
కిరణ్ కచ్చితంగా పార్టీ పెడతారు: ఏరాసు
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరముందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కచ్చితంగా కొత్త పార్టీ పెడతారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం సీఎం కిరణ్తో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు.
సమావేశం ముగిసిన తర్వాత ఏరాసు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈరోజు సీఎం కిరణ్ రాజీనామా చేయడంలేదని వెల్లడించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు అధికారికంగా ప్రకటించిన రోజున సీఎం రాజీనామా చేస్తారని చెప్పారు. తమ జిల్లా నాయకులతో మాట్లాడిన తర్వాత రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకుంటామని ఏరాసు తెలిపారు. తాము ఏపార్టీలో ఉంటామన్నది త్వరలోనే తేలుస్తుందన్నారు.
పార్లమెంటులో విభజన బిల్లు పెట్టిన వెంటనే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని మరో మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. ఇప్పుడు రాజీనామా చేస్తే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు సంకేతాలు పోతాయన్న భావనతో సీఎం వెనక్కు తగ్గారని వెల్లడించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదని బీజేపీ సహా రాజకీయ పక్షాలు అంటున్నాయని టీజీ చెప్పారు.