ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం | AP Govt Prepared free textbooks to Government School Students | Sakshi
Sakshi News home page

ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం

Published Thu, May 23 2024 4:25 AM | Last Updated on Thu, May 23 2024 4:25 AM

AP Govt Prepared free textbooks to Government School Students

3.12 కోట్ల మొదటి సెమిస్టర్‌ పుస్తకాలు పంపిణీకి రెడీ

మండల స్టాక్‌ పాయింట్లకు తరలింపు

8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్స్‌పై పుస్తకం

జూన్‌ 8కి అన్ని స్కూళ్లకు పుస్తకాలు

1.08 కోట్ల సెమిస్టర్‌–2 పుస్తకాలు జూలైలో పంపిణీ

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యా­ర్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్‌ నుంచి జిల్లా స్టాక్‌ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్‌ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకా­లను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికా­రులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్‌ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్‌ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్‌–2 బోధన అక్టోబర్‌ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.

ఈసారి పదో తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో
గత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం అమల్లో ఉంది. జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్‌ సైన్స్‌ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్‌ పేపర్‌పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్‌ స్కిల్స్‌ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. 

బైలింగ్యువల్‌లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్‌లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్‌ బుక్స్‌ డైరెక్టర్‌ కొండా రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement