
సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వనున్నారు. స్టార్ హోటళ్లలో శిక్షణ వద్దని, దుబారా చేయవద్దన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు అసెంబ్లీ కమిటీ హాల్లోనే సదస్సును ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి రూపాయి ఆదా చేసే దిశగా అతి తక్కువ ఖర్చుతో శిక్షణ ఇస్తుండగా.. గత ప్రభుత్వంలో గ్రాండ్ కాకతీయలో శిక్షణ తరగతులు నిర్వహించి ప్రజాధనాన్ని వృధా చేశారు. నేటి శిక్షణ తరగతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు హాజరుకాగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాకపోవటం గమనార్హం.