రణరంగంగా మారిన జమ్మలమడుగు
కడప: మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ దౌర్జన్యం చేసి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడటంతో కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం రణరంగంగా మారింది. టీడీపీ, పోలీసులకు మధ్య జరిగిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
జమ్మలమడుగులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పాయువు ప్రయోగం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు జరిపిన రాళ్ల దాడిలో పోలీసు ఎస్ఐసహా ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అధికారులు రంగంలోకి దిగారు.