ఏవీఎస్‌కు కన్నీటి వీడ్కోలు | final farewell to avs | Sakshi
Sakshi News home page

ఏవీఎస్‌కు కన్నీటి వీడ్కోలు

Published Sun, Nov 10 2013 2:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఏవీఎస్‌కు కన్నీటి వీడ్కోలు - Sakshi

ఏవీఎస్‌కు కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు ఏవీ సుబ్రహ్మణ్యం(ఏవీఎస్)కు అభిమానులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడి పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో ఏవీఎస్ కుమారుడు ప్రదీప్ కర్మకాండ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం ఏవీఎస్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 9 గంటలకు ఏవీఎస్ పార్థివదేహాన్ని మణికొండలోని ఆయన ఇంటి నుంచి ప్రజల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఏవీఎస్ మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఆయన భార్య ఆశ, కుమార్తె ప్రశాంతి, కుమారుడు ప్రదీప్, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అంతకుముందు సినీ నటులు కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి ఏవీఎస్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఫిల్మ్ చాంబర్ నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకూ జరిగిన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పాల్గొన్నారు. ఏవీఎస్ అమర్ రహే! అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.  
 
 ఫిల్మ్ చాంబర్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఏవీఎస్ భౌతికకాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏవీఎస్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మురళీమోహన్, దాసరినారాయణరావు, డి. రామానాయుడు, సీపీఐ కార్యదర్శి నారాయణ, మండలి బుద్ధప్రసాద్, ఎం. వెంకయ్యనాయుడు, రఘుబాబు, నాగబాబు, అల్లు అరవింద్, బ్రహ్మానందం, కృష్ణ, విజయనిర్మల, వెంకటేష్, బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సాయికుమార్, విజయ్‌చందర్, అశోక్‌కుమార్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జయసుధ, నన్నపనేని రాజకుమారి, శివాజీరాజా, శివకృష్ణ, దాసరి అరుణ్‌కుమార్, పరుచూరి గోపాలకృష్ణ, జమున, గద్దర్, ఆర్.నారాయణమూర్తి, నరేష్, కృష్ణుడు, తదితర ప్రముఖులు ఉన్నారు. ఏవీఎస్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటనీరు పెట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement