మరెన్నో రచనలను ఇంగ్లిష్లో రాస్తున్నవారు ద్విజులకు చెందినవారు మాత్రమే. ద్విజులు అంటే బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థులు, ఖాత్రిలు అని అందరికీ తెలుసు. జనాభాలో అతిపెద్ద భాగమై ఉన్న శూద్రులకు కాకుండా ఈ ద్విజులకు మాత్రమే ఇంగ్లిషులో ఇంత పట్టు ఎలా వచ్చింది? ఈ శూద్రులలో కూడా అందరూ నిరుపేదలు కారు. భారతదేశంలో భాషా, విద్యా చరిత్రే దీనికి కారణం. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అంటే దేశంలోకి సంస్కృతం ఇంకా అడుగు పెట్టడానికి ముందు ప్రజలు పాళి, ఇతర ప్రాంతీయ గిరిజన భాషలను మాట్లాడేవారు. వీరే హరప్పా, మొహంజొదారో, ఢోలవీరా వంటి నగరాలతోపాటు హరప్పా నాగరికతను నిర్మించారు. వీరందరికీ తమతమ సొంత భాషలున్నాయి. అధునాతన భాష లేకుండా పట్టణ నాగరికతను నిర్మించడం అసాధ్యం అనేది తెలిసిందే. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత సంస్కృత పాఠం రుగ్వేదం. వేదకాలంలో శూద్రులను నాలుగోవర్ణంగా ప్రకటిం చారు. అంటే వీరు బానిసలతో సమానం. వీరికి సంస్కృత భాషను నిషేధించారు. వీరిలో ఎవరైనా సంస్కృతం నేర్చుకున్నా, చదివినా, రాసినా తీవ్ర శిక్షలు విధించేవారు. తర్వాత 13వ శతాబ్దంలో టర్కులు, అప్గాన్ పాలకులు వచ్చారు. పర్షియన్ భాష మెల్లగా పాలక భాషగా, పాఠ్యభాషగా ఉనికిలోకి వచ్చింది. ఈ భాషను వ్యతిరేకించడానికి బదులుగా ద్విజ కులాలు ఆ భాషను నేర్చుకుని ముస్లిం పాలకులకు పాలనాధికారులుగా, దుబాసీలుగా మారిపోయారు. మొఘల్ పాలనలోనే పర్షియన్ భాష భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది. చాలావరకు ముస్లింలతోపాటు బ్రాహ్మణులు, కాయస్థులలో చాలామంది ఆ భాషను నేర్చుకుని ప్రభుత్వంలో కొలువులు సాధించడానికి దేశమంతా వలసపోయారు. హైదరాబాద్ రాష్ట్రానికి, ముంబై ప్రాదేశిక ప్రాంతానికి బ్రాహ్మణులు, కాయస్థులు వలసపోవడం దీనికి రుజువు. బాల్ థాకరే కుటుంబం కూడా కాయస్థులకు చెందినవారే. ముస్లిం పాలకులు కూడా రైతులకు, హస్తకళా నిపుణులకు విద్య నేర్పి పర్షియన్ భాషలో వ్యవసాయ కులాల నైపుణ్యాలను మెరుగుపర్చాలని భావించలేకపోయారు. శూద్రుల నిరక్షరాస్యత కూడా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి క్షీణతకు కారణమైంది. క్రమంగా పర్షియన్ భాష నుంచి హిందీ, ఉర్దూ భాషలు ఆవిర్భవించాయి. ఇవి కూడా హిందుస్తానీ భాషలుగా చెలామణి అయ్యాయి. సంస్కృత అక్షరాలను హిందీ స్వీకరించగా, అరబిక్, పర్షియన్ అక్షరాలను ఉర్దూ స్వీకరించింది. అయితే ఈ రెండు భాషల మధ్య భావ ప్రసరణ నేటికీ వ్యవస్థీకృతంగానే ఉంటోంది. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ వంటి సంస్కృత లిపిని ఉపయోగిస్తున్న ఉత్తరాది భాషల మధ్య పరస్పర అవగాహన ఉంది. హిందీకీ ఈ భాషలకు మధ్య పరస్పర అవగాహన, మార్పిడి కూడా ఉంటోంది. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సులభంగా హిందీని అర్థం చేసుకుని మాట్లాడుతుండటానికి ఇదే కారణం. పర్షియన్ సంస్కృతిలో కూడా ముస్లిం పాలనాధికారులు శూద్రులను శారీరక శ్రమలకే పరిమితం చేశారు తప్పితే బౌద్ధిక కృషిలో భాగం చేయలేదు. 1839లో పర్షియన్ భాషను ఈస్టిండియా కంపెనీ రద్దు చేసి ఇంగ్లిష్ను పాలనా భాషగా చేశారు. 1817 నుంచి ఇంగ్లిష్ను నేర్చుకోవడం ప్రారంభించిన ద్విజులు ప్రధానంగా బ్రాహ్మణులు నేరుగా ఇంగ్లిష్ పాలనాయంత్రాంగంలో ప్రవేశించారు. అయితే ఇంగ్లిష్ను బోధనా, పాలనా భాషగా చేసిన తర్వాత కూడా శూద్రకులాలకు చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలను పొందలేకపోయారు.అయితే బ్రిటిష్ అధికారులతో వ్యక్తిగత స్నేహం ప్రాతిపదికన ఇంగ్లిష్ను నేర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి రాజారామమోహన్ రాయ్. ఈయన ఓ బ్రాహ్మణ జాగీర్దారు. పోతే 1841లో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేరిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. పార్శీ అయిన దాదాబాయి నౌరోజి కూడా ఇంగ్లిష్లో చదువుకుని వ్యాపారం కోసం ఇంగ్లండ్ వెళ్లి రాజకీయనేతగా మారారు. ఇకపోతే స్వదేశంలోనూ, ఇంగ్లండ్లోనూ ఇంగ్లిష్ చదువుకున్న మొట్టమొదటి బనియా (వర్తకులు) గాంధీజీ కావచ్చు. ఆ తర్వాత భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి ఇంగ్లండ్లో చదివిన ఏకైక శూద్రుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రమే. అయితే పటేల్ ఇంగ్లిష్లో పెద్దగా రాయలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శూద్రకులాల్లోని భూస్వాములు తమ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పడానికి ఇంగ్లండ్కు పంపడం పెద్దగా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో కట్టమంచి రామలింగారెడ్డి భారతదేశంలో చక్కగా ఇంగ్లిష్ చదువుకున్న శూద్రుడిగా కనిపిస్తాడు. అయితే శూద్ర భూస్వాములు కట్టమంచి వారసత్వాన్ని కొనసాగించలేదు. గ్రామాల్లో భూస్వామ్య అధికారం చలాయించడంతోనే వారు సంతృప్తి చెందారు. ఇప్పుడు వీరు ఇంగ్లిష్ మీడియంలో విద్య ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. దళితులు, ఆదివాసులతోపాటు శూద్రులు కూడా వెనకబడిపోవడానికి కారణం భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో అనుసంధానం కలిగించే జాతీయ భాషను వారు నేర్చుకోలేకపోవడమే. ఇప్పుడు శూద్రులు, దళితులు, ఆదివాసులు తమ ఉత్పత్తి అవసరాలకోసం ప్రాంతీయ భాషతోపాటు ఇంగ్లిష్ను కూడా నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరికి ఇంగ్లిష్ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ భాషగా మారింది. ఇక ప్రాంతీయ భాష వారి ఉత్పాదక, వ్యవహార భాషగా కొనసాగుతుంది. ఇంగ్లిష్ తెలుసుకుని వ్యవసాయ ఉత్పత్తిలో పాలుపంచుకునేవారు ఉంటే భారతీయ వ్యవసాయ నాణ్యత మౌలికంగానే మారిపోతుంది. ఒక జాతిగా భారతదేశం ఇంగ్లిష్ను జాతీయ భాషగా గుర్తిస్తూ అక్టోబర్ 5ను భారతీయ ఇంగ్లిష్ దినోత్సవంగా పాటిస్తుండటం ప్రాధాన్యత కలిగిన అంశం. ఇంగ్లిష్ 1817లో స్కూల్ విద్యా భాషగా మనదేశంలో పుట్టింది ఇది కేవలం ద్విజుల భాషగానే ఉనికిలో ఉంటూ వచ్చింది. ఈ పరిస్థితి మారాల్సి ఉంది. ఇంగ్లిష్ కూడా ఇప్పుడు మన భాషే కాబట్టి ప్రతి ఆహార ఉత్పత్తిదారు ఇంగ్లిష్ మన భాష కాదని అలోచించకుండా దాన్ని నేర్చుకోవలసి ఉంది. విశ్వీకరణ చెందిన ప్రపంచంలో ప్రతి రైతూ అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్లో పట్టు సంపాదించాలి. పేదలకు, భారతీయ గ్రామాల్లోని ఆహార ఉత్పత్తిదారులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అడ్డుకోవడంలో అంతర్జాతీయ కుట్ర లేకుండా జాగ్రత్తపడదాం. (రేపు భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం) ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లిష్ లేకుంటే మీ ముందు మాట్లాడగలిగేవాడినా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ అప్పీలుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. స్పందన తెలియజేసేందుకు ప్రతివాదికి ఒక అవకాశం ఇచ్చాకే ఉపశమనం కల్పించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంబంధించి జారీ చేసిన జీవో నం: 81, 85ను హైకోర్టు రద్దు చేయడంపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: కోర్టుధిక్కార నేరాలు ఇంకా అవసరమా?) ఇది ప్రగతిశీల చర్య: ప్రభుత్వ న్యాయవాది ⇒ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ప్రస్తావించిన అంశాలన్నీ సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని నివేదించారు. ⇒ ఏ మీడియంలో విద్యా బోధన ఉండాలనేది నిర్ణయించుకోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కు అని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు స్పష్టంగా చెప్పింది. ⇒ ఆంగ్ల భాషను స్వీకరించడం ప్రగతిశీల చర్య. తెలుగు మీడియంలో చదవాలనుకుంటున్న వారికోసం ఆ పాఠశాలలను కొనసాగించడమే కాకుండా విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించింది. 95 శాతం మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియాన్ని కోరుకుంటున్నారు. ⇒ ఇది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకోసం తీసుకున్న నిర్ణయమే కానీ ప్రజాకర్షక చర్య కాదు. అలాంటి దృఢమైన నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వం కూడా అంతే దృఢంగా ఉండాలి. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నాం... ⇒ విద్యా బోధన ఆచరణ సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే ఉండాలని విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29 చెబుతోంది కదా? దీనిపై ఏమంటారన్న ధర్మాసనం ప్రశ్నపై ప్రభుత్వ న్యాయవాది కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు లోబడి విద్యార్థులు, తల్లిదండ్రుల కోరికకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు నివేదించారు. వారు తెలుగు మీడియంను ఆప్షన్గా ఎంచుకోలేదు కాబట్టి ఆచరణ సాధ్యం కావడం లేదన్నారు. మాతృభాషకు ప్రాముఖ్యం ఇవ్వాలన్న రాజ్యాంగంలోని సెక్షన్ 29(ఎఫ్)ను కచ్చితంగా పాటిస్తున్నామన్నారు. అలా ఎక్కడా చెప్పలేదు... ⇒ అన్ని సందర్భాలలోనూ కేవలం మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యా హక్కు చట్టంలో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి చట్టం, శాసనాల ఉల్లంఘన జరగలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ⇒ హైకోర్టు తీర్పును అనుసరించి అన్ని ప్రైవేట్ పాఠశాలలు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించగలవా? ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినవి మాత్రమే. అవి ప్రైవేట్ స్కూళ్లకు వర్తించవు అని నివేదించారు.. ⇒ ఇరుపక్షాల వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదికి రెండు వారాల గడువు ఇస్తూ విచారణను సెప్టెంబర్ 25వతేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘నేను కోయంబత్తూరుకు 40 కి.మీ దూరంలోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా. ఒకవేళ నేను ఇంగ్లిష్ మీడియంలో చదువుకోకుంటే ఇవాళ మీ ముందు ఇలా ఆంగ్లంలో మాట్లాడగలిగేవాడినా? ఆంగ్లంలో ప్రావీణ్యం లేకుంటే ఒక ప్రాంతానికే పరిమితమవుతాం. మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇది రాజ్యాంగం, చట్టానికి లోబడే చేస్తున్న ఒక అభ్యుదయకరమైన చర్య. దీనికి దృఢ సంకల్పం కావాలి. ఒక గట్టి ప్రభుత్వం మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోగలుగుతుంది. చట్టానికి అనుగుణంగా మాతృభాషను పరిరక్షిస్తూ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధనకు సిద్ధమయ్యాం. అక్షరాస్యతలో మార్పు అంటే మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించడం అని కాదు’ – సుప్రీం ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది విశ్వనాథన్ నివేదన -
ఆంగ్ల మాధ్యమంలో పాఠాలేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 10 లక్షల మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు వీడియో పాఠాలు లేకుండా పోయాయి. తెలుగు మీడియం విద్యార్థులకు మంగళవారం నుంచి డిజిటల్ పాఠాలను (వీడియో పాఠాలు) దూరదర్శన్, టీశాట్ ద్వారా ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టిన విద్యాశాఖ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులను మాత్రం పట్టించుకోలేదు. కిం కర్తవ్యం...?: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,87,563 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో తెలుగు మీడియం విద్యార్థులు 15,44,208 మంది (57.46 శాతం), ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు 10,16,334 మం ది, మరో లక్ష మంది వరకు ఇతర మీడియం విద్యార్థులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి మూతబడిన స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకొనే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ అమలుకు కార్యా చరణ రూపొందించింది. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర విద్యా సాంకేతిక మండలి (ఎస్ఐఈటీ) రూపొందించిన వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఎస్ఐఈటీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు మీడియం విద్యార్థుల కోసమే 900 వరకు వీడియో పాఠాలను రూపొందించింది. ఆంగ్ల, ఇతర మీడియంల విద్యార్థులకు వీడి యో పాఠాలను రూపొందించలేదు. గతంలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల కోసం 65 వీడి యో పాఠాలను రూపొందించి ఆ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని 10 లక్షల మంది వరకు ఉన్న ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ది అర్థంకాని ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులెవరూ నోరు విప్పట్లేదు. ప్రైవేటు విద్యార్థులకూ కష్టమే..: ప్రస్తుతం రాష్ట్రంలోని 10 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పా ఠశాలల్లో 31,22,927 మంది విద్యార్థులు చ దువుతున్నారు. వారిలో ఇంగ్లిష్ మీడియం వి ద్యార్థులే 30,27,459 మంది ఉన్నారు. వారి లో ఆన్లైన్ బోధన అందుతున్నది దాదాపు 10 లక్షల మందికే. కార్పొరేట్, కొంత పేరున్న 2,500 పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ తరగ తులను నిర్వహిస్తున్నాయి. మిగతా 7,500 పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ పా ఠాలకు సాంకేతిక ఏర్పాట్లు చేసుకోలేదు. -
అది సీఎం జగన్ ఆలోచనే..
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నవే ఉన్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ ఆలోచనలు, భావజాలం, సంస్కరణలు ఈ విధానంలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోరణిలో చూసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తే, సీఎం జగన్ మాత్రం విద్యను పేదలకు హక్కుగా అందించాలని ఆకాంక్షించారని తెలిపారు. ఆ ఆలోచనే నేడు కేంద్ర విద్యా విధానంలో ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని చెప్పారు. (ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ) గురువారం ఆయన సచివాలయం నుంచి మాట్లాడుతూ.. "ప్రభుత్వ రంగంలో మొదటి సారి ప్రి ప్రైమరీ విద్యను కూడా తీసుకొస్తున్నాం. ఇంగ్లిష్ మీడియంపై కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. అవకాశం ఉన్నంత వరకు మాతృ భాషను అమలు చెయ్యమని చెప్పింది. అంతే కాదు 2 నుంచి 8 మధ్య వయస్సున్న పిల్లలు భాషలు త్వరగా నేర్చుకోగలరని, భాషలు నేర్చుకోవాలంటే మీడియం ఒక్కటే కారణం కాదని తెలిపింది. మేం ఇంగ్లిష్ మీడియంకు కట్టుబడి ఉన్నాం. తెలుగును ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యలేదు. ప్రతి ఒక్కరు మా గ్రామానికి ఇంగ్లిష్ మీడియం స్కూల్ వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. పూర్తిగా తెలుగుమీడియం ఉండాలంటే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలోను అమలు చేయాల్సి ఉంటుంది" అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
నివేదిక చాటుతున్న నిజం
మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ స్వీయ భాషాభిమానం ఎక్కువే. బోధనా మాధ్యమంగా కూడా అదే వుండాలని కోరేవారికి కూడా కొదవలేదు. కానీ జాతీయ గణాంక సంస్థ(ఎన్ఎస్ఓ) జరిపిన సర్వేలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని కోరుకునేవారు గణనీయంగా వున్నారని తేలింది. దేశంలో దాదాపు అన్నిచోట్లా, అన్ని వర్గాలకు చెందినవారూ తమ పిల్లలకు ఇంగ్లిష్ మాధ్యమమే అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సర్వే 2017–18కి సంబంధించిందే అయినా నివేదికను ఈమధ్యే వెలువరించారు. ఆ సంస్థ నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే నర్సరీ మొదలుకొని సెకండరీ విద్య వరకూ తమ పిల్లలకు ఇంగ్లిష్ మాధ్యమమే కావాలనుకునేవారు అధికమయ్యారు. తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీలతోసహా 13 ప్రాంతీయ భాషలు మాట్లాడే కుటుంబాల్లోని పిల్లల్లో అత్యధికులు... అంటే 50 శాతం కన్నా ఎక్కువ ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకుంటున్నారని ఎన్ఎస్ఓ నివేదిక అంటోంది. ఈ నివేదిక వెల్లడించే అంశాలు మరికొన్ని ఉన్నాయి. హిందీ భాషా ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్లలో మాత్రం ఇంగ్లిష్ మీడియం వైపు మొగ్గుచూపే విద్యార్థుల శాతం గతంతో పోలిస్తే తగ్గింది. ఈ రాష్ట్రాలు పేదరికంతో కొట్టుమిట్టాడే ప్రాంతాలు కావడమే అందుకు కారణం. అక్కడ విద్యపై పెట్టే తలసరి వ్యయం జాతీయ సగటుకంటే తక్కువ. ఇంగ్లిష్ మాధ్యమం కావాలని కోరుకున్నవారంతా మాతృ భాష విషయంలో ఎలాంటి భావో ద్వేగాలూ లేనివారన్న అభిప్రాయానికి రానవసరం లేదు. చుట్టూ వున్న సమాజంలో కలిగిన కుటుం బాలవారు తమ పిల్లల్ని ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలకు పంపించడం, అలా చదువుతున్నవారే అనంతరకాలంలో ఉపాధి అవకాశాలు తన్నుకుపోతుండటం చూసిన వారు తమ పిల్లలు కూడా అదేవిధంగా ఎదగాలని, వారు కూడా మెరుగైన జీవనం గడపాలని ఆశించడంలో తప్పులేదు. పైగా మన సమాజంలో కులపరంగా కావొచ్చు...ఆర్థికపరంగా కావొచ్చు వందల ఏళ్లుగా వున్న అసమా నతలు విద్యలో బాహాటంగా కనిపిస్తున్నాయి. నిరుపేద వర్గాలవారు ఎలాంటి మౌలిక సదుపా యాలూ లేని బడుల్లో చదుకోవాల్సివస్తోంది. ఏ మాధ్యమం అన్న సంగతలా వుంచి అసలు చదువే వారికి సరిగా అందని పరిస్థితులున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తగినంతమంది టీచర్లు లేకపో వడం, బోధనోపకరణాలు వుండకపోవడం వగైరాలవల్ల అక్కడ చదువుకునే అల్పాదాయ వర్గాలవారి పిల్లలు అనంతరకాలంలో చదువుల్లో తీవ్రంగా వెనకబడిపోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇంగ్లిష్ మాధ్యమం అందుబాటులో లేకపోవడం వారి ఉన్నత విద్యనూ, ఉపాధి అవకాశాలనూ దారుణంగా దెబ్బతీస్తోంది. నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఈ వ్యత్యాసాలు పెద్దగా కనబడేవి కాదు. కానీ విద్యా రంగంలో ప్రైవేటుకు చోటివ్వడం మొదలుపెట్టాక అంతా తలకిందులయింది. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్లో చంద్రబాబు అధికారంలోకొచ్చాక ఇది మరింత వెర్రితలలు వేసింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమం వుండే ప్రైవేటు విద్యా సంస్థలకు పోయేలా చేశారు. అలా చదివించే స్తోమత లేని కుటుంబాలు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కొనసాగించారు. వృత్తి విద్యా కోర్సుల్లో చేరినప్పుడు, అనంతరకాలంలో ఉద్యోగావకాశాల కోసం పోటీపడినప్పుడు నిరుపేద వర్గాల పిల్లలు ఇంగ్లిష్ మాధ్యమంలో చదివినవారితో వెనకబడుతున్నారు. ఇంగ్లిష్ మాధ్యమం అర్థంకాక అండర్ గ్రాడ్యు యేషన్ స్థాయిలో చదువు మానేవారి సంఖ్య కూడా గణనీయంగా వుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి టీడీపీ ఎన్నో ఎత్తుగడలు వేసింది. తీరా న్యాయస్థానం ఉత్తర్వులతో తల్లిదండ్రులు 2020–21 విద్యా సంవత్సరంలో తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రభుత్వం సర్వే నిర్వహించినప్పుడు 96.17 శాతంమంది ఇంగ్లిష్ మాధ్య మమే కావాలని చెప్పడం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. పిల్లలకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకా శాలు అందాలంటే ఇంగ్లిష్ మాధ్యమం తప్పనిసరని దాదాపు ముక్తకంఠంతో వారంతా చెప్పారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వున్నదని ఇప్పుడు తాజాగా వెల్లడైన ఎన్ఎస్ఓ నివేదిక సైతం చెబుతోంది. మన దేశంలో సైన్సు, ఇంజనీరింగ్, సామాజిక శాస్త్రాలు వగైరాలన్నీ ఇంగ్లిష్లోనే వుంటాయి. వాటిని దేశీయ భాషల్లో అందించాలన్న స్పృహే మన పాలకులకు మొదటినుంచీ లేకుండా పోయింది. కనుకనే ఉన్నత చదువుల స్థాయికెళ్లేసరికి ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకోవడం అందరికీ తప్పనిసరైంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ విద్య తెలుగులో చదువుకుని, మంచి మార్కులతో ఉత్తీర్ణులైనవారు సైతం ఆ ఇంగ్లిష్ మాధ్యమం కొరుకుడు పడక బోల్తాపడుతున్నారు. తగినన్ని తెలివితేటలున్నా ప్రాథమిక స్థాయినుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో చదివినవారితో పోటీ పడలేక పోతున్నారు. ఇంగ్లిష్ మాధ్యమంపై అభ్యంతరాలు వ్యక్తం చేసేవారంతా ఎన్ఎస్ఓ నివేదిక చాటిచెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకోక తప్పదు. ఆ సంస్థ వెలువరించే సర్వేలకు విశ్వ సనీయత వుంది. మన దేశంలో గణాంకాలకు ఆద్యుడని చెప్పే పీసీ మహలనోబిస్ వంటివారు అందుకు కారణం. సర్వేకు తీసుకున్న ప్రాతిపదికలు, సర్వేలో పాల్గొన్నవారి వివరాలు ఈ సంస్థ తెలియజేస్తుంది. సమాజంలో అందరికీ సమాన విద్య, సమానావకాశాలు ఉన్నప్పుడు మాధ్యమం గురించి పట్టింపు రాదు. కానీ అందుకు భిన్నమైన స్థితిగతులున్నప్పుడు, ఇంగ్లిష్ మాధ్యమంవైపు వెళ్లడానికి కేవలం పేదరికమే ఆటంకంగా మారినప్పుడు ప్రభుత్వాలు అవసరమైతే తమ విధానాలు మార్చుకుని అందరికీ సమానావకాశాలు దక్కేలా చూడవలసి ఉంటుంది. ఎన్ఎస్ఓ నివేదిక అందరి కళ్లూ తెరిపించాలి. -
బడుగులకు సర్కారు బడే అండ
సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన అత్యధిక శాతం మంది పిల్లలకు ప్రభుత్వ బడులే అండగా నిలుస్తున్నాయి. వీరిలో అత్యధిక శాతం మందివి నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే కావడంతో తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోని ఫీజులు చెల్లించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో స్థోమత ఉన్న కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. వీరిలో అత్యధికం ఓసీలే. వారితో పాటు కొంతమంది సామాన్యులు కూడా అప్పోసప్పో చేసి తమ పిల్లలనూ ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. అగ్రవర్ణాల్లోని నిరుపేదలూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019–20లో రాష్ట్రంలోని మొత్తం స్కూలు విద్యార్థుల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో 56 శాతం, ప్రైవేట్ స్కూళ్లల్లో 44 శాతం మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు దళారులను నియమించి ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా తమ స్కూళ్లలో చేర్పించుకుంటున్నారు. 2020–21 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో పాటు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాలు, టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో శిక్షణనివ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరంలో చేరికలు మరింత పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రైవేట్’లో కమీషన్లు..అడ్మిషన్లు ► ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ► కొన్ని స్కూళ్లు దళారీలను నియమించుకుని కమీషన్లు ముట్టచెబుతున్నాయి. ► అంతేకాక.. తమ సంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ విద్యార్థులను చేర్పిస్తున్నాయి. ► టార్గెట్లు పూర్తిచేయకపోతే ఉద్యోగం ఉండదని హెచ్చరిస్తున్నాయి. మాకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నారు నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూలులో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చాలా పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాలే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అమ్మఒడి కింద డబ్బులు అందించడంతో పాటు స్కూలులో పుస్తకాలు, ఇతర పరికరాలు అందిస్తూ మంచిగా చదువులు చెప్పిస్తున్నారు. – రూపేంద్ర నాయక్, 9వ తరగతి, మిట్టపల్లి జడ్పీ హైస్కూల్, ఓడీ చెరువు మండలం ఇ.గొల్లపల్లి గ్రామం, అనంతపురం జిల్లా ఆంగ్లంలోనే మాకు పాఠాలు నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మాకు ఇంగ్లీషు మీడియంలోనే పాఠాలు చెబుతున్నారు. ప్రైవేటు స్కూలు కన్నా మంచిగా, సులభంగా అర్ధం చేసుకునేలా పాఠాలు చెబుతున్నారు. అమ్మఒడి పథకంతో పాటు పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా స్కూలులో ఇస్తున్నారు. చదువు ఒక్కటే కాకుండా ఆటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. – సత్యగంగాధర్,కేఏఎన్ మున్సిపల్ హైస్కూల్,సాలూరు, విజయనగరం జిల్లా -
విద్యలో సమానత్వమే అసలైన విప్లవం
భారతదేశంలో సమానత్వం అతి ప్రధాన సమస్య. చారిత్రకంగా చూస్తే అన్ని దేశాల్లోనూ ఆస్తిపై యాజమాన్యమే మానవుల్లో అసమానతలను సృష్టించింది. విద్యలో కులపరమైన అంతరాలు సైతం మనదేశంలో పూడ్చలేని అసమానత్వాన్ని సృష్టించాయి. కులవ్యవస్థ ద్వారా, విద్య ద్వారా ఈ అసమానత్వం మన దేశంలో విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. ఆధునిక కాలంలోనూ.. పౌరసమాజంలో ఉంటూ సమానత్వం కోసం పోరాడటం కంటే ప్రభుత్వంలో ఉంటూ సమానత్వం కోసం పోరాటం చాలా కష్టమైనది. తాను స్వయంగా అధికారంలో ఉంటూ ఆఫ్రికన్ అమెరికన్లకు బానిసత్వం నుంచి స్వేచ్ఛ కల్పించాలనుకున్న అబ్రహాం లింకన్ దానికోసం తన ప్రాణాల్నే బలిపెట్టాల్సి వచ్చింది. కానీ, అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉంటూ లింకన్ హత్యకు గురవడం అమెరికన్ జీవితాన్ని ప్రత్యేకించి నల్లజాతి ప్రజల జీవితాలనే మార్చివేసింది. ఇంగ్లిష్ విద్య లేకుండా ఈరోజు నల్లజాతి ప్రజల పరిస్థితిని కాస్త ఊహించుకోండి. వారు పాఠశాలల్లో ఇంగ్లిష్ చదువుకోకుంటే ప్రపంచం వారి వాణిని అసలు విని ఉండేది కాదు. సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలకు పాఠశాల విద్యలో బోధనా మాధ్యమంలో సమానత్వం కోసం అధికారంలో ఉంటూనే ఒక సంవత్సర కాలంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం భారతీయ ప్రజాస్వామ్యంపై గణనీయమైన ప్రభావం కలిగించబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ఆయన ప్రతిపాదించిన వెంటనే ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత మొదలైంది. ఇంగ్లిష్ మీడియంపై ఆయన చేసిన ప్రతిపాదన సీబీఎస్ఈ అని పిలుస్తున్న సెకండరీ స్కూల్ విద్యా మండలి నెలకొల్పిన సిలబస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక స్కూళ్లలో చెబుతున్న ఇంగ్లిష్ మీడియంలో బోధనను సరిగ్గా పోలి ఉంది. ఇలాంటి విద్యావ్యవస్థ 1947 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొనసాగుతూనే ఉంది. అయితే సమాజంలోని అన్ని రంగాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుతున్న విద్యావంతులే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాతృభాషకు ప్రాధాన్యం, స్థానిక భాషలో విద్యను పిల్లలే ఎంపిక చేసుకోవడం, ఇంగ్లిష్ మీడియంకు తగిన సన్నాహకాలు లేవనడం, మన సంస్కృతి, నాగరికతలకే ఇంగ్లిష్ విద్య గొడ్డలిపెట్టు అని పెడబొబ్బలు పెట్టడం వంటి వ్యతిరేకతలన్నీ ట్యాంకుకు చిల్లు పడినప్పుడు ధారగా కారే నీటి చందాన పెల్లుబుకుతూ వస్తున్నాయి. శ్రామిక వర్గాలు ఒకసారి ఇంగ్లిష్ నేర్చుకుని సమాజంలో మంచి స్థానంలోకి ఎగబాకితే తమ ఇళ్లలో కారుచౌకగా పనులు చేసిపెట్టేవారు ఇక దొరకరనే స్వార్థంతోనే పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రాకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తమ శ్రమశక్తిని కారుచౌకగా అమ్ముకుంటున్న నిరక్షరాస్యులైన వలస కార్మికులు కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్లో తమ వాణిని కూడా వినిపించలేక ఎంతగా ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాల్లోనూ వీరు 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను పొంది ఉంటే, వారిపై ఇలాంటి దారుణమైన దోపిడీ జరిగి ఉండేది కాదు. గతంలోనూ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ రాజ్యమేలిన కాలంలో సమాన విద్యావకాశాలు లేకనే దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు చెందిన పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్గాలకు చెందినవారే ఇప్పుడు కూడా పట్టణ పెట్టుబడిదారీ కేంద్రాల్లో గూడు, కనీస గౌరవం లేకుండా దెబ్బతినిపోయారు. దేశంలోని 20 కోట్లమంది నిరక్షరాస్య శక్తులకు తమదైన వాణిని వ్యక్తీకరించలేని మహా విషాదాన్ని లాక్డౌన్ ప్రపంచానికి చాటి చెప్పింది. అమ్మఒడి పథకంతోపాటు మంచి సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ఏపీలోని శ్రామికుల జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయనుంది. అలా జరుగుతుందనే, ఏపీలోని ఇంగ్లిష్ విద్యాధిక శక్తులు భీతిల్లిపోతున్నారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమం గురించి ఇవాళ ప్రతి ఇంటిలోనూ తీవ్రమైన చర్చ, వాదనలు జరుగుతున్నాయి. సంపన్న ఇంగ్లిష్ విద్యాధిక శక్తుల అసలు ఉద్దేశాలను పీడనకు గురవుతున్న ప్రజారాశులు తెలుసుకోలేకపోవచ్చు. నిజానికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే ఇంగ్లిష్ విద్యతో నైపుణ్యం పొందిన జనాభాతో భారతదేశం ఒక ప్రపంచ శక్తిగా భవిష్యత్తులో ఎదిగే క్రమాన్నే మన కులీన విద్యావంతులు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా 130 కోట్లమంది నిపుణ కార్మికశక్తి ఇంగ్లిష్ విద్యను పొందినరోజు ప్రపంచ మార్కెట్లను వీరు ముంచెత్తవచ్చు. ఎందుకంటే ఇంగ్లిష్లో ప్రావీణ్యం, నిపుణ కార్మికుల దన్నుతో భారత్ భవిష్యత్తులో అమెరికా, చైనాలను కూడా సులభంగా సవాలు చేయవచ్చు. కానీ ప్రతీఘాతక శక్తులు తాము పొందుతున్న సౌకర్యాలు చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకుంటున్నాయి. గొంతులేని కౌరుచౌక కార్మికులు తమ చెప్పుచేతల్లోనే ఉంటూ అందుబాటులో ఉండాలని వీరు కోరుకుంటున్నారు. తమ రాష్ట్రం వెలుపల తగిన వ్యక్తీకరణ సామర్థ్యం లేని అవిద్యావంతులు, లేక ప్రాంతీయ భాషలో చదువుకున్న కార్మికులు ఇప్పటి వలస కార్మికుల్లాగే కారుచౌక శ్రమశక్తికి ఒక రిజర్వ్ పూల్లాగా ఉండిపోతారు. ఇలాంటి వ్యవస్థే ఎప్పటికీ కొనసాగుతుండాలని కులీన విద్యావంతులు కోరుకుంటున్నారు. చివరకు ఇంగ్లిష్ వ్యతిరేకత, వర్గ బానిసత్వ వ్యతిరేకత కలిగి ఉండే కమ్యూనిస్టు నేతలు సైతం బోధనా మాధ్యమం విషయంలో దోపిడీదారుల వాదననే బలపరుస్తూ వస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. వ్యవసాయ ఉత్పత్తి సంబంధిత పనులకు వెలుపల ఉంటున్న దోపిడీ వర్గ, కుల శక్తులు తాజా పరిణామంతో మరింత కలవరపడుతున్నారు. ఎందుకంటే కార్మికులు సైతం ఇంగ్లిష్లో ప్రావీణ్యం సాధించిన తర్వాత వారు ఇక ఎన్నటికీ బానిసలుగా పడి ఉండరన్నదే దోపిడీ శక్తుల కలవరానికి కారణం. అమెరికాలో నల్లజాతీయులు తమ ఇంగ్లిష్ విద్య ద్వారానే తమ బలాన్ని ప్రదర్శించగలుగుతున్నారు. దేశంలోని ఒక రాష్ట్రంలో ఇంతటి విప్లవాత్మక చర్యకు నాందిపలికితే, అది అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాగా మిగులుతుంది. సమానవిద్య అనే ఆయుధంతో బానిస–యజమాని సంబంధాల వ్యవస్థను మార్చివేయాలనే తలంపుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంటున్నందుకు దోపిడీ శక్తులు ఆందోళన చెందుతున్నాయి. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తీసుకున్న అసాధారణ నిర్ణయం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఈ శక్తులే భాష సమస్యలో మనోభావాలను రెచ్చగొట్టడంలో విజయం సాధించారు. ఇలాంటి శక్తుల మధ్యనే వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రారంభ చర్యను చేపట్టి ఉన్నారు. ఈ శక్తుల ప్రాబల్యం కారణంగానే తన హయాంలో ఆయన కేవలం 6,400 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియాన్ని పాక్షికంగా ప్రవేశపెట్టగలిగారు. ఆయన హయాంలోనూ, బోధనతో కాకుండా పైరవీలు చేసుకుంటూ బతికేసిన ఉపాధ్యాయ సంస్థలను ముందుకు నెట్టిన విప్లవకర శక్తులుగా డప్పు వాయించుకునే ఇంగ్లిష్ వ్యతిరేక వామపక్ష శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సమానత్వ వ్యతిరేక శక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూన్నప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్య ప్రారంభమైనప్పుడు, నిజంగానే ఏపీలో విద్యావిప్లవం ప్రారంభమవుతుంది. ఏడాదికేడాదిగా ఈ విప్లవం ముందుకెళుతుంది. పట్టణాలు, నగరాల బాట పట్టకుండానే గ్రామీణ పిల్లలు 12వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకోగలరు. ఇది మొత్తం గ్రామీణ వ్యవస్థనే మార్చేస్తుంది. అయితే మితవాద, వామపక్ష, ఉదారవాద ప్రజాస్వామిక శక్తులనే తేడా లేకుండా ఇంగ్లిష్ మీడియం వ్యతిరేక శక్తులు తమ ఏజెంట్లను కూడా గ్రామాల్లోకి చొప్పిస్తారన్న విషయాన్ని గ్రామాల్లోని పేదపిల్లల తల్లిదండ్రులు మర్చిపోరాదు. ఇంగ్లిష్ మీడియం మీకు సరిపడదని ఈ ఏజెంట్లు పేద తల్లిదండ్రులకు నచ్చచెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇంగ్లిష్ విద్యతో గ్రామీణ సంస్కృతి కూడా మారిపోతుంది. తాగివచ్చి భార్యను చితకబాదే సంస్కృతి కూడా మారిపోతుంది. అవును ఇంగ్లిష్ విద్య శ్రామిక ప్రజారాశుల బానిస మనస్తత్వాన్ని మార్చివేస్తుంది. అందుకే గ్రామాల్లోని తల్లిదండ్రులు ఇంగ్లిష్ వ్యతిరేక శక్తులను ఏమాత్రం లెక్కపెట్టకుండా తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియమే కావాలని డిమాండ్ చేస్తూ, దరఖాస్తు పత్రాల్లో సంతకాలు చేయాలి. కొందరు ఓబీసీ, దళిత, ఆదివాసీ నాయకులు కూడా ఇంగ్లిష్ వ్యతిరేక యజమానుల తరపున ఏజెంట్లుగా వచ్చి ఇంగ్లిష్ విద్య సరైంది కాదని వాదించవచ్చు. వీరిని అసలు నమ్మకండి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ చదువుతున్న తమ పిల్లలకు గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలు పోటీ రాకూడదని ఈ దళారీ నేతలు కోరుకుంటున్నారని మర్చిపోవద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే మన గ్రామీణ జీవితంలోని అన్ని రంగాల్లోనూ విద్యలో సమానత్వం అనేది అనేక మార్పులను తీసుకురానుంది. ఇంగ్లిష్ విద్య ప్రాముఖ్యత గురించి తెలిసిన ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన యువత గ్రామాలకు వెళ్లి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పించే విషయంలో తల్లులకు సహాయం చేయాలి. ఈ అవకాశం ఇప్పుడు కోల్పోతే, మరికొన్ని శతాబ్దాల పాటు శ్రామికవర్గాల్లో బానిసత్వం ఇప్పటిలాగే కొనసాగుతుంది. ఒకసారి మన పాఠశాలల్లో ఈ సరికొత్త విప్లవం మొదలయ్యాక, అధికారంలో ఉంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పోరాటం భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
రేపటి నుంచి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు
సాక్షి, అమరావతి: పాఠశాలలు ఆగస్టు 3 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా విద్యార్థులను ఆంగ్ల మాధ్యమానికి సన్నద్ధం చేసేందుకు వీలుగా బుధవారం నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. దూరదర్శన్తోపాటు ఆన్లైన్లోనూ వీడియో పాఠాలు బోధించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. బ్రిడ్జి కోర్సులను విద్యార్థులకు వసతి సదుపాయాలతో నిర్వహించాలని తొలుత భావించినా కరోనా కారణంగా నిలిచిపోయింది. 2020–21 విద్యాసంవత్సరం నుంచి 1 – 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి తదుపరి తరగతులను ఆపై ఏడాదుల్లో ఆంగ్ల మాధ్యమాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి విద్యాశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే టీచర్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై శిక్షణ కూడా పూర్తయింది. నిర్దేశిత తేదీల్లో స్కూలుకు రావాలి.. ► మొబైల్ నెట్వర్క్, టీవీలో పాఠాలు చూసే అవకాశం లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల ద్వారా బ్రిడ్జి కోర్సులు నేర్చుకొనేందుకు వీలుగా ప్రాథమిక పాఠశాలల టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం పాఠశాలల్లో విద్యార్థుల నోట్ పుస్తకాలు, వర్కు పుస్తకాలను సరిచూసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీలకు సమాచారం అందించాలి. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బ్రిడ్జి కోర్సు లెవెల్ – 1 లేదా బ్రిడ్జి కోర్సు లెవెల్ – 2 పుస్తకాలను విద్యార్థులకు అందించాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. ► 6, 7వ తరగతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు 17 నుంచి ప్రతి బుధవారం హాజరు కావాలి. ► 8, 9వ తరగతుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలలకు హాజరు కావాలి. ► పదో తరగతి బోధించే టీచర్లు ప్రతి బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు హాజరు కావాలి. ► వీడియో పాఠాలు నేర్చుకునే విద్యార్థుల నోట్ బుక్స్, వర్క్ బుక్స్ను టీచర్లు తనిఖీ చేసి మూల్యాంకనం చేయాలి. రేపట్నుంచి ‘సప్తగిరి’లో.. ► ఈ నెల 10 నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్లు అందుబాటులో ఉండనందున దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠాలను ప్రసారం చేయనున్నారు. ► దూరదర్శన్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 – 5వ తరగతి విద్యార్థులకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 3 వరకు 6, 7 తరగతులకు పాఠాలు ఉంటాయి. 3 నుంచి 4 గంటల వరకు 8, 9, 10వ తరగతులకు నిపుణులతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను రోజూ ప్రసారం చేయనున్నారు. ► జూలై నెల సిలబస్కు సంబంధించిన అంశాలన్నీ వీటిలో ఉంటాయి. రోజువారీ పాఠ్యాంశాల షెడ్యూల్ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. -
సర్కారీ బడికి.. జై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రభుత్వ పాఠశాలలకు.. ప్రైవేట్ స్కూళ్లకు ఉన్న ప్రధాన వ్యత్యాసం మౌలిక వసతులు, ఆంగ్లంలో బోధన. ఇప్పుడిక ఆ తేడా తొలగిపోవడం, అమ్మఒడి లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక ఆసరా అందిస్తుండటంతో సర్కారీ స్కూళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏడాది వ్యవధిలోనే దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం దీనికి నిదర్శనం. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో లక్ష్యాన్ని మించి చేరికలు నమోదవుతున్నాయి. ► ఒక దశలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోగా గతేడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు భారీగా పెరిగాయి. 2020–21 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో రూ.పది వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతం చేయడంతోపాటు తల్లిదండ్రుల మనోగతానికి అనుగుణంగా ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తెస్తుండటం ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆదరణకు ప్రధాన కారణం. ► రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సర్కార్ స్కూళ్లంటే చులకనగా చూసే ధృక్పథం నుంచి వాటిల్లో తమ పిల్లలను భరోసగా చదివించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా బోధన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏడాదిలోనే పలు చర్యలు చేపట్టింది. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక లాంటి పథకాల ద్వారా తోడ్పాటునందిస్తుండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను ఆదరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే కొత్త టేబుళ్లు శరవేగంగా స్కూళ్ల అభివృద్ధి పనులు.. – రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ స్కూళ్లలో రూ.10 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ‘మనబడి నాడు–నేడు’ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తొలిదశ కింద 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు రూ.3,832 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.3,333 కోట్ల నిధులు మంజూరు చేశారు. – స్కూళ్లలో టాయిలెట్లు (రన్నింగ్ వాటర్తో), విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మంచినీరు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నీచర్, పెయింటింగ్, బ్లాక్ బోర్డులు. ఇంగ్లీషు ల్యాబ్స్, ప్రహరీలు, మరమ్మతులు లాంటి 9 రకాల సదుపాయాలను కల్పిస్తారు. అవసరమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టారు. – తొలిదశలో మొత్తం 15,715 స్కూళ్లలో 1,18,477 పనులు చేపట్టాలని అంచనా వేయగా ప్రభుత్వం ఇప్పటికే 1,18,308 పనులకు అన్ని అనుమతులు ఇవ్వడంతో శరవేగంగా కొనసాగుతున్నాయి. 36,58,553 మందికి ‘గోరుముద్ద’ – ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా పిల్లలకు రుచి, శుచికరమైన పౌష్టికాహారాన్ని రోజుకో రకమైన మెనూతో ప్రభుత్వం అందిస్తోంది. – గోరుముద్ద ద్వారా రాష్ట్రంలోని 45,723 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని 36,58,553 మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూరుస్తోంది. వీరిలో ప్రాథమిక స్థాయిలో 18,18,630 మంది, ప్రాథమికోన్నత స్థాయిలో 11,21,910 మంది, హైస్కూల్ స్థాయిలో 7,18,013 మంది విద్యార్థులున్నారు. – గోరుముద్ద అందించేందుకు 88,296 మంది వంటపనివారి వేతనాన్ని రూ.1,000 నుంచి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది. – గతంలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 24,29,196 మంది మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటుండగా కొత్త మెనూ అమల్లోకి వచ్చాక ఇది 29,74,010కి పెరిగినట్లు (9 శాతం) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. – ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు కొత్త మెనూను ప్రకటించి రోజూ వేర్వేరు రకాల పదార్థాలతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం అదనంగా రూ.1,048.57 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. మరో ‘కానుక’.. దుస్తులు, బుక్స్, బ్యాగ్, బూట్లు – ‘జగనన్న విద్యాకానుక’ పథకం కింద 2020–21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 – 10వ తరగతి విద్యార్థులకు 3 జతల దుస్తుల వస్త్రం, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు. దుస్తులు ఒక్కో జత కుట్టుకూలి కింద రూ.40 చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నారు. – ‘జగనన్న విద్యా కానుక’ కోసం 2020–21 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం రూ.650.60 కోట్లను వెచ్చిస్తోంది. ఇంగ్లీషు మీడియానికే తల్లిదండ్రుల ఓటు – ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను కల్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా 2020–21 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకు అనుగుణంగా 1 – 6వ తరగతి వరకు ముందుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టి ఆపై ఏడాదుల్లో తదుపరి తరగతులకు విస్తరించేలా ఉత్తర్వులిచ్చింది. – బోధనా మాధ్యమంపై ముందుగా పేరెంట్స్ కమిటీల నుంచి అభిప్రాయ సేకరణ చేయగా ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా 94 శాతం తీర్మానాలు వచ్చాయి. – తదుపరి హైకోర్టు సూచన మేరకు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకున్నారు. తెలుగు మాధ్యమాన్ని 3.05 శాతం (53,943) మంది ఎంచుకున్నారు. – రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిఫార్సుల మేరకు 1 –10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం (2020–21 నుంచి 1 – 6 వరకు) ప్రవేశపెట్టనున్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగిస్తారు. ఈ స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సదుపాయంతో పాటు దూర ప్రాంతాలనుంచి వచ్చే వారికి రవాణా ఖర్చుల కింద రూ.6 వేలు చెల్లిస్తారు. – ఆంగ్ల మాధ్యమంలో బోధన, నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎస్సీఈఆర్టీ సమగ్ర అభ్యసన అభివృద్ధి కార్యక్రమం (సీఎల్ఈపీ) పేరుతో వెబ్నార్ శిక్షణ ఇచ్చింది. దీనికి 1.10 లక్షల మంది ప్రభుత్వ టీచర్లు హాజరయ్యారు. టీచర్లు, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను కూడా ప్రారంభించారు. ‘అమ్మ ఒడి’తో కొండంత అండ.. – పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచడం, డబ్బులు లేని కారణంగా పేద పిల్లలు చదువుకు దూరం కారాదనే లక్ష్యంతో ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింపచేసింది. – ప్రస్తుత విద్యాసంవత్సరంలో 42.24 లక్షల మంది పేద తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.6,336 కోట్లు అందచేశారు. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా మేలు చేకూరింది. – అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరిన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులున్నారు. వీరిలో 1 – 5 తరగతులు చదివే వారు 16,37,886 మంది, 6,–,10 తరగతుల విద్యార్థులు 10,55,078 మంది, ఇంటర్ విద్యార్థులు 2,41,800 మంది ఉన్నారు. – అమ్మ ఒడి పథకంతో డ్రాపవుట్ల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు పాఠశాలల్లో పిల్లల చేరికలు గణనీయంగా పెరిగాయి. 2019–20లో 70,41,988 మంది విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించగా అది 72,29,596కి పెరగడం విశేషం. వీరిలో అత్యధికులు ప్రభుత్వ స్కూళ్లలో చేరిన వారే ఉన్నారు. ఏడాదిలో 2.50 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలోకి... – గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లలో చేరే వారి సంఖ్య అధికంగా ఉండగా ఇప్పుడు అది తారుమారైంది. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తూ చేపట్టిన చర్యల వల్ల ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి 2.50 లక్షల మంది విద్యార్థులు వచ్చి చేరడం గమనార్హం. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, వివిధ పథకాల వల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. – ఇవేకాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రమాణాల పెంపు, నియంత్రణకు వీలుగా ప్రభుత్వం శాసనసభలో ప్రత్యేక చట్టం చేసి పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతో పాటు సదుపాయాలు, ఇతర అంశాలను పర్యవేక్షిస్తూ నియంత్రిస్తోంది. -
ప్రభుత్వ టీచర్ల నుంచి ఆనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు వీలుగా టీచర్లలో మరిన్ని నైపుణ్యాలను పెంపొందించేందకు ప్రభుత్వ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), సమగ్ర అభ్యసన అభివృద్ధి కార్యక్రమం (సీఎల్ఈపీ) పేరుతో చేపట్టిన వెబ్నార్ శిక్షణకు ప్రభుత్వ టీచర్ల నుంచి ఆనూహ్య స్పందన లభిస్తోంది. వెబ్నార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అందించే ఆంగ్లం, తదితర టీచింగ్ శిక్షణకు 1.10 లక్షల మంది హాజరయ్యారు. వీరికి ఎస్సీఈఆర్టీ రెండు విధాలుగా శిక్షణనిస్తోంది. రీడింగ్ మెటీరియల్, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లను ‘అభ్యసన’ యాప్లో నిర్వహిస్తున్నారు.వెబ్నార్ పోర్టల్లో లైవ్ తరగతులను వివిధ విశ్వవిద్యాలయాలు, ఇతర జాతీయ సంస్థల విద్యావేత్తలతో నిర్వహిస్తున్నారు. సాంకేతిక, సబ్జెక్ట్ అంశాలపై శిక్షణ వెబ్నార్ పోర్టల్ ద్వారా తొలుత టీచర్లకు టెక్నాలజీ అంశాలపైనా బోధన సాగింది. పోర్టల్ వినియోగం, ఎలాంటి కంటెంట్ను ఎలా తీసుకోవాలి? యూ ట్యూబ్లో ఏయే అంశాలను గ్రహించాలి వంటి అంశాల్లో సాంకేతిక నైపుణ్యాలను అందించారు. తరువాత ఆంగ్ల నైపుణ్యాలు, వివిధ సబ్జెక్టుల బోధనా విధానాలపై 15 రోజులు శిక్షణనిచ్చారు. ఇంగ్లిష్ గ్రామర్తో పాటు వివిధ సబ్జెక్ట్ల కంటెంట్ కూడా ఉంది. ప్రస్తుతం స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ చేపడుతున్నాం. విద్యార్థులకు దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా పాఠ్యాంశాలు చెప్పించాం. టీచర్లే స్వయంగా ఆయా పాఠ్యాంశాలపై వీడియోలు చిత్రీకరించేలా వీడియో ఎడిటింగ్, ఫొటో ఎడిటింగ్ అంశాలపై లండన్కు చెందిన నిపుణురాలు ఎడ్విన్తో ఆ టెక్నాలజీపై శిక్షణ ఇప్పించాం. దీంతో టీచర్లు పలు అంశాలపై 800 వీడియోలు రూపొందించారు. – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, ఎస్సీఈఆర్టీ ఇన్చార్జ్ డైరెక్టర్ ఆన్లైన్లో అభిప్రాయాల సేకరణ ► వెబ్నార్ శిక్షణ ద్వారా వారు ఆంగ్ల నైపుణ్యాలు పెంపుదల, ప్రయోజనం, సమస్యలు అవసరమైన మార్పులపై టీచర్ల నుంచి ఆన్లైన్ పద్ధతిలో అభిప్రాయాలను తీసుకున్నారు. ► 5 పాయింట్ల రేటింగ్ ఉండే ప్రతి అంశానికి దాదాపు అందరు టీచర్లు కూడా 4.5 నుంచి 5 పాయింట్ల రేటింగ్ ఇచ్చారు. ఈ శిక్షణ నిరంతరం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ► టీచర్లు, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను కూడా ప్రారంభించారు. ► శిక్షణ సందర్భంగా రోజువారీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్ల పేరుతో సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లను నిర్వహిస్తున్నారు. ► వెబ్నార్ శిక్షణలో 80 వేల మంది టీచర్లు గ్రాండ్ టెస్ట్కు హాజరయ్యారు. ► టీచర్లు ఎప్పుడు పాల్గొన్నా ఇబ్బంది లేకుండా అంతకు ముందు అంశాల రికార్డులను చూసి నేర్చుకొనేలా చేశారు. ఎంతో ప్రయోజనం లాక్డౌన్ సమయంలోప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ల ద్వారా వెబ్నార్ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే వీలు కల్పించడంతో ఎంతో మేలు జరుగుతోంది. మే 27 నుంచి ప్రారంభమైన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ జూన్ 30 వరకూ కొనసాగనుంది. ఈ వెబ్నార్ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్గా వ్యవహరించాను. 2012 నుండి 1 నుండి 5 తరగతుల వరకు ఉన్న పాఠాలను వీడియో పాఠాలుగా తయారుచేసి సుమారు 800 వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. 6 లక్షల మందికి చేరువగా ఆన్లైన్ క్లాసులు లాక్డౌన్ సమయంలో విద్యార్థులకు నిరంతరాయ విద్యా బోధన దిశగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులకు విశేష ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్, రేడియా, జూమ్ యాప్ల ద్వారా నిర్వహిస్తున్న ఈ క్లాసులు ఆరు లక్షల మంది విద్యార్థులకు చేరుకునే దిశగా నడుస్తున్నాయి. ఇప్పటికే లక్షమందికి పైగా ఆన్లైన్ క్లాసులు అందుతున్నాయి. లాక్డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడటంతో మరింత ప్రాధాన్యం పెరిగింది, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కూడా ఆలస్యం కానున్నందున సకాలంలో సిలబస్ పూర్తి చేసేలా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్ వి రాములు తెలిపారు. ► విద్యామృతం పేరుతో ఈ పథకం ప్రారంభించి డీడీ–సప్తగిరి ఛానల్ ద్వారా క్లాసులు. ► ఈ–విద్యాలోక టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ బోధన. నిష్ణాతులైన గురుకుల ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో తరగతులు. ► ఎంసెట్ విద్యార్థులకు ఆలిండియా రేడియో ద్వారా క్లాసులు. ► 409 మంది నూతన టీజీటీలకు జూమ్ యాప్ ద్వారా శిక్షణ తరగతులు. ► కొత్తగా పదోన్నతి పొందిన గురుకుల ప్రిన్సిపాల్స్కు ‘లీడర్షిప్ ఇంపరేటివ్స్’పై శిక్షణ. ► లిటిల్ టీచర్స్ పేరుతో 39 మంది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు. ► గురుకుల విద్యాలయాల సొసైటీ సిబ్బందికి ఇంగ్లిష్ గ్రామర్, ఈ–ఆఫీస్ రికార్డు వర్కులపై శిక్షణ. -
ఇంగ్లిష్ మీడియం..పేదబిడ్డల బాగు కోసమే
పేదలు తమ పిల్లల బతుకులు మారాలని ఆరాటపడుతున్నా.. మన ఖర్మ కొద్దీ ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో బతుకుతున్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. బయట ఒకటి మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లును అడ్డుకున్నారు. అయితే బిల్లును జాప్యం చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. ఆ బిల్లును మళ్లీ పెట్టి పాస్ చేయించాం – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ఉన్నత విద్యతోనే నిరుపేదల బతుకులు మారతాయని, ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటున్న పెద్ద మనుషులు వారి పిల్లలను, మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం కోసం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని చెప్పారు. 94 శాతం పేరెంట్స్ కమిటీలు కూడా ఇంగ్లిష్ మీడియాన్నే కోరుకున్నాయన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివే వారు శాతం కేవలం 25.8 శాతమేనని, పేదరికంతో ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్నారని సీఎం పేర్కొన్నారు. ‘మన పాలన– మీ సూచన’లో విద్యారంగంపై బుధవారం మేధోమథన సదస్సులో ఇంగ్లిష్ మీడియం ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ... పేరెంట్స్ కమిటీలు కావాలన్నాయి పేద విద్యార్థులు, వారి కుటుంబాల మేలు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చాలని నిర్ణయించాం. ఈ క్రమంలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి మాధ్యమంపై అభిప్రాయాలను కోరాం. దాదాపు 94 శాతం పేరెంట్స్ కమిటీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉంటేనే తమ పిల్లలు ఆంగ్లం నేర్చుకుని బాగా చదువుకుంటారని, భావి ప్రపంచంతో పోటీ పడగలుగుతారని తేల్చి చెప్పాయి. కొత్త థియరీలు... ► కొంతమంది ప్రతి అడుగులోనూ అడ్డుకుంటూ చివరకు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంగ్లీషు మీడియం తెస్తే తెలుగును అగౌరవపర్చినట్లు అంటూ కొత్త థియరీలు తెస్తున్నారు. అంతగా తెలుగును గౌరవించాలనే ఈ పెద్దమనుషులు తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఎక్కడ చదివిస్తున్నారు? అంతా ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. కానీ పేదబిడ్డలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలట. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా పేదల జీవితంలో మార్పు తెచ్చేందుకు ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ► సదస్సులో మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, విద్యా శాఖ అధికారులతో పాటు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆంగ్లమే అవసరం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని, ఆంగ్లంలో చదివితేనే ప్రపంచంతో పోటీ పడగలమని విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యా వేత్తలు పేర్కొన్నారు. అమ్మ ఒడితో పేదల చదువులకు భరోసా కల్పించారని, ఫీజు రీయింబర్స్మెంట్తో ఉన్నత విద్యకు అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాగా చదువుకుంటామని విద్యార్థులు చెప్పారు. జగనన్న గోరు ముద్ద అమృతమని, రోజుకో మెనూతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. చదువులపై ముఖ్యమంత్రికి ఉన్న స్పష్టత, అవగాహన అభినందనీయమని విద్యావేత్తలు పేర్కొన్నారు. విద్యారంగంపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం నిర్వహించిన మేధోమథన సదస్సుల్లో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని రకాలుగా సాయం... నేను స్కూల్లో కుకింగ్ హెల్పర్గా పనిచేస్తా. ఈ సంవత్సరమే ఉద్యోగంలో చేరా. మొన్నటి దాకా పిల్లలకు భోజనంలో ఒట్టి సాంబారు పోశాం. ఇప్పుడు స్కూల్లో చిక్కీలు ఇస్తుంటే ఇష్టంగా తింటున్నారు. నా పిల్లలు నలుగురూ ప్రభుత్వ పాఠశాలలోనే తింటారు. బాగా చదువుతున్నారు. నాకు అమ్మఒడి డబ్బులు వచ్చాయి. డ్వాక్రా డబ్బులు ఇచ్చారు. నాకు ఇల్లు కూడా వచ్చిందని వలంటీరు ఫోన్ చేశారు. మా అత్తయ్యకు పింఛన్ కూడా వస్తోంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. –జరీనా, పేరెంట్, గుంటూరు ఇష్టంగా తింటున్నాం మామయ్యా..! సీఎం జగన్ మామయ్యకు నమస్కారం. ‘జగనన్న గోరు ముద్ద’ గురించి చెబుతా. గతంలో ఒకటి రెండు కూరలే పెట్టేవారు. ఇప్పుడు ఎన్నో రకాల కూరలు. వారానికి ఐదు గుడ్లు, మూడు చిక్కీలు స్వీట్ పొంగల్, పాయసం, పులిహోర, కోడిగుడ్డు కూర, సాంబారు, ఆలూ కుర్మా, తోటకూర పప్పు ఇవన్నీ పెడుతుంటే ఎంతో ఇష్టంగా తింటు న్నాం. 8వ తరగతి చదివే మా అన్నయ్య కూడా స్కూల్లోనే తింటున్నాడు. ఇవన్నీ సమ కూర్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. –ఎం.రాజేశ్వరి, 5వ తరగతి, కోలవెన్ను, కృష్ణా జిల్లా. అమ్మ ఒడితో పాఠశాల ఫుల్! రెండేళ్ల క్రితం మా పాఠశాలలో 16 మంది విద్యార్ధులే ఉండేవారు. జగనన్న అమ్మఒడి కారణంగా విద్యార్ధుల సంఖ్య 165కి పెరిగింది. పేదవాళ్లను ఉన్నత స్ధితికి చేర్చే క్రమంలో మీరు బోయీలుగా పనిచేస్తున్నారు. మా బతుకుల్లో కొత్త దేవుడు ఉదయించాడని విద్యార్థులు, తల్లిదండ్రులు మీకు (సీఎం జగన్) చెప్పమన్నారు. ఆ చదువులయ్యే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. – రామ్మోహన్, సెకండరీ గ్రేడ్ టీచర్, వైయస్సార్ నగర్,నెల్లూరు. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది.. యావత్ దేశమంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తున్నారు. శార్వరి నామ సంవత్సరాన్ని మేం విద్యా సంవత్సరంగా భావిస్తున్నాం. నవకాయ పిండివంటల్లో ఏది బాగుందంటే ఎలా చెప్పలేమో మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు కూడా అలాంటివే. ఈ ఏడాది సంక్రాంతి 14వ తేదీన కాకుండా 9వ తేదీనే వచ్చిందని అమ్మ ఒడి పథకంతో లబ్ధిపొందిన తల్లులు పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో చెప్పటాన్ని మరచిపోలేం. జగనన్న విద్యా కానుక ద్వారా పేద పిల్లలకు ఇచ్చే కిట్ ఎంతో ఉపయోగపడుతుంది. –కే.ఎస్.ఆర్.వి. శాస్త్రి, టీచర్, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి. అమ్మలా వచ్చిన అన్న...! నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ పేదలకు మేలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం మాకు ఎంతో మేలు చేసింది. ఇప్పటిదాకా అక్షరాభ్యాసం సమయంలో అమ్మ అని రాసేవారు ఇప్పుడు అన్న అని రాస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినం దుకు పేరెంట్స్ కమిటీల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. – టి.ప్రకాష్, పేరెంట్, పెనమలూరు,కృష్ణా జిల్లా ఐరోపాలోనూ ఇలా లేదు.. మీ ప్రసంగం విన్న తరువాత విద్యారంగంపై మీకున్న స్పష్టత అర్థమైంది. విద్యాశాఖ అంశాలపై సాధారణంగా కమిషనర్, సెక్రటరీ లేదా మంత్రి రివ్యూ చేస్తారు. కానీ ఒక సీఎం ఇంత క్లారిటీగా రివ్యూ చేయడం నా సర్వీసులో చూడలేదు. అద్భుతం. విద్యా శాఖకు మీరు కేటాయించిన బడ్జెట్ చూస్తుంటే ఐరోపా దేశాల్లో కూడా ఇలాలేదు. ఈరోజు ప్రపంచ దృష్టంతా విద్యారంగంపైనే ఉంది. – ఉపేందర్ రెడ్డి, నిపుణుడు, అడ్వైజర్,అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా. వర్సిటీల స్థాయిలో నాణ్యత పెరగాలి.. విద్యాసంస్ధల పరంగా మన రాష్ట్రంలో 16 స్టేట్ వర్సిటీస్, 5 డీమ్డ్ వర్సిటీస్, 5 ప్రైవేటు వర్సిటీలున్నాయి. 14 సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంస్థలు లేవు. కొత్త సంస్ధలను నెలకొల్పడం కంటే మనం ఉన్నవాటిని అభివృద్ధి చేసుకుని అప్గ్రేడ్ చేసుకోవడం మంచిది. విశ్వవిద్యాలయాల స్థాయిలో నాణ్యత పెంచాలి. కనీసం ఐదు విశ్వవిద్యాలయాలను జాతీయ స్ధాయిలో మొదటి 50 ర్యాంకుల లోపు ఉండేలా చూడాలి. అప్పుడే మనం దేశానికి ఎడ్యుకేషన్ హబ్గా మారుతాం. –కే.ఎన్.సత్యన్నారాయణ, డైరెక్టర్, ఐఐటీ, తిరుపతి. విద్యా దీవెన ఆదుకుంది మా తల్లిదండ్రులకు మేమిద్దరం ఆడపిల్లలం. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పొందాం. నాన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆరోగ్యశ్రీతో బతికించు కున్నాం. నాన్నకు వికలాంగుల పింఛన్ వస్తోంది. దేవుడే మీ రూపంలో దిగివచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. నేను బాగా చదివి మీ దగ్గర మంత్రిగా పనిచేయాలని కోరుకుంటున్నా. – చంద్రిక, విద్యార్థిని, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజి, విజయవాడ రెండు అడుగులు ముందుకు.. మీ నాన్న గారు (వైఎస్సార్) ఒక అడుగు ముందుకేసి గ్రామీణ పేద విద్యార్థుల కోసం ఆర్జీ యూకేటీలను స్ధాపిస్తే మీరు రెండు అడుగులు ముందుకేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. మీకు ధన్యవాదాలు. – నాగలావణ్య, ఆర్జీయూకేటీ, విద్యార్థిని, నూజివీడు -
ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. వాటిల్లో విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ తరగతుల్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఇక 7, 8, 9, 10 తరగతులు కూడా ఏటా క్రమేణా ఆంగ్ల మాధ్యమాలుగా మారతాయి. (సీఎం జగన్ లక్ష్యాలను నెరవేరుస్తాం) ► ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ఆప్షన్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు మూడు ఆప్షన్లను కల్పించింది. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృ భాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. (సీఎస్గా నీలం సాహ్ని కొనసాగింపు!) ► మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారు. అయితే ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనాపరంగా, ఆర్థికపరంగా సాధ్యం కాదు కనుక గతంలో ఇచ్చిన జీఓ 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో (672 మండలాల్లో) ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. దూరంగా ఉన్నవారికి రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వానికి నివేదిక... తమకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధన కావాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో మాధ్యమంపై రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలిని ప్రభుత్వం నివేదిక కోరిన సంగతి తెలిసిందే. విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సోమవారం ప్రభుత్వానికి 59 పేజీల నివేదికను సమర్పించింది. నివేదికలో పలు అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఆంగ్ల మాధ్యమం పాఠశాల స్థాయి నుంచి ఎంత అవసరమో ఎస్సీఈఆర్టీ ప్రస్తావించింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యతను సంతరించుకునేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసింది. ఎస్సీఈర్టీ సిఫార్సులను ప్రభుత్వం యధాతథంగా ఆమోదించింది. ముఖ్యమైన సిఫార్సులు.. ► విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం వివిధ ప్రక్రియల ద్వారా కొనసాగాలి ► విద్యార్థులు ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా తడబాటుకు తావులేకుండా చెప్పగలగాలి ► ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేస్తున్నాం ► విద్యార్థులు, తలిదండ్రులు ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని 1నుంచి 6 వ తరగతి వరకు ప్రవేశపెట్టవచ్చు. ► ఎస్సీఈఆర్టీ 1–6 ఆంగ్ల మాధ్యమం పుస్తకాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేసి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసింది. ► ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు. ► తెలుగు సబ్జెక్టును 1 నుంచి 10 తరగతి వరకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్యపుస్తకాలను పటిష్టంగా తీర్చిదిద్దింది. -
ఇంగ్లిష్ మీడియానికే ఓటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) 58 పేజీల నివేదికను ప్రభుత్వానికి సోమవారం సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అనేక అంశాలపై సమగ్రంగా విశ్లేషణ చేయడంతోపాటు పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో నొక్కి చెప్పింది. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కావాలనే విషయమై ప్రభుత్వం ఇటీవలే విద్యార్థుల తలిదండ్రుల నుంచి లిఖితపూర్వక ఆప్షన్లను సేకరించగా.. 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు వీలుగా సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని ఎస్సీఈఆర్టీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీఈఆర్టీ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. నివేదికలో ఏముందంటే.. ► అన్ని రకాల సమగ్ర విశ్లేషణల అనంతరం ఎస్సీఈఆర్టీ ఈ దిగువ విషయాలను నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యం పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా. ► ఆంగ్ల మాధ్యమం వల్ల విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రమాణాలు అభివృద్ధి చెందుతాయి. ► దీనివల్ల రాజ్యాంగం నిర్దేశించిన విలువలు విద్యార్థుల్లో పెరుగుతాయి. విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ► శారీరక, మానసిక సామర్థ్యాల పెంపు దిశగా.. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం అనేది వివిధ ప్రక్రియలను చేపట్టడం ద్వారా కొనసాగాలి. ► విద్యార్థుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా.. తడబాటుకు తావు లేకుండా చెప్పగలగాలి. ► నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో విద్యార్థులు సాధిస్తున్న జ్ఞాన సముపార్జనను ఎల్లప్పుడూ పర్యవేక్షించటం ద్వారా వారిలో సామర్థ్యాలు ఏ మేరకు పెరుగుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ► ఈ దృష్ట్యా ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశ పెట్టాలి. ► ఇందుకు సంబంధించి ఎస్సీఈఆర్టీ 1నుంచి 6వరకు ఆంగ్ల మాధ్యమం పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేయించింది. ► ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యథాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు. ► తెలుగు సబ్జెక్టును 1నుంచి 10 తరగతి వరకు తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్య పుస్తకాలను ఇప్పటికే పునర్నిర్మితం చేసి మాతృభాష మరింత పటిష్టమయ్యేలా తీర్చిదిద్దింది. ► బోధనాభ్యసన ప్రక్రియలను పరిపుష్టం చేయడం, ప్రభుత్వ పథకాల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పర్చడం వంటి చర్యలు ఫలితాలిస్తాయి. ► విద్యార్థులకు వర్క్ బుక్స్, స్కూల్ కిట్స్, అభివృద్ధిపర్చిన పాఠ్య పుస్తకాలు, పౌష్టికతతో కూడిన మధ్యాహ్న భోజనం వంటివి దీనికి మరింత తోడ్పాటునిస్తాయి. ► ఐసీటీ వేదికల ఆధారంగా టీచర్ల సామర్థ్యాలు పెంచేందుకు వీలుగా వారికిచ్చిన అనేక శిక్షణ కార్యక్రమాలు ఇందుకు ఉపకరిస్తాయి. ► తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థులు పురోగతిపై వారికి వివరిస్తూ చర్చిస్తూ ఉండాలి. -
ఇంగ్లిష్ మీడియంపై సిఫార్సులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలుపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రభుత్వానికి త్వరలోనే సిఫార్సులు అందించనుంది. వీటి ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అత్యధికులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపిన దృష్ట్యా ఆ మాధ్యమం అమలుకు వీలుగా సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఎస్సీఈఆర్టీకి సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో–21) జారీ చేశారు. ఆంగ్ల మాధ్యమం అమలుపై హైకోర్టు తీర్పు మేరకు ఏపీ విద్యా చట్టం (ఎడ్యుకేషన్ యాక్ట్)లోని సంబంధిత సెక్షన్లను అనుసరించి ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి అమలు చేసిన తీరు, అందుకు దశలవారీగా తీసుకున్న చర్యలకు సంబంధించిన అంశాలను కూడా నివేదికల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్తో పాటు విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)లోని సంబంధిత అవకాశాలను కూడా పరిశీలించి సిఫార్సుల్లో పొందుపర్చాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆంగ్ల మాధ్యమం వైపు తల్లిదండ్రుల మొగ్గు ► ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 81, 85లను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ► అకడమిక్ అంశాలపై అధికారాలు ఎస్సీఈఆర్టీవేనని, విద్యాహక్కు చట్టం ప్రకారం అకడమిక్ వ్యవహారాల్లో ఎస్సీఈఆర్టీ ప్రమేయం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది. ► అదే సమయంలో నిర్ణయం తీసుకునే ముందు మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తీర్పులో అభిప్రాయపడింది. ► ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2020–21)లో తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారనే దానిపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. ► ఈ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించిన కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. ► 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న 17,87,035 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆప్షన్లు కోరగా.. 17,85,669 మంది నుంచి ఆప్షన్లు అందాయి. ► 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమం.. 3.05 శాతం మంది తెలుగు మాధ్యమం, 0.78 మంది ఇతర మైనర్ మాధ్యమాలు కావాలని ఆప్షన్లు ఇచ్చారు. ► హైకోర్టు తీర్పును అనుసరించి నిర్వహించిన ఆప్షన్ల సేకరణలో మాధ్యమంపై పిల్లలు/తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇలా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై తగిన సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఈ జీవోలో ఎస్సీఈఆర్టీని కోరింది. -
ఇంగ్లీషు మాధ్యమానికి జై
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు జై కొట్టారు. ఈ మేరకు తమ ఐఛ్చికాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ స్పష్టంచేశారు. విద్యారంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా నాడు – నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను గణనీయ స్థాయిలో అభివృద్ధిచేయడానికి కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందించడానికి, అంతర్జాతీయంగా ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడి ఉన్నతస్థాయి చేరుకోవడానికి పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత 2019 – 2020 విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది. 3 ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్ను వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు. 1. ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు 2. తెలుగు మీడియం 3. ఇతర భాషా మీడియం ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఏప్రిల్ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి. -
అందరినోటా ఆంగ్లం మాట...
విజయనగరం అర్బన్: ప్రాధమిక స్థాయి నుంచే ఆంగ్లమాధ్యమం అమలు చేయాలంటూ ఎక్కువ సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు కోరారు. పోటీ ప్రపంచంలో అధునాతన విజ్ఞానం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఆంగ్లమాధ్యమ చదువులు తప్పనిసరిగా వారు భావిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందివ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకమైన నిర్ణయాన్నే అంతా స్వాగతిస్తున్నారు. తెలుగు సబ్జెక్టుతో పాటు ఇంగ్లిష్ మీడియం అమలు చేసే అంశంపై గతంలో యాజమాన్య కమిటీలతో అభిప్రాయ సేకరణ చేసిన ప్రభుత్వం... తాజాగా పిల్లల తల్లిదండ్రులనుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టింది. నాడు పేరెంట్ కమిటీలు... నేడు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై జనవరిలో నిర్వహించిన పేరంట్ కమిటీల సమావేశాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. అప్పట్లో 97 శాతం ఆంగ్లమాధ్యమాన్నే కోరారు. ప్రస్తుతం తల్లిదండ్రుల అభీష్టం తెలుసుకునేందుకు ప్రభుత్వం మూడు రోజుల నుంచి సర్వే చేపట్టింది. ఈ సారి కూడా అదేరీతిలో కోరినట్టు తెలియవచ్చింది. బడుగు ప్రజలకు వరం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టడం బడుగు బలహీన వర్గాల ప్రజలకు వరం. ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాలకు పోటీ పడాలంటే తప్పని సరిగా ఇంగ్లిష్ మీడియం అవసరం. అందుకే మేము మా ఇద్దరి పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో గతేడాది వరకు చదివించాను. ఫీజులు భారమైనప్పటికీ భరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం మాలాంటివారికి వరం.– బొడబళ్ల సత్యవతి, విద్యార్థి తల్లి, ఎంపీపీ స్కూల్, కొర్లాం, గంట్యాడ మండలం. ఇంగ్లిష్ మాధ్యమం ఉండాలి పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ భాష ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి ఒక్కరికీ ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన అనివార్యమైంది. నేడు పేద, మధ్యతరగతి వారికి ఇంగ్లిష్ బోధన కోరుకొనే వారు అధికంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం చేపడుతున్న ఆలోచన మంచిదే. – జె.సి.రాజు, జిల్లా కన్వీనర్,విద్యాపరిరక్షణ కమిటీ -
ఇంగ్లిష్ మాధ్యమమే భేష్
సాక్షి, అమరావతి: ‘చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియంలో మాధ్యమంలో బోధన ఉంటేనే మంచిది. దానివల్ల పెద్దయ్యేకొద్దీ ఆంగ్ల ప్రావీణ్యం సులభంగా అలవడుతుంది. మాతృ భాష సహజంగా అలవడుతుంది. కానీ ఇంగ్లిష్ అలా కాదు. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియం ఉంటేనే తెలుగు మాదిరిగా ఆంగ్ల ప్రావీణ్యం లభిస్తుంది. కొన్ని సార్లు తప్పు చేసినా.. పై తరగతుల్లో వాటిని సరి చేసుకుని ఆంగ్ల ప్రావీణ్యం పెంచుకునే వీలుంటుంది. మేము చిన్నప్పుడు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చదివాం. దీంతో ఇంగ్లిష్ ఫ్లూయన్సీ లేక మొదట్లో ఇక్కడ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లోనే కాదు మన దేశంలో సైతం ఇంగ్లిష్ నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకుని పిల్లలు, తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే ఇంగ్లిష్ ఉండేలా చూసుకోవాలి’ ► అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాంధ్రులు ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం, ఇంగ్లిష్ భాష నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై పలువులు ప్రవాసాంధ్ర విద్యార్థులు, ఉద్యోగుల అనుభవాలు వివరించారు. అవేంటో వారి మాటల్లోనే.. భవిష్యత్తుకు బలమైన పునాది ‘ఇంగ్లిష్’ చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియం. నా స్నేహితులు కొంతమంది తెలుగు మీడియంలో చదవడం వల్ల బీటెక్లో ఇబ్బంది పడ్డారు. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నా.. ఇంగ్లిష్ ఇబ్బంది వల్ల తమ ఆలోచనల్ని వ్యక్తపరిచే వాళ్లు కాదు. ఈ కారణంతోనే నాతో పాటు ఉన్నత విద్యకు అమెరికా రాలేక పోయారు. చిన్నప్పుడు మాతృ భాష అలవడుతుంది. స్కూల్లోనూ సబ్జెక్టుగా తెలుగు ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ ఉంటే మనకు భవిష్యత్తుకు అవసరమైన ఆంగ్ల పరిజ్ఞానానికి బలమైన పునాది పడుతుంది. ఇంగ్లిష్ మీడియంలో అభ్యసిస్తేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటాం. –వరుణ్, ఎమ్మెస్, పోర్ట్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ఆత్మ స్థైర్యం కోల్పోయాను తెలుగు మీడియంలో చదివి.. పై చదువులకు ఇంగ్లిష్ మీడియంలోకి మారాను. ఇంగ్లిష్ నైపుణ్యం లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు అవసరమైన ప్రక్రియల విషయంలో చాలా మంది విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. తెలుగు మీడియం వారు ఉన్నత విద్య, ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రతీదీ ఇంగ్లిష్తో ముడిపడింది. వాటిని అందుకోవాలంటే ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాల్సిందే. ఇందుకోసం చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలి. –ఎ.రాజేశ్, ఎమ్మెస్, కాలిఫోర్నియా ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, వర్జీనియా ఇంగ్లిష్ నైపుణ్యం లేక అవకాశాలు పోయాయి నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదవడంతో అమెరికా వచ్చిన తొలి రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నా భావ వ్యక్తీకరణ ఇబ్బంది ఎదురయ్యేది. దీని వల్ల అవకాశాలు కూడా కోల్పోయాను. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కింది తరగతుల నుంచే ఇంగ్లిష్లో బోధన ఉండేలా చేయాలి. –సుధాకర్ గౌతమ్, ఎమ్మెస్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్టు ప్రపంచంతో పోటీపడవచ్చు ఇంగ్లిష్పై పట్టు లేక.. మంచి ఉద్యోగాలు రాక ఇక్కడ మన వాళ్లు చాలా కష్టపడుతుంటారు. ఇంగ్లిష్లో బాగా మాట్లాడలేక చాలా మంచి అవకాశాలు కోల్పోతుంటారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీపడవచ్చు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివించే అవకాశం వదులుకోవద్దు. తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం అందరికీ ఉండదు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. రాబోయే తరాలకు ఇది మంచి అవకాశం. – పి. దుర్గాచరణ్, ఫుల్స్టాక్ డెవలపర్, అమెరిహెల్త్ కారిటాస్, ఫిలడెల్ఫియా పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశం చిన్నప్పటి నుండే ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఒక్కసారిగా పై తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే... ఇటు సబ్జెక్ట్ అటు ఇంగ్లిష్ రెండూ రాక చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దేశంలో లక్షల మందికి అవకాశాలు లేకపోవడానికి ఇదే కారణం. ఇంగ్లిష్ ప్రావీణ్య కోర్సులు ప్రవేశ పెట్టినంత మాత్రానా ఆ భాషపై పట్టు లభించదు. – జి.నాగశ్రీనివాసులు, సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ, కనెక్టికట్ చిన్నప్పుడైతేనే సులభంగా గ్రహించగలరు ఇంగ్లిష్ మీడియం బోధన చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి. చిన్నతనంలోనే ఏదైనా సులభంగా నేర్చుకుని, గ్రహించగలిగి, ఆకళింపు చేసుకుంటారనేది వాస్తవం. ఇంగ్లిష్ రాక పోవడం వల్ల ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్య కోర్సుల్లో ఎంతో మంది వెనుకబడి పోతున్నారు. సబ్జెక్ట్ ఉన్నా వ్యక్తీకరించలేక అవకాశాలు కోల్పోతున్నారు. తల్లితండ్రులు ఇంగ్లిష్ మీడియం బోధన ఉండేలా చూసుకోవాలి. – నాగసాయి శశాంక్, ఎమ్మెస్, విల్మింగ్టన్ యూనివర్సిటీ, న్యూక్యాజిల్ -
విజ్ఞాన ప్రపంచంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి
సాక్షి, అమరావతి: విజ్ఞానంతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలు బాగా ఉన్నవారికే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఆంగ్ల నైపుణ్యాలు ఉన్నవారికే ఆదాయం కూడా ఎక్కువగా వస్తోందని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ ఎవరూ కాదనలేని వాస్తవమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్లు పెరగడానికి కారణం.. అక్కడ ఇంగ్లిష్ మాధ్యమం లేకపోవడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి ఆంగ్ల మాధ్యమంలో సమర్థంగా, సమగ్రంగా బోధించగలిగేలా టీచర్లను తీర్చిదిద్దాలన్నారు. అప్పుడే ఆంగ్ల మాధ్యమం సత్ఫలితాలిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► మాతృభాషలో బోధన శాస్త్రీయమే అయినప్పటికీ ఈనాటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లిష్ ప్రభావమే ఎక్కువ. గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ నాలెడ్జి దానిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య లావాదేవీలు కూడా అత్యధికం ఇంగ్లిష్లోనే జరుగుతున్నాయి. ► ప్రతిభావంతులైన విద్యార్థులు ఇంగ్లిష్లో ప్రావీణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ► స్టార్ హోటల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం రావాలన్నా మంచి ఇంగ్లిష్ రావాలి. ఆ స్థాయిలో ప్రపంచ ఎకానమీ మారింది. మంచి ఉద్యోగం, ఆదాయం పొందాలంటే అది ఇంగ్లిష్తోనే సాధ్యం. ప్రపంచ పరిజ్ఞానం కూడా అత్యధికం ఇంగ్లిష్లోనే ఉంది. ఆ విజ్ఞానాన్ని సముపార్జించాలంటే ఇంగ్లిష్ మాధ్యమం కావాల్సిందే. ► అయితే తెలుగు మీడియంలో చదువుకుంటూ ఇంగ్లిష్ను నేర్చుకుంటానన్నా అవకాశం ఇవ్వాలి. ► బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్నది తల్లిదండ్రులు, పిల్లల నుంచే తెలుసుకోవాలి. వారి అభిప్రాయం మేరకు మాధ్యమం పెట్టాలి. ► ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇంగ్లిష్లోనే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇంగ్లిష్ మీడియమే కోరుతున్నారు. నా అభిప్రాయం కూడా ఇంగ్లిష్ మాధ్యమం ఉండాలనే. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని పెడితే డ్రాపవుట్లను కూడా నియంత్రించొచ్చు. ఇంగ్లిష్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ప్రతి స్కూల్లో సమర్థులైన ఇంగ్లిష్ టీచర్లను నియమించాలి. ఇంగ్లిష్ ల్యాబ్స్, పుస్తకాలు,రిఫరెన్సు గ్రంథాలను సమకూర్చాలి. అదేవిధంగా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియానికి మార్చేటప్పుడు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా పాఠశాలల్లో ప్రమాణాలు పెరగాలి. బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అలాంటి ప్రమాణాలుంటేనే అన్ని వర్గాల మధ్య సమానత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు అందుకే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్లే డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. పేదలు కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం కోసమే ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. పేదపిల్లలు ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారని అధ్యయనం చేస్తే కనిపించే మొట్టమొదటి కారణం.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడమే. భాషాభిమానం ఉన్నా వాస్తవాన్ని గ్రహించాలి భాషాభిమానం ఉండొచ్చు కానీ రియాలిటీ ఏమిటో గుర్తించాలి. మన అభిప్రాయాలతో రియాలిటీని ఆపలేం. తెలుగును ప్రేమించినంత మాత్రాన ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించాల్సిన పనిలేదు. తెలుగు పండితులు, కవుల పిల్లలు ఈరోజు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. -
ఆంగ్ల మాధ్యమంతోనే విద్యార్థులకు మేలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయిస్తేనే మన పిల్లలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకోగలుగుతారని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఉమ్మడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ‘ప్రపంచంలో ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్న వారికే అన్ని అవకాశాలు దక్కుతున్నాయి. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇక్కడే పరిశ్రమలు పెట్టినవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన వారందరూ చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారేనన్న విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల మాతృభాష తెలుగుకు ఎలాంటి ముప్పు రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీనవర్గాలు, నిరుపేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందితేనే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమం ఉండాలో ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు బంగారు భవిష్యత్తు పొందాలంటే ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో తల్లిదండ్రులందరూ గుర్తించాలి’ అని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ► స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లయినా ఇప్పటికీ బడుగు, బలహీనవర్గాలు, పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మాధ్యమంలోనే కొనసాగుతున్నాయి. ► డబ్బున్న వారి పిల్లలకే ఇంగ్లిష్లో ప్రావీణ్యం దక్కేలా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయి. ► ఉన్నత వర్గాల వారు ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే ఎందుకు చదువుకుంటున్నారు? మాతృభాషకు ఏదో అయిపోతుందని అంటున్న వారంతా తమ పిల్లలను ఎందుకు ఆంగ్ల మాధ్యమ స్కూళ్లలో చదివిస్తున్నారో చెప్పాలి. ► తెలుగు తప్పనిసరిగా నేర్పిస్తూ ఆంగ్ల మాధ్యమం పెట్టడం వల్ల భాష మరింత అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా పిల్లలు తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ► ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఆంగ్లంలో ప్రావీణ్యం చూపకపోవడానికి కారణం వారు చిన్నప్పుడు తెలుగు మాధ్యమంలో చదువుకోవడమే. ► ప్రైవేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో నైపుణ్యం ఉన్న టీచర్లున్నారు. ► ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉన్నా ప్రమాణాలు శూన్యం. ► ప్రైవేటు స్కూళ్లను ఏ జీవో ప్రకారం ఆంగ్ల మాధ్యమాలుగా కొనసాగిస్తున్నారో ప్రభుత్వం కూడా అదే జీవో ప్రకారం విద్యార్థుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమాలుగా మార్పు చేస్తే సరిపోతుంది. ఇంగ్లిష్ వచ్చినవారికే ఉద్యోగాలు ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఆంగ్ల మాధ్యమం కావాలని అడుగుతున్నారు. ఇంతకుముందే పేరెంట్స్ కమిటీలు ఈ మేరకు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందించాయి. వారి అభీష్టం ప్రకారం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలి. గతంలో కూడా ఇంగ్లిష్ వచ్చినవారికే ఉద్యోగాలు, ఉపాధి లభించాయి. మాతృభాషను ఇంట్లో నేర్చుకుంటారు ఏ మాతృభాషనైన ఇంటిలో అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఎలాగూ నేర్చుకుంటారు. దాన్ని స్కూళ్లలో మాధ్యమాలుగా పెట్టనక్కరలేదు. దాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా నేర్పిస్తే చాలు. చాలా భాషలకు లిపి కూడా లేదు. ఆ పిల్లలంతా వారి మాతృభాషలోనే చదువుతున్నారా? వారికి ఇతర భాషా మాధ్యమంలోనే బోధిస్తున్నారు కదా! -
ఆంగ్లమా... తెలుగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది. వారి మనోభావాలకు అనుగుణంగా బోధనా మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతో లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నుంచి ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఈఓలను అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తమ పిల్లలు ఏ భాషా మాధ్యమంలో చదువుకుంటారో తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో టిక్ చేసి సంతకం చేసి ఇవ్వాలి. ► హైకోర్టు సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈనెల 21న జీవో 20 జారీ చేశారు. దీన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ► 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1–6వ తరగతి విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే ఆప్షన్ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి. ► అమ్మ ఒడి కార్యక్రమం కోసం పాఠశాలలు, గ్రామం, మండలాల వారీగా సేకరించిన విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి ఫార్మాట్లో లిఖిత పూర్వకంగా సేకరించాలి. కోవిడ్ నేపథ్యంలో తగిన ప్రోటోకాల్ను పాటించాలి. ► మాధ్యమంపై తల్లిదండ్రుల సంతకాలతో సేకరించిన ఫార్మాట్ హార్డ్ కాపీలను పాఠశాల, మండలాల వారీగా జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో భద్రపరచాలి. ► మండల విద్యాధికారులు ఈ సమాచారాన్ని ఫారం–1 ద్వారా క్రోడీకరించాలి. జిల్లా స్థాయిలో క్రోడీకరించిన సమాచారాన్ని ఫారం–2లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలి. ► ఈ మేరకు కలెక్టర్లు సంబంధిత విభాగాల అధికారులందరికీ ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశారు. ప్రొఫార్మాలో సమాచారం ఇలా ఇవ్వాలి... ► జిల్లా విద్యాధికారిని ఉద్దేశిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రొఫార్మా ద్వారా తెలియచేయాలి. ► తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మీడియం కావాలో ఎంచుకుని పత్రంలో టిక్ చేయాలి. ► 2020–21 విద్యా సంవత్సరంనుంచి తమ కుమారుడు/కుమార్తెకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలిపేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 3 ఆప్షన్లను ఇచ్చింది. మూడు ఆప్షన్లు ఇవీ.. 1. తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం 2. తెలుగు మీడియం 3. ఇతర భాషా మీడియం ► ఎంపిక చేసుకున్న మాధ్యమానికి ఎదురుగా టిక్ చేయాలి ► ఎంపిక చేసుకోని వాటికి ఎదురుగా ఇంటూ గుర్తు పెట్టాలి ► తల్లి/తండ్రి/సంరక్షుకుడు∙సంతకం తప్పనిసరిగాచేయాలి. ► కుమారుడు/కుమార్తె పేరు, ఏ గ్రామం, పాఠశాల, ఏ తరగతి, ఏ మాధ్యమం కావాలో స్పష్టం చేస్తూ తేదీతో సంతకం చేయాలి. -
ఏ మీడియం కావాలో చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా 2020–21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అనంతరం ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదవ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లిష్ మీడియంలో రాసేలా తీర్చిదిద్దాలని భావించింది. ► ఇదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. ఈ మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ఓ తెలుగు మీడియం పాఠశాల కొనసాగించాలని నిర్ణయించింది. ► కాగా ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో కేసు వేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. -
కత్తి మొనపై ఎంత దూరం?
లిటిగెంట్ ఫెలోస్. ఈ జాతి బ్రిటిష్ కాలం నుంచే చిగురేసి మొగ్గ తొడిగింది. నూటాయాభై ఏళ్ల కిందటి సామాజిక స్థితిపై మహాకవి గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకంలో రామ ప్పంతులు పాత్రను వారి జాతిపిత అనుకోవచ్చు. తన మాట వినని వాళ్లనూ, గిట్టని వాళ్లనూ డ్యామేజీ దావా వేస్తానని బెది రిస్తూ గడిపేస్తుంటాడు. గిరీశం మీద మరీ పట్టలేని కోపం వచ్చి నప్పుడు ‘ఆ వెధవని పజ్యండు కోర్ట్లంటా తిప్పకపోతే నేను రామప్పంతులును కాదు, చూడు నా తమాషా’ అంటూ శప థాలు కూడా చేస్తాడు. ఇంతకూ ఈ పంతులుగారు లాయర్ కాదు. గ్రామకరణం మాత్రమే. కాకపోతే కోర్టుల చుట్టూ తిరిగీ తిరిగీ వాటి గుట్టుమట్లనూ, లా పాయింట్లనూ, వాటిలోని లొసు గుల్నీ బాగా కనిపెట్టేశాడు. అందువల్ల ‘దొంగ సాక్ష్యాలు లేక పోతే కేసులు ఎట్లా గెలుస్తామ’నే లోకరీతిని వంటబట్టించుకు న్నాడు. దేశంలో న్యాయవ్యవస్థతో పాటు దాని చల్లని ఛాయలో లిటిగెంట్ల వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. ఇప్పుడది మరింత వ్యవస్థీకృతమై రాజకీయ రంగాన్ని కూడా శాసించే స్థాయికి చేరింది. రకరకాల పార్టీల్లో, వేరువేరు కొంపల్లో నిద్రించే తన స్లీపర్ సెల్స్ను కనుసైగలతో మేల్కొలిపి తన చేతికి మట్టి అంటకుండా కావలసిన దావాలను కోర్టుల్లో వేయించే రాజకీయ నాయకుడు ఎవరు? సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని సదరు దావాలు గెలిచేలా చూడగలిగే శక్తి ఎవరికి ఉంది?... తెలుగు ప్రజలను ఈ ప్రశ్నలు అడిగితే ‘సిల్లీ క్వశ్చన్స్’ అని నవ్వు కుంటారు. రామప్పంతులు టూ ది పవర్ ఆఫ్ నూటాయాభై ఏళ్లు అనేదాని విలువెంతో ఆయన లిటిగేషన్ హార్స్ పవర్ అంతన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఏ అంశాల ఆధారంగా కోర్టు కొట్టివే సిందీ, కోర్టుకు వెళ్లిన వారెవరూ, వారిని ప్రేరేపించిన వారెవరు? దాని వెనుక వారికి ఉన్న ప్రయోజనాలు ఏమిటీ అనే విషయా లను ప్రస్తుతానికి పక్కనేపెట్టి వివాద నేపథ్యాన్ని పరిశీలిద్దాము. గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పడిపోతూ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు అదే నిష్పత్తిలో పెరగసాగింది. ఈ పరిస్థితి ఇట్లాగే సాగితే ఇంకొన్నేళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా అంతరించే పరిస్థితి ఏర్పడవచ్చు. సమాజ హితానికి ఇంతకన్నా చెరుపు ఇంకేమీ ఉండదు. ప్రాథమిక విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే వుండాలనీ, సంపన్నుల పిల్లలైనా, పేదవర్గాల పిల్లలయినా ఒకే రకమైన స్కూళ్లలో, ఒకే రకమైన వాతావరణంలో చదువుకున్న ప్పుడే వారి మధ్య సమభావన, ఆరోగ్యకరమైన పోటీతత్వం అలవడుతుందని, సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని పలువురు విద్యావేత్తలు, సామాజికవేత్తలు అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం ఆకాంక్ష కూడా అదే. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని వెల్లడి చేస్తూ ఆరు వాక్యాల్లో రాసుకున్న పీఠిక (Preamble)) కూడా అందరికీ సమాన అవకాశాలకు హామీ ఇచ్చింది. రాజ్యాంగ రచనా కాలం నాటికి భారతీయ సమా జంలో ఉన్న ఆర్థిక సామాజిక అంతరాలను దృష్టిలో ఉంచుకొని, బలహీన వర్గాల వారు కూడా సమానస్థాయికి చేరుకొని అవ కాశాల కోసం పోటీపడే విధమైన రక్షణలు ఉండాలనే దృష్టి కోణం దీనివెనుక వుంది. ఈ ఆకాంక్షలకు భిన్నమైన వాతావ రణం నేడు నెలకొని ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలు పూర్తిగా ఇంగ్లిష్ మాధ్యమంపైనే కేంద్రీకరించాయి. కనీసం ఒక భాషగా కూడా తెలుగును బోధించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుకుంటున్న విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ తదితర సబ్జెక్టుల్లో ఇప్పటివరకు కూడా సరైన పద కోశాన్ని మన విద్యావ్యవస్థ అందించలేకపోయింది. తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లిష్ చదవడం కంటే కష్టతరమైన కృతక పదజాలంతో సాంకేతిక విషయాలను చదవాల్సి వచ్చింది. ఉన్నత విద్యలోకి ప్రవేశించేసరికి ఆ విషయాలను సహజమైన ఇంగ్లిష్లో చదువుకున్న విద్యార్థులతో కృతక పఠనం కారణంగా తెలుగు మీడియం విద్యార్థులు పోటీపడలేక పోయారు. ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు, ఉన్నతోద్యోగాల్లో అవ కాశాలు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకే వస్తున్నాయి. అవ కాశాలతోపాటు ఇంగ్లిష్కు ఒకరకమైన సామాజిక హోదా– గౌరవం ప్రత్యేకంగా లభిస్తున్న వాస్తవికతను పిల్లల తల్లి దండ్రులు గ్రహించారు. ఇంగ్లిష్కు సామాజిక హోదా ఇప్పుడే కాదు. రామప్పంతులు కాలం నుంచీ ఉంది. గిరీశం గాడు నాలుగు ‘బట్లేరు’ ముక్కలు నేర్చినందువల్ల మధురవాణి దగ్గర తనకంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నాడన్న దుగ్ధ రామ ప్పంతులును ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఇంగ్లిష్ సామా జిక హోదా, అది కల్పించే అవకాశాలు ఇప్పుడు ఇంకా పెరి గాయి. అది విశ్వభాషగా మారి కూర్చుంది. ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఇంగ్లిష్లో మాట్లాడగలగడం అదనపు అర్హతగా మారింది. ఈ నేపథ్యంలో ఖరీదైనా సరే తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోనే చదివించాలన్న ధోరణి తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. అంతో ఇంతో స్తోమత కలిగిన కుటుంబాల పిల్లలు ప్రైవేట్ బాట పట్టడంతో ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలినవారంతా నిరుపేద కుటుంబాల పిల్లలే. సామాజిక లెక్కల ప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు. నోరున్నవాళ్లు, పలుకుబడి కలిగినవారి పిల్ల లంతా ప్రైవేటు బాట పట్టడంతో సర్కారు బళ్లను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. కనీస వసతులు లేకుండా ఈ స్కూళ్లు శిథిలమైపోవడం మొదలైంది. టెన్త్ క్లాసుతోనే ఈ పిల్లల్లో అత్యధికులు డ్రాపౌట్లుగా మారుతున్నారు. అందరూ ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉన్నత స్థానాల్లోకి వెళ్లిపోతే శ్రీమంతులకు నౌకర్లు, డ్రైవర్లు దొరకరనే భయంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం పేద వర్గాల్లో బలపడుతున్నది. అది కూడా నిజమే అనుకోవలసి వస్తున్నది. ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును కనీసం ఒక సబ్జెక్టుగా కూడా అమలు చేయకపోయినా ఏనాడూ ఒక్క మాటైనా మాట్లా డనివారు పేదపిల్లలకు ఇంగ్లిష్ మీడియం అనగానే పెద్దపెట్టున గర్జించడం, గాండ్రించడం, ఓండ్ర పెట్టడం మొదలగు శబ్దాలు చేయడం ప్రారంభించారు. దీన్నెట్లా అర్థం చేసుకోవాలి? దురదృష్టవశాత్తు ప్రధాన ప్రతిపక్షం సహా కొన్ని చిన్నాచితకా పార్టీలకు కూడా తెలుగు భాష ఇప్పుడే గుర్తుకొస్తున్నది. కాటుక కంటి నీరు కారుస్తూ కలలోకి వస్తున్నది. ఒకటో క్లాసు పిల్లాడికి బోధన మాధ్యమాన్ని ఎంపిక చేసుకొనే హక్కు లేకపోవడం అప్రజాస్వామికమని తోస్తున్నది. ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఈ సమూహం మొత్తా నికి ప్రతిపక్షనేత నాయకత్వం వహిస్తున్నారని తేటతెల్లమై పోతున్నది. ఆయన నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం లేదు. తెలుగులో ఎల్లో మీడియాగా అపకీర్తి పొందిన కొన్ని పత్రికలు, చానళ్లలో వచ్చే వార్తల ప్రాధాన్యతలను గమనిస్తే చాలు, ప్రతిపక్షనేత సొంత అభిప్రాయాలేమిటో తెలిసి పోతుంది. ‘పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామ భద్రుండట’ అంటాడు బమ్మెర పోతన తన భాగవతం గురించి. ఈ వాక్యాలకు ఒక దుష్ట పేరడీ ‘పలికెడిది పచ్చ మీడియా, పలికించెడివాడు బాబుమియా’. ఇది జనంలో ఒక నానుడిగా స్థిరపడిపోయింది. ఇంగ్లిష్ మీడియం జీవోను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ఎల్లో మీడియాలో జరిగిన పండుగ సంబరాలను గమనిస్తే, ఈ శిబిరానికి కష్టజీవుల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడం ఏమాత్రం ఇష్టంలేదని రూఢీగా తెలిసిపోయింది. ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ వీళ్లు చెబు తున్న కుంటిసాకులు హాస్యాస్పదంగానే కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియం పెడితే, తెలుగు సెక్షన్లు కూడా విడిగా పెట్టాలట. మీడియం ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఇవ్వాలట. మరి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇటువంటి ఏర్పాటు ఉండాలన్న డిమాండ్ ఎందుకు చేయలేదని పేదవర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. దాదాపు నూరుశాతం పాఠశాలల పేరెంట్స్ కమిటీలు తమకు ఇంగ్లిష్ మీడియం కావాలని తీర్మానం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వాస్తవాన్ని మరుగుపరిచి తెలుగు సెక్షన్లకు డిమాండ్ చేయడం విడ్డూరం. నూటికి ఇద్దరో ముగ్గురో తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకుంటే ఏం చేయాలి? మండలానికి ఒకటో, అసెంబ్లీ నియోజక వర్గానికి ఒకటో తెలుగు మీడియం స్కూల్ను ఏర్పాటు చేయవలసి వస్తుంది. తెలుగు భాషాసేవ పేరుతో ప్రభువులకు సేవ చేయడానికి ఆమాత్రం సంఖ్యాబలం చాలా? అందరూ ఇంగ్లిష్ మీడియంలో చదివేస్తే తెలుగు భాషా, సాహిత్యం అంతరించిపోతుందేమోనన్న భయం కొంతమందిని వెంటాడుతున్నది. వీరి పిల్లలు ఇంగ్లిష్లో చదివి ఉన్నతోద్యో గాలు చేస్తుంటే తెలుగు సాహిత్యం కోసం పేద పిల్లలు దీక్ష బూనాలన్నమాట. అయినా తెలుగు మీడియంలో చదవనంత మాత్రాన భాషా, సాహిత్యం అంతరిస్తున్నదని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం ఏమున్నది? సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణరావు, సినారె, పీవీ నర్సింహా రావు, వట్టికోట ఆళ్వార్స్వామి వంటివారు ఉర్దూ మీడియంలో విద్యాభ్యాసం చేసి తెలుగు సాహితీవేత్తలుగా కీర్తి గడించలేదా? ఈ దేశంలోని శ్రామిక వర్గాల ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని అందుకోకుండా ఇంకెన్నాళ్లు సాకులు చెబుతారు? ఎక్కడో ఒక చోట జగన్మోహన్రెడ్డి వంటి బలమైన నాయ కులు పేదలకు అండగా ముందడుగు వేస్తే అభాండాలతో ఎంతకాలం అడ్డుకోగలరు? ఏదో ఒక రోజున నవజీవన బృందా వనాన్ని చేరుకోగలమనే ఆశతో, నమ్మకంతో వాళ్లు నడుస్తూనే ఉన్నారు. తరతరాలుగా నడుస్తూనే ఉన్నారు. పల్లేరుకాయల మీద నడిచిన పాదాలతో వాళ్లు నడుస్తూనే ఉన్నారు. పజ్జొన్న అంబలి తాగిన అర్ధాకలితో వాళ్లు నడుస్తూనే ఉన్నారు. మీరు లాక్డౌన్ కళాపోషణలో వుంటే వాళ్లు మండుటెండల్లో నడుస్తూనే వున్నారు. గమ్యం తెలియకుండా నడుస్తూనే ఉన్నారు. రహదారు లపై వాళ్లే, రైలు పట్టాలపై వాళ్లే. నడుస్తూనే ఉన్నారు. దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ ఇంకెన్ని మైళ్లు నడవాలి? అన్నార్తులు, అభాగ్యులుండని ఆ నవయుగమదెంత దూరం? వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
సుప్రీం కోర్టుకు వెళతాం
సాక్షి, అమరావతి: ఇంగ్లిష్ మీడియం జీవోల రద్దుపై హైకోర్టు జడ్జిమెంట్ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయంగానో, అపజయంగానో చూడొద్దన్నారు. ఇంగ్లిష్ మీడియం అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ చెబుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలని, ఆ తర్వాత ఒక్కో తరగతికి పెంచుకుంటూ పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పాలని సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారు. ► ఇదే అంశంపై అన్ని పాఠశాలల్లోని పేరెంట్స్ కమిటీలు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాయి. చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా 90 శాతం పేరెంట్స్ కమిటీలు తీర్మానం చేశాయి. ► ఆంగ్ల మాధ్యమంపై అసెంబ్లీలో చర్చించాం. మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించినా, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన కూడా స్వాగతించారు. ఇప్పుడు హైకోర్టు అభ్యంతరం చెప్పిందని చంద్రబాబు, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేయడం చూస్తుంటే వారి ఆలోచన ఏమిటో అర్థమైంది. ► బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవడం, ఆంగ్ల మాద్యమంలో విద్యనభ్యసించడం టీడీపీకి ఇష్టం లేదు. ► తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ.. అన్ని భాషల్లో ప్రాథమిక విద్యను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఇప్పటికే లక్ష మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చాం. బ్రిడ్జి కోర్సులు ప్రవేశ పెడుతున్నాం. సీఎం ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం సీఎం ఎంత దూరమైనా వెళ్తారు. న్యాయ పోరాటం చేస్తాం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఒకటో తరగతి నుంచే పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన ఇంగ్లిష్ చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని నిలిపివేయడం వల్ల ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా çసుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేసి ఆంగ్ల మాధ్యమం కోసం న్యాయ పోరాటం చేస్తాం. – వై.కోటేశ్వరరావు (వైకే), హైకోర్టు సీనియర్ న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్రం కన్వీనర్ ఆంగ్ల మాధ్యమంతోనే పేదలకు న్యాయం ఇంగ్లీష్ మీడియంతోనే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉంటుందని ఎంతో సంతోషించాం. హైకోర్టు తీర్పుతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంతో న్యాయం జరిగేలా చూడాలి. – సామల సింహాచలం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఆంగ్ల మాధ్యమం ఎంతో మేలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని మా సంఘం తొలి నుంచి సమర్థిస్తూ వస్తోంది. గతంలో మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ఐచ్ఛికంగా అమలు చేశారు. పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కల్పించడంతో మంచి స్పందన వచ్చింది. కొన్ని వామపక్ష టీచర్ల సంఘాలు ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించినా, మునిసిపల్ టీచర్ల ఫెడరేషన్ మాత్రమే పట్టుపట్టి అమలు చేయించింది. మునిసిపల్ స్కూళ్లలో 90 శాతం ఇంగ్లిష్ మీడియంలోనికి మార్చగలిగాము. – ఎస్.రామకృష్ణ, అధ్యక్షుడు, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఇది ప్రతిపక్షాల కుట్రే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేద, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు అందించాలన్న సంకల్పంతో 81, 85 జీవోలు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక ఆర్టీఈ చట్టంలోని కొన్ని లొసుగులను ఆధారం చేసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఇలా ఆంగ్ల మాధ్యమం అమలు కాకుండా అడ్డుకోవడం దారుణం. ఇది పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులను దూరం చేయడమే. – గిరిప్రసాదరెడ్డి, మల్లు శ్రీధర్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేదలకు న్యాయం చేయాలి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నిరుపేద విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. వారికి ఆంగ్ల మాధ్యమం అందకుండా పోవడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అయినా పేదలకు న్యాయం చేకూర్చాలి. ఎలాగైనాసరే వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకొవాలి. – చేబ్రోలు శరత్ చంద్ర, పర్రె వెంకటరావు, బహుజన టీచర్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
ఇంగ్లిష్ మీడియం జీవోలు రద్దు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమంది. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత చూసినా.. 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, విద్యా జాతీయ విధానం, ఇతర నివేదికల మేరకు నిస్సందేహంగా 1 నుంచి 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నాయని హైకోర్టు తెలిపింది. అందువల్ల ఈ జీవోలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కావని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం 92 పేజీల తీర్పు వెలువరించింది. ఇంగ్లిష్ మీడియం జీవోలను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలివీ.. ► ప్రాంతీయ, మాతృ భాషగా తెలుగుకు ఓ పెద్ద చరిత్రే ఉంది. స్వాతంత్య్రం తర్వాత తెలుగు భాషాభివృద్ధి కోసం ఓ కమిటీ ఏర్పాటైంది. దీని ఫలితంగానే ‘అధికార తెలుగు భాషా సంఘం, తెలుగు అకాడమి’ ఆవిర్భవించాయి. దీని సిఫారసుల మేరకే ప్రాథమిక, ఉన్నత విద్యలో తెలుగు బోధనా మాధ్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సహేతుక కారణాలు లేకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఓ జీవో ద్వారా ఈ విధానాన్ని మార్చింది. ► మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా హక్కు చట్ట నిబంధనలను సంతృప్తి పరచలేరు. పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అభ్యర్థన మేరకు ఇంగ్లిష్ మీడియంను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్న విషయాన్ని చట్ట ప్రకారం తల్లిదండ్రుల కమిటీలు నిర్ణయించజాలవు. ► 81, 85 జీవోలు జారీ చేసే నాటికి రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలకు సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నడుస్తున్నాయి. తద్వారా ఇంగ్లిష్ మీడియంలో తమ పిల్లలను చేర్చాలనుకునే వారికి ఆ అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేశామన్న ప్రభుత్వ వాదన ఆమోదయోగ్యం కాదు. కేసు పూర్వాపరాలు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 20న జీవో 85 (అంతకు ముందు 81) జారీ చేసింది. ► ఈ జీవోను సవాలు చేస్తూ పశ్చిమ గోదావరికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్, తూర్పు గోదావరికి చెందిన సుధీష్ రాంభొట్ల హైకోర్టులో వేర్వేరుగా గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ► ఈ వ్యాజ్యాల్లో తల్లిదండ్రుల కమిటీలు కూడా ఇంప్లీడ్ అయ్యాయి. అన్ని వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపి ఈ ఏడాది ఫిబ్రవరి 14న తీర్పు వాయిదా వేసింది. -
ప్రైవేటుకు పరుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా, అప్పులు చేసి మరీ ప్రైవేటులో చదివించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలే ఉన్నా ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరం అవుతున్నారు. రాష్ట్రంలో 74.02 శాతం ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో కేవలం 46.82 శాతం మంది విద్యార్థులే చదువుతున్నారు. అదే ప్రైవేటు పాఠశాలలు 25.98 శాతమే ఉన్నా వాటిల్లో ఏకంగా 53.18 శాతం పిల్లలు చదువుకుంటున్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 58.67 లక్షల మంది విద్యార్థులు ఉండగా అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 28.33 లక్షల మంది (48.28 శాతం) చదివారు. అదే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 27.49 లక్షలకు 46.82 శాతం) తగ్గిపోయింది. అంటే మూడేళ్లలో 84 వేల మంది (1.46 శాతం) ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. అదే ప్రైవేటు పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరంలో 30.34 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2018–19 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 31.22 లక్షలకు పెరిగింది. ఇదే విషయాన్ని ‘సోషియో ఎకనామిక్ ఔట్లుక్’కూడా స్పష్టం చేసింది. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శాసనమండలిలో వెల్లడించిన అంశం ఇదే విషయాన్ని బలపరుస్తోంది. సానుకూల చర్యల దిశగా అడుగులు... ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరమే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగంలోనూ ఆంగ్ల మాధ్యమ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం గతేడాది ప్రారంభించింది. అయితే స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే టీచర్లు సిద్ధంగా ఉన్నారని, సరిపడా తరగతి గదులు, వసతులు ఉన్నాయని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు తీర్మానం చేసి పంపిస్తేనే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు అనుమతులు ఇస్తోంది. అయితే ఇకపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల తీర్మానంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేసే దిశగా అడుగుగులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బీసీలే అత్యధికం.. రాష్ట్రంలోని సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగతా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 20,47,503 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో బీసీ విద్యార్థులే అత్యధికంగా 54.03 శాతం మంది ఉన్నట్లు ‘సోషియో ఎకనామిక్ ఔట్లుక్’వెల్లడించింది. జనరల్ విద్యార్థులు 7.65 శాతం ఉంటే ఎస్సీలు 24.52 శాతం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఎస్టీలు 13.80 శాతం మంది, బీసీలు 54.03 శాతం మంది చదువుతున్నట్లు వివరించింది. మరోవైపు ఈ పాఠశాలల్లో చదువుతున్న వారిలో అత్యధికంగా బాలికలే ఉన్నారు. అందులోనూ బీసీ బాలికలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లపై సీఎం ఏమన్నారంటే... ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు మెచ్చుకుంటున్నారు. నేనే ఒక టీవీ ఇంటర్వ్యూలో చూశా. కూలి పని చేసుకునే మహిళ కూడా ఎంత ఖర్చయినా తమ పిల్లలను ప్రైవేటు స్కూల్కు పంపిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే అందులోనే చదివిస్తానని చెప్పింది. అందుకే విద్యావేత్తలు ఈ అంశాన్ని తేల్చాలి. బడ్జెట్ సమావేశాల తరువాత దీనిపై విద్యావేత్తలు, టీచర్ ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చించి ఓ విధానాన్ని రూపొందించండి. చివరగా నేను అందులో పాల్గొంటా. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై నిర్ణయం తీసుకుందాం’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కారును అనుసరించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చంద్రశేఖరరావు చెప్పారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంగ్లిష్ మీడియంలో తన కొడుకును చదివించడానికి ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్న విషయాన్ని ఓ మహిళా కూలీ చెప్పడాన్ని టీవీలో చూశానన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ వచ్చి ఉండాలని అందరూ కోరుకుంటున్నారని, దీన్ని అమలు చేసేందుకు విద్యావేత్తలు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాల తరువాత దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని, ఆ మీటింగ్లో వ్యక్తమైన సలహాలు, సూచనల్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా జీవిత ఖైదీలను కొందరిని విడుదల చేయాలన్న విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. -
రూ.600 కోట్లతో ‘జగనన్న విద్యా కానుక’
సాక్షి, అమరావతి: ‘మీ పిల్లల మేనమామగా..’ అంటూ రాష్ట్రంలోని నిరుపేద బడుగు బలహీన వర్గాల అక్కచెల్లెమ్మల పిల్లల చదువుల బాధ్యత తనదిగా పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ ఆ పిల్లలకు మరింత భరోసా కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిల్లలకు అందించే దుస్తులు పాఠ్యపుస్తకాలతో పాటు వారి చదువులకు అవసరమయ్యే మరికొన్ని వస్తువులను కూడా చేర్చి ‘కిట్’ రూపంలో అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ మదర్సాల్లో చదువుకొనే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందించనున్నారు. ‘జగనన్న విద్యా కానుక’ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు రూ.600 కోట్ల వ్యయంతో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు తెరిచే నాటికే పంపిణీ వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికి ఈ కిట్లను సిద్ధం చేసి విద్యార్ధులందరికీ పంపిణీ చేయనున్నారు. రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. పాఠ్యపుస్తకాలు డిసెంబర్ వరకు, దుస్తులు అయితే ఏకంగా ఏప్రిల్ వరకు కూడా పంపిణీ అయ్యే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాఠశాలలు తెరిచే నాటికే పిల్లలకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. రెండు జతల దుస్తులను మూడు జతలకు పెంచారు. 3 జతల దుస్తుల వస్త్రంతో పాటు నోట్ పుస్తకాలు, ఒక జత షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును కిట్ రూపంలో అందించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు తరగతుల వారీగా ఈ కిట్లను అందిస్తారు. వీటికి సగటున ఒక్కో విద్యార్థికి రూ.1,350 నుంచి 1,550 వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 లక్షల మంది విద్యార్థులకు వీలుగా అంచనా వేస్తున్నా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ సంఖ్య మరో 3 నుంచి 4 లక్షల వరకు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో కిట్ల రూపంలో రెసిడెన్సియల్ స్కూళ్లలోని 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు వీటిలో కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేసేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లు, ఎయిడెడ్ మదర్సాల్లో చదువుకొంటున్న పిల్లలందరికీ వీటిని పంపిణీ చేయించేలా ఆదేశాలు ఇచ్చారు. అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడుతో ప్రోత్సాహం నవరత్న హామీల్లో కీలకమైన ‘అమ్మ ఒడి’ పథకాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్న తేడా లేకుండా పిల్లలను చదువుకోవడానికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఈ ఏడాది రాష్ట్రంలోని 43 లక్షల మంది తల్లులకు రూ.6,500 కోట్ల వరకు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రపంచంలో ఎలాంటి పోటీనైనా ఎదుర్కొని ఉద్యోగ ఉపాధి అవకాశాలను దక్కించుకోవడానికి వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేందుకు మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో దాదాపు రూ.12 వేల కోట్లతో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. పాఠశాలల ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు తీయించారు. రూపురేఖలు మార్చాక కొత్త, పాత ఫొటోలను ప్రజల ముందుంచనున్నారు. -
‘మూడు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలి’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చెపట్టింది. విచారణలో భాగంగా.. ప్రభత్వుం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలను వినిపించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో విద్యాహక్కు చట్టంలోని 29వ నిబంధనను ఉల్లంఘించలేదని తెలిపారు. భాషాపరంగా అల్ప సంఖ్యాకుల కోసం కొన్ని చర్యలను, వారి మాతృభాషా పరిరక్షణకోసం భద్రతా చర్యలను మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి అంశాల్లో ఆచరించదగ్గ మూడు తీర్పులను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ముసాదా విధానాన్ని పరిశీలించాల్సిందిగా ఏజీ శ్రీరామ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాధ్యాసాధ్యాలను మాత్రమే ఈ ముసాదా విధానం చర్చించిందని ఏజీ శ్రీరామ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లో పేర్కొన్న సంస్థలు (మైనార్టీ విద్యాసంస్థలు), ప్రైవేటు సంస్థలు ఎక్కడా ప్రభావితం కాలేదని శ్రీరామ్ కోర్టుకు చెప్పారు. తమకు ఇంగ్లిషు మీడియమే కావాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల్లో 97శాతం కోరుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచుతున్నామని ఆయన చెప్పారు. తమ పిల్లలు తెలుగు మీడియంలోనే చదువుతున్నారంటూ పిటిషనర్లు కోర్టు ముందు చెప్పడం లేదు.. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. పాఠ్య ప్రణాళకలో తెలుగును తప్పనిసరి చేస్తూ, మాతృభాషను అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం తాజా జీవో జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారిచేత ఎన్నికైన ప్రభుత్వం తగిన రీతిలో విధానాలను రూపొందిస్తుందన్నారు. విధానాలను నిలువరించే అప్పిలేట్ అథారిటీ లా కోర్టులు వ్యవహరించజాలవని ఆయన అన్నారు. ఈ విధానం సరైందని.. మరొక విధానం కాదని కోర్టులు నిర్దేశించలేవని ఆయన తెలిపారు. విధానాల విషయంలో కోర్టులకు పరిమితమైన పాత్ర ఉంటుందని ఏజీ శ్రీరామ్ అన్నారు. -
ఇంగ్లీష్ మీడియానికి పేరెంట్స్ సపోర్ట్
-
‘విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు’
సాక్షి, అనంతపురం: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గురువారం అనంతపురంలోని జేఎన్టీయూలో వైస్ చాన్సలర్ల టెక్ సదస్సును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ లీడర్ అని, ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి చారిత్రాత్మక పథకమన్నారు. ఇక విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ద్వారా అధిక ఫీజుల నియంత్రణ చేపడుతామని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్, ఎన్టీఆర్ విద్యకు పెద్ద పీట వేశారన్నారు. కానీ చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తంగా మారాయని పేర్కొన్నారు. సీఎం జగన్ విద్యాభివృద్ధికి నడుం బిగించారని, ఆయన విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఇంగ్లిషు మీడియం దోహదపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు, లక్ష్మీ పార్వతి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు. -
ఆంగ్లానికి అందరి మద్దతు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రజలంతా దీనికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో 43 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్ల పేరెంట్స్ కమిటీలన్నీ ఆంగ్ల మాధ్యమం కోసం ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాయని వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసేలా 13 జిల్లాల నుంచి అందిన పేరెంట్స్ కమిటీల తీర్మానాల కాపీలను విద్యాశాఖ సచివాలయంలో ట్రంకు పెట్టెల్లో ప్రదర్శనకు ఉంచింది. ఇది చారిత్రాక ఘటన ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెతోపాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి, చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల నుంచి ఆంగ్ల మాధ్యమం కోరుతూ తీర్మానాలు వచ్చాయని చెబుతూ మంత్రి సురేష్ వాటిని చూపించారు. టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్గజపతిరాజు, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు తదితరుల గ్రామాల నుంచి కూడా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రజల నుంచి తీర్మానాలు అందాయని తెలిపారు. ఇది చారిత్రాక ఘటన అని, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలకు ప్రజల మద్దతును తెలియచేస్తోందని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు దీన్ని రిఫరెండంగా భావించాలని చెప్పారు. నైపుణ్యాలు తెలుసుకునేందుకు యాప్ సీఎం ఆదేశాల మేరకు 67,145 మంది టీచర్లకు ఆంగ్ల మాధ్యమంపై బోధనలో శిక్షణ పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంగ్లీషు మీడియంలో నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు టీచర్ల కోసం యాప్ రూపొందించామని చెప్పారు. 1వ తరగతి నుంచి 3వ తరగతి విద్యార్ధులకు ఇంటెన్సివ్ లెర్నింగ్ కోర్సును రెండు నెలల పాటు రెసిడెన్సియల్ స్కూళ్లలో నిర్వహిస్తామని, 4, 5 తరగతుల వారికి వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు బ్రిడ్జి కోర్సులు ఉంటాయని వివరించారు. జగనన్న విద్యాకానుక కింద రూ.1,500 విలువైన కిట్ వచ్చే విద్యా సంవత్సరంనుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద విద్యార్థులకు కిట్లను అందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. రూ.1,500 వ్యయంతో ప్రతి విద్యార్థికి పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫారం, బెల్టు, షూ, సాక్స్లతో కూడిన కిట్ను ఇస్తామన్నారు.త్వరలో డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, టీచర్ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. -
చంద్రబాబుకు ఇది నిజంగా చెంపదెబ్బే..
సాక్షి, చంద్రగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి నారావారిపల్లి గ్రామ ప్రజలు జై కొట్టారు. చంద్రబాబు సొంతూరు అయిన నారావారిపల్లెలోనూ ఇంగ్లీషు మీడియం విద్యకు గ్రామస్తులు ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నారావారిపల్లెకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 43 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి.. ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. దీంతో పేద ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే.. ఇంగ్లీషు మీడియం విద్యకు ఇంతకాలం మోకాలడ్డుతున్న కొంతమంది కుహనా మేధావులకు, తల్లిభాష పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, పేదవర్గాలకు పెద్ద చదువులు అందకూడదని కుట్రలు పన్నుతున్న ఎల్లో మీడియా శక్తులకు నారావారిపల్లె నుంచే ప్రజలు బుద్ధి చెప్పినట్లు అయింది. సొంతూరులో చంద్రబాబుకు ఇది నిజంగా చెంపదెబ్బే. రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చే కార్యక్రమానికి నడుం బిగించారు. ప్రభుత్వ విద్యా విధానంలో మెరుగైన ఫలితాలను తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కార్పోరేట్ స్కూళ్లలో భారీగా ఫీజులు చెల్లించగలిగే వారికే పరిమితమైన ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా చేరువ చేయాలనే సంకల్పాన్ని సాకారంలోకి తెచ్చారు. చదవండి: బాబును ఎవరూ నమ్మొద్దు.. అన్నీ దొంగ సర్వేలే ఈ నిర్ణయాలన్నింటి పైనా నారావారిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాల్సి ఉండగా.. 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ఏకగ్రీవంగా వారి నిర్ణయాన్ని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం భోదించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో పేద ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంగ్లీష్ మీడియం విద్యకు ఇంతకాలం మోకాలడ్డుతున్న కొంతమంది కుహానా మేధావులకు, తల్లిభాష పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, ఎల్లో మీడియా శక్తులకు నారావారిపల్లి ప్రజలు బుద్ధి చెప్పినట్లయ్యింది. -
సీఎం స్థానం అంటే.. రాష్ట్రానికి తండ్రి లాంటిది
సీఎం స్థానం అంటే.. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటిది. దేవుడు మనకు ఈ స్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయమైనా ఒక తండ్రిలా ఆలోచించి తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే కూడా తప్పే అవుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఏం చెప్పామో అదే చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏటా రెవెన్యూ ఎంతో కొంత పెరుగుతుందని, నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చు కానీ పెరుగుదలైతే ఉంటుందన్నారు. ఆంగ్ల పత్రికల ప్రతినిధులతో సోమవారం ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. పెన్షన్లు, ఇంగిష్ మీడియం, రాజధాని, ప్రత్యేక హోదా, మండలి రద్దు, పోలవరం, కియాపై అసత్య ప్రచారం తదితర అంశాలపై ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను ఈ సందర్భంగా ఆయన స్పష్టీకరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. సంతృప్త స్థాయిలో లబ్ధి కల్పించడమే లక్ష్యం ‘మాకు ఓటు వేయని వారికి కూడా పెన్షన్లు ఇవ్వండని చెప్పాం. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితా ప్రజల ముందే ఉంచుతున్నాం. ఈ రోజు ఫోన్ ఆన్ చేస్తే కమ్యూనికేషన్ అంతా ఇంగ్లిషే. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తున్నాం. రాజధానిపై నేను చెప్పాల్సిందంతా అసెంబ్లీలోనే చెప్పా. మౌలిక వసతుల కోసమే రూ.1,09,000 కోట్లు అవుతుందని గత ప్రభుత్వం అంచనా వేసింది. ఆ డబ్బులో 10వ వంతు విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. మరో 10 ఏళ్లకైనా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుంది. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుస్తాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం. అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్గా కొనసాగిస్తామని, అమరావతి రైతులెవ్వరికీ అన్యాయం చేయం అని చెప్పాం. రాజధానిపై బీజేపీ జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెబుతుంటే, రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. కొద్ది జాప్యమే.. అడ్డుకోలేరు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏని ఏఎంఆర్డీఏగా మార్చడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కానీ రాష్ట్రంలో అందరికీ మంచి చేస్తున్నామని ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టాం. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. తాము ఎక్కడికీ వెళ్లడం లేదని కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాల కోసం వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4 వేల కోట్లను గత ప్రభుత్వం 2014 నుంచి చెల్లించలేదు. ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్ వెళ్లారు. ఇది అభివృద్ధి కాదా? విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, గృహ నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతలుగా నిర్ణయించాం. నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులను బాగా అభివృద్ధి చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం నాణ్యత బాగా పెంచాం. అమ్మఒడి అమలు చేశాం. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసాతో అన్నదాతలను ఆదుకుంటున్నాం. పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. -
చట్ట సభల్లో వాడుతున్న భాష సిగ్గు చేటు
సాక్షి, విశాఖపట్నం: చట్టసభల్లో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అసహనాన్ని కలిగిస్తోందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో నాయకులు వాడుతున్న భాష సిగ్గు చేటుగా ఉందని శుక్రవారం పార్లమెంట్లో చోటుచేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన ‘ఏ ఛైల్డ్ ఆఫ్ డెస్టినీ ఆన్ ఆటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. వెంకయ్య మాట్లాడుతూ.. అమ్మ, అక్క అనే పదాలు పవిత్రమైనవని, కానీ.. అసెంబ్లీలలో నాయకులు వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని, చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనీ.. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇంగ్లిష్ ముఖ్యమే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ చదువులు ముఖ్యమే అయినా.. మాతృ భాషను విస్మరించొద్దని ఉప రాష్ట్రపతి సూచించారు. తనకు కాన్వెంట్ అంటే ఏంటో తెలీదన్నారు. మాతృభాష కళ్లు అయితే.. ఇంగ్లిష్ కళ్లజోడు లాంటిదన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని, విద్యతో పాటు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, వినయం, సంస్కారాన్ని బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఏఏ సహా అన్ని చట్టాలపై దేశవ్యాప్తంగా ప్రజలు అధ్యయనం చేయాలన్నారు. దేశ చట్టసభలు తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడే హక్కు పొరుగు దేశాలకు లేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఐఎన్ఎస్ డేగాలో గార్డ్ ఆఫ్ ఆనర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం విశాఖకు వచ్చిన వెంకయ్యకు ఐఎన్ఎస్ డేగాలో తూర్పు నౌకాదళం గార్డ్ ఆఫ్ ఆనర్తో స్వాగతం పలికింది. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్, కలెక్టర్ వినయ్చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా గౌరవ స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్య తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక బోటులో హార్బర్లో పర్యటించి, దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌకను సందర్శించారు. -
వికేంద్రీకరణతోనే న్యాయం జరుగుతుంది
-
పేదోళ్ల ‘ఇంగ్లిష్’ చదువుకు అడ్డు చెప్పొద్దు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ధనిక వర్గాలవారే కాకుండా బడుగు, బలహీనవర్గాల వారి పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని, అందుకు కోర్టులు, నాయకులు అడ్డు చెప్పవద్దని సినీ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ‘పేద ప్రజలకు ఆంగ్ల విద్య’ అంశంపై శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు 90 శాతం ఉన్నారని, వారంతా ఆంగ్ల మాధ్యమ విద్య లేక ఉద్యోగావకాశాలు పొందలేక కూలీలుగా, వలసజీవులుగా మిగిలిపోతున్నారని చెప్పారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి నిరుపేదలకు విద్యనందిస్తే, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేసి 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించి అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు మీడియంలో మంచి మార్కులు సాధించినా.. ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారికే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు తమ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసివేయగలరా? వాళ్ల పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించగలరా అని సవాలు విసిరారు. రాష్ట్రానికి చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రంలో దీనికి అడ్డులేకుండా సహకరించాలని కోరారు. పేదోడి చదువుకి అడ్డు తగలవద్దని విజ్ఞప్తి చేశారు. బహుళ రాజధానులకు అడ్డు తగలకుండా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని ఆయన కోరారు.