
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చీఫ్ పారెస్ట్ కన్జర్జేటివ్ అధికారి ప్రతీప్ కుమార్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. జంతువులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జంతు ప్రదర్శనశాలకు ఎలాంటి వాయువు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులంతా తక్షణమే సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలన్నారు. ఈ మేరకు ప్రతీప్ కుమార్ స్పందిస్తూ.. ఇప్పటికే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటవీ శాఖ అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు.అనంతరం విద్యుత్ శాఖతో నిర్వహించిన సమావేశంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమతంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లకుండా వెంటనే చర్యలు చేపట్టాలని పర్యావరణ అధికారులకు ఆదేశించారు. కాగా గురువారం తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు.
(గ్యాస్ లీక్.. అధికారులతో సీఎం జగన్ సమీక్ష)