
సాక్షి, కడప: ఇళ్ల పట్టాలపై కొన్ని పత్రికలు అవాస్తవాలు ప్రచురించడం బాధాకరమని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను వెనక్కి తీసేసుకుంటున్నారంటూ వచ్చిన కథనాలపై కలెక్టర్ స్పందించారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కథనాలు నిజం కాదని ఆయన వివరణ ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలందరికి ఇళ్లు, ఉగాది నాటికి ఇంటి స్థలాలు ఇస్తామని ఆయన తెలిపారు.
2500 ఎకరాలు భూమిని గుర్తించాం..
ఇంటి స్థలాల కోసం జిల్లా వ్యాప్తంగా 2500 ఎకరాలు భూమిని గుర్తించామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఉన్న చోట పట్టా భూములు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. 300 ఎకరాల పట్టా భూమిని సేకరించామని.. ఈ పథకం ద్వారా భూములను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు.