
సొంత జిల్లాలో మాజీ సిఎం కిరణ్కు షాక్
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లాలో షాక్ తగిలింది. జేఎస్పీ తరపున గుర్రంకొండ ఎంపీపీగా ఇటీవల ఎన్నికైన నట్టా చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ దారుణంగా చతికిలపడిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. గెలిచిన ఒకరిద్దరూ కూడా పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో జేఎస్పీ సంకట స్థితిలో పడింది.