
ఢిల్లీ: పోలవరం విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తమ వాదనలను త్రిసభ్య ధర్మాసనం ఎదుట వినిపించాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 50 మీటర్ల వెడల్పుతో 60 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మిస్తున్నారని, దీంతో చాలాప్రాంతం ముంప్పునకు గురవుతుందని ఒడిషా ప్రభుత్వం తన అభ్యంతరాలను సుప్రీం దృష్టికి తీసుకురాగా, ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలంటే తమకు కొంత సమాచారం కావాలని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కోర్టును కోరాయి. తమకు ఏ సమాచారం కావాలో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఒడిశా, ఛత్తీస్గఢ్కు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మదన్ బీ లోకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం కేసు ఒక అంతు లేని కథ అని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను జనవరి మొదటివారానికి కోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment