
సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు
ఆయేషా మీరా హత్యతో తనకు సంబంధం లేదని నిందితుడు సత్యంబాబు పేర్కొన్నాడు.
విజయవాడ: ఆయేషా మీరా హత్యతో తనకు సంబంధం లేదని నిందితుడు సత్యంబాబు పేర్కొన్నాడు. పోలీసులు బెదిరించడం వల్లే చేయని నేరాన్ని ఒప్పుకున్నానని వెల్లడించాడు. తన తల్లిని, చెల్లిని ఎన్ కౌంటర్ చేస్తామని దర్యాప్తు అధికారులు బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించినట్టు చెప్పాడు.
సత్యంబాబు ఆరోపణలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారి రంగనాథ్ తోసిపుచ్చారు. ఆయేషా మీరాను సత్యంబాబు హత్య చేసినట్టు స్వయంగా అంగీకరించాడని తెలిపారు. చాలా నేరాల్లో అతడు నిందితుడని, బాధితులను విచారిస్తే నేరాల చిట్ట బయటపడుతుందన్నారు. సత్యంబాబు అమాయకుడు, ఇరికించారనేది అబద్ధమన్నారు. సాంకేతికంగా కేసును హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. సత్యంబాబును అరెస్ట్ చేశాక నందిగామలో ఒక్క నేరం జరగలేదని వెల్లడించారు.